శనివారం, మార్చి 14, 2015

కరుణకుమార కథలు

కొన్ని రచనలు కొందరు రచయితలకి ఇంటిపేర్లుగా స్థిరపడిపోతాయి. అలా, 'కరుణకుమార' పేరు చెప్పగానే గుర్తొచ్చే కథలు 'కొత్త చెప్పులు' 'బిళ్ళల మొలత్రాడు.' ఈ రెండు కథలూ కరుణకుమార ఇంటిపేర్లుగా స్థిరపడిపోయాయి. ఇవి మాత్రమే కాదు, 'ఉన్నతోద్యాగాలు' 'పోలయ్య' లాంటి కథలు అనేక కథా సంకలనాల్లో చోటుచేసుకున్నాయి. రాశిలో తక్కువే అయినా వాసిలో ఎన్నదగ్గ కథలు రాశారు కరుణకుమార. ఈయన కథ ప్రచురించని కథా సంకలనాలు అరుదు. చాలా రోజులుగా ఒకటే ప్రశ్న. ఎవరీ కరుణకుమార? మొత్తం ఎన్ని కథలు రాశారు??

మరీముఖ్యంగా, 'తెలుగు కథల్లో గాంధీ దర్శనం' పేరుతో వెలువరించిన పన్నెండు కథల సంకలనంలో రెండు కథలు కరుణకుమారవే ఉండేసరికి మరింతగా ఆసక్తి పెరిగింది. మొన్నామధ్యన పుస్తకాల షాపులో 'కరుణకుమార కథలు' చూడగానే వెంటనే తీసేసుకున్నాను. పశ్చిమగోదావరి జిల్లాలో పుట్టి నెల్లూరులో స్థిరపడిన కందుకూరి అనంతం (1901-1956) బస్సు కండక్టరుగా జీవితం మొదలుపెట్టి తహసీల్దారుగా ఎదిగారు. 'కరుణకుమార' కలంపేరుతో రాసిన కథల్లో నెల్లూరు జిల్లా గ్రామీణ జీవితం, దేశ స్వాతంత్రానికి పూర్వం ఉన్న గ్రామ రాజకీయాలు, సామాన్యులపై స్వతంత్ర పోరాట ప్రభావం చిత్రితమయ్యాయి.


కరుణకుమార కి కలంపేరుని నిశ్చయించింది ఆయన బావమరిదీ, ప్రసిద్ధ చరిత్ర పరిశోధకులూ అయిన మల్లంపల్లి సోమశేఖర శర్మ. బహుశా, ఒకట్రెండు కథలు చదివాకే కలంపేరు నిర్ణయించి ఉంటారు. బలహీనుల పట్ల వల్లమాలిన కరుణ కనిపిస్తుంది కథల్లో. మొత్తం పదిహేను కథలున్న ఈ సంకలనంలో ఎనిమిది కథల్లో ఇతివృత్తం బలహీనుడిపై బలవంతుడు చేసే దౌర్జన్యమే. ఏ రెండు కథలకే కాదు, ఏ రెండు పాత్రలకీ కూడా పోలిక లేని విధంగా కథల్ని తీర్చిదిద్దారు రచయిత. కొన్ని కథల్లో బలవంతులు గెలిస్తే, మరికొన్ని కథల్లో బలహీనులు ధైర్యంగా నిలబడడం కనిపిస్తుంది.

కామందు చిన్నపరెడ్డి కి 'కొత్తచెప్పులు' కుట్టి తేవడంలో ఆలస్యం చేసిన నరిసికి దొర వేసిన శిక్ష, అనంతర పరిణామాలూ సంకలనంలో మొదటి కథ 'కొత్తచెప్పులు.' 'ఉదయిని' పత్రికలో 1936 లో ప్రచురితమైన ఈ కథ కరుణకుమార మొదటికథ. అందుకే కావొచ్చు, ముగింపులో కొంత నాటకీయత కనిపిస్తుంది. 'హరిజనోద్యమం' ఇతివృత్తంగా సాగిన కథ 'పోలయ్య.' కథలో ప్రధాన పాత్రతో పాటు పాఠకులని కూడా చీకటి రాత్రి ఎడ్లబండి మీద ప్రయాణం చేయిస్తారు రచయిత. మెరుపుముగింపు ఈ కథ ప్రత్యేకత. మనసుపడ్డ పిల్లని పెళ్ళిచేసుకుని, గుర్రం మీద ఊరేగాలని ఏర్పాటు చేసుకున్న రొబ్బయ్య ఊళ్ళో పెద్దలకి కంటగింపుగా మారిన వైనం 'పశువుల కొఠం.'


రెవిన్యూ శాఖలో పనిచేసిన వాళ్ళు మాత్రమే రాయగలిగే కథ 'కయ్య, కాలువ.' భూలావాదేవీల మీద రచయితకి ఉన్న పట్టు ఎంతటిదో తెలుస్తుంది ఈకథలో. కామందుకీ, రోజుకూలికీ మధ్య జరిగిన పోరాటంలో గెలుపు ఎవరిదో చెబుతూ ముగుస్తుంది. గ్రామదేవత జాతర ఇతివృత్తంగా సాగే 'మొక్కుబడి' కథనీ, మరీ ముఖ్యంగా ముగింపునీ ఓ పట్టాన మర్చిపోలేం. 'చలిజ్వరం' గ్రాంధిక భాషా వాది' గల్ఫికల్లా సాగితే, 'జాకీ' వ్యంగ్యంగా ముగుస్తుంది. ధనిక, పేద జీవితాలని చిత్రించిన కథ 'కనువిప్పు.'  పేదవాడిది పైచేయి అనిపిస్తారు రచయిత. 'టార్చిలైటు' 'రిక్షావాలా' '512' 'బిళ్ళల మొలత్రాడు' ఈ నాలుగు కథలూ పేదవాళ్ళవే. ఒకప్పుడు 'సన్నజీవాలు' పేరుతో సంకలనంగా వచ్చాయివి.

'రిక్షావాలా' కథ గోపీచంద్ 'రిక్షావాడి'ని గుర్తుచేస్తుంది. 'బిళ్ళల మొలత్రాడు' పెద్ద కథలో సుబ్బులు, అతని భార్య రమణి గుర్తుండిపోయే పాత్రలు. కరుణకుమార ఎంతటి ఆశావాదో ఈ కథ ముగింపు చెబుతుంది. 'టార్చిలైటు' 'చలిజ్వరం' కథల ముగింపులలో పోలిక కనిపిస్తుంది. 'సేవాధర్మం' '512' కథలు చిన్నపాటి జర్క్ తో ముగుస్తాయి. ఇక, సంకలనంలో చివరి కథ 'ఉన్నతోద్యాగాలు.' గాంధీజీని ఆదర్శంగా తీసుకుని జీవితాన్ని గడిపే ఓ తహసీల్దారు కథ. యుద్ధం రోజుల పరిస్థితులు చదివేప్పుడు కొకు కథలు గుర్తొస్తాయి. కరుణకుమార కథలన్నీ సేకరించి ప్రచురించిన విశాలాంధ్ర ప్రచురణ సంస్థని ఎంతైనా అభినందించాల్సిందే. కాలపరీక్షకి నిలబడే ఈ కథల్ని, కథా సాహిత్యాన్ని ఇష్టపడే వారందరూ తప్పక చదవాల్సిందే. (పేజీలు 278, వెల రూ. 125, విశాలాంధ్ర అన్ని శాఖలు).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి