శుక్రవారం, మార్చి 20, 2015

ఎందుకీ అసహనం?

నాకు ప్రతిపక్షం అంటే ఇష్టం. పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రతిపక్షంలో ఉన్న పక్షం నాకు నచ్చుతుంది. ప్రజాస్వామ్యానికి నిజమైన అర్ధం ప్రతిపక్షమే అనీ, బలమైన ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం నియంతృత్వం/రాచరికంతో సమానమనీ నా వ్యక్తిగత అభిప్రాయం. అధికారంలో ఉన్నవాళ్ళలో 'మేము దైవాంశ సంభూతులం' అన్న భావన ప్రబలకుండా అడ్డుకోడమే కాదు, వాళ్ళు చేసే అడ్డగోలు నిర్ణయాలు చట్టాలుగా మారిపోకుండా ఆపగల శక్తి బలమైన ప్రతిపక్షానికి ఉంటుంది. అందుకే, ప్రతిపక్షం అంటే అధికారంలో ఉన్న వాళ్ళకీ, వాళ్ళ అనుయాయులకీ అసహనం కొంచం ఎక్కువగానే ఉంటుంది.

గోదావరి జిల్లా వాడిగా, రాయలసీమని గురించి కొంత అవగాహన ఉన్న వాడిగా, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలని దశాబ్దాలుగా గమనిస్తున్నవాడిగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఈ పథకం వల్ల కాంట్రాక్టర్లకి మినహా ఇంకెవరికీ ప్రయోజనం లేదని బలంగా నమ్ముతున్నాను. ప్రకటించిన ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తయిన పక్షంలో పట్టిసీమ పథకం నిరుపయోగంగా మారుతుంది. ఈ పథకంపై పెట్టే ఖర్చు వృధా వ్యయం తప్ప మరొకటి కాదు.

ఈ పథకం పూర్తిచేసినా, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలకి గోదావరి జలాల్లో వాటా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి రాయలసీమకి ఒనగూడే ప్రయోజనం అంటూ ఏమీ లేదు. పైగా, గోదావరి 'మిగులు' జలాలకి కృష్ణా డెల్టాకి తరలించడం వల్ల గోదావరి డెల్టా రైతుల ప్రయోజనాలు ప్రశ్నార్ధకం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పోనీ, ఈ జలాల వల్ల కృష్ణా డెల్టా రైతులకి ప్రయోజనం ఉందా అంటే, వీటి అంతిమ గమ్యం ప్రతిపాదిత రాజధాని నగరం తప్ప పంటపొలాలు కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే, గోదావరి జలాలని కొత్త రాజధానికి తరలించే పథకం ఇది.

విభజన తర్వాత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ రావడం అత్యవసరం. ఇందుకు బదులుగా తాత్కాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పట్టిసీమ పథకాన్ని తెరమీదకి తేవడం అంటే, పోలవరం పథకాన్ని పక్కదోవ పట్టించడమే. పట్టిసీమ పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టుదల చూస్తుంటే 'పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం అడ్డుపుల్ల వేసిందా?' అన్న సందేహం పదేపదే కలుగుతోంది. రైతు రుణమాఫీ కాగితాలకే పరిమితం కావడం, బ్యాంకుల నుంచి అప్పు పుట్టక రైతులు ఇబ్బందులు పడుతూ ఉండడం లాంటివన్నీ వ్యవసాయ రంగంలో రాబోయే సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. రైతు పక్షాన ఓ గొంతు వినిపించాల్సిన సమయం ఇది.

ఈ నేపధ్యంలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్షం విషయంలో అధికారపక్షం వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రతిపక్ష సభ్యుల నోటివెంట 'వ్యవసాయం' 'రైతు' 'పట్టిసీమ' అనే మాటలు రాకుండా ఉండేందుకు ఏమేం చెయ్యాలో అవన్నీ చేస్తున్నారు అధికార పక్షం సభ్యులు. విషయాన్ని పక్కదోవ పట్టించడమే అంతిమ లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షం వారందరిదీ నేరమయ చరిత్రే అనుకుంటే, అధికారంలో ఉన్న వాళ్ళందరూ పులు కడిగిన ముత్యాలేమీ కాదే? పోనీ, ప్రతిపక్షం అంతా నేరమయం, అధికార పక్షం అంతా మిస్టర్ క్లీన్ల మయం అనుకుందాం.. ఈ మిస్టర్ క్లీన్లందరూ స్థాయి తగ్గించుకుని ప్రవర్తించాల్సిన అవసరం ఏమిటి?

పట్టిసీమ పథకాన్ని గురించీ, రైతు సమస్యల గురించీ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతోందన్నది కట్టెదుట కనిపిస్తోంది. తప్పించుకు తిరిగే ప్రయత్నంలో ప్రతిపక్షం మీద అవసరానికి మించి బురద జల్లుతోంది. ఊహకి అందనంత అసహనం చూపుతోంది. అధికార పక్షం మాత్రమే కాదు, ప్రతిపక్షమూ రాష్ట్ర ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తోంది. శాసనసభలో ప్రతిపక్షం గొంతు నొక్కడానికి కారణం ఆ పక్ష సభ్యుల ప్రవర్తనే అయిన పక్షంలో, వ్యవసాయరంగానికి సంబంధించి సభలో లేవనెత్తిన ప్రశ్నలకి ప్రజలందరికీ సూటిగా జవాబులు ఇవ్వడం ద్వారా మాత్రమే ప్రభుత్వం తన విశ్వసనీయతని నిలబెట్టుకోగలుగుతుంది.

2 కామెంట్‌లు:

  1. ఆర్ధిక మంత్రి ప్రసంగంలో పట్టిసీమ గురించి చెప్పారు అయితే నిధుల గురించి ఏమీ అనలేదు. సాగు నీటి శాఖ బడ్జెటులో చూస్తె ఈ ప్రాజెక్టు పేరే కనిపించలేదు. మరి నిధులు ఎంత & ఎలా కేటాయించారు అన్నది ప్రశ్నార్థకమే.

    రిప్లయితొలగించండి
  2. @జై గొట్టిముక్కల: అన్నీ జీవోల ద్వారా జరిపించేశారండీ, అసెంబ్లీ సమావేశాలకి ముందే.. ..ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి