మంగళవారం, ఫిబ్రవరి 01, 2022

ది జర్నీ అఫ్ ఎ జర్నలిస్ట్

దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం మాట. కొంత విరామం తర్వాత 'ఆంధ్రజ్యోతి' పత్రిక తిరిగి ప్రారంభమైనప్పుడు నా మిత్రులొకరు అక్కడ ఉద్యోగంలో చేరారు. ఒకరోజు ఏదో మాట్లాడడం కోసం ఫోన్ చేశాను. ఇంకా లేండ్ లైన్ల కాలమే. మాటల మధ్యలో ఆవేళ వాళ్ళ పేపర్లో వచ్చిన ఒక వార్త బాగుందని చెప్పాను. "రాసినతను ఇక్కడే ఉన్నాడు, ఇస్తున్నా ఉండండి" అన్నారు. రిసీవర్ మార్పిడి జరుగుతూ ఉండగానే వార్తని మళ్ళీ ఓసారి చూస్తే రాసినతని పేరు కనిపించింది - కంభాలపల్లి కృష్ణ. ఆ తర్వాత అతన్ని కొన్ని టీవీ ఛానళ్లలో చూస్తూ వచ్చాను. ఇప్పుడు 'ది జర్నీ అఫ్ ఎ జర్నలిస్ట్' అనే పుస్తకం చూడగానే "ఇతను ఆత్మకథ రాసుకునేంత పెద్దవాడై పోయాడా అప్పుడే?" అనిపించింది. రాసిన విధానం వల్ల కావొచ్చు, ఎక్కడా ఆపకుండా చదవడం పూర్తి చేశాను. 

సూర్యాపేటలో పుట్టి పెరిగిన కృష్ణ, డిగ్రీ చదువుతూ ఉండగానే 'ప్రజాశక్తి' దినపత్రికలో ప్రూఫ్ రీడర్ గా ఉద్యోగ పర్వం ఆరంభించి, అటుపై అక్కడే సబ్-ఎడిటర్ గా మారి, అటు నుంచి ఆంధ్రజ్యోతి మీదుగా టీవీ నైన్లో చేరి అటు పైని అనేక టీవీ ఛానళ్లలో పని చేశారు. కెరీర్ మొదలు పెట్టి పాతికేళ్ళు పూర్తయిన సందర్భంగా రాసిన ఈ పుస్తకంలో కేవలం తన విషయాలు మాత్రమే కాకుండా, గడిచిన పాతికేళ్లలో దేశ, రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పులని ఎప్పటికప్పుడు రికార్డు చేస్తూ రావడం వల్ల జరిగిపోయిన పరిణామాలన్నీ ఒక్కసారి సింహావలోకనం చేసుకోడానికి ఉపకరించిందీ పుస్తకం. మరీ ముఖ్యంగా, కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని నిశితంగా అక్షారబద్ధం చేసిన రచన ఇది. జరిగిన సంఘటనలన్నీ తేదీలతో సహా ఇవ్వడం వల్ల ఒక రెడీ రిఫరెన్సు గానూ పనికొస్తుంది. 

ఒకప్పుడు జర్నలిస్టుల్లో ఎక్కువమంది అన్ని రాజకీయ పార్టీలని సమదృష్టితోనూ, ఉద్యమాలని నిస్పక్షపాతంగానూ చూసేవారేమో. ఇప్పుడు ప్రతి పత్రికా, ఛానెలూ ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసేదే కాబట్టి నిష్పక్షపాతాన్ని ఆశించలేం. పైగా ముందు మాటలోనే "నాకు జీతం ఇస్తున్న సంస్థలు రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తున్నా నేను మాత్రం ప్రత్యేక తెలంగాణకు 'జై' కొట్టాను" అని ప్రకటించారు కాబట్టి, లోపలి విషయాలు ఎలా ఉండబోతున్నాయన్న అంచనా సులువుగానే దొరికింది.  అయితే, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఢిల్లీలో పని చేసే తెలుగు జర్నలిస్టుల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి మీద, తెలంగాణ ప్రాంతం వారు భౌతిక దాడులు చేయడం లాంటి విషయాలనూ రికార్డు చేశారు. ఇవి వార్తల్లో కనిపించని వార్తలు. 

బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమం మొదలుకుని, తాను ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రతి ఉద్యమాన్నీ ఈ పుస్తకంలో రికార్డు చేశారు కృష్ణ. ఎక్కడోతప్ప, రాగద్వేషాల జోలికి వెళ్లకుండా విషయాన్ని విషయంగా చెప్పేందుకే పుస్తకం అంతటా ప్రయత్నించారు. తాను కవర్ చేసిన రాజకీయాల మొదలు, తాను ఎదుర్కొన్న రాజకీయాల వరకూ చెప్పదల్చుకున్న ప్రతి విషయాన్నీ ఒకే టోన్ లో చెప్పడం పాఠకులని ఆకట్టుకుంటుంది. వృత్తి జీవితం తాలూకు మెళకువలు వేటినీ ప్రత్యేకించి చెప్పకపోయినా, కొన్ని కొన్ని వార్తలని తాను కవర్ చేసిన విధానాన్ని చెప్పే క్రమంలో జోడించారు. కొత్తగా జర్నలిజంలోకి వచ్చే వారికి ఈ మెళకువలు ఏమాత్రంగానైనా ఉపయోగపడొచ్చు. 

బ్రేకింగ్ న్యూసుల కోసం టీవీ వరకూ వెళ్లనవసరం లేకుండా సెల్ ఫోన్ల లోనే వార్తలు కనిపించేస్తున్న కాలంలో ఉన్నాం ఇప్పుడు. ఓ ఇరవై ఏళ్ళ క్రితం ఈ బ్రేకింగ్ న్యూసులు సంపాదించదానికి జర్నలిస్టులు ఎన్ని ప్రయత్నాలు చేసే వాళ్ళో చదివినప్పుడు టెక్నాలజీ ఎంత వేగంగా విస్తరిస్తోందో కదా అనిపించక మానదు. తాను బ్రేక్ చేసిన వార్తల గురించి చెబుతూ 'మార్గదర్శి' వార్త ఎలా దొరికిందో వివరంగా చెప్పాడమే కాదు, ఆ కేసు ఇంకా సుప్రీం కోర్టులో పెండింగులో ఉందన్న అప్డేట్ నీ ఇచ్చారు. తీర్పు ఎలా వస్తుందన్నది ఆసక్తికరం. వైఎస్ హెలికాఫ్టర్ మిస్ అయినప్పుడు, మరణ వార్త తెలిసినా ఆధికారిక ప్రకటన వచ్చే వరకూ బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేయలేకపోవడం, జగన్మోహన్ రెడ్డి పై కేసులు మొదలైన క్రమం లాంటి సంగతులన్నీ వార్తా ప్రసారపు దృష్టికోణం నుంచి చెప్పుకొచ్చారు. 

కొందరు రాజకీయ నేతలతో సన్నిహితంగా, అంతరంగికుడిగా మెలగడం, వాళ్లకి అవసరమైనప్పుడు సలహాలు ఇవ్వడం ('ప్రజారాజ్యం' లో చేరొద్దని కాంగ్రెస్ నేత వీ. హనుమంత రావు కి) లాంటివన్నీ పుస్తకాన్ని ఆసక్తిగా చదివిస్తాయి. 'కారణాంతరాల' వల్ల వెలుగే చూడని వార్తల కబుర్లూ ఉన్నాయి. పాతికేళ్ల కాలంలో తెలుగు నాట రాజకీయాలు ఎన్నెన్ని మలుపులు తిరిగాయి, తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వాళ్ళ ఆకాంక్షలు, అప్పటి రాజకీయ సమీకరణాలు లాంటి విశేషాలని విహంగ వీక్షణం చేసేందుకు పనికొచ్చే పుస్తకం ఇది. క్లుప్తంగా రాసిన పుస్తకం కావడం, రాసిన విషయాల పట్ల ఆసక్తి ఉండటం వల్లనేమో ఎక్కడా బోర్ కొట్టకుండా ఆసాంతమూ ఆసక్తిగా చదివించింది. భూమి బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఈ 160 పేజీల పుస్తకం వెల రూ. 100. అన్ని పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లయిన్ ద్వారానూ కొనుక్కోవచ్చు. 

2 కామెంట్‌లు:

  1. మీరు వ్రాసే పుస్తక పరిచయాలు చాలా బాగుంటాయి. If possible please write about the recent English book 'India that is Bharat' by J. Sai Deepak which has received wide appreciation.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలండీ.. మీరు సూచించిన పుస్తకం చదివేందుకు ప్రయత్నిస్తాను..

      తొలగించండి