సోమవారం, జులై 20, 2020

వెంకట సత్య స్టాలిన్ 

పెద్ద పెద్దవాళ్ళు ఎవరు ఎక్కడినుంచి పిలిచినా, ఏ పేరుతో పిలిచినా పలుకుతాడతను. ఎక్కడున్నా రెక్కలు కట్టుకుని వాలతాడు. సలహా సంప్రదింపు కానిచ్చేసి, తాను చెప్పదల్చుకున్న నాలుగు ముక్కలూ వాళ్ళ చెవిన వేసేసి మాయమైపోతాడు. చేసిన సాయానికి ప్రతిగా కృతజ్ఞతలు చెప్పడాన్ని కూడా ఒప్పుకోని బహు మొహమాటి. బిరుదులూ, సన్మానాలకి ఆమడ దూరం. బాల నెహ్రు కోటుకి మొదటగా గులాబీని గుచ్చింది అతనే. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఇంకా 'కుంజమ్మాళ్' గా ఉండగానే సంగీతంలో సుళువులు చెప్పిందీ అతనే. అరవిందుడికి 'సావిత్రి' రాయమని సూచించిన వాడూ, చక్రవర్తుల రాజగోపాలాచారి రాసిన రామాయణ సారానికి మెరుగులు దిద్దినవాడూ ఒక్కడే. అతను తెలుగు వాడు. వెంకట సత్య స్టాలిన్ అతని పేరు. 

'నేమ్ డ్రాపింగ్' అనేది ఒక కళ. అందరికీ చేతనయ్యేది కాదు. విషయాన్ని అతికినట్టుగా చెప్పాలి. ఆ చెప్పడంతోనే అవతలి గొప్పవాళ్ళకి మనం ఎంత దగ్గరో చెప్పాలి. అలా చెబుతూనే, 'అబ్బే  మనదేం లేదు' అన్నట్టుగా ధ్వనించినా, చేరాల్సిన వాళ్ళకి చేరాల్సిన విషయం చేరిపోవాలి. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఈ బాపతు జనం పుష్కలంగా కనిపిస్తూ ఉంటారు. అది ఇది ఏమని అన్ని రంగాలనీ చక్కపెట్టేసే వాళ్ళు నిజ జీవితంలో అరుదే కానీ, సాహిత్యంలో అప్పుడప్పుడూ తారసపడుతూ ఉంటారు. వాళ్ళు మహా సీరియస్ గా చెప్పే విషయాలు మనల్ని గిలిగింతలు పెట్టేస్తాయి. కొండొకచో ఆపుకోలేని నవ్వు పుట్టిస్తాయి కూడా. కాలం నాడు గురజాడ వారి గిరీశం ఈ 'నేమ్ డ్రాపింగ్' ని ప్రశస్తంగా నిర్వహించాడు. దానిని పరాకాష్టకు తీసుకెళ్లిన వాడు మాత్రం, శ్రీరమణ సృష్టించిన ఈ వెంకట సత్య స్టాలిన్. 

బెంగాలీలు ఇతన్ని 'బెంకట్' అనీ 'స్తోలిన్' అనీ పిలిస్తే, తమిళులు ఆదరంగా 'సచ్చూ' అంటారు. కన్నడిగులు 'హోళిన్ గారో' అని మర్యాద చేస్తే, ఉత్తరాది వారు 'వెంకట్ జీ' అంటూ పాదాభివందనాలు చేస్తారు. ఇతను ఏ కాలంలోకైనా, ఏ ప్రాంతానికైనా వెళ్లగలిగిన వాడు. విక్టోరియా మహారాణి మొదలు పీవీ నరసింహా రావు వరకూ, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి మొదలు ఎంటీ రామారావు వరకూ ఎవరికి ఏ సందేహం వచ్చినా చిటికలో తీర్చే వాడూ, సమయానికి తగు సలహాలు ఇచ్చేవాడూను. తన పేరు బయటికి రావడాన్ని బొత్తిగా ఇష్టపడడు. లేకపోతే, చిన్నయసూరి బాల వ్యాకరణానికి సహరచయితగా స్టాలిన్ పేరు ఉండేది. ప్రతిభని మొగ్గ దశలో గుర్తిచే శక్తి స్టాలిన్ లో అపారం. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, ద్వారం వెంకట స్వామి నాయుడు, ఈలపాట రఘురామయ్య, స్థానం నరసింహారావు.. వీళ్లంతా స్టాలిన్ డిస్కవరీలే. 


కేవలం అతడికున్న తీవ్రమైన మొహమాటం, విపరీతమైన మాడెస్టీ వల్ల స్టాలిన్ పేరు మనకి చరిత్ర పుస్తకాల్లో కనిపించదు. అసలు మొట్టమొదట ఉప్పు సత్యాగ్రహం చేసిన వాడు స్టాలినే. ఎవరెస్టుని అధిరోహించిన టెన్సింగ్ నార్కే కి పర్వతారోహణలో మెళకువలు చెప్పిన వాడూ ఇతడే. స్టాలిన్ ధైర్యం చెప్పి ఉండకపోతే యూరి గెగారిన్ అంతరిక్ష యాత్ర చేసేవాడే కాదు. గాలిబ్ రచనలన్నీ తనకి వెంటనే కావాలని పీవీ నరసింహారావు పట్టుపడితే, రెండు దస్తాల ఠావులు, పుల్లకలం, సిరాబుడ్డి సాయంతో  గాలిబ్ కవిత్వాన్నంతటినీ అక్షరం పొల్లుపోకుండా కాగితం మీదకి ఎక్కించిన జ్ఞాపకశక్తి స్టాలిన్ సొంతం. మోతీలాల్ నెహ్రు ఖరీదైన బారిస్టర్ అని అందరికీ తెలుసు కానీ, మోతీలాల్ విజయం వెనుక ఉన్నవి స్టాలిన్ సలహాలే అని ఎందరికి తెలుసు? 

అనేక స్థలకాలాదుల్లోకి బొంగరంలా తిరుగుతూ ఎన్నో పనులు చక్కబెట్టినా, స్టాలిన్ చేయలేక పోయిన పనులూ చాలానే ఉన్నాయి. 'శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు' నిర్మాణంలో చేయి వేయలేదని పిఠాపురం మహారాజా ఫిర్యాదు. తన దర్బారులో కనీసం ఓ వారం విడిది చేసి తన పండితులకి సాహిత్య విషయాలు బోధ పరచలేదని మైసూరు మహారాజు పెద్ద వడయారుకి ఓ వెలితి. వంగ సాహిత్యాన్ని గురించి స్టాలిన్ తో తనివితీరా చర్చించలేదన్న లోటు రవీంద్రుణ్ణి పీడిస్తూనే ఉంది. సరోజినీ దేవి, డాక్టర్ ముత్యాల గోవిందరాజులు నాయుణ్ణి ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు, పెళ్లిపెద్దగా ఉండాల్సిన వాడే, వేరే అత్యవసరమైన పని తగలడంతో ఆ వేళకి హాజరు కాలేకపోయాడు. అనేకానేకులకి అంతరంగికుడు మరి. ఒకేసారి అన్నిచోట్లా ఉండడం సాధ్యమవుతుందా? 

ముందుమాటలో 'వెంకట సత్య స్టాలిన్' ని పరిచయం చేస్తూ 'కాలం నాటి కందిగింజ' అన్నారు శ్రీరమణ. స్టాలిన్లు అన్ని కాలాల్లోనూ కనిపిస్తూనే ఉంటారు. మంచం కింద దాగిన రామప్పంతులు 'ఏవిట్రా వీడి గోతాలు?' అనుకున్నంత మాత్రాన, గిరీశం తన ధోరణి మార్చుకున్నాడా? 'వెంకట సత్య స్టాలిన్' చదువుతూ ఇదే మాటని కొన్ని వందల సార్లు అనుకోవచ్చు. మన సర్కిల్లో మనకి తెలిసిన 'స్టాలిన్' లని గుర్తు చేసుకోవచ్చు. పుస్తకం చదివేశాక, 'స్టాలిన్' లు తారసపడినప్పుడు కష్టపడి నవ్వాపుకోవడం మాత్రం తప్పక సాధన చేయాలి. స్టాలిన్ అనుభవాలు మొత్తం ఇరవై మూడింటిని అక్షరబద్ధం చేశారు శ్రీరమణ. ఇరవై ఒక్కింటిలో సాక్షాత్తూ స్టాలిన్ మాత్రమే కనిపిస్తాడు పాఠకులకి. ఎంటీఆర్, బాపూ-రమణ గురించి రాసిన వాటిలో మాత్రం స్టాలిన్ కాస్త వెనకడుగేయడం వల్ల కాబోలు, శ్రీరమణ కనిపించిపోయారు. వాళ్ళముగ్గురితో 'తన మార్కు' చనువుని ప్రదర్శించ లేక పోయాడు స్టాలిన్. ఈ బహు చక్కని వ్యంగ్య రచనని వీవీఐటీ ప్రచురించింది. పేజీలు 104, వెల రూ. 120. అన్ని ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు, ఆన్లైన్ లోనూ లభిస్తోంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి