బుధవారం, ఫిబ్రవరి 09, 2022

తూఫాన్ మెయిల్

'ముంబయి మహానగరంలో పేదల జీవితాలని చిత్రించిన కథలు' అనగానే తిండి, బట్ట, గూడు సమస్యల చుట్టూ అల్లిన కథలై ఉంటాయన్న ఆలోచన రావడం సహజం. ప్రముఖ కన్నడ రచయిత జయంత్ కాయ్కిణి  'తూఫాన్ మెయిల్' పేరుతో వెలువరించిన పదకొండు కథల సంకలనం (అనువాదం - రంగనాథ రామచంద్ర రావు) ఏ ఒక్క కథలోనూ ఈ మూడు సమస్యల్లో ఏ ఒక్కటీ చర్చకి రాలేదు. ఈ కథలన్నీ ఆసాంతమూ ఆసక్తిగా చదివిస్తాయి. చదవడం పూర్తి చేసిన తర్వాత పాఠకుల్ని ఆలోచనల్లో పడేస్తాయి. కనీసం కొన్నాళ్ల పాటు ఈ కథల్లో పాత్రలు, వాళ్ళ ప్రవర్తన, తీసుకున్న నిర్ణయాలు విడవకుండా గుర్తొస్తూనే ఉంటాయి. ఈ వెంటాడే లక్షణంతో పాటు, ఎంచుకున్న ఇతివృత్తాలు, కథల్ని చెప్పే పద్ధతీ కూడా ఈ సంకలనాన్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. 

కథల గురించి మాట్లాడుకోడానికి ముందు రచయిత గురించి చెప్పుకోవాలి. జయంత్ కాయ్కిణి ముంబయిలో 23 ఏళ్ళు బయో కెమిస్ట్ గా ఉద్యోగం చేసి, అటుపై బెంగుళూరు చేరి 'ఫ్రీలాన్సర్' గా రచనా ప్రస్థానం సాగిస్తున్నారు. సుమారు పాతిక కన్నడ సినిమాలకి పాటలు రాశారు. కొన్ని సినిమాలకి కథలు, మాటలు సమకూర్చారు. ఇవి కాకుండా ఐదు కవితా సంకలనాలు, ఆరు కథా సంకలనాలు, మూడు నాటకాలు వెలువరించారు. సాహిత్య కృషికి గాను గౌరవ డాక్టరేట్ తో సహా ప్రతిష్ఠాత్మక బహుమతులెన్నో అందుకున్నారు. ఉత్తమ సినీ గేయ రచయితగా నాలుగు 'ఫిలింఫేర్' ఆవార్డులున్నాయి ఈయన ఖాతాలో. చాలా కథలు ఆంగ్లంలోకి అనువాదం అయ్యాయి. తెలుగులోకి అనువాదం అయిన తొలి కథా సంకలనం ఇదే. స్వస్థలం ఉత్తర కర్ణాటక జిల్లాలోని గోకర్ణ.

ముంబయిలో అనాధలుగా పెరిగి, యుక్తవయసుకి వచ్చేసరికి చిన్న చిన్న ఉద్యోగాల్లో కుదురుకున్న పోపట్, అసావరి లోఖండే ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇద్దరూ కలిసి వాళ్ళ పెళ్లి శుభలేఖ డిజైన్ ని ఎంచుకోవడమే సంపుటంలో తొలి కథ 'నో ప్రెజెంట్స్ ప్లీజ్' ఇతివృత్తం. శుభలేఖ చిత్తుప్రతి రాసే సమయానికి వరుడు పోపట్ కి వధువు పేరు గంభీరంగా ఉన్నట్టు, ఆమె పేరు పక్కన తన పేరు తేలిపోతున్నట్టూ తోస్తుంది. "అసావరి, లోఖండే అంటే ఏకులం?" అని అడిగేస్తాడు. ఆమె ఉలికి పడుతుంది. ఇన్నాళ్లుగా ఎప్పుడూ వాళ్ళ మధ్య రాని ప్రస్తావన అది. రిమాండ్ హోమ్ లో పెరిగిన ఆ అమ్మాయికి తన కులమేమిటో తెలీదు. ఈ సమస్యని ఎలా అధిగమించాలో ఇద్దరికీ తెలియదు. ఇద్దరూ కలిసి ఆలోచన చేస్తారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం మాత్రమే కాదు, వాళ్ళ జీవిత చిత్రణా వెంటాడుతుంది. 

పీయూసీ ఫెయిలైన ఛోటూ తాను చేసిన ఓ తప్పు కారణంగా ఇంట్లో నుంచి బహిష్కరించబడ్డాడు. ఆ తర్వాత తండ్రి మరణించాడు. తల్లికీ, పెద్దక్కకి ఛోటూ తిరిగొస్తే బాగుండునని ఉంటుంది. పన్నెండేళ్ళు గడిచినా అతను తిరిగి రాలేదు. వీళ్ళ అన్వేషణా ఆగలేదు. ఉన్నట్టుండి ఛోటూ ఫలానా చోట ఉన్నాడన్న ఆచూకీ తెలుస్తుంది పెద్దక్కకి. తీరా చూస్తే ఆ చోటు వీళ్ళుండే చోటుకి అరగంట నడక దూరం. ఇంతకీ ఛోటూ అక్కడ ఉన్నాడా అన్నది 'కనుమరుగైన అడవి' కథకి ముగింపు. పైకి ఆర్ధిక సమస్యలా కనిపించినా, ఈ కథలో దిగువ మధ్య తరగతి పాటించే విలువల్ని గురించి లోతైన చర్చ ఉంటుంది. ఒకరికొకరు ఏమీ కాని ఇద్దరు రూమ్మేట్ల కథ 'పార్ట్ నర్'. ఇద్దరి మధ్యనా విభేదాలు పొడసూపిన తరుణంలో జరిగిన ఓ అనూహ్య సంఘటన కథని మలుపు తిప్పుతుంది. మానవత్వపు పరిమళాన్ని వెదజల్లే కథ ఇది. 

గోకర్ణలో పుట్టి, ముంబయిలో పెరిగి, అక్కడి వ్యక్తిని పెళ్లిచేసుకున్నాక, అనుకోకుండా రాజకీయాల్లో చేరిన యువతి కథ 'భామిని సప్తపది'. సౌందర్యరాశి అయిన భామిని ఇంటా బయటా ఎదుర్కొనే సమస్యల మీదుగా సాగే కథ, సాగర తీరంలో ఆమె తీసుకునే నిర్ణయంతో ముగుస్తుంది. పెళ్లికాని నడివయసు సత్యజిత్ కథ 'అద్దం లేని ఊరిలో'. తనకో పెళ్లి సంబంధం రావడం సత్యజిత్ ని ఆశ్చర్య పరుస్తుంది. అనంతర పరిణామాలని నిశితంగా చిత్రించిన కథ ఇది. సంకలనానికి శీర్షికగా ఉంచిన 'తూఫాన్ మెయిల్' ఓ ఫైటర్ కథ. 'తూఫాన్' అనే వ్యక్తి సినిమాల్లో గ్లాస్ బ్రేక్ ఫైట్ సీన్లలో హీరోలకి డూప్ గా నటిస్తూ ఉంటాడు. అతని స్నేహితుడి భార్య మధువంతి సినిమాల్లో ఎక్స్ ట్రా డాన్సర్. సమాంతరంగా సాగే వీళ్ళ కథల్లో బాలీవుడ్ లో పనిచేసి కిందిస్థాయి కార్మికుల జీవన చిత్రణ ఉంటుంది. 

చికిత్స కోసం ఆస్పత్రిలో చేరి, పక్క వార్డులో తన చిన్న నాటి స్నేహితురాలిని కనుగొన్న వ్యక్తి కథ 'పొగడపూల వాసన'. ఆమె తాలూకు వాళ్ళు ఇతని గదికి వచ్చి ఆమెని మళ్ళీ కలవొద్దని చెబుతారు. ఎందుకు అన్నదే ఈ కథ. సర్కస్ లో మోటార్ సైకిల్ విన్యాసాలు చేసే మనిషి కథని 'బావిలో ఒక తలుపు' కథలోనూ, నడివయసులో ఉద్యోగం పోగొట్టుకున్న వ్యక్తి కథని 'గేట్ వే' లోనూ చిత్రించారు. 'టిక్ టిక్ మిత్రుడు' కథ టీవీ క్విజ్ షో నేపధ్యంగా సాగితే, చివరి కథ 'ఒపేరా హౌస్' మూత పడ్డ ఓ సినిమా హాల్లో పనిచేసే వారి కథని కళ్ళముందు ఉంచుతుంది. అనువాదం దాదాపు సరళంగానే సాగింది. 'అనల్ప' ప్రచురించిన ఈ 136 పేజీల పుస్తకం వెల రూ. 160. ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్లోనూ లభిస్తోంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి