మంగళవారం, ఫిబ్రవరి 15, 2022

చిత్రలేఖ

ఆమె ఒక నర్తకి. కళ్ళు చెదిరే అందం ఆమె సొంతం. చురుకైన బుద్ధి కలది. అయితే, ఆమెలో స్థిరత్వం పాళ్ళు కొంచం తక్కువ. పైగా పట్టుదల మనిషి. ఆమె తెలివితేటల వల్ల ఉపకారం మాట అటుంచి, ఆమెకే అపకారం జరిగే పరిస్థితులు తలెత్తాయి. ఇందుకు ఆమె స్వయంకృతం  కూడా చాలావరకూ కారణం. అసలేం జరిగిందో తెలియాలంటే చాణక్యుని మంత్రిగానూ, పాటలీపుత్రాన్ని రాజధానిగానూ చేసుకుని చంద్రగుప్తుడు రాజ్యపాలన చేస్తున్న రోజుల్లోకి వెళ్ళాలి. ఆ రాజ్యంలో రత్నాంబరులు అనే గురువు ఆశ్రమంలో చదువు పూర్తి చేసుకున్న ఇద్దరు శిష్యులు  'పాపం అంటే ఏమిటి గురుదేవా?' అని సందేహం వెలిబుచ్చడం, ఆ ప్రశ్నకి వారే సమాధానం వెతుక్కునేలా ఆ గురువు చేసిన ఏర్పాటుని తెలుసుకోవాలి. చిత్రంగా, ఆ శిష్యులిద్దరి జ్ఞాన్వేషణకీ కేంద్రం ఆ నర్తకే అవుతుంది. ఆమె పేరు చిత్రలేఖ.

సుప్రసిద్ధ హిందీ రచయిత భగవతీ చరణ్ వర్మ 1934 లో రాసిన 'చిత్రలేఖ' నవలలో కథానాయిక చిత్రలేఖ.  హిందీలో నవలగా లక్షలాది కాపీలు అమ్ముడై, సినిమాలుగా తెరకెక్కిన ఈ నవలని లంక నారాయణరావు తెనిగించారు. క్లాసిక్ బుక్స్ సంస్థ తాజాగా ప్రచురించింది. రత్నాంబరుల ప్రియశిష్యులిద్దరిలో శ్వేతాంకుడు క్షత్రియుడు కాగా, విశాల దేవుడు బ్రాహ్మణ యువకుడు. ఇద్దరికీ 'పాపం' అంటే ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహాలం కలిగింది. రత్నాంబరులు - శ్వేతాంకుడు సామంత బీజగుప్తుని వద్దా, విశాల దేవుడు యోగి కుమారగిరి దగ్గరా ఏడాది పాటు శుశ్రూషలు చేసి తమ సందేహానికి సమాధానాన్ని అన్వేషించాల్సిందిగా సూచించి, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తారు. శిష్యులిద్దరూ ఒకరు బీజ గుప్తుని రాజభవనానికి, మరొకరు కుమారగిరి ఆశ్రమానికి బయల్దేరతారు. తాను తపస్సు నిమిత్తం రాజ్యాన్ని విడిచిపెడతారు రత్నాంబరులు.

పాటలీపుత్రంలో సుప్రసిద్ధ నర్తకి చిత్రలేఖ. పూర్వాశ్రమంలో ఆమె ఒక బ్రాహ్మణ వితంతువు. భర్త మరణానంతరం ఆమె వేసిన అడుగులు నాట్యం వైపు నడిపించి తక్కువ కాలంలోనే ప్రఖ్యాత నర్తకిని చేశాయి. చిత్రలేఖ రూపలావణ్యాలని చూసి ఎందరో ప్రముఖులు ఆమెని మోహించారు. కానీ, ఆమె ఎవరివైపూ దృష్టి సారించలేదు. ఓ సందర్భంలో ఆమె నృత్య ప్రదర్శన చూసిన సామంత బీజగుప్తుడు చిత్రలేఖ ఆకర్షణలో పడ్డాడు. పెద్ద పదవిలో ఉన్న, అవివాహితుడైన బీజగుప్తుడు చిత్రలేఖనూ ఆకర్షించాడు. వారిద్దరిమధ్యా అనుబంధం మొదలైంది. ప్రతి సాయంత్రం చిత్రలేఖ బీజగుప్తుడి భవనానికి వస్తుంది. ఇద్దరూ కలిసి మధువు సేవించి రాత్రంతా కలిసి గడుపుతారు. ఏ తెల్లవారు జామునో ఆమె తన భవనానికి బయలుదేరుతుంది. వారి సంబంధం బహిరంగమే. బీజగుప్తుని శుశ్రూష చేయడానికి వచ్చిన శ్వేతాంకునికి చిత్రలేఖని 'యజమానురాలి' గా పరిచయం చేస్తాడా సామంతుడు.

యోగి కుమారగిరికి విశేషమైన యోగ బలంతో పాటు లెక్కలేనంత గర్వం కూడా ఉంది. తనని మించిన వాడు లేడన్న విరుగుబాటు చాలా ఎక్కువ. ఒకనాడు రాజాస్థానంలో జరిగిన ఓ కార్యక్రమంలో అత్యంత అనూహ్యంగా చిత్రలేఖ చేతిలో అవమానానికి గురవుతాడు కుమారగిరి. ఆమె తనకి క్షమాపణలు చెప్పడానికి వచ్చినప్పుడు ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు కూడా. అదే సమయంలో, చిత్రలేఖ కారణంగా బీజగుప్తుడు వివాహానికి విముఖుడయ్యాడన్న మాట ఆమె చెవిన పడుతుంది. అతని వివాహానికి తాను అడ్డు తొలగాలనుకుని, రాజ్యం విడిచి కుమారగిరి ఆశ్రమం చేరుతుంది. తనకి సన్యాస దీక్ష ఇవ్వాల్సిందిగా కుమారగిరిని ఒత్తిడి చేస్తుంది. తాను అతనితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయి ఉన్నానని చెబుతుంది. అక్కడ విశాలదేవుడు కుమారగిరికి ప్రధాన అనుచరుడు. కుమారగిరి, చిత్రలేఖకి దగ్గరవడానికి అతడు ప్రత్యక్ష సాక్షి.

చిత్రలేఖ ఎడబాటు బీజగుప్తుణ్ణి చింతాక్రాంతుణ్ణి చేస్తుంది. ఇటు చిత్రలేఖ ఆగమనం కుమారగిరి ఆశ్రమ జీవితంలో అనేక అసంగతాలకి కారణమవుతుంది. అటు శ్వేతాంకుడు, ఇటు విశాలదేవుడు జరుగుతున్న పరిణామాలని శ్రద్ధగా గమనిస్తూ ఉంటారు. చిత్రలేఖ ఈ ఇద్దరినీ తన అంతరంగికులుగా భావించి, తన నిర్ణయాలని గురించి వారితో చర్చిస్తూ ఉంటుంది. బీజ గుప్తుడు, కుమారగిరి ఇద్దరిలో చిత్రలేఖ ఎవరిని ప్రేమించింది? ఐహిక సుఖాలని విడిచిపెట్టి ఆమె సన్యాస దీక్ష స్వీకరించ గలిగిందా? ఏడాది శుశ్రూష తర్వాత శిష్యులిద్దరూ 'పాపం' అంటే ఏమిటో తెలుసుకో గలిగారా? వారి నిర్వచనాలని వారి గురువు రత్నాంబరులు ఆమోదించారా? ఇత్యాది ప్రశ్నలకి జవాబు 176 పేజీల 'చిత్రలేఖ' నవల. అనువాదం సరళంగానే జరిగినా, అక్కడక్కడా వ్యతిరేక పదాలు పడ్డాయి - 'స్తబ్దంగా' అని ఉండాల్సిన చోట 'నిస్తబ్దంగా లాంటివి.

ఈ చారిత్రక కల్పనని చదువుతున్నంత సేపూ తెలుగులో చారిత్రక కల్పనకి పరాకాష్టగా చెప్పదగిన అడివి బాపిరాజు 'హిమబిందు' పదేపదే జ్ఞాపకం వచ్చింది. రెండు కథల మధ్యా లేశమైనా పోలిక లేదు. కానీ, 'హిమబిందు' ఇతర భాషల్లోకి అనువాదమై ఉంటే ఎంత బాగుండేదో కదా అన్న ఆలోచన వెంటాడింది. మనవాళ్ళెందుకో మన సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి పంపడం మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. మనదగ్గరా గొప్ప సాహిత్యం ఉందని ప్రపంచానికి తెలియకుండా పోతోంది కదా అనిపించింది. ఆద్యంతమూ ఆసక్తిగా చదివించే 'చిత్రలేఖ' నవల వెల రూ. 150. ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి