గురువారం, మే 21, 2009

పుష్కరాల రేవులో పుల్లట్లు

కథగా మలచగలిగిన ఒక అంశాన్ని నవలగా రూపు దిద్దడానికి రచయిత ఎంత కృషి చేయాలో, ఒక నవలకు సరిపడే కాన్వాస్ ఉన్న వస్తువును కథగా కుదించడానికి అంతకు మించి శ్రమించాలి. ఇలాంటి సవాళ్ళు రచయితల్లోని రచనాశక్తిని వెలికి తీస్తాయి. ఈ రెండో కోవకి చెందిన కథల్లో నాకు బాగా నచ్చిన కథ బి.వి.ఎస్. రామారావు రాసిన 'పుష్కరాల రేవులో పుల్లట్లు.' 'ఆంధ్రజ్యోతి' దీపావళి ప్రత్యేక సంచిక (1984) లో తొలిసారి ప్రచురితమైన ఈ కథ, రచయిత ప్రచురించిన కథా సంకలనం 'గోదావరి కథలు' లో పునర్ముద్రితమైంది.

రాజమండ్రి పుష్కరాల రేవులో పుల్లట్లు పోసుకుని జీవించే పుల్లమ్మ కథ ఇది. ప్రభుత్వాసుపత్రి, పోలీసు స్టేషన్, కోర్టులలో సామాన్యుడికి ఎలాంటి న్యాయం జరుగుతుందో వివరించారు రచయిత. పుల్లమ్మ పుల్లట్లు తినని జీవితం వ్యర్ధం అనుకుంటారు గోదారి రేవు చుట్టుపక్కల వాళ్ళు. గోదారిలో స్నానం చేసి ఉదయాన్నే నాలుగు పొయ్యిలు వెలిగించి నాలుగు రకాల అట్లు పోస్తూ అష్టావధానం చేసే పుల్లమ్మతన అట్లకి తీసుకునేది నామ మాత్రపు ధరే. ఎవరికీ పార్సిళ్ళు కట్టకూడదనేది ఆమె పెట్టుకున్న ఏకైక నియమం.

పన్నులశాఖకి చెందిన ఓ పెద్ద అధికారి ఆఫీసుపనిమీద రాజమండ్రి వచ్చి, పుల్లమ్మ అట్ల గురించి విని వాటిని పార్సిల్ తెప్పించుకోవాలి అనుకుంటాడు. 'కావాలంటే మీరున్న హోటల్ కొచ్చి అట్లు వేస్తాను కానీ పార్సిల్ కట్టను' అంటుంది పుల్లమ్మ. ఆ ఆఫీసరు గారికి కోపం వస్తుంది. పన్ను కట్టనందుకు పుల్లమ్మ మీద కేసు రాయమంటారు. పుల్లమ్మ అట్ల కొట్టు పక్కనే టీ కొట్టు పెట్టుకున్న ఈశ్వరయ్య తొందరలోనే డబ్బు సంపాదించి ఓ హోటల్ పెడతాడు. పుల్లమ్మని తన రెండో భార్యగా ఆహ్వానిస్తాడు. ఆమె నిర్ణయం చెప్పడమే ఆలస్యం.

చెట్టు కిందున్న తన హోటల్ కి వచ్చిన పన్నుల శాఖ ఉద్యోగులతో తానేమీ సంపాదించలేదని, కావాలంటే తన ఇంటికొచ్చి చూడమంటుంది పుల్లమ్మ. వాళ్ళు వినిపించుకోకపోవడంతో 'నేను పన్ను కడితే ఆ డబ్బు ఏం చేస్తారు?' అని అడుగుతుంది పుల్లమ్మ. 'ప్రభుత్వం వారు ఈ డబ్బుతో ధర్మాసుపత్రులు కట్టిస్తారు, పోలీసు స్టేషన్లు కోర్టులు నడుపుతారు' అని చెబుతారు వాళ్ళు. తన ప్రాణం పోయినా ధర్మాసుపత్రికి గాని, పోలీసు స్టేషన్ కి గాని వెళ్ళని కోర్టు గడప తొక్కనని చెబుతుంది పుల్లమ్మ. ఆలోచించుకోడానికి సాయంత్రం వరకూ టైం ఇస్తారు వాళ్ళు. అట్ల పని ముగిశాక స్నానానికి గోదారిలోకి దిగి తన గతాన్ని గుర్తుచేసుకుంటుంది పుల్లమ్మ.

రిక్షా తొక్కుకునే రాజయ్య, పాచిపనులు చేసుకునే రత్తాయమ్మదంపతులకి గోదారి రేవులో దొరుకుతుంది పసి పిల్లగా ఉన్న పుల్లమ్మ. తామే పెంచుకుని, తమ కొడుకు సారిగాడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు ఆ దంపతులు. పేడ పోగేసి పిడకలు అమ్మడం మొదలు, ఎన్నో పనులు చేస్తుంది బాల పుల్లమ్మ. వయసొచ్చాక, తను చేసుకోబోయే నారిగాడు అట్లు పోసే ఓ అమ్మి వెనకాల పడుతున్నాడని తెలిసి, తనూ అట్లు పోయడం నేర్చుకుని సారిగాడిని తనవైపు తిప్పుకుంటుంది. రత్తాయమ్మ చనిపోవడం తో ఇంటికి ఆడ దిక్కు లేదని పుల్లమ్మ పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు రాజయ్య.

సారిగాడితో తన పెళ్లి ఊహించుకున్న పుల్లమ్మ, పందిట్లో రాజయ్య తన మెడలో తాళి కట్టడంతో నిర్ఘాంత పోతుంది. జరుగుతున్నదేమిటో అర్ధమయ్యేలోగానే తను ప్రేమించిన వాడికి సవతి తల్లి అయిపోతుంది. తన మీద కన్నేసిన బాబూరావు అనే కానిస్టేబులు, కేవలం తనని లొంగ దీసుకోవడం కోసమే రాజయ్య తో పెళ్లి నాటకం ఆడించాడని తెలుసుకుని, తనకి జరిగింది పెళ్ళే కాదనే నిర్ణయానికి వస్తుంది పుల్లమ్మ. సారిగాడి మనసు మార్చే ప్రయత్నాలలో పడుతుంది. పుల్లమ్మ విషయంలో తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఘర్షణలో రాజయ్య చేతిలో తీవ్రంగా గాయపడ్డ సారిగాడిని ధర్మాసుపత్రికి తీసుకెళ్తుంది ఆమె.

సమయానికి వైద్యం అందక సారిగాడు ఆస్పత్రి అరుగుమీదే ప్రాణాలు విడుస్తాడు. కేసు భయంతో రాజయ్య పారిపోతాడు. పుల్లమ్మ తనకి లొంగలేదనే కోపంతో ఆమెమీద బ్రోతల్ కేసు పెట్టిస్తాడు బాబూరావు. పోలీసు స్టేషన్ లోను, కోర్టులోనూ ఆమెకి అన్యాయం జరుగుతుంది. వ్యభిచారిగా ముద్ర వేయించు కుంటుంది. జీవిక కోసం పుల్లట్ల వ్యాపారం మొదలు పెట్టి తక్కువ రేటుకే అట్లు అమ్ముతూ ఉంటుంది. అట్లు తినే వాళ్ళలో తన సారిగాడిని చూసుకోడం కోసం పార్సిల్ కట్టకూదడనే నియమం పెట్టుకుంటుంది.

గతాన్ని తలుచుకుంటూ సాయంత్రం వరకూ గోదారిలోనే ఉండిపోయిన పుల్లమ్మ దగ్గరకి పన్నుల శాఖ వారు, రెండో భార్య గా ఉండే విషయంలో నిర్ణయం చెప్పమంటూ ఈశ్వరయ్యా వస్తారు. ఆమె నిర్ణయం ఏమిటన్నది ఈ కథకి హృద్యమైన ముగింపు. కథల సంపుటిలో ఎనభై పేజీలున్న ఈ కథ నాకెప్పుడూ ఓ నవల చదువుతున్న అనుభూతినే ఇస్తుంది.

14 కామెంట్‌లు:

  1. ఎవరో గోదావరి కథలు అడిగినట్లున్నారు ..-:)..మంచి పరిచయం .నేను చదివాను ,ఈ కథకన్నా మించిన కథలెన్నో ఆ పుస్తకంలో వున్నాయి ..అవి మనల్ని వెంటాడుతూనే వుంటాయి.

    రిప్లయితొలగించండి
  2. chaala manchi kathani parichyam chesaaru...mugimpu cheppakundaa muginchaaru.
    pustakam vetaloe vunna... neanea chadivi telusukuntaanu lendi mugimpu...(lekhini open kaavadam ledu enduko???)

    రిప్లయితొలగించండి
  3. You can download Godavari kathalu at http://www.archive.org/details/godavarikathalu019901mbp

    రిప్లయితొలగించండి
  4. గోదావరి కథలు http://www.archive.org/details/godavarikathalu019901mbp లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందర కొన్ని పేజీలు ఖాళీగా ఉంటాయి. ఖంగారు పడకండి. కథలు అన్నీ పూర్తిగా ఉన్నాయి. ఒక్కో కథా " ఆణిముత్యం ". అన్నీ తప్పకుండా చదవండి.

    రిప్లయితొలగించండి
  5. గోదావరి కధలు నా చిన్నపుడు చదివాను. అన్నీ ఎంతో నచ్చాయి. నెటివిటీకి తగిన సంభాషణలతో, పాత్రలతో కధలన్నీ చాలా అద్భుతంగా రాసారు.
    @harephala గారూ మీరు చెప్పిన లింకులో ఆ కధలు చూసి చాలా ఆనందం అయింది. తాంక్యూ.

    రిప్లయితొలగించండి
  6. మరో మంచి కధ ! హృదయానికి హత్తుకొనేలా మీ పరిచయం ...మరల క్లైమాక్స్ సస్పెన్స్ ...చదవాల్సిన లిస్టులోకి మరో పుస్తకం ...
    @ హరేఫల గారు , గోదావరి కధల లింకు ఇచ్చినందుకు ధన్యవాదాలండీ .

    రిప్లయితొలగించండి
  7. మురళి గారు మంచి పుస్తక పరిచయం. రోజు వారి గా మన జీవితాలలో జరిగే సంఘటనలను ఎంతో ఆశక్తి తో చదివే కధ లా మలిచేరు... ఎక్కువ బొమ్మలు లేవు కాని వున్నవి బాపు గారు వేసినట్లు వున్నారు కదా..
    @ హరేపల గారు ధన్యావాదాలు ఆ కధ ల లింక్ ఇచ్చినందుకు...

    రిప్లయితొలగించండి
  8. టపా చదివి వ్యాఖ్య రాసిన బ్లాగు మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఫణిబాబు (హరేఫల) గారు, లంకె ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. adenti murali garu... ilaa katha konchum chepte elaa..... muginpu kuda ivvali kada.... ledaa ee katha ekkada dorukutundo ainaa cheppali kadaa

    రిప్లయితొలగించండి
  10. @Raj: పైన హరేఫల గారి వ్యాఖ్యలో లింక్ ఉంది చూడండి.. ముగింపులు రాస్తుంటేనేమో 'అలా ముగింపు చెప్పేస్తే మాకు చదవాలనే ఆసక్తి ఉండదు కదా' అంటున్నారండి మన బ్లాగు మిత్రులు.. అదీ సమస్య.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. కధలన్నీ చాలా బాగున్నాయి లింక్ ఇచ్చిన హరేఫలగారికి ధన్యవాదాలు,అలాగె పరిచయం చేసిన మురళిగారిక్కూడా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి