బుధవారం, జూన్ 29, 2016

నల్లడబ్బు - తెల్లడబ్బు

విదేశీ బ్యాంకుల్లో పేరుకుపోయిన భారతీయ నల్లధనాన్ని వెనక్కి తెస్తామంటూ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ఇఛ్చిన హామీ సామాన్యులని చాలా ఆకర్షించింది. ఆ పార్టీ నేతలు కొందరు అలా వెనక్కి తెచ్చిన నల్ల ధనాన్ని సామాన్యుల బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తామని అత్యుత్సాహంగా ప్రకటించడం వల్ల ఈ హామీకి ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది. ఆచరణకు వచ్చేసరికి హామీ అమలులో ఉన్న కష్టనష్టాలు ప్రభుత్వానికి అనుభవంలోకి వస్తున్నట్టున్నాయి. విదేశీ నల్లధనానికన్నా ముందు, స్వదేశీ నల్ల ధనాన్ని వెలికి తీసే కార్యక్రమం మొదలు పెట్టింది. (ఏటా ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉంటూ ఉంటాయి కాబట్టి, ఎన్నికల హామీలని పూర్తిగా మర్చిపోవడం అనే సౌకర్యం  కేంద్రంలో అధికారంలోకి వఛ్చిన పార్టీ(ల)కి ఉండదు).

'ఆదాయ వెల్లడి పథకము-2016' పేరిట ప్రధాని మొదలు స్థానిక అధికారుల వరకూ విస్తృతంగా ప్రచారం చేస్తున్న పథకం నిజానికి పూర్తిగా కొత్తదేమీ కాదు. గతంలో వాజపేయి ప్రభుత్వంలో మొదటిసారి, తర్వాత కాంగ్రెస్ అధ్యక్షతన పాలించిన యూపీఏ హయాంలో రెండు సార్లూ అమలు చేసిందే. తేడా ఏమిటంటే, ఆదాయాన్ని స్వచ్చందంగా ప్రకటించి, గడువులోగా నిర్ణీత జరిమానా చెల్లించి నల్ల డబ్బుని తెలుపు చేసుకోకపోతే అనంతర పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తోంది ప్రభుత్వం. గతంతో పోలిస్తే ఇప్పుడు కంప్యూటరైజేషన్ పెరగడం, యూనిక్ నెంబర్ (ఆధార్) పుణ్యమా అని ప్రతి ఒక్కరి సమాచారం ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉండడంతో ఇలా హెచ్చరించడానికి అవకాశం దొరికింది ప్రభుత్వానికి.


గత పథకాల్లో వెల్లడి చేసిన నల్ల డబ్బులో ముప్ఫయి శాతాన్ని ప్రభుత్వానికి జరిమానాగా చెల్లిస్తే నలుపు తెలుపయి పోయేది. తాజా పధకంలో ఈ మొత్తాన్ని నలభై ఐదు శాతానికి పెంచారు. ఆదాయపు పన్నే ముప్ఫయ్ శాతం ఉన్నప్పుడు, జరిమానా మొత్తం అంతకన్నా ఎక్కువగా ఉండాలి కదా అన్న వాదన ఫలితమిది. ఈ ప్రకారం, కోటి రూపాయల నల్ల ధనం ఉంటే, అందులో నలభై ఐదు లక్షలు ప్రభుత్వానికి జరిమానా కట్టేస్తే మిగిలిన యాభై ఐదు లక్షలూ తెల్లదనం అయిపోతుంది. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా ఇలా స్వచ్ఛందంగా ఆదాయం వెల్లడి చేసిన వారి మీద ఎలాంటి విచారణలూ, కేసులూ ఉండవు. మర్యాదగా చూడబడతారు. వాళ్ళ వివరాలు కూడా చాలా గోప్యంగా ఉంచబడతాయని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఈ స్కీములో భాగంగా బినామీ ఆస్థులని యజమాని పేరిట మార్పించుకునే సౌలభ్యం కూడా ఉంది.

జూన్ ఒకటైన ప్రారంభమైన ఈ పథకాన్ని గురించి పేపర్ల లోనూ, టీవీల్లోనూ, మన్ కీ బాత్ లోనూ వీలున్నప్పుడల్లా వివరిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ వెంటే ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా. పథకం ప్రయోజనాలతో పాటు, నల్లడబ్బుని తెలుపు చేసుకోక పోతే ఎదురవ్వబోయే పరిణామాలని గురించి హెచ్చరికలు కూడా చేస్తున్నారు. దేశంలో అమలవుతున్న పన్నుల వ్యవస్థని గురించి కూడా వాళ్లిద్దరూ చాలా ఆవేదన చెందుతున్నారు. ఇంత పెద్ద దేశంలో వార్షికాదాయం యాభై లక్షలు పైబడి ఉందని పన్ను పత్రాల్లో చూపిస్తున్న వాళ్ళు కేవలం లక్షన్నర మందేనట. పాన్ కార్డు తీసుకున్న పాతిక కోట్ల మందిలోనూ కేవలం ఐదు కోట్ల మంది మాత్రమే ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారట. ఈ సంవత్సరం కనీసం మరో ఐదు కోట్ల మంది చేత రిటర్నులు ఫైల్ చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుందిట.

ఆదాయ వెల్లడి పథకం ప్రకటించి నెల గడిచింది కానీ జనం నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. సెప్టెంబర్ నెలాఖరు లోగా దరఖాస్తు చేసేసుకోవాల్సి ఉంటుంది. ఆపై, నవంబరు చివరిలోగా జరిమానా చెల్లించేయాలి. నల్లడబ్బు ఉండే అవకాశం ఉందని భావిస్తున్న వర్గాల మీద దండోపాయం మినహా మిగిలిన మూడు ఉపాయాలూ ప్రయోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. దండోపాయం మాత్రం, గడువు తేదీ ముగిసిన తర్వాతే అమలుచేస్తారుట. ఈ పథకం కింద పెద్ద మొత్తంలో సొమ్ములొస్తే సామాన్య ప్రజల కోసం ఏదో ఒకటి చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే బాగుండును. ఇప్పుడు వసూలు చేస్తున్న పన్నుల్ని సగానికి సగం తగ్గించేస్తాం లాంటి హామీలు అవసరం లేదు కానీ, దొడ్డి దారిన మోపిన స్వచ్ఛ భారత్ సెస్సు, కృషి కళ్యాణ్ సెస్సులని తొలగిస్తామని చెప్పినా ఎంతో కొంత పన్నుల బరువు తగ్గుతుందన్న ఆశ ప్రజల్లో కలిగేదేమో కదా..

2 కామెంట్‌లు:

  1. జనా ధన్ యోజన పధకం క్రింద అకౌంట్ ఓపెన్ చేయమనగానే 15 లక్షలు అకౌంట్ లో పడిపోతాయని భావించారు.అర్నాబ్ ఈ విషయం అడిగితే ఎన్నికల్లో ఎన్నో చెపుతాం కుర్చీలో కూర్చుంటే గానీ తెలియలేదు అని "చోడియే ఓ సబ్ బేకార్ బాత్" అని ఆయనే ఒప్పేసుకున్నారు.చిరంజీవిలాంటి వారే మోడీ అని నేను చెపుతుంటే నమ్మలేదు.ఇంకా ఎన్ని షాక్ లు ఇస్తారో వేచి చూడండీ.

    రిప్లయితొలగించండి
  2. @నీహారిక: ఎన్ని వచ్చినా తప్పదు కదండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి