సాహిత్యంతో ఏమాత్రం పరిచయం ఉన్నవారికైనా గీతా రామస్వామి పేరు వినగానే 'హైదరాబాద్ బుక్ ట్రస్ట్' గుర్తొస్తుంది. మిగిలిన ప్రచురణ సంస్థలు ప్రచురించడానికి అంతగా ఆసక్తి, ఉత్సాహం కనబరచని విలువైన పుస్తకాలు - ముఖ్యంగా అనువాదాలు - తెలుగునాట కనిపించడం వెనుక ప్రత్యక్ష కారణం హెచ్.బీ.టీ కాగా పరోక్ష కారణం ఆ సంస్థ వ్యవస్థాపకురాలు గీత. ఆమె అభిరుచులు ఏవిటన్నది హెచ్.బీ.టీ పుస్తకాలు చదివే పాఠకులందరికీ తెలుసు. ఆమె జీవితం ఏవిటన్నది వివరిస్తూ రాసిన ఆత్మకథ 'అడుగడుగున తిరుగుబాటు' ఈమధ్యనే మార్కెట్లోకి వచ్చింది. ఆమె కేవలం ప్రచురణ కర్త మాత్రమే అయితే ఈ పుస్తకంలో పెద్దగా విశేషాలు ఏవీ ఉండక పోయేవేమో.. కానీ ఆమె విద్యార్థి జీవితం నుంచే రాజకీయాల్లోకి వచ్చి, నక్సలెట్లతో కలిసి కొంతకాలం పనిచేసి, అటుపైన ఉద్యమకారిణిగా జీవితాన్ని కొనసాగించారు.
పుస్తకం పేరుకు తగినట్టే గీత జీవితంలో అడుగడుగునా తిరుగుబాటే. మృత్యువు అంచు వరకూ వెళ్లొచ్చిన సందర్భాలు ఎన్నెన్నో. ఉద్యమాలతోనూ, రాజకీయాలతోనూ ఏమాత్రం సంబంధం లేని సాంప్రదాయ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన గీతకి చిన్ననాడు ఆ సంప్రదాయాలే బందిఖానాలుగా అనిపించాయి. తండ్రి ఉద్యోగ రీత్యా అనేక ప్రాంతాలలో నివాసం ఉన్నా, కాలేజీ చదువు నాటికి చేరుకున్న హైదరాబాద్ నే తన స్థలంగా నిర్ణయించుకున్నారామె. ఉస్మానియా యూనివర్సిటీలో చేరడం, వామపక్ష రాజకీయాలతో పరిచయం ఏర్పడడాన్ని తన వికాసపు ప్రారంభ దినాలుగా భావిస్తారామె. మడి, మైలలని తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు గొడ్డు మాసం తినడం ద్వారా సంప్రదాయం నుంచి స్వేచ్ఛని ప్రకటించుకున్న ఆమె, తర్వాత జీవితంలో ఎప్పుడూ మాంసాహారాన్ని విడిచిపెట్టలేదు, ఏ సంప్రదాయాన్నీ పాటించనూ లేదు.
సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జన్సీ ని ప్రకటించే నాటికి గీత నక్సల్బరీ ఉద్యమంలో వున్నారు. అది కూడా అడవుల్లో కాదు, హైదరాబాద్ నగరంలో. మురికి వాడల ప్రజల కోసం పని చేస్తూ ఉన్న కాలం లోనే ఉన్నట్టుండి ఎమర్జన్సీ వచ్చి పడడంతో, తప్పనిసరిగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళవలసి రావడం, కుటుంబంతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవడం జరిగాయి. నగర నేపధ్యం నుంచి వచ్చిన గీతకు నిజానికి కుల సమస్య పట్ల మొదట్లో అవగాహన లేదు. ఆమె పనిచేసిన రాజకీయ విభాగాలలోనూ, తొలిగా చదివిన ఉద్యమ సాహిత్యం ద్వారానూ ఆమెకి 'వర్గం' పరిచయం అయింది తప్ప, కులం కాదు. ఎమర్జన్సీ అనంతర కాలంలో ఆమె పార్టీ రాజకీయాలకి అతీతంగా ప్రజలతో కలిసి పనిచేయాలని భావించినప్పుడు, హైదరాబాద్ సమీపంలోని ఇబ్రహీంపట్నం కి ఓ సర్వే నిమిత్తం వెళ్లే అవకాశం వచ్చింది. ఆమె జీవితాన్ని పెద్ద మలుపు తిప్పిన సంఘటనల్లో ఇది ముఖ్యమైనది.
ఇబ్రహీంపట్నం ని తన కార్యక్షేత్రం గా చేసుకుని, ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములని భూమి లేని నిరుపేదలకి ఇప్పించే ఉద్యమాన్ని సుదీర్ఘ కాలం పాటు పెద్ద ఎత్తున నిర్వహించారు గీత. హైదరాబాద్ సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనమైన తర్వాత, ముస్లిం జాగీర్దార్లు సంస్థానాన్ని విడిచి వెళ్లడంతో, ఆ భూములని స్థానిక భూస్వాములైన రెడ్డి కులస్థులు తమ ఆస్తులుగా ప్రకటించుకున్నారు. కొన్ని చోట్ల దొంగ డాక్యుమెంట్లతో, చాలా చోట్ల అసలు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా. ఆ భూములని నిరుపేదలకు ఇప్పించడం కోసం స్థానిక మాదిగ కులస్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించారు గీత. ఇందుకు అటు నక్సలైట్ల నుంచి కానీ, ఇటు వామపక్షాల నుంచి కానీ ఎటువంటి సహాయం తీసుకోలేదామె. స్థానికంగా వ్యవసాయ కూలీల సంఘాన్ని ఏర్పాటు చేసి, మొదట వెట్టి కార్మికుల విముక్తితో మొదలు పెట్టి, అటుపైన భూముల పంపిణీ వరకూ ఉద్యమాన్ని పెంచుకుంటూ వచ్చారు.
జార్జి రెడ్డి సోదరుడు సిరిల్ గీతకి సహచరుడు. అతడు న్యాయ విద్యని అభ్యసించడంతో పాటు, 'ఆసరా' అనే సంస్థని స్థాపించి నడిపించాడు. భూసంబంధ కోర్టు కేసులన్నీ ఆసరా చూసేది. ఉస్మానియా సహాధ్యాయులలో కొందరు ఆమెకి మద్దతిచ్చారు. మరికొందరు బహిరంగానే విభేదించారు. భూస్వాములందరూ ప్రభుత్వంలో బాగా పలుకుబడి ఉన్నవాళ్లు కావడంతో భూ పంపిణీకి అడుగడుగునా అడ్డంకులే వచ్చాయి. ఎప్పటికప్పుడు తన కార్యచరణని సమీక్షించుకుంటూ, తప్పులు సరిదిద్దుకుంటూ ముందుకు సాగారు గీత. ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల అనేక గ్రామాల ప్రజల విశ్వాసాన్ని సంపాదించారు. పెద్దలతో విరోధాలకి లెక్కేలేదు. "మేమందరం కలిసి ఇబ్రహీంపట్నం లో రెడ్డి రాజ్యాన్ని కూలదోశాము" అని రాసుకున్నారామె. 'ఈనాడు' రామోజీరావు ఆమె భూ పోరాట కథని సినిమాగా తీస్తానని ప్రతిపాదించడం కొసమెరుపు.
ఒకపక్క హెచ్.బీ.టీ ద్వారా పుస్తకాలని ప్రచురిస్తూనే, మరోపక్క ఇంత బలమైన ప్రజా ఉద్యమాన్నిప్రజాస్వామిక పద్ధతిలో నిర్మించి, కొనసాగించడం, తనని నమ్మిన ప్రజలందరినీ ఏకతాటిపై నిలిపి వారి హక్కుని సాధించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. బాల్యం మొదలు కాలేజీ వరకూ వ్యక్తిగత జీవితం కనిపించే ఈ ఆత్మకథలో, అటుపైన ఉద్యమాలు, పోరాటాలు మాత్రమే కనిపిస్తాయి. నేను బదులు 'మేము' కనిపిస్తుంది పేజీలన్నింటా. 'Land Guns Caste Woman: The Memoir of a Lapsed Revolutionary' పేరిట గీత ఇంగ్లీష్ లో రాసుకున్న ఆత్మకథని ప్రభాకర్ మందార తెనిగించారు. ఎక్కడా అనువాదంలాగా అనిపించక పోవడం, పురుష హృదయం ఏమాత్రం తొంగి చూడకపోవడం ఈ పుస్తకం ప్రత్యేకత. హెచ్.బీ.టీ ప్రచురించిన ఈ 456 పేజీల పుస్తకం వెల రూ. 499. సాహిత్యంతో పాటు ప్రజా ఉద్యమాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళని ఆపకుండా చదివించే రచన.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి