గురువారం, ఫిబ్రవరి 17, 2022

మనసున్న మనుషులు

గళాభినేత్రి శారదా శ్రీనివాసన్ రాసిన తొలి నవల 'మనసున్న మనుషులు'. సుదీర్ఘమైన ఆకాశవాణి కెరీర్ లో ఎంతోమంది సాహితీవేత్తలతో కలిసి పనిచేసి, కొన్ని వేల కాల్పనిక పాత్రలకి తన గొంతుతో ప్రాణ ప్రతిష్ట చేసిన ఈ విదుషి ఆలస్యంగా కలం పట్టినా, వరుసగా పుస్తకాలు ప్రచురిస్తూ ఉండడం సంతోషం కలిగించే విషయం. ఎనభయ్యేడేళ్ళ జీవితాన్ని చూసిన రచయిత్రి రాసిన ఈ నవలలో మెజారిటీ పాత్రలు ఎంతో మెచ్యూరిటీ కలిగినవీ, జీవితాన్ని గురించి స్థిరమైన అభిప్రాయాలున్నవీను. రెండు మూడు 'నెగిటివ్' పాత్రలున్నప్పటికీ వాటి పరిధి తక్కువ. పైగా ఈ మెచ్యూర్డ్ పాత్రల వెలుగుల ముందు వెలవెలబోతాయవి. నిజానికి 118 పేజీల ఈ రచనని నవల అనడం కన్నా, ముందుమాటలో రచయిత్రి డి. కామేశ్వరి చెప్పినట్టు నవలిక అనడమే సబబు. ఏకబిగిన చదివించే కథనం ఈ రచన ప్రత్యేకత.

ఇది ఎలీషా అనే ఓ అనాధ కథ. అతడు పెళ్లి చేసుకున్న సుజాత కథ. వాళ్లిద్దరూ కలిసి పెంచుకున్న రుక్మిణి కథ కూడా. ఈ మూడు భిన్న జీవితాలతో పాటు, వీరికి సంబంధించిన వారి జీవిత చిత్రణ కూడా కనిపిస్తుంది. అనాధ శరణాలయంలో పెరిగిన ఎలీషా స్వయంకృషితో యూనివర్సిటీ ప్రొఫెసర్ స్థాయికి ఎదుగుతాడు. పెరిగిన పరిస్థితుల కారణంగా అతనికి పెళ్లిమీద మనసు పోదు. అయితే, ఊహించని పరిస్థితుల నేపథ్యంలో తనకన్నా పద్దెనిమిదేళ్లు చిన్నదైన సుజాతని పెళ్లి చేసుకుంటాడు. సుజాత వ్యక్తిత్వం, ఆత్మాభిమానం ఉన్న స్త్రీ. జీవితంలో తగిలిన ఎదురు దెబ్బ వల్ల భవిష్యత్తుని గురించి పెద్దగా ఆలోచనలు ఉండవు ఆమెలో. పైగా ఎలీషా ఆమెకి పూజనీయుడు. అతని నిర్ణయాలకు ఆమె అడ్డు చెప్పదు. 

ఎలీషా-సుజాతల జీవితాల్లోకి అనూహ్యంగా ప్రవేశిస్తుంది రుక్మిణి. పద్దెనిమిదేళ్ల వయసుకే చాలా ఎదురు దెబ్బలు తిన్న అమ్మాయి. సుజాత తల్లిదండ్రులకి ఆమె సోదరుడి వల్ల కలిగే ఇబ్బందులని, రుక్మిణికి సోదరుడి కారణంగా ఎదురైన సమస్యలని (రెండు చోట్లా తోబుట్టువులే విలన్లు) పరిష్కరించడానికి ఎలీషా చొరవ తీసుకోవడం, రుక్మిణి భవిష్యత్తుకి సంబంధించిన నిర్ణాయాలతో కథ ముగుస్తుంది. నవల మొదట్లో చాలా బలమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రగా పరిచయమయ్యే సుజాత రానురాను ఎలీషా నీడలోకి వెళ్లిపోవడం, రుక్మిణి తన సమస్యల్లో ఒకదాన్ని నేరుగా పరిష్కరించుకునే అవకాశం ఉన్నా, చిన్న అడ్డదారిని వెతుక్కోవడం నన్ను నిరాశ పరిచిన విషయాలు. 

కథాకాలం విషయంలో స్పష్టత లేకపోవడం మరో సమస్య. మొదట ఆటోరిక్షా అతనిగా పరిచయమయ్యే పాత్ర అంతలోనే రిక్షా అతనిగా మారిపోవడం వల్ల మొదలైన కన్ఫ్యూజన్, మొబైల్ ఫోన్ వాడని పాత్రలు బ్యాంక్ ఏటీఎం, ఇంటర్నెట్టు వాడడం దగ్గర పరాకాష్టకి చేరింది. ఎలీషా-సుజాతల పెళ్లికి దారితీసే పరిస్థితుల చిత్రణలో కొంత నాటకీయత చోటుచేసుకుంది. తను నటించిన రేడియో నాటకాల ప్రభావం రచయిత్రి మీద కొంచం ఎక్కువగానే పడినట్లుందనిపించింది. అయితే, చెప్పదలుచుకున్న విషయం మీద స్పష్టత ఉండడం వల్ల కథనం సాఫీగానే సాగిపోయింది. ఈ నవల రాయడానికి తనకి ప్రేరణనిచ్చిన విషయాలేంటో తన ముందుమాటలో వివరంగా చెప్పారు రచయిత్రి.

"ప్రతి పాత్రా కొద్దో గొప్పో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లినా, ఎక్కడా చిన్న జర్క్ కూడా కనిపించదు. నల్లేరుమీద బండిలా మెత్తగా సాగిపోతుంది కథ. స్థితప్రజ్ఞుల సంగతి వేరు. కానీ, సామాన్యులే తమ బుద్ధి కుశలతతో స్థితప్రజ్ఞత పొందడం ఈ నవలలోని ప్రత్యేకత" అన్నారు సినీ గీత రచయిత భువనచంద్ర తన ముందుమాటలో. "ఇది మామూలు మధ్యతరగతి కథ" అన్న డి. కామేశ్వరి తన ముందుమాటలో కథ మొత్తం చెప్పేయకుండా ఉండి ఉంటే మరింత బాగుండేది. నవలలాగే ముందుమాటలో క్లుప్తంగా ఉన్నాయి. క్రియేటివ్ లింక్స్ ప్రచురించిన ఈ 130 పేజీల పుస్తకం వెల రూ. 130. ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఆన్లైన్ లోనూ లభిస్తోంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి