సోమవారం, ఆగస్టు 22, 2011

సీరియల్ వార్తలు

'నేటితో పూర్తయిన పంచాయితీ సర్పంచుల పదవీకాలం.. ప్రత్యేక అధికారులని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు' ..ఎమ్మెల్యేల రాజీనామాల వార్తలు టీవీలో సీరియస్గా చూస్తుండగా కింద ఈ స్క్రోలింగ్ కనిపించింది. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. అటువైపు నుంచి మిత్రుడు "ఏంటీ విశేషాలు? ఎనీ న్యూస్?" అని రెండు భాషల్లో. తను ఎదురుచూస్తున్న న్యూస్ ఇంకా తెలియలేదు. అందుకని నేను చదువుతున్న స్క్రోలింగ్ పైకి చదివి వినిపించి, చూస్తున్న దృశ్యం తాలూకు రాజీనామాల సంగతులు కూడా గడగడా చెప్పేశాను.

"ముప్పాతిక మూడొంతులు ఆఫీసర్ల రాజ్యమే అన్నమాట! అసెంబ్లీని సస్పెండెడ్ యానిమేషన్లో పెట్టేస్తే ఆ మిగిలింది కూడా ఆఫీసర్లే చూసుకుంటారు కదా హేపీగా" నాయకులకన్నా ఆఫీసర్లు నయమని తన అభిప్రాయం. నేను పూర్తిగా విభేదించను కానీ "ఏ రాయి అయితేనేం.." అన్న వైరాగ్యం కొంతా, ఏదీ కూడా అతి కూడదన్న భావన మరికొంతా.. అంటే అటు పూర్తిగా నాయకులకీ, ఇటు అధికారులకీ వదలరాదని. రాజకీయాలు, ఎన్నికల గురించి కాసేపు చర్చ జరిగింది.

ఇప్పటికే మండల పరిషత్, జిల్లా పరిషత్, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో ప్రజా ప్రతినిధుల పదవీ కాలాలు పూర్తయ్యాయి, ఇప్పుడు పంచాయితీలు కూడా ఖాళీ అయిపోయాయి. వీటన్నింటికీ ఎన్నికలు జరపాలి. ఇప్పటికే తెలంగాణా కోసం రాజీనామాలు చేసిన వాళ్ళు చెయ్యగా, మిగిలిన వాళ్ళు మహానేత మరియు యువనేత కోసం రాజీనామాలు చేసేశామని ప్రకటించేశారు. అయినప్పటికీ కూడా చట్టం తన పని తాను చేసుకుపోతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే గ్రామస్థాయి మొదలు, రాష్ట్ర స్థాయివరకూ ఎక్కడ చూసినా అధికారులు మాత్రమే కనిపిస్తున్నారు.

"సస్పెండెడ్ యానిమేషన్ అంటే మరి ప్రజాస్వామ్యం?" కొంచం ఆందోళనగా అడిగాన్నేను. రాష్ట్రపతి పాలన అన్నది చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే విధిస్తారు కదా మరి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నవి అరుదైన పరిస్థితులే అని తను వాదించాక, "పోనీ ఆర్నెల్లు ఊరుకుంటే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయా? ఆఫీసర్లు ఇవన్నీ సాల్వ్ చేసేస్తారా?" అని అడిగాను. ప్రభుత్వాన్ని రద్దు చేసేసి, మళ్ళీ ఎన్నికలు పెట్టేసినా సమస్యలు యధాతధంగానే ఉంటాయన్నది నా వాదన.

"ప్రజాస్వామ్యానికొచ్చే లోటేమీ ఉండదు. కాకపొతే ఇప్పుడే ఎన్నికలు ఉండవు. పెట్టాల్సిన ఎలక్షన్లకోటి దిక్కు లేదు.. ఇంక కొత్తవేం పెడతారు? అన్నా హజారే దీక్ష పుణ్యమా అని టెస్ట్ క్రికెట్ విషయం వెనక్కెళ్ళి పోయినట్టు, రాష్ట్రపతి పాలన అనగానే కనీసం కొన్ని ఇష్యూస్ అయినా సాల్వ్ కాకుండా ఉంటాయా?" తన లాజిక్కైతే బాగానే ఉంది కానీ, సోనియా లేకుండా ఇంతలేసి నిర్ణయాలు తీసుకోగలిగే మగదూర్ ఎవరికుందీ దేశంలో? "అయినా రిజిగ్నేషన్లు వెంటనే యాక్సెప్ట్ చేయరు కదా.. లాలింపులూ, బుజ్జగింపులూ లాంటివన్నీ అయ్యాక అప్పుడు కదా నెక్స్ట్ స్టెప్.." ఇది నా పాయింట్.

"నిజమే కానీ, చావుకి పెడితే లంఖణానికి వస్తుందని సామెతొకటి ఉంది కదా.. అలా మొత్తానికి ప్రభుత్వాన్ని రద్దు చేసేస్తాం అంటే ఈ రాజీనామాలు కంచికెళ్ళక పోతాయా అని? రాన్రాను చిన్న పిల్లలు కూడా రాజీనామా ఆటాడుకునేలా అయిపోతోంది పరిస్థితి.." తన పాయింట్ అర్ధమయ్యింది కానీ, ఎంత వరకూ ఆచరణ సాధ్యం అన్నది ప్రశ్న. "ఇప్పటికిప్పుడు అంత అవసరం ఏమొచ్చింది. అపోజిషన్ కూడా గవర్నమెంట్ కి చాలా అనుకూలంగానే ఉంది కదా.. ఆఫ్ కోర్స్ వాళ్ళ సమస్యలు వాళ్ళవి.. సోనియా వచ్చేవరకూ కథ నడుస్తూ ఉంటుంది" అన్నాన్నేను.

"అప్పటివరకూ వార్తలు కూడా డైలీ సీరియల్లాగే ఉంటాయింక.. ప్రభుత్వం కూడా డైలీ సీరియల్లాగే పనిచేస్తుంది," తన డిస్కవరీ. నేను అదేదో సినిమాలో శ్రీలక్ష్మి 'నాన్నా..చిట్టీ...' అన్నట్టుగా "ప్రభుత్వమా? పని చేయడమా? ఏదీ, మళ్ళీ ఓసారి...." అంటుండగానే తన నవ్వు గట్టిగా వినిపించింది. నవ్వయ్యాక నేనే అందుకుని "ప్రభుత్వం పని చేస్తోంది.. కానీ చేస్తున్నాను అని చెప్పుకోలేక పోతోంది.. ఎందుకంటే చేయాల్సినవి చాలా ఉన్నా చెయ్యలేకపోతోంది.. పాపం, ప్రతిపక్షాలదీ అదే పరిస్థితి.. ఎవరి గోల వాళ్ళది," అంటుండగానే "మన గోల మనది" అంటూ ఫోన్ కట్ చేశాడు తను..

2 కామెంట్‌లు: