సోమవారం, ఫిబ్రవరి 07, 2022

ఆ 21 రోజులు

పేరున్న రచయిత (త్రు) లకి కూడా సాహితీ సృజనలో తీరని కోరికలుంటాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. కథా, నవలా రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మికి ఓ చిరు కోరిక ఇన్నాళ్లూ తీరకుండా ఉండిపోయింది. "అప్పట్లో ప్రముఖ రచయితలు ఏ వారానికి ఆ వారం రాసి ఇస్తారు అని తెలుసుకుని అలా నేనుకూడా రాయాలని సరదా పడ్డాను. కానీ ఎక్కడో దూరాన వుండటం వల్ల అది సాధ్యం కాదని గ్రహించాను" అన్నారు తన తాజా నవల 'ఆ 21 రోజులు' కి రాసిన ముందుమాటలో. రేపు పబ్లిష్ చేసే భాగాన్ని ఇవాళ రాయడం అన్న పద్ధతిలో ఫేస్ బుక్ మాధ్యమంలో ప్రచురించిన ఈ నవల తనకో కొత్త అనుభవం అన్నారు రచయిత్రి. నవలని ఆదరించిన పాఠకులే ప్రింటింగ్ బాధ్యతనీ తీసుకోవడం ఈ నవల ప్రత్యేకత.

పొత్తూరి విజయలక్ష్మి ఇతర రచనల్లో లాగానే ఈ నవలలోనూ నాయికది నాయకుడికన్నా బలమైన పాత్ర. స్పష్టంగా చెప్పాలి అంటే నాయిక పక్కన ఓ నాయకుడు ఉండాలి కాబట్టి శ్రీలలిత పక్కన శరత్ ఉంటాడు. ఈ శ్రీలలిత ఓ పల్లెటూళ్ళో పుట్టి పెరిగి అక్కడే పదో తరగతి వరకూ చదువుకున్న అమ్మాయి. తనని పెంచిన తాతయ్య కాలం చేయడంతో అనాధగా మిగిలి, తాతయ్య పనిచేసిన ఆలయంలోనే పనికి కుదురుకుంటుంది. అక్కడ ఊహించని సమస్య ఒకటి రావడంతో ఉన్నట్టుండి ఆ ఊరు విడిచిపెట్టాల్సి వస్తుంది. శరత్ ది కూడా పల్లెటూరే, అతనూ అనాథే. కాకపోతే అతనికి కాస్త భూవసతి ఉంది. వారసత్వంగా వచ్చిన మెట్టపొలంలో నేరేడు పళ్ళు పండిస్తూ పొట్ట పోసుకుంటూ ఉంటాడు.

పెళ్లీడుకొచ్చిన శరత్ కి సంబంధాలు చూసేవాళ్ళు ఎవరూ లేకపోవడంతో తనే పేపర్లో ప్రకటన ఇచ్చుకుంటాడు. అనూహ్యంగా ఆ ప్రకటన శ్రీలలిత కళ్ళలో పడుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం వాళ్ళిద్దరికీ పెళ్లవుతుంది. 'రాగాలా.. సరాగాలా..' సంసారం ఓ ఆర్నెల్లు సాగాక కథలో ప్రధానమైన మలుపు (కుదుపు) వస్తుంది. పుట్టింది పల్లెటూరైనా, చదివింది పదో తరగతే అయినా బోల్డన్ని తెలివితేటలు, సమయస్ఫూర్తి, కించిత్తు సాహసం, బోలెడంత నోటిమంచితనం ఉన్న శ్రీలలితకి కూడా అది గడ్డు సమస్యే. ఆ సమస్యతో ఆమె పోరాటపు గడువు 21 రోజులు. ఇంతకీ ఆ పోరాటంలో ఆమె గెలిచిందా? అన్నది ఆపకుండా చదివించే ఈ నవలకి ముగింపు.

ముందుమాటల్లో హెచ్చరించినట్టుగానే ఇది హాస్య నవల కాదు. ఈ కథలో హాస్యానికి చోటు కూడా తక్కువే. అయినప్పటీ పాఠకులకి దరహాసాన్నిచ్చే ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోలేదు రచయిత్రి. చిన్న చిన్న మాటవిరుపులు, పాత్రల మేనరిజాలు ఉపయోగించుకుని నవ్వించారు చాలాచోట్ల. కథ తాలూకు మొత్తం భారాన్ని నాయిక మీద మోపేయడం వల్ల నాయకుడికి బొత్తిగా చేసేందుకు ఏమీ స్కోపు లేకుండా పోయింది. 'సువర్ణ సుందరి' లో నాగేసర్రావులా ఈ నవలలో శరత్ ది పాసివ్ పాత్ర. సహాయ పాత్రలన్నీ ఆ సమయానికి వచ్చి నాయికకి తగురీతిలో సాయం చేసి వెళ్తూ ఉంటాయి. పైగా, వ్యవసాయాన్ని చాలా సులువైన విషయంగా చిత్రించడం వల్ల ఎక్కడా హీరో కష్టపడ్డట్టు అనిపించదు మనకి.

మనందరం ఓ నెగటివ్ ప్రపంచంలో బతుకుతున్నాం. తెల్లారి లేస్తే వినే, చదివే, చూసే వార్తల్లో నెగటివ్ వార్తలే అధికం. వీటి ప్రభావం కాబోలు, కొత్త మనుషులు తారసపడినా కాస్త అనుమానాస్పదంగానే చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో ఒకటి మినహా అన్నీ పాజిటివ్ పాత్రలే ఉన్న ఈ నవల ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. లోకంలో మంచితనం మిగిలే ఉందన్న భరోసానిస్తుంది. సంకల్పం బలమైనదైతే, ఆశావహ దృక్పధంతో ముందుకు వెళ్తే, ఫలితం తప్పక ఉంటుందన్న ఓ ధైర్యాన్ని ఇచ్చే రచన ఇది. ముందుగానే చెప్పుకున్నట్టు చదివించే గుణం పుష్కలంగా ఉన్న ఈ నవలని చదువుతున్నంత సేపూ లాజిక్ లని కూడా పక్కన పెట్టేస్తాం. చదవడం పూర్తి చేశాక 'నిజజీవితంలో కూడా ఇలాంటి మనుషులు కొందరుంటే ప్రపంచం మరింత అందంగా ఉండేది కదా' అని నిట్టూరుస్తాం. శ్రీ రిషిక పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ 111 పేజీల నవల వెల రూ. 125. ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్ లోనూ దొరుకుతోంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి