సోమవారం, జూన్ 27, 2022

ఒక ఎంపిక

"సంతాలీ వారి వృత్తి వేట, ఆయుధం బాణం. అందుకే వారి గౌరవార్ధం చిత్తరంజన్ లోకో వర్క్స్ లోగోలో బాణం గుర్తుని కూడా చేర్చారు. చాలామంది సంతాలీలకి ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళ ఇంటిపేర్లు భిన్నంగా ఉంటాయి. టుడ్డు, ముర్ము, ఎక్కా.. అలా ఉంటాయి. చిత్తరంజన్ లో విశ్వకర్మ పూజకి చాలా ప్రాధాన్యత ఉంది. సెప్టెంబర్ నెలలో వచ్చే ఆ పూజని చాలా ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సెక్షన్ లోనూ విశ్వకర్మ విగ్రహం పెట్టి పూజ చేస్తారు. వర్క్ షాప్ కి ఆవేళ బయట వాళ్ళని కూడా అనుమతిస్తారు. వేలమంది వస్తారు. మాలాంటి వాళ్ళు ఒంటరిగా వెళ్లినా సంతాలీలు మాత్రం పసిపిల్ల బాలాదీ వస్తారు. ఆడవారి కట్టు వేరుగా ఉంటుంది. జాకెట్టు వేసుకోరు. ఉన్నంతలో మంచి చీరె కట్టుకుని, తల నున్నగా దువ్వుకుని, పువ్వులు పెట్టుకుని, వెండి నగలు వేసుకుని వచ్చారు.

ఒక ఏడు చూస్తే చాలదా, ప్రతి ఏడూ ఎందుకు కాళ్ళీడ్చుకుంటూ రావడం అని సందేహం కలిగింది. 'ఈ పూజ కోసం ఏడాదంతా ఎదురు చూస్తారు. తప్పకుండా వస్తారు' అని చెప్పారు మా శ్రీవారు. వచ్చిన వాళ్ళు ఊరికే చూసి పోటం లేదు, వాళ్ళ వాళ్ళు పని చేసే దగ్గర ఆగి, అక్కడ పెట్టిన విశ్వకర్మ విగ్రహానికి, అమిత భక్తితో ఒకటికి పదిసార్లు దండాలు పెట్టడం చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. ఏడాది పొడుగునా తమ మనిషి అక్కడే పనిచేస్తాడు, అతనికి ఎటువంటి ప్రమాదమూ జరగ కూడదని ప్రార్ధిస్తారుట. మరి వాళ్ళ ప్రార్ధనల ఫలితమేనేమో, అంత పెద్ద కర్మాగారంలో ఏనాడూ ప్రమాదం జరగదు. సంతాలీలను చూశాక, రోజూ పొద్దున్న దీపం పెట్టి, ఫ్యాక్టరీ చల్లగా ఉండాలని దణ్ణం పెట్టుకోటం అలవాటు అయింది.." సీనియర్ రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి రాసిన 'జ్ఞాపకాల జావళి' లో 'కర్మాగారం' అనే అధ్యాయంలో కొంత భాగం ఇది. 

ఒక్క చిత్తరంజన్ మాత్రమే కాదు, భారతదేశంలో నిర్మాణం జరిగిన అనేక భారీ ప్రాజెక్టుల వెనుక ఈ సంతాలీల శ్రమ ఉంది. వారు చిందించిన చెమట ఉంది. దేశానికి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదేళ్ల తర్వాత, మొట్టమొదటిసారిగా ఈ 'సంతాలీ' తెగకి చెందిన మహిళని అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించింది కేంద్రంలోని అధికార పార్టీ. ఆమె ఎన్నిక లాంఛనమా, కష్టసాధ్యమా అనే చర్చని పక్కన పెడితే అత్యున్నత పదవికి నామినేషన్ వరకూ ప్రయాణం చేయడానికి అత్యంత వెనుకబడ్డ సంతాలీ గిరిజనులకు డెబ్బై ఐదేళ్లు పట్టింది! ఒడిశాకి చెందిన ద్రౌపది ముర్ము నామినేషన్ ఘట్టాన్ని టీవీలో చూస్తుంటే వచ్చిన చాలా ఆలోచనల మధ్యలో పొత్తూరి విజయలక్ష్మి గారి రచనా గుర్తొచ్చింది. తెలుగు సాహిత్యంలో సంతాలీల ప్రస్తావన ఇంకెక్కడా వచ్చినట్టు లేదు. 

అదే టీవీలో కొన్ని ఛానళ్లలో 'మన వాడికి' రాష్ట్రపతి అవకాశం ఇవ్వకపోవడం పట్ల ఆగ్రహం కనిపించింది. దేశం ముక్కలవుతుందన్న బెదిరింపూ వినిపించింది. 'ముక్కలవ్వడం మరీ అంత సులభమా?' అనిపించేసింది చూస్తుంటే. మనవాళ్ళకి ఇప్పటికే చాలా అవకాశాలు వచ్చాయి, ఒక్క అవకాశమూ రాని వర్గాలు ఇంకా చాలానే మిగిలి ఉన్నాయన్న స్పృహ వారికి ఎందుకు కలగలేదన్న ఆశ్చర్యం వెంటాడింది. 'రాష్ట్రపతి-రబ్బరు స్టాంపు' తరహా చర్చలూ జరిగాయి. ఇప్పటివరకూ పనిచేసిన పద్నాలుగు మందిలోనూ పదవిని అలంకరించుకున్న వాళ్లతో పాటు, పదవికి అలంకారంగా మారిన వాళ్ళూ ఉన్నారు. లోటుపాట్లు ఉంటే ఉండొచ్చు గాక, మన వ్యవస్థ బలమైనది. ప్రతి పదవికీ ప్రయోజనం ఉంటుంది. సమయం, సందర్భం కలిసిరావాలి. ఆ సమయంలో, ఆ పదవిలో ఉన్న వ్యక్తి బలమైన నిర్ణయాలు తీసుకోగలిగే వారై ఉండాలి. 

ఇదే 'జ్ఞాపకాల జావళి' లో 'అర్చన' అధ్యాయంలో కొంత భాగం: "అర్చనా వాళ్ళు సంతాలీల్లో ఒక తెగకు చెందిన వాళ్ళు. వాళ్ళ బంధువులు కాస్త దూరంలో బాఘా అనే చిన్న జనావాసంలో ఉంటారు. అక్కడ ఒక అమ్మాయికి ఏడాది కిందట పెళ్లి అయింది. భర్త తిన్ననైన వాడు కాదు. తాగటం, పెళ్ళాన్ని కొట్టటం. రెండు నెలలకే పుట్టింటికి వచ్చేసింది. వాళ్లొచ్చి నచ్చచెప్పి తీసుకెళ్లారు. అలా నాలుగైదు సార్లు జరిగింది. వీళ్ళు విసిగిపోయి దండువా పెట్టారు. దండువా అంటే పిల్లవైపు బంధువులు పిల్లాడింటికి వెళ్తారు. మగవాళ్ళు ఖాళీ చేతులతో వెళ్తారు. ఆడవాళ్ళూ వెళ్తూ చీపురు, అప్పడాల కర్ర, విసిన కర్ర వంటి ఆయుధాలు తీసుకెళ్తారు. పిల్లాడిని కూచోబెట్టి చుట్టూ తిరుగుతూ తలోటీ తగిలిస్తారు. మళ్ళీ అందులోనూ పద్ధతులున్నాయి. పిల్ల తల్లి, వదిన మాత్రం కొట్టరు, తిట్టి ఊరుకుంటారుట. 

'దండువా అయ్యాక ఛాటా చేశారు' అంది అర్చన. ఛాటా అంటే తెగతెంపులు. 'ఇక మీకూ మాకూ రామ్ రామ్' అని అందరిముందూ ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళిచ్చిన బంగారం, వెండి వాళ్ళకి ఇచ్చేశారు. వీళ్ళు ఇచ్చినవి చెవులు మెలేసి తీసుకున్నారు. వాళ్ళు కారం బూందీ, తీపి బూందీ పెట్టి చాయ్ ఇచ్చారుట. 'తన్నడానికి పోతే విందు కూడానా?' అంటే, 'అవును మరి, మేము ఊరికే పోయామా? మా పిల్లని బాగా చూసుకుంటే వాళ్ళ గడప తొక్కే పనేముంది మాకు? తప్పు వాళ్లదే కాబట్టి మర్యాద చెయ్యాలి. అదే మా పధ్ధతి. పిల్లని పుట్టింటి వాళ్ళు తీసుకు వచ్చేశారు. దానిష్టం అయితే మారు మనువుకి వెళ్తుంది. లేదా ఏదో కాయకష్టం చేసుకుంటూ ఉంటుంది' అని వివరంగా చెప్పి 'పనుంది' అని వెళ్ళిపోయింది. చెయ్యెత్తి దణ్ణంపెట్ట బుద్ధి వేసింది నాకు. ఏం చదివారు వీళ్ళు? ఎంత తెలివి? ఎంత బాధ్యత? ఎంత ఐకమత్యం? అన్నింటినీ మించి ఎంత ధైర్యం? మనమూ ఉన్నాం ఎందుకూ? చుట్టుపక్కల ఏం అన్యాయం జరిగినా బాపూ గారి కార్టూన్ లో చెప్పినట్టు చూసీ చూడనట్లు ఊరుకుంటాం." 

2 కామెంట్‌లు: