సోమవారం, ఏప్రిల్ 25, 2022

థాయిస్

"నా 'చిత్రలేఖ' కు అనతోల్ ఫ్రాంసు 'థాయీ' కి నడుమ నాకు, అనతోల్ ఫ్రాంసుకి ఉన్నంత అంతరం ఉన్నది. చిత్రలేఖలో ఒక సమస్య ఉన్నది; మానవ జీవనాన్ని, అందులోని మంచి చెడుగుల్ని పరిశీలించడంలో నా దృష్టి కోణము, నా ఆత్మాలాపము నావి" నవలా రచయిత భగవతీ చరణ్ వర్మ తన 'చిత్రలేఖ' నవలకి రాసిన ఈ ముందుమాట 'థాయిస్' మీద ఆసక్తి పెంచింది. అంతే కాదు, విశ్వనాథ 'వేయి పడగలు' లో కనిపించే అనేకానేక చర్చల్లో ఈ 'థాయిస్' ను గురించిన చర్చ కూడా ఉంది.  ఆసక్తి మరింత పెరిగి వెతుకులాట మొదలు పెడితే, రెంటాల గోపాలకృష్ణ చేసిన తెలుగు అనువాదం కనిపించింది. ఫ్రెంచ్ భాషలో 1890లో తొలుత ప్రచురితమైన ఈ నవల అనేక ప్రపంచ భాషల్లోకి అనువదింపబడింది. నాటకాలుగానూ, సినిమాలుగానూ మలచబడింది. రచయిత అనతోల్ ఫ్రాంస్ ఫ్రెంచ్ సాహిత్యంలో ఉద్ధండుడు. నోబెల్ బహుమతి గ్రహీత. ఒక ఓపెరా ఆధారంగా ఈ నవలని రాశాడు. 

ఈజిప్షియన్ ఎడారిలో ఓ మఠాధిపతి అయిన క్రైస్తవ సన్యాసి పప్నూటియస్ కి కొంత శిష్యగణం ఉంది. సాటివారిలో మంచిపేరూ ఉంది. క్రీస్తుని చేరేందుకు తాను చేస్తున్న సాధన సరిపోతుందా అన్న ప్రశ్న వేధిస్తూ ఉన్నప్పటికీ, జీవితం పట్ల సంతృప్తిగానే ఉంటాడు ఆ సన్యాసి. నిజానికి అతను అలెగ్జాండ్రియాలో ఓ ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. యవ్వనంలో విలాసవంతమైన జీవితం గడిపాడు. ఉన్నట్టుండి ఒకరోజు ఐహిక సుఖాల మీద విరక్తి బయలుదేరి సన్యాసిగా మారాలని నిర్ణయించుకుంటాడు. సంపదల్ని త్యజిస్తాడు. బంధుమిత్రుల్ని వదిలిపెడతాడు. ఆశ్రమ జీవితానికి అలవాటు పడతాడు. పీఠాధిపతి స్థాయికి ఎదుగుతాడు. పుట్టి పెరిగిన నగరానికి దూరంగా ఆశ్రమవాసం, అతి సాధారణ జీవితం, తనలాగే సుఖాలని త్యజించిన ఆశ్రమ వాసుల సావాసం.. ఈ జీవితం చాలా నచ్చుతుంది కూడా. రోజులు గడుస్తుండగా ఉన్నట్టుండి ఒకరోజున ఆ సన్యాసికి 'థాయిస్' గుర్తు రావడంతో కథ మలుపు తిరుగుతుంది. 

అలెగ్జాండ్రియా నగరంలో ప్రముఖ నటి, నర్తకి, వేశ్య థాయిస్. ఆమె అపురూప సౌందర్యవతి, అంతకు మించిన నటి, నర్తకి. ధనవంతులందరూ తమ సమస్త సంపదల్నీ ఆమె పాదాల చెంత ధారపోసి మరీ ఆమె పొందుకు పాకులాడతారు. తన అందచందాలతో అనతి కాలంలోనే విశేషమైన పేరునీ, ధనాన్నీ ఆర్జిస్తుంది థాయిస్. ఇప్పుడు ఆమె మీద ఆధారపడి కొన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి. పప్నూటియస్ కూడా తన పూర్వ జీవితంలో థాయిస్ ని పొందిన వాడే. ఆమె మీద విశేషంగా ధనాన్ని వెచ్చించిన వాడే. సన్యాసిగా మారిన పప్నూటియస్ కి థాయిస్ ని సంస్కరించాలనే అభిలాష కలుగుతుంది. ఆమెని పాపకూపం నుంచి బయటకు తెచ్చి, యేసు ప్రభువుని చేరే మార్గం బోధించాలన్న తపన చిన్నగా మొదలై, త్వరత్వరగా పెరిగి పెద్దదై అలెగ్జాండ్రియా ప్రయాణం అయ్యేలా చేస్తుంది. సాటి మఠాథిపతి వారించే ప్రయత్నం చేసినా వినకుండా థాయిస్ ని సంస్కరించడమే ధ్యేయంగా నిశ్చయించుకుంటాడు. 

తన అందంతో, ప్రతిభతో అపారమైన సంపద ఆర్జించిన థాయిస్ తన బాల్యాన్ని కడు పేదరికంలో గడిపింది. ఆకలితో పాటు తల్లిదండ్రుల నిరాదరణ కూడా ఆమెని బాధించింది. ఆమెని కూతురిగా భావించిన వ్యక్తికి క్రైస్తవం పట్ల గాఢమయిన అభిమానం. ఒక రాత్రి ఆమెని రహస్యంగా ఓ చర్చికి తీసుకువెళ్లి బాప్టిజం ఇప్పిస్తాడు. కాలక్రమంలో  జీవితం ఎన్ని మలుపులు తిరిగినా ఈ సంఘటనని మర్చిపోదు థాయిస్. మత పెద్దలని, సన్యాసులని ఇతోధికంగా గౌరవిస్తూ ఉంటుంది. ఈ కారణానికే, తన ఇంటికి వచ్చిన పప్నూటియస్ ని ఆదరించి గౌరవిస్తుంది. అంతేకాదు, సన్యాసం స్వీకరించి పాపపు జీవితం నుంచి బయటపడమని అతడు ఇచ్చిన సలహాని పెద్దగా తటపటాయింపు లేకుండానే అంగీకరిస్తుంది. సమస్త సంపదలనీ త్యజించి అతని వెంట ఎడారికి బయలుదేరుతుంది. ఆమె నిర్ణయం విని అలెగ్జాండ్రియా నగరం అట్టుడుకుతుంది. ఆమె ఆరాధకుల నుంచీ, ఆమె మీద ఆధారపడ్డ వారి నుంచీ తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కానీ, ఆమె పట్టించుకోదు. సన్యాసినుల ఆశ్రమంలో ఆమెని చేర్చి, తన ఆశ్రమానికి బయలుదేరతాడు పప్నూటియస్. అటు తర్వాత కథ అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. 

నవల చదవడం పూర్తి చేశాక, భగవతీ చరణ్ వర్మకి అనతోల్ ఫ్రాంసుకి మరీ ఎక్కువ అంతరం ఉన్నట్టు అనిపించలేదు. చిత్రలేఖకి, థాయిస్ కి బొత్తిగా పోలిక లేకపోలేదు. మక్కికి మక్కి ఎంత మాత్రమూ కాదు. అలాగని, ఒకవేళ థాయిస్ లేకపోతే చిత్రలేఖ ఉండేదా అంటే సందేహమే. ఈ రెండు పాత్రల మధ్యా పోలిక, 'మృచ్ఛకటికమ్' వసంతసేన కి 'కన్యాశుల్కం' మధురవాణి కి ఉన్న పోలిక లాంటిది. అనువాదం మరికొంచం సరళంగా ఉండొచ్చు. ఏకబిగిన చదివించదు కానీ, మధ్యలో వదలాలనీ అనిపించని కథనం. ఇంగ్లీష్ వెర్షన్ చదవాలన్న కుతూహలాన్ని కలిగించింది. థాయిస్ ఇంట విందు సందర్భంగా జరిగే వేదాంత చర్చ మరీ సుదీర్ఘంగా అనిపించింది. 'థాయిస్' తెలుగు అనువాదం క్లాసిక్ బుక్స్ ద్వారా అందుబాటులో ఉంది. 184 పేజీల ఈ పుస్తకం వెల రూ. 150. ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి