శుక్రవారం, మార్చి 20, 2009

ఎన్ని..కల..లో

న్యూస్ పేపర్లు, టీవీ చానళ్ళు, వెబ్ సైట్లు, బ్లాగులు..ఎక్కడ చూసినా ఒకే అంశం మీద చర్చలు.. త్వరలో జరగ బోతున్న ఎన్నికల గురించి.. పార్టీలు, బలాబలాలు, కూటములు, తారాతోరణాలు.. వీటి గురించే వాదోప వాదాలు. వీటన్నంటి ప్రభావం అనుకుంటా.. రాత్రి నిద్ర పోబోతుంటే ఒక ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు తెలుగు, సైన్సు, సోషల్ సబ్జక్టుల్లో ప్రశ్న జవాబులు గుర్తొచ్చాయి.. ఎన్నికల గురించి ఆ తరహా లో ప్రశ్నలు, జవాబులు...

ప్రశ్న: ఎన్నికలు అనగా ఏమి? వివరింపుము?
జవాబు: ప్రజాస్వామ్య దేశములలో ఐదేళ్లకోసారి జరిగే ఒక ప్రక్రియను ఎన్నికలు అందురు. ఈ ప్రక్రియలో ప్రజలు తమ నాయకులను ఎన్నుకుందురు. ఎన్నికలలో గెలిచిన వారు నాయకులై ప్రజలను పాలింతురు.గెలుచుట కొరకు ఎన్నికలలో పోటీ పడే అభ్యర్ధులు ప్రజలకు పలు విధాలైన హామీలు ఇచ్చెదరు. ఆకాశమును దించు దుమని,నెలవంక ను తుంచుదుమని చెప్పుటకు సైతం వెనుకాడరు. అంతిమంగా ఎక్కువమంది ప్రజల ఓట్లు పొందినవారు రాబోవు ఐదేళ్ళ కాలానికి పాలకులవుదురు.ఐతే ఎన్నికలు ఐదేళ్ళ కొకపరి మాత్రమే జరుగ వలెనన్న నియమేమిదియూ లేదు. అవి రెండు,మూడేళ్లకూ జరుగవచ్చు.

ప్రశ్న: ప్రజాస్వామ్యం అనగానేమి?
జవాబు: ప్రజల చేత, ప్రజలకొరకు, ప్రజల యొక్క నాయకులను ఎన్నుకొనుట యే ప్రజాస్వామ్య మనే భావన విస్తృత వ్యాప్తిలో కలదు. ప్రజాస్వామ్యము నందు ప్రజలే ప్రభువులు అని కూడా అనుచూ ఉంటారు. ఐతే ఈ ప్రజల పాత్ర పరిమితమే అన్న భావన కూడా కలదు. రాచరికమునకు ప్రజాస్వామ్యము భిన్నమైనది. రాచరికమున, రాజు మరణించి నంతనే అతని కుమారుడు రాజవును. ప్రజాస్వామ్యమును, పాలకుడు మరణించిన యెడల, అతని కుమారుడు ఎన్నికలో గెలిచి నాయకుడు కావాల్సి ఉండును. ఈ ఎన్నిక నామ మాత్రము అన్న విషయము గమనింప దగినది.

ప్రశ్న: ప్రజలు అనగా ఎవరు? ప్రజలకు, ఓటర్లకు గల భేదములను వివరింపుడు?
జవాబు: ఒక దేశమునందలి మనుష్య జనాభా అంతా ఆదేశపు ప్రజలు. కులము, మతము, వర్ణము, వర్గము, స్త్రీ, పురుష, బాల, వృద్ధ భేదములు లేవు. ఐతే ఈ ప్రజలలో 18 సంవత్సరముల వయస్సు దాటిన వారందరూ ఓటర్లు. ఓటర్లందరూ ప్రజలే, కాని ప్రజలంతా ఓటర్లు కారు. నాయకులు,నాయకులు కాగోరువారు ఈ భేదమును కలలో సైతం మర్చిపోరు.. వీరు ప్రకటించు కార్యక్రమాలు,ఇచ్చు హామీలు అన్నీ ఓటర్లని ఉద్దేశించి ఉండును. ప్రకటనలలో మాత్రం వీరు ప్రజలకోసం పని చేయుచున్నాము అని చెప్పుచూ ఉందురు.

ప్రశ్న: ఓటర్ల ప్రత్యేకత ఏమి?
జవాబు: ప్రజాస్వామ్యమున ఎన్నికలు జరిగిన ప్రతిసారి, ఓటర్లు ఓటరు మహాశయులు, ఓటరు దేవుళ్ళు అవుదురు. కనీసం రెండు మూడు మాసములు నాయకులంతా వీరిని ఆకర్షించుటకు పడరాని పాట్లు పడుదురు. ఎండా కొండా లెక్క చేయక వీరి చుట్టూ తిరిగెదరు. వీరి పిల్లల చీమిడి ముక్కులను సైతం చిరు నవ్వుతో తుడిచెదరు. ఓటరుల కష్టములు చూసి నాయకుల గుండెలు కరుగును. ఓటరులు తమ కష్టములను తాత్కాలికముగా అయినా మరచిపోవలెననే తలంపుతో వారికి డబ్బు, సారాయి పంచెదరని వినికిడి. అందరు నాయకులనుంచీ కానుకలు స్వీకరించే స్వేచ్చ మరియు తమకి నచ్చిన వారికి మాత్రమే వోటు వేసే స్వేచ్చ ఓటర్లకు కలవు. దీనినే ప్రజాస్వామ్యము యొక్క సౌందర్యము (beauty of democracy)అని కూడా కొందరు అందురు.

ప్రశ్న: ఎన్నికలు పూర్తైన పిదప ఏమి జరుగును?
జవాబు: నాయకులకి పూర్తి విశ్రాంతి లభించును. ఊరూ వాడా తిరిగే శ్రమ తప్పును. మరల ఎన్నికలు ప్రకటించు వరకు నచ్చిన విధముగా సంచరించు స్వేచ్చ వారికి కలదు. ఎన్నికలలో ఓడినవారు తదుపరి ఎన్నికలలో గెలుచుటయే లక్ష్యముగా కృషి ప్రారంబింతురు.. కృషి అనగా అధికారములో ఉన్నవారిపై విమర్శలు కురిపించుట మాత్రమే.., ప్రజల కొరకు కష్టించి పని చేయుట కాదు. ఒకసారి ఎన్నికలు పూర్తైన పిదప, మరల ఎన్నికల సమయము వరకు ఓటరులను పలకరించు తీరిక, ఓపిక ఎవ్వరికీ కలుగవు.

...ఇలా జవాబులు రాస్తే ఎన్ని మార్కులు వస్తాయా అని ఆలోచిస్తున్నా...

5 కామెంట్‌లు: