బుధవారం, ఫిబ్రవరి 16, 2022

భరోసా

పిల్లల పెంపకం మొదలు పర్యావరణ పరిరక్షణ వరకూ కాదేదీ కథావస్తువుకి అనర్హం. కావల్సిందల్లా కథ చెప్పే నేర్పు. ఆ కథలకి ఉండాల్సింది ఆసాంతమూ చదివించే లక్షణం. చదవడం పూర్తి చేసి వేరే పనుల్లో తలమునకలైనప్పుడు కూడా ఆ కథలు గుర్తొచ్చాయంటే అది కచ్చితంగా రచయిత విజయమే. 'భరోసా' కథా సంపుటిలోని పదిహేను కథల్లోనూ వస్తువులు పాతవే, కానీ చెప్పిన తీరు ఆ కథల్ని గుర్తు పెట్టుకునేలా చేసింది. ఈ కథలన్నీ గడిచిన పదకొండేళ్లలో వివిధ పత్రికల్లో అచ్చైనవి. ఇంకోంన్నేళ్ల తర్వాత చదివినా 'భలే చెప్పారే' అనిపించేవి. రచయిత జి. ఉమామహేశ్వర్ కి కథనం మీద ఉన్న శ్రద్ధ ఈ కథల్ని ప్రత్యేకంగా నిలిపింది. విలువల్ని గురించిన రచయిత ఆలోచనలు ఈ కథల్లో ప్రతిఫలించాయి.  బాగా నలిగిన విషయాలని కూడా కొత్తగా చెప్పాలనే ప్రయత్నం కనిపిస్తుంది అన్ని కథల్లోనూ.

మొదటి కథ 'భరోసా' సాఫ్ట్వేర్ కంపెనీ నేపధ్యంగా సాగడంతో మొత్తం కథలన్నీ ఇదే నేపధ్యంతో సాగుతాయా? అన్న సందేహం వచ్చింది. కానీ, ఏ రెండు కథలదీ ఒకే నేపధ్యం కాదు. ఏ రెండు కథల వస్తువూ ఒకటి కాదు. మిడిల్ మేనేజ్మెంట్ స్థాయిలో ఉన్న నడివయసు కంప్యూటర్ నిపుణులు, కొత్తగా ఉద్యోగాల్లోకి వస్తున్న తరంలో కమిట్మెంట్ ఎంత అనే చర్చ నేపధ్యంగా సాగుతుంది కథ. "బిజినెస్ లో గతికితే తప్ప అతకదు కదా" లాంటి చెణుకులకి లోటులేదు. ఇంతకీ కొత్త తరం మీద వాళ్ళకి 'భరోసా' కలిగించిన సంగతేమిటన్నది ముగింపు. రెండో కథ 'ఎట్లా బతకబోతాడో' వ్యంగ్యపూరితంగా సాగుతుంది. నలుగురితో పాటుగా కాకుండా, కాస్త భిన్నంగా ఆలోచించే వ్యక్తిని గురించి అతని కుటుంబం ఏమనుకుంటుందో చెబుతుందీ కథ. 

'ఒక దళారీ పరాభవం' కథ 'ఇలా జరిగితే బాగుండును' అన్న ఆలోచననిస్తుంది. జరగదు అనుకోలేం, అలాగని జరుగుతుందని నమ్మనూలేం. 'క్విజ్ మాస్టర్' కథ కూడా విలువల్ని చర్చించేదే. విజయానికి మెట్లే కాదు, అడ్డదారులు కూడా ఉంటాయని చిన్న వయసులోనే గ్రహించిన పిల్లలని, వాళ్ళని ప్రోత్సహించే పెద్దల్నీ చూసి ఆలోచనలో మునిగిపోయే క్విజ్ మాస్టర్ కథ ఇది. భార్యకి భయపడే ఓ భర్త (ఈ సంపుటంలో ఉన్న కథల్లో భర్తలందరూ భార్యలకు భయపడే వాళ్ళే), ఆమె మనసు నొప్పించకుండానే తన తొమ్మిదేళ్ల కొడుకు కోరిన కోరిక తీర్చిన కథ 'గోకులన్న' - ఈ మధ్యే మార్గాలు అన్నిసార్లూ అక్కరకొస్తాయా? అన్న సందేహాన్ని మిగులుస్తుంది. 'జలపాఠం' కథ చదువుతుంటే నీటి పంపిణీని గురించి మానవహక్కుల నేత దివంగత కె. బాలగోపాల్ రాసిన పుస్తకం 'జలపాఠాలు' బాగా గుర్తొచ్చింది. వ్యంగ్య ధ్వనిలో సాగే కథ ఇది.

అన్నదమ్ముల ఆస్తి పంపకాలు ఇతివృత్తంగా సాగే కథ 'ధర్మామీటర్' ఇంటింటి కథలాగే అనిపిస్తుంది. ఓ. హెన్రీ తరహా మెరుపు ముగింపుతో గుర్తుండిపోయే కథ 'నీ లీల పాడెద దేవా'. ఆలయాల వెనుక జరిగే రాజకీయాలని చెప్పే కథ 'మనిషి-దేవుడు', నలిగిన ఇతివృత్తాన్ని కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు రచయిత. సెల్ టవర్ల కారణంగా పిచ్చుకలు అంతరించిపోతుండడానికి ఓ ఆశావహ ముగింపు ఇస్తూ రాసిన కథ 'మొదటి పిచ్చుక'. 'వారసులు అంటే కడుపున పుట్టిన వాళ్ళా లేక ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్లే వాళ్ళా?' అన్నది చర్చిస్తుంది 'వారసులు' కథ. 'చందమామ రావే' కథని ఓ అంథాలజీగా చెప్పాలనే ప్రయత్నం బాగుంది కానీ, అన్ని కథల్లోనూ కొడుకులు విలన్లు కావడం వల్ల కొత్తదనం లోపించింది.

పిల్లలు ప్రధాన పాత్రలుగా నడిచే మరో కథ 'వైట్ బోర్డు'. అక్కాతమ్ముళ్ల గిల్లికజ్జాలు కథని చివరికంటా చదివిస్తాయి, ముగింపు ఊహించగలిగేదే అయినప్పటికీ. ఆద్యంతమూ ఆసక్తిగా డిటెక్టివ్ తరహాలో సాగే కథ 'నేను నా దేశమును..' ఏమాత్రం కన్విన్సింగ్ కాని విషయాన్ని తన కథనంతో ఒప్పించేలా చెప్పారు రచయిత. పర్యావరణ పరిరక్షణ ఉపన్యాసాన్ని చదివించే కథగా చెప్పారు 'హరిత విప్లవం' కథలో. కార్పొరేట్ ఆఫీసు వాతావరణం, అక్కడి రాజకీయాల్ని కథలో భాగం చేయడం తెలివయిన ఎత్తుగడ. కథల్లో అక్కడక్కడా వామపక్షపాతం కనిపించినా, ఎజెండాతో రాసిన జెండా కథలు కావివి. శైలి ఆపకుండా చదివించేదిగా ఉండడం వల్ల 'అప్పుడే కథ పూర్తైపోయిందా' అనిపిస్తుంది. పాలపిట్ట బుక్స్ ప్రచురించిన ఈ 168 పేజీల సంకలనం వెల రూ. 120. ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి