బుధవారం, ఏప్రిల్ 13, 2022

వెన్నెలవే వెన్నెలవే ...

"భూలోకం దాదాపు కన్ను మూయు వేళ... 
పాడేను కుసుమాలు పచ్చగడ్డి మీన...  
యే పూవుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ..."

సంగీత దర్శకుడు ఇచ్చిన ట్యూన్ కి పాట రాయడం ఒకరమైన కష్టం అయితే, డబ్బింగ్ సినిమాకి పాట రాయడం ఇంకోరకం కష్టం. మొదటి దాంట్లో ట్యూన్ పరిధి మేరకు పదాలని కుదించుకుని, భావం చెడకుండా రాసే వీలుంటుంది. కానీ రెండో దాంట్లో అప్పటికే వేరే భాషలో వచ్చిన సాహిత్యాన్ని తెనిగించాలి. అలాగని అది మక్కి కి మక్కి అనువాదం కారాదు. తెలుగు నుడికారం వినిపించాలి, అదే సమయంలో మూలానికి దగ్గరగా ఉండాలి. తేలిపోకూడదు, మూలాన్ని మించిపోనూ కూడదు. తెలుగు సినిమా కవులు ఎవరి  పరిధిలో వారు ఈ అసిధారా వ్రతాన్ని నిర్వహించారు. కొందరు కేవలం అనువాద చిత్రాలకి మాత్రమే పాటలు రాశారు. 

అర్జునుడు రెండు చేతుల్తోనూ బాణాలు సంధించినట్టుగా కుడి చేత్తో ఓ పాట, ఎడమ చేత్తో మరో పాట ఏకకాలంలో రాయగలిగిన వేటూరి చాలా డబ్బింగ్ పాటల్నీ తన ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యంగా ఏ. ఆర్. రహమాన్ సంగీత సారధ్యంలో వచ్చిన తమిళ పాటల్ని తెనిగించడానికి మొదటి పిలుపు వేటూరికే వచ్చేది. అలా పాతికేళ్ల నాడు ఈ కాంబినేషన్ లో వచ్చిన 'మెరుపు కలలు' సినిమాలో 'వెన్నెలవే.. వెన్నెలవే' యుగళగీతం కాల పరీక్షకి నిలబడింది. ఇవాళ్టికీ వినిపిస్తోంది. ఇప్పుడైతే 'పాన్ ఇండియా సినిమా' అనే బ్రాండింగ్ హడావిడి చేసేవాళ్ళేమో కానీ, అప్పట్లో డబ్బింగ్ సినిమా అనే అన్నారు రాజీవ్ మీనన్ దర్శకత్వంలో ఏవీఎం నుంచి వచ్చిన ఈ తమిళ, తెలుగు, హిందీ రిలీజ్ ని. 

అసలు 'మెరుపు కలలు' కథే చిత్రం అనుకుంటే, ఈ పాట సందర్భం మరీ విచిత్రం. సన్యాసినిగా మారి యేసుక్రీస్తు సేవకి అంకితమైపోవాలని నిర్ణయించుకున్న కథానాయికలో (కాజోల్) ప్రేమ భావనలు పుట్టించాలి. అలాగని ఆమెని తను (ప్రభుదేవా) ప్రేమించకూడదు. ఆమె దృష్టి ఐహికం మీదకి మళ్ళాక అసలు కథానాయకుడు (అరవింద్ స్వామి) రంగంలోకి దిగుతాడు. ఇక్కడ అంతస్థుల భేదం కూడా ఉంది. కాజోల్, అరవింద స్వామి ఇద్దరూ డబ్బున్న వాళ్ళ బిడ్డలు, చిన్ననాటి స్నేహితులూను. ప్రభుదేవా పేదవాడు. అనాధ పిల్లలతో కలిసి తిరిగేవాడూను. ప్రపంచం నిద్రపోయిన ఓ అర్ధరాత్రి వేళ ఆమె కోసం పాట అందుకున్నాడు.. ఇక్కడ వెన్నెల అంటే ఆకాశంలో చందమామ మాత్రమే కాదు, కథానాయిక కూడా.. 


వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా 
విరహాన జోడీ నీవే... హే... 
నీకు భూలోకుల కన్ను సోకేముందే 
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా…  

ఆకాశాన్ని దాటి ఒక్కసారి కిందకి వచ్చావంటే, భూమ్మీద ఎవరి కన్నూ నీ మీద పడక మునుపే నిన్ను వెనక్కి పంపేస్తా అంటూ వెన్నెలని పిలుస్తున్నాడు. ఇది పల్లవి. ఇక చరణాల్లోకి వస్తే.. 

ఇది సరసాల తొలి పరువాల 
జత సాయంత్రం సైఅన్న మందారం 
చెలి అందాల చెలి ముద్దాడే 
చిరు మొగ్గల్లొ సిగ్గేసె పున్నాగం   
పిల్లా ... పిల్లా... 
భూలోకం దాదాపు కన్నుమూయు వేళ .. 
పాడేను కుసుమాలు పచ్చగడ్డి మీన 
యే పూవుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ

'కన్నుమూయడం' అంటే వాడుకలో అర్ధం తనువు చాలించడం. ఇక్కడ కవి ప్రయోగం 'నిద్రపోవడం' అని. మందారం, పున్నాగం మాత్రమే కాదు,  'అందాలు అందాలి' అనడం భలేగా కుదిరింది. 

అతగాడు పల్లవి, చరణం పడ్డాక అప్పుడు ఆమె అందుకుంది: 

ఎత్తైన గగనంలో నిలిపేవారెవరంట
కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంట 
ఎద గిల్లీ గిల్లీ వసంతాన్నే ఆడించే 
హృదయంలో వెన్నెలలే రగిలించే వారెవరు 
పిల్లా ... పిల్లా ... 
పూదోట నిదరొమ్మని పూలే వరించు వేళ 
పూతీగ కలలోపల తేనే గ్రహించు వేళ 
ఆ వయసే రసాల విందైతే .. ప్రేమల్లే ప్రేమించు 

ఆమె హృదయంలో ప్రేమ భావన అంకురించింది. పూదోటని పూలు వరించడం, పూతీగ తేనెని గ్రహించడం, ప్రేమల్లె ప్రేమించు అనడం.. ఇవన్నీ గుర్తుండిపోయే ప్రయోగాలు. తమిళ 'మిన్సార కణవు' కి వైరముత్తు రాసిన సాహిత్యాన్ని తెలుగు చేశారు వేటూరి. హరిహరన్, సాధనా సర్గం ఆలపించారు. సింపుల్ సెట్లో ప్రభుదేవా, కాజోల్, చిన్నపిల్లల మీద చిత్రీకరించారు ఈ పాటని. వింటున్నంత సేపూ హాయిగా ఉండడమే కాదు, విన్నాక ఓ పట్టాన వదిలిపెట్టని పాట ఇది. 

2 కామెంట్‌లు:

  1. 'విన్నాక ఓ పట్టాన వదిలిపెట్టని పాట ఇది" ఎంత చక్కగా చెప్పారు. మీకు వేటూరి అంటే ఒక ఆత్మీయత అని నాకు బాగా తెలుసు. ఆత్మీయతని చక్కని పాట పలుకులతో రంగరించిన మీ వ్యాసం వేటూరిమీదా, ఆయన పాటమీదా వెన్నెల వన్నెలల మెరుపులు కురిపించింది.

    రిప్లయితొలగించండి