తెలుగులో ఉత్తమ కథా సంకలనాలు జాబితాలో మొదటి వరుసలో ఉండే పేరు 'అమరావతి కథలు'. అమరావతి నేపధ్యంగా సాగే చిన్న చిన్న కథలని ఒక్కసారి చదివితే చాలు మరి మరిచిపోవడం కష్టం. భిన్నమైన ఇతివృత్తాలు, ఉత్కృష్టమైన శిల్పం, సజీవ పాత్రలు, క్లుప్త సంభాషణలు ఆ కథలని చిరస్మరణీయం చేశాయి. వాటిని రాసిన వారు సత్యం శంకరమంచి. ఎప్పుడు 'అమరావతి కథలు' చదివినా, 'ఈ రచయిత రాసిన మిగిలిన రచనలు కూడా అచ్చులోకి వస్తే బాగుండు' అనిపిస్తూ ఉంటుంది. కాస్త ఆలస్యంగానే అయినా ఆ కోరిక తీరింది. సత్యం రాసిన ఇరవై ఒక్క కథలు ప్లస్ ఒక నవలిక ని 'కార్తీక దీపాలు' పేరుతో ప్రచురించింది విజయవాడ నవోదయ ప్రబ్లిషర్స్ సంస్థ. ఈ కథల్లో కొన్ని 'అమరావతి కథలు' లాగే క్లుప్తమైనవి కాగా, ఎక్కువ కథలు పది-పదిహేను పేజీల నిడివి కలిగినవి.
పుస్తకాన్ని ఏకబిగిన చదవడం పూర్తి చేసినప్పుడు ఈ కథలన్నింటి ఏక సూత్రం 'వేదన' - స్పష్టంగా చెప్పాలంటే 'జీవుడి వేదన' - అనిపించింది. ఇతివృత్తం ఏదైనప్పటికీ, పాత్ర నేపధ్యం ఎటువంటిది అయినప్పటికీ రచయిత వేదన పాఠకులకి అందుతుంది. కథల తాలూకు తొలి ప్రచురణ తేదీ, వివరాలని ఇవ్వక పోవడం వల్ల, ఇతివృత్తాన్ని, కథన రీతిని ఆధారం చేసుకుని రచయిత ఏ కాలంలో ఈ కథని రాసి ఉంటారన్నది ఊహించుకోవాలి పాఠకులు. ఇది చాలా పెద్ద శ్రమ. ఉదాహరణకి సంపుటిలో మొదటి కథ 'మేల్కొన్న మానవులు' చదువుతుంటే, 'ఈ కథ 'అమరావతి కథలు' రాసిన రచయిత నుంచి వచ్చిందేనా?' అన్న ప్రశ్న పదేపదే ఎదురవుతుంది. సత్యం తన తొలినాళ్లలో రాసిన కథ అయి ఉండవచ్చు అనిపిస్తుంది. ఇదే ప్రశ్న ఎదురయ్యే కథలు మరో నాలుగైదు ఉన్నాయి.
రెండో కథ 'కాశీ చెంబు' కి తగినంత నగిషీ పని చేస్తే 'అమరావతి కథలు' సరసన నిలబడుతుంది. ఇతివృత్తం అమరావతి కథే కానీ, కథనంలో క్లుప్తతకి బదులు సాగతీత కనిపిస్తుంది. మూడో కథ 'ఫలశృతి' లో నాటకీయత పాళ్ళు అధికం. బుచ్చిబాబు తరహా ఇతివృత్తానికి సత్యం మార్కు ముగింపు. 'అన్నదమ్ములు' 'ఇంటిదీపం' మినీ కథలు లేదా స్కెచ్ లు. 'ఇక మీదట రాబోయే కథలు బాగుండవచ్చు' అనే నమ్మకాన్ని ఇచ్చిన కథ 'కలనేత చీర'. అనూహ్యమైన ముగింపుకి తీసుకెళ్లారు ఈ కథని. పేకాట వ్యసనపరుల కథ 'రమ్మీ'. జీవుడి వేదనే ఇతివృత్తంగా నడిపిన కథ 'ప్రశ్న'. పేరులాగే ప్రత్యేకంగా అనిపించే కథ 'ఎతికిరె సేసేలా'. పేరుకి తగ్గట్టే జయపూర్ కథా స్థలం. కథ మొత్తం ఒక పూట లో జరిగే ఎదురుచూపు. కుంభవృష్టి వర్షం నేపధ్యం.
'అవతలిగట్టు' కథ సాధారణమే అయినా కథనం అపూర్వం. పద్మరాజు గారి 'గాలివాన' 'పడవ ప్రయాణం' గుర్తొస్తాయి, కథనం వరకూ. 'నీ వెనుక నేను' 'ఎర్ర మల్లె' ఒకే నాణెం తాలూకు బొమ్మా బొరుసూ అనవచ్చు. 'అండ్ దే లివ్డ్ హేపిలీ' అనిపించే కథ 'ఇంద్రధనస్సు', ఆనందార్ణవ చిత్రణతో పాటే అస్తిత్వపు ప్రశ్ననూ సంధిచడం ఈ కథ ప్రత్యేకత. 'మేల్కొన్న మానవులు' తరహాలోనే గ్రామీణ జీవన చిత్రణ చేసిన కథ 'పొడవని పొద్దు'. గ్రామ రాజకీయాల చుట్టూ అల్లిన కథ ఇది. స్త్రీ-పురుష సంబంధాల చుట్టూ అల్లిన కథలు 'మర్త్య లోకం - మరో లోకం', 'గుండె గొంతుకలోన'. చలం, బుచ్చిబాబుల కథలని గుర్తు చేసే కథలు ఈ రెండూ. 'అమరావతి కథలు' ని గుర్తు చేసే మరో కథ 'బందీ'. 'ఇహ సంసారం బహు దుఃఖారం' ఎందుకయ్యిందో సరదాగా చెప్పిన కథ ఇది.
ఆపకుండా చదివించే కథ 'వియోగాంతే'. ఈ కథ పూర్తి చేశాక మరో కథకి వెళ్ళడానికి సమయం పడుతుంది. తర్వాతి కథ 'తెరసెల్లా' ఆ తర్వాతి కథ 'నర్తకి' లో నాటకీయత పాళ్ళు కొంచం ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా 'నర్తకి' కథ ఇతివృత్తం, కథనం బాగున్నా, ముగింపులో వచ్చే నాటకీయత నిరాశ పరిచింది. పుస్తకానికి శీర్షికగా ఉంచిన 'కార్తీక దీపాలు' కృష్ణ ఒడ్డున జరిగే కథ. నాయకుడి బాల్య స్నేహితురాలి కథ. కార్తీక దీపాలు కొండెక్కడాన్ని ఆమె కథకి అన్వయించిన కథ. ఈ కథలతో పాటు చేర్చిన నవలిక 'ఆఖరి ప్రేమలేఖ'. 'అనుబంధం' శీర్షికతో వెనుక మాట రాసిన వెల్చేరు నారాయణ రావు దీనిని నవల అన్నారు కానీ, పెద్ద కథ లేదా నవలిక అనవచ్చు. అమరావతి గాలిగోపురంలో కూర్చుని పుస్తకం చదువుకునే ఓ కుర్రాడికీ, తన కుటుంబంతో కలిసి 'కారులో' గుడికి వచ్చిన అమ్మాయికి మధ్య నడిచిన కథ. నవలిక మొత్తం నాయకుడు, నాయికకి రాసే ఉత్తరమే. అతడి వైపు కథ మాత్రమే.
"'అమరావతి కథలు' వంటి గొప్ప రచనలు చేయడానికి గల పూర్వపు అర్హతను ఈ కథలు చదువరులకు తెలియజెపుతాయి" అన్నారు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ తన ముందుమాటలో. "మనస్సులో కొన్ని గాయాలతో, విసుగుదలతో, అసహనం అనుభవిస్తూ, ఆలయానికి, బయట ప్రపంచానికీ మధ్య సంప్రదాయం పేరిట కనిపించే అంతరువుని నిరసిస్తూ - ఆలయ పూజారుల ఇంటినుంచి విశాల ప్రపంచం లోకి ప్రయాణం చేసిన రచయిత..." అంటూ శ్రీకాంత శర్మ రాసిన వాక్యాలు ఈ కథల్ని మరింత బాగా అర్ధం చేసుకోడానికి దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు. అచ్చంగా 'అమరావతి కథలు' లాంటి కథలకోసం కాకుండా, 'అమరావతి కథలు' ని తన గమ్యంగా చేసుకున్నరచయిత ప్రయాణంలో మజిలీలు అని భావించి చదివితే పాఠకులని నిరాశ పరచవు ఈ కథలు. (పేజీలు 270, వెల రూ. 300, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).