శుక్రవారం, ఫిబ్రవరి 04, 2022

మనంమనం బరంపురం

ఇప్పుడంటే 'మీది తెనాలి మాది తెనాలి' అనే వాడుక బాగా వినిపిస్తోంది కానీ, ఒకప్పుడు 'మనం మనం బరంపురం' అనేవాళ్ళు ఇదే అర్ధానికి. ఒరిస్సాలో ఉన్న తెలుగు నేల బరంపురం. తెలుగు నేలతో, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో బరంపురానికి ఉన్న సంబంధ బాంధవ్యాలు ప్రత్యేకం. తనదైన ప్రత్యేక సంస్కృతీ సాహిత్యాలు ఉన్న ఆ ప్రాంతం నుంచి యాభయ్యేళ్ల క్రితం వచ్చిన కథాసంకలనం 'మనంమనం బరంపురం'. అప్పుడే కొత్తగా పురుడు పోసుకున్న 'వికాసం' అనే పొట్టి పేరుగల వికాసాంధ్ర సాహితీ సంస్కృతీ సంవేదిక సంస్థ కొత్తగా కథలు రాసే వారిని ప్రోత్సహించే నిమిత్తం వెలువరించిన ఈ సంకలనాన్ని, సంస్థ స్వర్ణోత్సవాల సందర్భంగా గత సంవత్సరం పునర్ముద్రించారు. మొత్తం పదకొండు కథలున్న ఈ సంకలనం ప్రత్యేకత ఏమిటంటే ఈ కథలన్నీ ఆయా రచయిత(త్రు) ల తొలి(నాటి)కథలు.

సంకలనం చదవడం పూర్తి చేశాక మొదటగా స్పష్టమయ్యేది వస్తు వైవిధ్యం. ఇతివృత్తాలు వేటికవే భిన్నంగా ఉన్నాయి. అయితే, ఏ కథా కూడా బరంపురం కేంద్రంగా లేదు. కథాస్థలంతో నిమిత్తం లేని ఈ కథలన్నీ ఆసాంతమూ ఆపకుండా చదివిస్తాయి. కొన్ని కథలు ఇవాళ్టికీ సమకాలీనం అనిపిస్తే, మరికొన్ని కథలు గడిచిన కాలపు సమాజానికి రికార్డుగా అనిపిస్తాయి. విలువలు, కట్టుబాట్ల విషయంలో గడిచిన యాభయ్యేళ్ళ కాలంలో సమాజంలో వచ్చిన మార్పులని ఎత్తిచూపించే కథలివి. రెండు ప్రేమకథల్ని సమాంతరంగా నడిపిన గరికపాటి జగన్నాధరావు కథ 'నల్లకారు నవ్వింది' చదువుతుంటే ప్రేమ దక్కకపోతే ప్రేమించిన అమ్మాయిమీద ప్రతీకారం తీర్చుకోవాలనుకునే అబ్బాయిలు అప్పుడూ ఉన్నారన్న సత్యం బోధపడుతుంది. ఆ ప్రేమికుడి ఆలోచనల్లో మార్పు ఎలా వచ్చిందన్నదే కథ.

బి. ఎల్. ఎన్. స్వామి కథ 'బ్రహ్మవరం' లో కీలకమైన పాయింట్ ని 'జంబలకిడిపంబ' అనే హాస్య చిత్రంలో వాడేసుకున్నారు. కె. ఎల్. ప్రసాద్ 'నిశీధి నిజాలు' రెండు రౌడీ గ్యాంగుల మధ్య ఒక అమ్మాయి కోసం జరిగే కథ. పాయింట్ సినిమాటిక్ గా ఉండడం మాత్రమే కాదు, కథ ఆసాంతమూ సినిమాలాగే సాగుతుంది. చిట్టా వెంకటప్పయ్య శాస్త్రి రాసిన 'ఆడది ఆహ్వానించింది' కథలో పాయింట్ ని కూడా తర్వాతి కాలంలో వంశీతో సహా చాలామంది రచయిత(త్రు)లు వాడుకున్నారు. న్యాయపతి వేంకట సత్యనారాయణ మూర్తి కథ 'మీకంటే మీ నాన్నే నయం' నాటి మధ్యతరగతి ఇళ్లలో పెళ్లిచూపులు ప్రహసనాలని జ్ఞాపకం చేస్తుంది. బలమైన కథానాయిక పాత్ర ఈ కథ ప్రత్యేకత.

ఇప్పుడు మన సమాజం నుంచి దాదాపుగా అంతమైపోయిన కుష్టు వ్యాధిని ఇతివృత్తంగా తీసుకుని మాస్టర్ రవి (దేవరాజు వేంకట నరసింహారావు) రాసిన 'చెయ్యి దాటిపోలేదు' కథకి బెంగాలీ వాతావరణాన్ని అద్దారు. ఈ కథనం కూడా ప్రత్యేకమే, ముఖ్యంగా 'టీ' ని వాడుకున్న తీరు. వడ్డిన ఏకాంబరం 'చంపకం' ఓ ఆదర్శ ప్రేమికుడి కథ. బలమయిన నాయిక చంపకం గుర్తుండిపోతుంది. తాతిరాజు వెంకటేశ్వర్లు రాసిన 'సేతుబంధనం' ఇంకో ఆదర్శ ప్రేమికుణ్ణీ, అతని ప్రేమలో బోలుతనాన్నీ కళ్ళముందు ఉంచుతుంది. జొన్న వెంకటరమణ మూర్తి కథ 'టిట్టిభం' పేరులాగే ప్రత్యేకమైనది. రచయిత చెప్పాలనుకున్న విషయం పాఠకులకి మొదటినుంచీ అర్ధమవుతూనే ఉంటుంది. ఉపమలూ, ఉత్ప్రేక్షలూ ఎక్కువయ్యాయనిపించే కథ. కుమారి దేవి రాసిన 'ఎలా అర్ధం చేసుకునేది!' ఓ లేడీ డాక్టర్ కథ. కొత్తగా వైద్య వృత్తిలో చేరిన ఆమెకి ఎదురయ్యే ఒక అనుభవం ఆమెకే కాదు కథ చదువుతున్న పాఠకులకీ గుర్తుండి పోతుంది.

సంకలనంలో చివరి కథ బి. నిర్మలా రావు 'శిక్షింపబడని దోషులు' ఇంకో ఆదర్శ ప్రేమికుడిని మన ముందుంచుతుంది. ఆతని ప్రేమ విఫలం కావడానికి కారణం చిత్రంగా అనిపిస్తుంది. కాథానాయకుడి పాత్ర మీద సానుభూతి కలిగించేందుకు రచయిత ప్రయత్నించడం పాఠకుల దృష్టిని తప్పించుకోలేదు. ప్రముఖ కథా రచయిత అవసరాల రామాకృష్ణారావు సంకలన కర్తగా వ్యవహరించారు. తొలిముద్రణకి రాసిన ముందుమాటలో రచయితల్ని పరిచయం చేయగా, తాజా ముద్రణకి ముందుమాట రాసిన ఎమ్మెస్వీ గంగరాజు ఒక్కో కథనీ క్లుప్తంగా విశ్లేషించారు. "సంకలనానికి మీరిచ్చే మూల్యంలో సగభాగం వికాసం స్వర్ణోత్సవ సంబరాలకి విరాళంగా భావించండి" అన్నారు సేతుపతి ఆదినారాయణ. నాటి సంకలనానికి చంద్ర గీసిన ముఖచిత్రాన్నే ఇప్పుడూ వాడారు. జేవీ పబ్లికేషన్స్ వారి ముద్రణ బాగుంది, అచ్చు తప్పులు తక్కువే. మొత్తం 127 పేజీల ఈ సంకలనం వెల రూ. 150. ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి