సోమవారం, ఫిబ్రవరి 14, 2022

మల్లీశ్వరి

'ప్రేమకావ్యం' అనగానే గుర్తొచ్చే తెలుగు సినిమాల్లో మొదటి వరసలో ఉండే పేరు 'మల్లీశ్వరి'. భానుమతి, రామారావుల నటన, బి.ఎన్. రెడ్డి దర్శక ప్రతిభ, కృష్ణశాస్త్రి సాహిత్యం, సాలూరి రాజేశ్వర రావు సంగీతం.. వంటొచ్చిన చేతి నుంచి కావాల్సిన దినుసులన్నీ తగు మోతాదులో పడి తయారైన పసందైన వంటకం. తయారై డెబ్బై ఏళ్ళు గడిచినా ఆ వంటకం రుచి మరింత పెరిగిందే తప్ప, కొంచం కూడా తగ్గలేదు. వాహినీ పతాకంపై తయారైన ఈ సినిమా పండిత పామరుల చేత 'క్లాసిక్' అనిపించుకుంది, ఏకగ్రీవంగా. తర్వాతి కాలంలో అతి నటనకి పర్యాయ పదాలుగా మారిపోయిన నాయికా నాయకులిద్దరూ పాత్రోచితంగా ఒదిగి నటించడం వల్ల ఇప్పుడు చూస్తున్నా ఈ సినిమా ఆహ్లాదంగానే ఉంటుంది. 

హంపీ విజయనగరం రాజధానిగా శ్రీకృష్ణ దేవరాయలు పాలిస్తున్న రాజ్యంలో వీరాపురం అనే పల్లెటూరు. ప్రధానంగా పద్మశాలీల గ్రామం. ఆ ఊళ్ళో ఒక్క నారప్ప ఒక్కడే వంద మగ్గాలకి యజమాని. నిత్యం చీనీ చీనాంబరాలు, మెడ తిరగనన్ని నగలూ ధరించి, బిగ్గా వేసుకున్న జడతో ఎల్లప్పుడూ కళ్ళు పెద్దవి చేసి చూసే నాగమ్మ (రుష్యేంద్రమణి) చాటు (సగటు) భర్త ఈ నారప్ప. వాళ్ళకి ఒకే ఒక్క కూతురు మల్లీశ్వరి (భానుమతి). దగ్గరవాళ్ళు 'మల్లమ్మా' అని పిలుచుకుంటూ ఉంటారు ముద్దుగా. పనిపాటలు తెలిసిన చలాకీ అల్లరి పిల్ల. చుట్టూ ఉన్న వాళ్లలో ఆమెని ఇష్టపడే వాళ్లతో పాటు, వెనకాల మూతి విరిచే వాళ్ళూ ఉంటారంటే అందుకు కారణం ముక్కున గుద్దినట్టుండే ఆమె మాటతీరే. 

నారప్పకి ఓ వితంతువైన తోబుట్టువు గోవిందమ్మ, ఆమె కొడుకు నాగరాజు (ఎన్టీఆర్). వీళ్లది కలిగిన కుటుంబం కాదు. గోవిందమ్మకి కులవృత్తి మీద గట్టి పట్టు లేదు. ఇక నాగరాజైతే ఆ వృత్తినే వదిలేసి శిల్పిగా మారతాడు. ఇందుకు మల్లీశ్వరి ప్రోత్సాహం చాలానే ఉంది. నారప్పకి మల్లీశ్వరిని నాగరాజుకిచ్చి పెళ్ళిచేయాలని ఉంటుంది. వాళ్లిద్దరూ ఒకే ప్రాణంగా పెరిగారని అతనికి తెలుసు. మేనల్లుడి మీద గట్టి నమ్మకం కూడా. అయితే,  నాగమ్మ 'ససేమిరా' అంటుంది. ఆ పేదింటికి తన కూతుర్ని పంపనని తెగేసి చెబుతుంది. ఆమె దృష్టిలో కూతురు మహారాణి. గొప్పింటి కోడలు కావాల్సిన పిల్ల. అత్త మనసులో ఏముందో తెలుసుకున్న నాగరాజు, డబ్బు సంపాదించే నిమిత్తం పట్టణానికి ప్రయాణమవుతాడు. ఏడాది తిరిగేసరికి కళ్ళు చెదిరే ధనం సంపాదించి తిరిగి వస్తానని శపధం చేసి మరీ బయల్దేరతాడు. 

ఎంతైనా కథానాయకుడు కాబట్టి అన్నప్రకారమే ఏడాది తిరిగేసరికల్లా బోల్డంత సంపదతో తిరిగొస్తాడు నాగరాజు. కానైతే అప్పటికి మల్లీశ్వరి ఇల్లు విడిచిపెట్టాల్సి వస్తుంది. ఆమెకోసం రాణీ వాసపు పల్లకీ వస్తుంది. ఆమె ఇప్పుడు మల్లమ్మ కాదు, మహారాణీ తిరుమల దేవమ్మ గారి ఇష్టసఖి మల్లీశ్వరీ దేవి. రాణివాసం వెళ్లిన స్త్రీల జీవితం వైభవోపేతం. ఈ కారణానికి కూతుర్ని తల్చుకుని గర్వ పడుతుంది నాగమ్మ. రాణివాసపు స్త్రీలకి వ్యక్తిగత జీవితమే కాదు, ఇష్టాఇష్టాలూ ఉండకూడదు, పంజరపు బతుకు బతకాలి. ఈ కారణానికి కూతుర్ని తల్చుకుని కుమిలిపోతాడు నారప్ప. అలాగని, రాజాజ్ఞని ధిక్కరించే శక్తి లేదతనికి. 

మల్లీశ్వరి కోసం ఇల్లొదిలి, దాదాపు పిచ్చివాడైపోయిన నాగరాజు ఓ ప్రముఖ శిల్పి కళ్ళలో పడతాడు. ఆ శిల్పి రాయలు నిర్మించ తలపెట్టిన నర్తనశాలకి ఓ రూపం ఇస్తున్నాడు. నాగరాజుని ఒప్పించి ఆ పనిలో భాగం చేస్తాడు. ఇప్పుడు మల్లీశ్వరి, నాగరాజు ఇద్దరూ రాజాస్థానంలోనే ఉన్నారు. కానీ రాణీవాసపు స్త్రీలు, పురుషుల్ని కలవరాదు, కనీసం వారితో మాట్లాడరాదు. చిన్ననాటి నుంచీ స్నేహితులు, వయసొచ్చాక ప్రేమికులూ అయిన ఈ జంట, అంతఃపుర నియమాలని ధిక్కరించ గలిగిందా? తదనంతర పరిణామాలేవిటి? అన్నది దాదాపు మూడున్నర గంటల నిడివి గల 'మల్లీశ్వరి' సినిమా ముగింపు. యూట్యూబ్ లో రెండున్నర గంటల సినిమా మాత్రమే లభిస్తోంది, అనేక కట్స్ తో. 

 'వాహినీ' కుమారి

'మల్లీశ్వరి' సినిమాకి మూలం ఆకాశవాణి కోసం బుచ్చిబాబు రాసిన 'రాయల కరుణ కృత్యం' అనే నాటిక. అయితే, టైటిల్స్ లో ఎక్కడా క్రెడిట్ ఇవ్వలేదు. బీఎన్ కి బుచ్చిబాబుకి వచ్చిన మాటపట్టింపులే ఇందుకు కారణం అన్నది కర్ణాకర్ణిగా వినిపించే మాట. భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రికి సినిమా కవిగా స్థానాన్ని సుస్థిరం చేయడమే కాదు, వాళ్ళబ్బాయి 'బుజ్జాయి' చిత్రకారుడిగా నిలదొక్కుకోడానికి కూడా దోహదపడిందీ చిత్రం. పాటలు మాత్రమే కాదు, మాటలూ లలితంగానే ఉంటాయి ఈ సినిమాలో. సంగీతం సమకూర్చడంలో సాలూరి రాజేశ్వర రావుకి అద్దేపల్లి రామారావు సహకారం అందించారు. కొన్ని పాటల్ని మాత్రమే ప్రస్తావించడం సాధ్యపడదు. అన్ని పాటల్నీ తల్చుకోవడం అంటే సినిమా మొత్తాన్ని మరోమారు పునఃశ్చరణ చేసుకోవడమే. 

శ్రీకృష్ణదేవరాయలుకి దాదాపు సమకాలికుడైన పురందరదాసు కీర్తన 'లంబోదర లకుమికరా' తో సినిమా మొదలవ్వడంలో  ఎంతైనా ఔచిత్యం ఉంది. అయితే, మల్లీశ్వరి నాగరాజులు పెద్దయ్యాకాను, సినిమా చివర్లోనూ గుళ్లో ప్రసాదం తీసుకునేప్పుడు వినిపించే ట్యూను 'మానస సంచరరే..' సదాశివ బ్రహ్మేంద్రులది. ఈయన రాయలికి దాదాపు 250 ఏళ్ళ తర్వాతి వాడు. (ఇలాంటిదే 'మాయాబజార్' సినిమాలో లక్ష్మణ కుమారుడు అద్దంలో చూసుకుంటూ త్యాగరాజ కీర్తన 'సమయానికి' ని 'ననినా నని..' అంటూ కూనిరాగం తీయడం -- వీటిని 'క్లాసిక్ మిస్టేక్స్' అందామా?). భజనపాటలు, యక్షగానమూ కూడా ఈ సినిమా సంగీతంలో భాగమే. పాటలు మాత్రమే కాదు, నేపధ్య సంగీతమూ సినిమాకి ప్రాణం పోసింది. 

 టి.జి. కమలాదేవి

నటీనటుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది భానుమతి గురించి. సహాయ దర్శకుడు రామకృష్ణ ని ప్రేమించి, సినిమా కథని మించిన ట్విస్టులతో పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకున్నాక, కొత్త జంటని ఆశీర్వదించడానికి వచ్చిన బీఎన్, 'మల్లీశ్వరి' ప్రాజెక్టు గురించి ఇద్దరికీ చెప్పి, సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకూ పిల్లల్ని కనడం వాయిదా వేసుకోమని కోరారట. తన ఆత్మకథ 'నాలో నేను' లో రాసుకున్నారు భానుమతి. (ఈ సినిమాకి కీలకమైన 'జామకాయల' సీను కూడా తన సలహా మేరకే చేర్చారని కూడా చెప్పారు). పాత్ర పోషణ మాత్రమే కాదు, పాటలూ తానే పాడారు.   అప్పటికింకా హీరోయిజం మొదలవ్వలేదు కాబట్టి, రామారావు నాగరాజు లో పరకాయ ప్రవేశం చేయడమే కాదు, రాయల ముందు చేతులు కట్టుకుని నిలబడ్డానికీ వెనుకాడలేదు. 

సహాయ పాత్రలు పోషించిన వాళ్లలో ఇద్దర్ని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. రాణీ తిరుమల దేవిగా నటించిన మిస్ కుమారి. 'వాహినీ' కుమారిగా ప్రసిద్ధురాలైన నాగరాజ కుమారి 'లక్స్' సబ్బుకు తొలి భారతీయ మోడల్. పుంభావ సరస్వతి మల్లాది రామకృష్ణ శాస్త్రి అభిమాన నటి. మరొకరు మల్లీశ్వరీ దేవి ఇష్టసఖి జలజ గా నటించిన టి.జి. కమలాదేవి (గోవిందమ్మ/కమలా చంద్రబాబు). సంభాషణలు తక్కువే అయినా వీళ్ళిద్దరూ ప్రత్యేకంగా గుర్తుండిపోతారు. ఆమాటకొస్తే చిన్నాపెద్దా పాత్రల్లో వేసిన ఏ నటీనటులూ కనిపించకుండా, కేవలం ఆయా పాత్రలు మాత్రమే కనిపించే సినిమా ఇది. చిన్నప్పటి మల్లీశ్వరీ, నాగరాజూ కూడా వాళ్ళే సహజంగా పెద్దైపోయి భానుమతీ, రామారావూ అయిపోయారేమో అనిపించేంతగా అతికినట్టు సరిపోయారు. 

రతనాలు రాశులు పోసి వీధుల్లో అమ్మిన రాయల కాలంలో చేతి వృత్తులవారి జీవితాలు ఎంత వైభవంగా ఉండేవో చెప్పే సినిమా 'మల్లీశ్వరి'. నాగరాజు తనకి  నచ్చిన పని చేయడానికి కులం అడ్డంకి కాలేదు సరికదా, చేతిలో విద్య అతన్ని భాగ్యవంతుణ్ణి చేసింది. ఆడితప్పని రాజు, ఆ రాజుకి ఆశీస్సులతో పాటు అవసరమైనప్పుడు సలహాలిచ్చే కవిరాజు, క్రమశిక్షణకి పెట్టింది పేరైన రాజాస్థానం.. వీటిని మాత్రమే కాదు, కాలాలకి అతీతమైన మానవ నైజాన్నీ, అజరామరమైన ప్రేమనీ హృద్యంగా తెరకెక్కించిన దర్శకనిర్మాత బీఎన్ రెడ్డి కీర్తికిరీటంలో కలికి తురాయి ఈ 'మల్లీశ్వరి'.  ఇంకా చూడలేదా? ఈ ప్రేమికుల రోజున చూసేయండి. మళ్ళీ చూడాలనిపించినా పర్లేదు, ఓసారి చూసిన వారందరికీ అలా అనిపించడం అత్యంత సహజమే. 

(Google Images) 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి