మంగళవారం, మార్చి 22, 2022

కన్నీటిచుక్క

శానిటైజర్లో నానిన చేతుల్ని లిక్విడ్ సోపుతో కడుక్కుని, డిస్పెన్సర్ నుంచి అలవాటుగా పేపర్ నాప్కిన్ అందుకుంటూండగా గుర్తొచ్చింది నీటిచుక్క ఆకారంలో ఉండే శ్రీలంక. కాగితం కొరత కారణంగా విద్యార్ధులకి జరగాల్సిన అన్ని పరీక్షలనీ నిరవధికంగా వాయిదా వేసింది గతవారం. బిల్లులు ప్రింటు చేయడానికి కాగితం లేక అక్కడి విద్యుత్ సంస్థలు బిల్లులు పంపిణీ చేయలేదు. ఆ చిన్నదేశాన్ని చుట్టుముట్టిన ఆర్ధికసంక్షోభపు వికృత రూపాన్ని ప్రపంచానికి సులువుగా అర్ధమయ్యేలా చెప్పే ఉదాహరణ ఇది. ఇంతేనా? చమురు, సహజవాయువు ధరలు చుక్కలంటాయి. నిత్యావసరాలని అత్యధిక ధరలు చెల్లించి కొనడానికి జనం సిద్ధపడ్డా తగినంత సరుకు లేదు మార్కెట్లో. ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉండగా, ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య సంస్థలతో చర్చలు ప్రారంభించింది. ఈ చర్చలు ముగిసేదెప్పుడు? జనం ఆకలి కేకలు ఆగేదెప్పుడు? 

సరిగ్గా ఐదేళ్ల క్రితం శ్రీలంకని గురించి ఘనమైన వార్తా కథనాలు వచ్చాయి -  మనదేశంలో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా. అప్పుడు, అంటే 2017 సంవత్సరానికి గాను శ్రీలంక జీడీపీ భారత జీడీపీని మించింది. పరిణామంలో భారత్ లో యాభయ్యో వంతు, కేవలం రెండు కోట్ల పైచిలుకు జనాభాతో - భారత్ తో పోల్చినప్పుడు ఆరొందలో వంతు - ఉన్న చిన్న దేశం, ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో ఓ రాష్ట్రం పాటి చేయని దేశం వృద్ధిలో భారత్ ని మించిపోవడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రత్యేక తమిళ దేశంకోసం సుదీర్ఘమైన ఉద్యమం చేసిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీయీ) ని సమర్ధవంతంగా అణచి వేయడం ద్వారా శ్రీలంక ప్రభుత్వం దేశంలో శాంతి భద్రతల్ని పెంపొందించిందనీ, అందువల్లనే అభివృద్ధి సాధ్యపడిందనే విశ్లేషణలు జోరుగా సాగాయి. అయితే ఈ మురిపెం ఎన్నాళ్ళో సాగలేదు. 

సరిగ్గా రెండేళ్ల తర్వాత, 2019 లో ఈస్టర్ పండుగ నాడు ఆ దేశంలో జరిగిన బాంబు పేలుళ్లతో శ్రీలంక మాత్రమే కాదు, మొత్తం ప్రపంచమే ఉలికిపడింది. మొత్తం మూడు చర్చిలు, మూడు హోటళ్ల మీద వరుసగా జరిగిన బాంబు దాడుల్లో ఏకంగా 270 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటివరకూ దేశానికి ప్రధాన వనరుగా ఉన్న పర్యాటకరంగ ప్రగతి మసకబారడం మొదలయ్యింది. నిజానికి ఈస్టర్ బాంబు పేలుళ్ల వల్ల కన్నా తర్వాత జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గోటబాయ రాజపక్స గెలవడం వల్లనే ఎక్కువ నష్టం జరిగిందన్న వాదన ఉంది. ఎన్నికల్లో తన గెలుపు కోసమే బాంబు దాడులు జరిపించారన్న ఆరోపణలనీ గోటబాయ ఎదుర్కొంటున్నారు. రాజపక్స అన్నదమ్ములు నలుగురూ, వాళ్ళ పిల్లలూ శ్రీలంక పాలనలో కీలకమైన పదవుల్లో ఉన్నారు. మొత్తం దేశం బడ్జెట్లో డెబ్బై శాతం నిధులు ఈ కుటుంబం ఆధ్వర్యంలో నడిచే మంత్రిత్వ శాఖల్లోనే ఖర్చవుతాయి!

Google Image

ఈస్టర్ పేలుళ్ల కారణంగా తగ్గడం మొదలైన టూరిజం ఆదాయం, కోవిడ్ వ్యాప్తితో మరింతగా తగ్గి, తాజాగా ఉక్రెయిన్ మీద రష్యా ప్రకటించిన యుద్ధం కారణంగా పూర్తిగా క్షీణించిపోయింది. ఉక్రెయిన్ యుద్ధం నిజానికి ఉక్రెయిన్ తో సమంగా శ్రీలంకకీ నష్టం చేస్తోంది. శ్రీలంకకి వచ్చే పర్యాటకుల్లో అత్యధికులు రష్యా, ఉక్రెయిన్ల నుంచే వస్తారు. శ్రీలంకలో ప్రధానమైన తేయాకు పంటకి అతిపెద్ద మార్కెట్ కూడా ఈ రెండు దేశాలే. అటు పర్యాటకుల్నీ, ఇటు తేయాకు మార్కెట్నీ కోల్పోయింది శ్రీలంక. వీటికి తోడు పాలనా పరమైన లోపాలు సరేసరి. గతేడాది ఉన్నట్టుండి కృత్రిమ ఎరువుల వాడకాన్ని నిషేధించింది శ్రీలంక ప్రభుత్వం. ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం మంచిదే అయినా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసనలకి తలొగ్గి కొంచం ఆలస్యంగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పంటల దిగుబడి తగ్గి ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. 

ఆదాయం పడిపోవడం ఓపక్క, ఆహార ధాన్యాల కొరత మరోపక్క చుట్టుముట్టినా ప్రభుత్వం వేగంగా స్పందించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పొరుగు దేశాలు  సహాయం అందించేందుకు సిద్ధపడినా శ్రీలంక ప్రభుత్వం అందుకోడానికి తిరస్కరించడం, ద్రవ్యలోటుకి సంబంధించిన కీలక నిర్ణయాలని వాయిదా వేస్తూ రావడం లాంటి తప్పిదాలు కూడా నేటి శ్రీలంక సంక్షోభానికి కారణాలని చెప్పాలి. నిజానికి అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ఏదో ఒక సమయంలో ఇలాంటి సంక్షోభాలని ఎదుర్కొన్నవే. నూతన ఆర్ధిక సంస్కరణలని ఆహ్వానించడానికి ముందు భారతదేశ పరిస్థితి కూడా ఇదే. బంగారు నిల్వలు మొత్తం విదేశీ బ్యాంకుల తాకట్టులో ఉండి, ఎక్కడా అప్పు పుట్టని పరిస్థితుల్లో దిగుమతులన్నీ క్లియరెన్స్ లు దొరక్క పోర్టుల్లో పేరుకుపోయిన పరిస్థితిని ఈ దేశమూ అనుభవించింది. పైగా అప్పుడు రాజకీయ అస్థిరత పతాక స్థాయిలో ఉంది కూడా. 

అంతటి సంక్షోభపు అంచుల నుంచి దేశాన్ని బయట పడేసిన నాటి ప్రధాని పీవీ నరసింహారావు ని మళ్ళీ ఓసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇవాళ శ్రీలంక ఐఎంఎఫ్ చేతుల్లోకి వెళ్లిపోతుందేమోనని ప్రపంచం సందేహిస్తున్న వేళ, నాటి సంక్షోభం నుంచి భారత్ గట్టెక్కిన వైనాన్ని గుర్తు చేసుకోవాలి. అంతర్జాతీయ షరతుల్ని గుడ్డిగా ఆమోదించకుండా, పరిమితుల మేరకి మాత్రమే ప్రయివేటు పెట్టుబడుల్ని ఆహ్వానించి దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టిన నాయకుడిని స్మరించుకోవడం తప్పు కాదు. ప్రస్తుతం శ్రీలంకకి కొరవడింది ఇలాంటి నాయకత్వమే.  కోతిపుండు బ్రహ్మరాక్షసిగా మారినట్టుగా ఆహార ధాన్యాల కొరతతో మొదలైన సమస్య, రికార్డు స్థాయి ఆహార, ఆర్ధిక సంక్షోభం వరకూ పెరిగిపోయినా పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న గట్టి దాఖలా ఏదీ కనిపించడం లేదు. సంక్షోభం పెరిగే కొద్దీ బేరమాడే శక్తి (బార్గెయినింగ్ పవర్) తగ్గిపోతుందనీ, ద్రవ్య సంస్థలు పెట్టే షరతులన్నింటికీ అంగీకరించాల్సిన పరిస్థితిలోకి వెళ్లిపోతామనీ ఆ దేశపు నేతలకి తట్టకపోవడం దురదృష్టకరం. నీటి చుక్క దేశపు కన్నీరు ఎప్పటికి ఆగేనో... 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి