మంగళవారం, జులై 05, 2016

పూసపాటి కృష్ణంరాజు కథలు

అప్పటివరకూ సామాజిక సమస్యల మీద కథలు రాస్తూ వఛ్చిన కెఎన్వై పతంజలి దివాణాలని కథా వస్తువులుగా తీసుకుని రచనలు చేయడానికి ప్రేరేపించిన రచయిత పూసపాటి కృష్ణంరాజు.  ఈ రాజుగారు రాసిన 'దివాణం సేరీవేట' కథ స్పూర్తితో 'రాజుగోరు' నవలిక రాశారు పతంజలి. ఇంకేముంది, ఇంగ్లీష్ వాడు చెప్పినట్టు రెస్టిజ్ హిస్టరీ. పతంజలికి ఇక్కడో కామా పెట్టి, కృష్ణంరాజు దగ్గరకి వస్తే గురజాడకి శిష్యుడు, చాసో కి అనుయాయి. పుట్టి పెరిగింది దివాణంలోనే అయినా, పేద ప్రజల పక్షాన కలం పట్టి కథలు రాసిన రచయిత.

కృష్ణంరాజు రాసినవి కేవలం పదహారు కథలే అయినా వాటికవే సాటి. ఈ మధ్య కాలంలో పునఃప్రచురణకి నోచుకోలేదీ కథలు. అయితే, 'ఈతరం కోసం కథాస్రవంతి' పేరిట ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ప్రచురిస్తున్న చిన్న కథల సంకలనాల్లో భాగంగా కృష్ణంరాజు రాసిన పన్నెండు కథలతో ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారు. పూసపాటి పేరు చెప్పగానే గుర్తొచ్చే 'దివాణం సేరీవేట,' 'సీతాలు జడుపడ్డది,' 'కుక్కుట చోరులు,' 'రెండు బంట్లు పోయాయి' తో పాటు మరో ఎనిమిది కథలు చదువుకోవచ్చు ఈ సంకలనంలో.

పుస్తకంలో మొదటి కథ 'మహారాజ యోగం' లో విశాఖపట్నంలో డిగ్రీ చదివే కుమార్రాజాకీ, అనుకోకుండా అతని బసకి వచ్చి,  అంత అనూహ్యంగానూ దూరమైన నాగులు అనే కుర్రవాడికి మధ్య అనుబంధాన్ని చిత్రించారు రచయిత. నాటి విశాఖ వాతావరణం, అడివిని తలపించే వాల్తేరు, ఇళ్లలోకి జొరబడే పాములు.. ఈ వాతావరణంలోకి పాఠకులని అలవోకగా తీసుకుపోయి అప్పుడు చెబుతారు నాగులు కథని. రెండో కథ 'దివాణం సేరీవేట.' కూలిపోడానికి సిద్ధంగా ఉన్న దివాణాల్లో ఉంటున్నా పౌరుషాల విషయంలో రాజీపడని రాజుల కుర్రాళ్ళు వేట చేసిన వైనాన్ని చదవాలంతే. (ఈ చిన్నకథకి విస్తృత రూపమే పతంజలి రాసిన 'రాజుగోరు.')


మూడోకథ 'సీతాలు జడుపడ్డది.' మూఢనమ్మకాల కారణంగా పేదవాళ్ళు ఎలాంటి మూల్యాలు చెల్లిస్తారో చెబుతుంది. అయితే, పుస్తకానికి ముందుమాట రాసిన డాక్టర్ చందు సుబ్బారావు ఈ కథని కొంచం అపార్ధం చేసుకున్నారేమో అనిపించింది. 'తెల్లరాజు-నల్లదొర,' 'సామంతం' కథలు రెంటికీ దౌర్జన్యమే కథా వస్తువు. స్వార్ధానికి, ప్రలోభానికి బలైపోయిన అక్కా చెల్లెళ్ళ కథ 'పేరంటాలు గుండం.' కాగా, 'దిగులు' కథలో చెదల్ని ప్రతీకగా తీసుకుని కథ నడిపిన తీరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక 'కుక్కుట చోరులు' కథ ఏకకాలంలో రెండు కథల్ని చదివిన అనుభూతిని ఇస్తుంది. ఒకటి రచయిత నేరుగా చెప్పిన కథ, రెండోది ప్రతీకాత్మకంగా చెప్పిన కథలో కథ.

రాచవారి వివాహ వేడుకల్ని కళ్ళకి కట్టే కథ 'రెండు బంట్లు పోయాయి.' చదరంగం బల్ల నేపధ్యంగా సాగే కథలో ఎత్తులూ, పై ఎత్తులూ ఆసాంతమూ ఊపిరి బిగపట్టి చదివిస్తాయి. 'దారితప్పినా.. మాట తప్పినా' గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వంశీకి నచ్చిన కథ. ఈ కథని అనుసరించి (అనుకరించి కాదు) చాలా కథలే రాశాడు వంశీ. వేట ఇతివృత్తంగా సాగే మరో కథ 'భూతాల స్వర్గం.' ఇది కూడా రెండు కథల కలగలుపు. సంపుటిలో చివరికథ 'గైరమ్మ' మీద చాసో కథ 'కుంకుడాకు' ప్రభావాన్ని కాదనలేం.

చాన్నాళ్ల తర్వాత పూసపాటి కృష్ణంరాజు రచనల్ని అచ్చులోకి తెచ్చిన అరసం వారికి అభినందనలు. మిగిలిన నాలుగు కథలకీ కూడా చోటిచ్చేస్తే సమగ్ర సంకలనం అయ్యేది కదా అనిపించింది కానీ, ప్రచురణకర్తలకి ఏవో పరిమితులు ఉండే ఉంటాయి. కథా సాహిత్యాన్ని ఇష్టపడేవాళ్లు తప్పక చదవాల్సిన సంకలనం ఇది. కథలు రాయాలనుకునే వాళ్ళైతే అధ్యయనం చేయాలి. ఎందుకంటే కృష్ణంరాజు శైలి, శిల్పం ప్రత్యేకమైనవి. అలాగే, ఏ రెండు కథలకీ పోలిక ఉండదు. ఆవేశపూరిత ప్రసంగాలూ, రాజకీయ ఎజెండాలు కనిపించవు. పేదవాళ్ల పట్ల రచయిత సహానుభూతి మాత్రం అడుగడుగునా కనిపిస్తుంది. (పేజీలు 111, వెల రూ. 50, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

6 కామెంట్‌లు:

  1. అరసం వాళ్ళకి ధన్యవాదాలు.. ఈ కబురందించిన మీక్కూడా. 'కుక్కుట చోరులు' నాకు చాలా ఇష్టమైన కథండీ. ఆ కథపై మీ విశ్లేషణ కోసం ఎదురుచూస్తుంటాను.

    రిప్లయితొలగించండి
  2. @కొత్తావకాయ: 'కుక్కుట చోరులు' గురించి రాయడం అంటే మూసిన గుప్పెటని తెరచి చూపించడం అవుతుందేమోనండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  3. నిజమే. పొడిగిస్తున్నానని అన్యధా భావించకండి కానీ.. కథ ఎలా చెప్పాలో ప్రయివేటు చెప్పేసే మాష్టార్లని చూస్తే, నాకు 'కుక్కుటచోరులు' లాంటి కథలు గుర్తొస్తాయి. అన్నట్టు, మీరు రాయాలనుకుంటే గుప్పిట తెరవరని నమ్మకం. :)

    రిప్లయితొలగించండి
  4. @కొత్తావకాయ: అయ్యో.. పొడిగించకూడదు అనేమీ లేదు కదండీ.. ప్రయివేట్లతో కథలు రాయడం వచ్చేస్తుందని నేననుకోనండీ.. ఆఫ్ కోర్స్, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి.. గుప్పెట తెరవకుండా, అర్ధమయ్యేలా చెప్పడం మరీ అంత సులువు కాదేమో అనిపిస్తుంది నాకు.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  5. Sorry, I haven't installed Telugu font.

    I like your blog posts about different Authors and their stories.
    Is there any possibility of ordering those books online?
    I don't live in India, so online is the only way for me.

    రిప్లయితొలగించండి
  6. @భరత్: ఆన్లైన్ లో అంటే, ఏవీకేఎఫ్, కినిగె సైట్స్ లో తెలుగు పుస్తకాలు కొనుక్కోవచ్చండీ.. ఆ సైట్స్ చూడండి ఒకసారి.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి