సోమవారం, సెప్టెంబర్ 06, 2021

జ్ఞాపకాల జావళి

ముందుగా మార్క్ ట్వేయిన్ చెప్పిన మాటనొకదాన్ని తల్చుకోవాలి. "Truth is stranger than fiction" అన్నాడా మహానుభావుడు. ఆత్మకథలు చదివేప్పుడు బాగా గుర్తొచ్చే మాట ఇది. అచ్చంగా ఆత్మకథ కాకపోయినా, తన జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలని  'జ్ఞాపకాల జావళి' పేరుతో అక్షరబద్ధం చేసిన పొత్తూరి విజయలక్ష్మి గారి అనుభవాలని  చదువుతూ ఉంటే కూడా మార్క్ గారన్న మాట గుర్తొచ్చింది. 'హాస్య కథలు' ద్వారా మాత్రమే కాదు, 'ప్రేమలేఖ' 'శ్రీరస్తు-శుభమస్తు' లాంటి నవలల ద్వారా కూడా విజయలక్ష్మి తెలుగు పాఠకులకి సుపరిచితురాలు. 'ప్రేమలేఖ' నవల జంధ్యాల చేతిలో 'శ్రీవారికి ప్రేమలేఖ' గా మారిన వైనం సాహిత్యాభిమానులందరికీ  చిరపరిచితమే.  పుస్తకం కవరు పేజీ మీద ఆవిడ పేరు చూడగానే 'హాయిగా చదివేయొచ్చు' అనే భరోసా కలిగేస్తుంది పాఠకులకి. పూర్తిగా ఆవిడ మార్కు పుస్తకమే ఈ 'జ్ఞాపకాల జావళి' కూడా. 

శుభవార్తలు చేరవేయడానికి ఉత్తరాలు, అశుభవార్తల కోసం టెలిగ్రాములూ మాత్రమే కమ్యూనికేషన్ చానెళ్లుగా అందుబాటులో ఉన్న 1970వ సంవత్సరంలో విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ లో బాపట్ల నుంచి రెండు రాష్ట్రాల అవతల ఉన్న చిత్తరంజన్లో అడుగు పెట్టారు, రెండు రోజుల రైలు ప్రయాణం చేసి. అది ఆమెకి అత్తవారిల్లు కాదు కానీ, భర్త గారిల్లు. స్థలం కొత్త, భాష తెలీదు, తెలిసిన వాళ్ళు కాదు కదా, కనీసం భాష తెలిసిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. రేడియోలో తెలుగు స్టేషన్లు వినిపించవు. హాళ్లలో తెలుగు సినిమాలు ప్రదర్శింప బడవు. ఫోనూ, టీవీ లాంటివేవీ ఇంకా అందుబాటులోకి రాలేదు. దొరికేవల్లా తెలుగు పత్రికలు మాత్రమే. పుట్టి పెరిగింది ఉమ్మడి కుటుంబంలోనూ, చూసింది గుంటూరు, బాపట్ల చుట్టుపక్కల ఊళ్లు మాత్రమేనేమో, ఒక్కసారిగా వచ్చిపడిన కల్చరల్ షాక్ ని తట్టుకోడం కష్టమే అయిందామెకి. 

ఎంత సీరియస్ విషయాన్నైనా సరదాగా చెప్పే శైలి పుస్తకాన్ని ఆపకుండా చదివిస్తుంది. అదే సమయంలో అప్పటికి నవ్వేసుకున్న విషయాలు కూడా, స్మృతిలో ఉండిపోయి, తర్వాత తల్చుకున్నప్పుడు ఆ నవ్వు వెనుక ఉన్న నొప్పి అనుభవానికి వస్తుంది. ఈ పుస్తకంలో ఉన్న మొత్తం డెబ్బై అనుభవ శకలాల్లో చాలా చోట్ల ఈ అనుభవం కలుగుతుంది. చిత్తరంజన్ లో వినిపించే రేడియో సిలోన్ తెలుగు వ్యాఖ్యాత మీనాక్షి పొన్నుదొరై మొదట్లో అపభ్రంశాల తెలుగు మాట్లాడినా, అతి త్వరలోనే ఆమె తన భాషనీ, ఉచ్ఛారణనీ మెరుగు పరుచుకోవడం విజయలక్ష్మికి హిందీ, బెంగాలీ భాషలు నేర్చుకోడానికి స్ఫూర్తినిచ్చింది. నిజానికిది చేతులకి, కాళ్ళకీ బంధనాలతో నీళ్ళలోకి విసిరేయబడిన వ్యక్తి ఈత నేర్చుకోడం లాంటిది. చదివేప్పుడు తేలికగానూ, తరువాత బరువుగానూ అనిపించే ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో. 

భాషలు నేర్చుకోడం మాత్రమే కాదు, చుట్టుపక్కల అందరితోనూ స్నేహాలు కలిపేసుకోవడం, రైల్వే ఆఫీసర్స్ క్లబ్బులో కీలక బాధ్యతలు నిర్వహించడం వరకూ ఆమె ఆ ప్రకారం ముందుకు పోతూనే ఉన్నారు.  విపరీతమైన చలి, కుంభవృష్టి వర్షాలు, రోళ్ళు పగిలే ఎండలు.. చిత్తరంజన్ వాతావరణంలో అన్ని ఋతువుల్లోనూ అతి తప్పదు. శీతాకాలాన్ని గురించి చెబుతూ, 'పాలు తోడు పెట్టిన గిన్నెకి, దోశల పిండికీ కూడా రగ్గులు కప్పాలి, లేకపొతే పాలు తోడుకోవు, విరగని దోశలు రావు'  అంటారు రచయిత్రి. మరొకరెవరైనా అయితే ఎన్నేసి ఫిర్యాదులు చేసి ఉండేవారో అనిపిస్తుంది ఇలాంటి చమక్కులని చదువుతున్నప్పుడు. వాతారణం ఎలా ఉన్నప్పటికీ చిత్తరంజన్ ఓ అందమైన కాలనీ. ప్రతి ఇంటి ముందూ పళ్ళు, కూరలు, పూల మొక్కలు తప్పనిసరి. సాక్షాత్తూ గాయని వాణీ జయరామే 'ఇంత అందమైన ఊరిని నేనెక్కడా చూడలేదు' అన్నారు మరి. 

ప్రయాణాలు మరీ సులభం కాని క్రితం రైల్వే ఉద్యోగులంటే ఓ గ్లామర్ ఉండేది. వాళ్ళు టిక్కెట్టు కొనక్కర్లేకుండా పాస్ తో ప్రయాణం చేసేస్తారనీ, ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు వెళ్లిపోవచ్చనీను. ఆ పాస్ ల వెనుక ఉండే కష్టాలనీ హాస్యస్ఫోరకంగా చెప్పారు రెండు మూడు చోట్ల. పుట్టింటికి రానూ పోనూ చేసే రెండేసి రోజుల ప్రయాణాల మొదలు, చిత్తరంజన్ లో నిర్వహించిన తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లో నిర్వహించిన దోశ స్టాల్ వరకూ చాలా తలపోతలే ఉన్నాయిందులో. కొత్త భాష, సంస్కృతీ నుంచి పుట్టే హాస్యం సరేసరి. సిగండాల లాంటి చిరుతిళ్ళు మొదలు, చిత్తరంజన్ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాల వరకూ ఆపకుండా చదివించే కథనాలకి లోటు లేదు. 

తాను రచయిత్రిగా మారిన క్రమాన్ని కనీసం రేఖామాత్రంగా ప్రస్తావించి ఉన్నా బాగుండేది. 'ప్రేమలేఖ' నవలకి ఓ పాఠకుడి నుంచి ప్రేమలేఖ అందుకోడం లాంటి తమాషా సంగతులు చెప్పారు తప్ప, పెన్ను పట్టిన విధానాన్ని గురించి ఎలాంటి హింటూ ఇవ్వలేదు. అలాగే 'ప్రేమలేఖ' నవల 'శ్రీవారికి ప్రేమలేఖ' సినిమాగా మారిన వైనాన్ని చెబుతారని ఎదురు చూశా కానీ ఆ జోలికి వెళ్ళలేదు రచయిత్రి. ఇక, శీర్షికలో ఉపయోగించిన 'జావళి' కి నాకు తెలిసిన అర్ధం శృంగార ప్రధానమైన గీతం అని. స్పష్టంగా చెప్పాలంటే, నాయిక, నాయకుణ్ణి శృంగారానికి ఆహ్వానిస్తూ పాడే పాట (ఉదాహరణ: 'మల్లీశ్వరి' లో 'పిలిచిన బిగువటరా'). ఇంకేదన్నా అర్ధం కూడా ఉందేమో మరి. మొత్తం మీద చూసినప్పుడు నవ్విస్తూనే ఎన్నో జీవిత సత్యాలని గుర్తు చేసే పుస్తకం ఇది. (పేజీలు 196, వెల రూ. 150, ఆన్లైన్లో  కొనుక్కోవచ్చు). 

1 కామెంట్‌: