ఆదివారం, జనవరి 06, 2013

నగదు బదిలీ

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 'ఆధార్' ప్రాజెక్ట్ తాలూకు ఫలితాలను పొందే కార్యక్రమం మొదలయ్యింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రయోజనాలని నేరుగా లబ్దిదారులకే చేర్చే పథకం (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీం) తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు నుంచి లాంచనంగా ప్రారంభమయ్యింది. తొలిదశలో దేశం మొత్తం ఎంపిక చేసిన యాభై జిల్లాలలో ఎంపిక చేసిన పథకాలని ఆధార్ కి అనుసంధానం చేసి ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. వీలైనంత తొందరలో - మరింత స్పష్టంగా చెప్పాలంటే వచ్చే ఏడాది జరగబోయే సాధారణ ఎన్నికలకి ముందుగానే - ఈ స్కీముని దేశవ్యాప్తంగా అమలు చేయడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

దేశంలోని ప్రతి పౌరుడికీ ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యతో కూడిన కార్డు పంపిణీ చేయడం ఆధార్ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. కార్డు దారుడి ఫోటో, చిరునామా, ఆదాయ వివరాలతో పాటు, రెండు చేతుల వేళ్ళ ముద్రలూ కంప్యూటర్ లో నిక్షిప్తం చేస్తారు. ఫలితంగా ఎలక్ట్రానిక్ వేలిముద్రని సేకరించిన క్షణాల్లోనే సదరు వ్యక్తి గుర్తింపు నిర్ధారణ జరిగిపోతుంది. ఆధార్ కార్డులు పొందిన అనంతరం, ప్రతి కుటుంబమూ ఒక బ్యాంక్ అకౌంట్ ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ బ్యాంక్ అకౌంట్ నెంబరు ను ఆధార్ వివరాలతో అనుసంధానం చేస్తారు.

ప్రభుత్వం నుంచి అందే అన్ని ప్రయోజనాలూ - పెన్షన్లు, స్కాలర్షిప్పులు మొదలు పంట భీమా, ఎరువుల సబ్సిడీ వరకూ ప్రతి ఒక్కటీ - నేరుగా లబ్దిదారుడి బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు. అదే విధంగా, ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రస్తుతం రేషన్ కార్డు ఆధారంగా సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇకపై, రేషన్ కార్డుతో పాటు ఆధార్ గుర్తింపు సైతం తప్పనిసరి అవుతుంది. రేషన్ షాపుల్లో లబ్దిదారుల ఎలక్ట్రానిక్ వేలిముద్రలు సేకరించి, కార్డు దారులే అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే పంపిణీ జరుగుతుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన జిల్లాలో రేషన్ పంపిణీ, పెన్షన్లు, స్కాలర్షిప్పుల, ఉపాధి హామీ వేతనాల పంపిణీని ఆధార్ సమాచారం ఆధారంగా జరపబోతున్నారు.

ఈ కొత్త విధానం వల్ల జరగబోయే ప్రయోజనం ఏమిటి? ముందుగా ప్రభుత్వానికి ఒనగూడే ప్రయోజనం గురించి చెప్పుకుందాం. స్కీముని ప్రారంభిస్తూ, టీవీ కెమెరాల సాక్షిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే మొత్తం కుటుంబాల సంఖ్య పన్నెండున్నర లక్షలు కాగా, అధికారులు జారీ చేసిన తెలుపు రంగు రేషన్ కార్డుల పదిహేను లక్షలు. తెలుపురంగు కార్డుల కోసం ఇంకా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి!! ఇక రాష్ట్రం మొత్తమీద పరిస్థితి ఏమిటన్నది సులువుగానే ఊహించవచ్చు. ఒక్క రూపాయికి కిలో బియ్యంతో సహా అనేక సబ్సిడీలని పొందేందుకు తెల్ల కార్డే ఆధారం. ఈ తెల్ల కార్డుల్లో బోగస్ కార్డులు అధికంగా ఉన్నాయి అన్నది నిర్వివాదం.

ఇప్పుడు రేషన్ సరుకులు అందజేసేందుకు లబ్దిదారుడి ఎలక్ట్రానిక్ వేలిముద్ర ఆధారంగా జరిగే నిర్ధారణం తప్పనిసరి. కాబట్టి, బోగస్ కార్డులకు పంపిణీ కుదరదు. ఒక్కో వ్యక్తికీ ఒక్కో ఆధార్ సంఖ్య మాత్రమే ఉంటుంది కాబట్టి, ఒకటి కన్నా ఎక్కువ కార్డులు ఉన్నా ఒక్క కార్డు మాత్రమే ఉపయోగించగలరు. (ఇదే విధానాన్ని వంట గ్యాస్ సిలిండర్లకీ ప్రవేశ పెట్టేందుకు కృషి జరుగుతోంది). ఇక, మరణించిన వారి పేరుపై కేన్సిల్ కాకుండా ఉండిపోయిన కార్డులు. లబ్దిదారుడి ఎలక్ట్రానిక్ వేలిముద్ర లేకుండా సరుకుల పంపిణీ సాధ్యం కాదు కాబట్టి, ఈ కార్డులని ఉపయోగించడం ఇకపై కుదరదు. పెన్షన్లు, స్కాలర్షిప్పులు, ఉపాధి హామీ వేతనాల పంపిణీకీ ఇదే విధానం కాబట్టి, బోగస్ చెల్లింపులకి అడ్డుకట్ట పడే వీలుంది.

ప్రభుత్వం నుంచి ప్రజలకి అందే ప్రయోజనాలు నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలో క్రెడిట్ అవుతాయి కాబట్టి, లబ్దిదారులు ఎవరికీ లంచాలు ఇవ్వనవసరం లేదన్నది ఏలినవారు చెబుతున్న మరో ప్రయోజనం. అయితే, వ్యవస్థలో వేళ్ళూనుకు పోయిన అవినీతి ఇంత సులువుగా రూపు మాసిపోతుందని అనుకోలేం. ఎవరి మార్గాలని వారు ఈ పాటికే వెతుక్కునే ఉంటారు. ప్రస్తుతానికి వస్తే సామాన్య ప్రజలకన్నా, ప్రభుత్వానికి ఈ విధానం వల్ల ఎక్కువ ప్రయోజనం కనిపిస్తోంది. కార్యక్రమం పూర్తిగా అమలులోకి వచ్చాక పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్నది వేచి చూడాల్సిన విషయం.

3 కామెంట్‌లు:

  1. ఏంటో వీళ్ళ స్కీములు దేశ సంపదనంతా పచ్చనోట్లగా మార్చేసి పంచేస్తారేమో..!?

    రిప్లయితొలగించండి
  2. The real intentions are different. Corrupt governments alwyas look for ways to circumvent all technical objections from institutions to perpetuate their governance.
    Taking cue from DTH, this direct transfers are a way to transfer money to voters without answerability to the ever vigilant Election Commission. The checking of these accounts or bringing to book the culprits becomes next to impossible to such agencies. These disguised ideas are a products of perverted geniuses.

    రిప్లయితొలగించండి
  3. @శ్రీ.దు: ఈ పధకం ఉద్దేశం అయితే మాత్రం, ఇప్పుడు ఇస్తున్న డబ్బునే నేరుగా చేతికి కాకుండా బ్యాంకులో వేయడం అండీ.. ఎంతవరకూ నెరవేరుతుందో చూడాలి ధన్యవాదాలు.

    @ఎన్నెస్ మూర్తి: ఈ ఆలోచన మన వాళ్లకి ఉందొ లేదో తెలియదు కానీ, ఇది మాత్రం బాగా ఆలోచించాల్సిన విషయమేనండీ... ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి