సోమవారం, మే 16, 2022

మండుటెండలు

ఎండలు మండిపోతున్నాయనుకోవడం ప్రతి వేసవిలోనూ మనకి మామూలే కానీ ఈసారి మామూలుగా కాక 'రికార్డు' స్థాయిలో మండుతున్నాయి. గత నెలలో (ఏప్రిల్) భారతదేశంలో నమోదైన ఉష్ణోగ్రతలు గడిచిన నూట ఇరవై రెండు సంవత్సరాల్లోనే అత్యధికంట! మనమే కాదు, పొరుగున ఉన్న పాకిస్తాన్, శ్రీలంక దేశాలు కూడా మండుతున్నాయి, కేవలం రాజకీయ వేడి మాత్రమే కాదు అక్కడి వాతావరణమూ అసహజమైన ఎండలతో అట్టుడుకుతోంది. బంగ్లాదేశ్ దీ అదే పరిస్థితి. ఈ బీద దేశాలన్నింటిమీదా సూర్యుడు ఎందుకిలా పగబట్టాడన్నది బొత్తిగా అంతుబట్టడంలేదు. ఎండల నుంచి రక్షింపబడడానికి జనాలకున్న ఒకే ఒక్క అవకాశం ఫ్యాన్ కిందో, ఏసీలోనో సేదదీరడం. అవి నడిచేది కరెంటు మీద. ఆ కరెంటుకి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయి సరఫరాలో ప్రతిరోజూ కోత పడుతోంది. ఇది చాలదన్నట్టు చార్జీలు రోజురోజుకీ పెరుగుతున్నాయి కూడా. 

ఉష్ణోగ్రతలు పెరగడానికి సైన్సు చెప్పే రెండు కారణాలు కాలుష్యం పెరగడం, పచ్చదనం తగ్గిపోవడం. ఏళ్ళ తరబడి ఇవే కారణాలు వినిపిస్తున్నా పరిష్కారం ఏమీ దొరక్కపోగా, ఎండలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ రెండు కారణాలు మనొక్క చోటే కాదు, మొత్తం ప్రపంచం అంతా ఉన్నవే కదా. మరి మనల్ని మాత్రమే ఈ ఎండలు ఎందుకు బాధిస్తున్నాయి. నాకు అర్ధమైనంత వరకూ ప్రతి సమస్యకీ ఉన్నట్టే ఈ ఎండల సమస్యకీ రెండు పరిష్కారాలు ఉన్నాయి -  ఒకటి తాత్కాలికమైనది, రెండోది శాశ్వతమైనది. మిగిలిన ప్రపంచం, మరీ ముఖ్యంగా ధనిక దేశాలు తాత్కాలిక పరిష్కారం దోవ పట్టాయి. వేసవిలో పెరిగే విద్యుత్ డిమాండ్ ని ముందుగానే ఊహించి పంపిణీకి ఆటంకం లేకుండా చూడడం, అవసరమైతే వీళ్లకీ వాళ్ళకీ (ఓ దేశానికీ, మరోదేశానికీ) జుట్లు ముడిపెట్టి ఇంధన సరఫరా వరకూ వాళ్ళ పబ్బం గడుపుకోవడం. దీనివల్ల 'ఎండలు బాబోయ్' అన్న మాట అక్కడ వినిపించడం లేదు. 

Google Image

ఇప్పుడు ఉష్ణోగ్రతలో రికార్డులు బద్దలు కొడుతున్న దేశాల్లో ఎండలు పెరిగేందుకు భౌగోళిక కారణాలు కొంత కారణం అయితే, తగ్గించుకునేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకునే వీలు కూడా కనిపించకపోవడం మరో సమస్య. ఓ పదేళ్ల క్రితంతో పోలిస్తే ఏసీల మార్కెట్ విపరీతంగా పెరిగిన మాట వాస్తవమే అయినా, మొత్తం జనాభా-ఏసీల నిష్పత్తితో పోల్చి చూసినప్పుడు వినియోగంలో ఉన్న ఎయిర్ కండిషనర్ల సంఖ్య తక్కువనే చెప్పాలి. పైగా జనం దగ్గర ఉన్న ఏసీలన్నీ వినియోగంలో ఉన్నాయనీ చెప్పలేం. కరెంటు కోత, బిల్లుల మోత కారణంగా ఇంట్లో ఏసీ ఉన్నా రోజంతా వాడే వాళ్ళు తక్కువే. కూలర్లు, ఫ్యాన్లదీ ఇదే కథ. ప్రజల్లో ఖర్చుపెట్టే శక్తి తక్కువగా ఉండడం, ఖర్చు పెట్టే అవకాశం లేకపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయి. భారీ ఎత్తున చెట్ల నరికివేత, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం కూడా గాలాడని ఉక్కపోతకి బాగానే దోహదం చేస్తున్నాయి. అయితే, వీటిలో ఏదీ ఆపగలిగేది కాదు. 

ఆశ్చర్యం ఏమిటంటే, ఏ ఏసీ అయితే ఎండ వేడిమి నుంచి ఉపశమనం ఇస్తుందో, అదే ఏసీ భవిష్యత్తులో ఉష్ణోగ్రత మరికొన్ని డిగ్రీలు పెరగడానికి కారణం అవుతోంది. పెరిగిపోతున్న వాతావరణం కాలుష్యానికి ప్రధానంగా తోడ్పడుతున్న వాటిలో ఏసీలో ఉన్నాయి. వీటితో పాటు క్రమేపీ పెరుగుతున్న విమానయానం, ఇప్పటికే బాగా పెరిగిన భవన నిర్మాణాలూ తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. ఒకప్పుడు కాలుష్యం అంటే ప్రధానంగా పారిశ్రామిక వ్యర్ధాల కారణంగా సంభవించేదే అయివుండేది. ఇప్పుడు కాలుష్య కారకాలు అనూహ్యంగా రూపం మార్చుకున్నాయి. ఉదాహరణకి పేకేజింగ్ మెటీరియల్స్. ఈకామర్స్ వినియోగం పెరిగిన తర్వాత, మరీ ముఖ్యంగా కరోనా మొదలైనప్పటినుంచి షాపుల్లో కన్నా, ఆన్లైన్ కొనుగోళ్లు బాగా పెరిగాయి. దుస్తులు, వస్తువులే కాదు, ఆహార పదార్ధాలు కూడా క్రమం తప్పకుండా కొనేవారు ఎక్కువయ్యారు. ఇదో అనివార్యతగా మారింది. పేకేజింగ్ కోసం వాడుతున్న ప్లాస్టిక్ గురించి ఎవరైనా డేటా సేకరిస్తే కళ్ళు తిరిగే విషయాలు బయట పడొచ్చు.  

తాత్కాలిక ఉపశమనాలను దాటి, శాశ్వత పరిష్కారాల వైపు దృష్టి సారించినప్పుడు ప్రభుత్వాల స్పందన ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. అడవుల విస్తీర్ణం నానాటికీ తగ్గుతోంది. మెరుగైన అర్బన్ ప్లానింగ్, గ్రీన్ బెల్ట్ ని పెంచే ఏర్పాట్లు, నీటి వనరుల సద్వినియోగం, భూగర్భ జలాలని పెంచే ఏర్పాట్లు.. ఇలాంటివన్నీ కాగితాలని దాటి క్రియలో కనిపించడం లేదు. జల, వాయు కాలుష్యాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ప్రజల వైపు నుంచి ఆచరణ బొత్తిగా లేదనలేం కానీ, ఉండాల్సిన స్థాయిలో అయితే లేదు. తెలంగాణలో 'హరిత హారం' కార్యక్రమంలో సెలబ్రిటీలు మొక్కలు నాటుతూ క్రమం తప్పకుండా ఫోటోలకి ఫోజులు ఇస్తున్నారు. ఆంధ్రలో ప్రతి వర్షాకాలంలోనూ నెల్లాళ్ళ పాటు మొక్కలు నాటే కార్యక్రమం కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా జరుగుతోంది, ఇవి కాకుండా స్వచ్చంద సంస్థలు ఆన్లైన్ లో డోనర్ల నుంచి డబ్బు తీసుకుని వాళ్ళ తరపున మొక్కలు నాటుతున్నాయి.. వీటిలో సగం మొక్కలు చెట్లైనా ఈపాటికి ఎండల సమస్య కొంచమైనా తగ్గాలి. ఇప్పటికైతే దాఖలా కనిపించడం లేదు. ఎండల్ని తిట్టుకుని ఊరుకోడమా, తగ్గించేందుకు (లేదా, మరింత పెరగకుండా ఉండేందుకు) ఏమన్నా చేయడమా అన్నది మన చేతుల్లోనే ఉంది.

2 కామెంట్‌లు:

  1. దాదాపు వంద దేశాల్లో గత రెండు మూడేళ్లలో సరాసరి ఉష్ణోగ్రత ఒకటిన్నర డిగ్రీలు పెరిగిందట. పైగా చాలా వరకు ఇవన్నీ సో కాల్డ్ "డెవలపింగ్ " కంట్రీస్ కాబట్టి నిబంధనలన్నీ పేపరు మీదే.

    వ్యక్తిగత స్థాయిలో నిర్లక్ష్యం నుంచి రాజకీయాల్లోని ఓటు బ్యాంకు దాకా దీనికి కారణాలు మాత్రం అనేకం..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ.. కానీ, సమస్య తీవ్రత ఏటేటా పెరుగుతూ పోతోంది.. రానున్న రోజులు ఎలా ఉండబోతున్నాయో మరి.. ..ధన్యవాదాలు.. 

      తొలగించండి