సోమవారం, జులై 18, 2016

జీవనయానం

అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య ఆత్మకథ 'జీవనయానం.' సుమారు రెండు దశాబ్దాలకి పూర్వం 'వార్త' దినపత్రిక ఆదివారం అనుబంధంలో రెండేళ్ల పాటు సీరియల్ గా ప్రచురితమైన ఈ రచన విశేషమైన పాఠకాదరణ పొందింది. దాదాపు అదే సమయంలో రంగాచార్య సమగ్ర సాహిత్యాన్ని సంపుటాలుగా వెలువరించే కృషిని ఆరంభించిన విశాలాంధ్ర ప్రచురణ సంస్థ ఈ ఆత్మకథనీ ప్రచురించి, ఇప్పటికి మూడు సార్లు పునర్ముద్రించింది. సంప్రదాయ కుటుంబంలో పుట్టి, వేద విద్యలు అభ్యసించిన రంగాచార్య నిజాం కి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయుధం పట్టడం ఒక వైచిత్రి. పట్టి చూస్తే ఆయన జీవితంలో ఇలాంటి వైచిత్రులకి లోటే లేదు.

దాశరథి వంశీయుల స్వస్థలం భద్రాచలం. అయితే, రంగాచార్య పూర్వీకులు కొన్ని కారణాలకి భద్రాద్రి విడిచి పెట్టేశారు. ఇప్పటి వరంగల్ జిల్లా మహబూబాబాద్ కి సమీపంలోని చిన్న గూడూరులో మొదలైంది రంగాచార్య బాల్యం. అటుపై తెలంగాణ లోని అనేక ప్రాంతాల్లో గడిపి, సికింద్రాబాదులో స్థిరపడ్డారు కుటుంబ సమేతంగా. తల్లిదండ్రుల మధ్య లోపించిన సఖ్యత కారణంగా, రంగాచార్య చిన్నతనంలోనే తండ్రి ఇల్లు విడిచి వెళ్ళిపోతే, అన్నయ్య కృష్ణమాచార్య కుటుంబ బాధ్యత భుజాన వేసుకున్నారు. అయితే, కృష్ణమాచార్య పోరాట మార్గం ఎంచుకుని జైలుకి వెళ్లడంతో యవ్వనారంభం లోనే కుటుంబ పోషణ బాధ్యత స్వీకరించాల్సి వచ్చింది రంగాచార్యకి.

'బోద్ధారో మత్సరగ్రస్తా: ప్రభవః స్మయదూషితాః అబోధోపహతాశ్చాన్నే జీర్ణమంగే సుభాషితమ్' అన్న భర్తృుహరి సుభాషితం తో ఆరంభమయ్యే ఈ పుస్తకం తెలంగాణ చరిత్రను వివరిస్తూ సాగి, దాశరధి వంశాన్ని పరిచయం చేసి, వందేళ్లనాటి తెలంగాణ పల్లెల స్వరూపాన్నీ, నిజాము అకృత్యాలనీ కళ్ళకి కడుతూ, ఆ కాలంలో ఆ ప్రాంతంలో తెలుగు భాష దీన స్థితినివివరిస్తూ రంగాచార్య కథలోకి తీసుకెళ్తుంది పాఠకులని. అక్కడినుంచీ కథనం అక్షరాలా పరుగందుకుంటుంది. ఏకబిగిన పూర్తి చేసి కానీ పుస్తకాన్ని పక్కన పెట్టడం అసాధ్యం. కుటుంబ పరిస్థితులు, చదువుకునే అవకాశాలు పెద్దగా లేకపోవడంతో చదువు కొనసాగించలేకపోయిన రంగాచార్య, నిజాం పాలనలో అన్యాయాన్ని ఎదిరించి కమ్యూనిస్టు అనిపించుకున్నారు.

"నిజానికి నేను ఇవాళ్టికీ ఏ పార్టీలోనూ సభ్యుణ్ణి కాను" అని సందర్భం వఛ్చిన ప్రతిసారీ చెప్పారు. నిజాం వ్యతిరేకతతో పాటు, ఏ పార్టీ మీద ప్రత్యేకమైన అభిమానం లేకపోవడం వల్లనే కావొచ్చు, తెలంగాణ సాయుధ పోరాట సందర్భంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చేసిన చారిత్రక తప్పిదాలని నిస్సంకోచంగా వివరించారు. ఆర్య సమాజం వంటి సంస్థల పనితీరునీ సునిశితంగా సమీక్షించారు. పోరాటం ముగిసి, నిజాం రాజ్యం భారతదేశంలో భాగమయ్యాక, ప్రయివేటుగా మెట్రిక్ పరీక్ష ఉత్తీర్ణులై ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన రంగాచార్య, తరువాతి చదువంతా ప్రయివేటుగానే సాగించారు. సికిందరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో అనువాదకుడిగా చేరి, ఉన్నత హోదాలో పదవీ విరమణ చేశారు.


ఓ వంక తెలంగాణ పోరాటాన్ని చిత్రించే 'చిల్లర దేవుళ్ళు,' 'మోదుగుపూలు' లాంటి నవలలు రాస్తూనే, మరోపక్క రామాయణ, భారత, భగవతాలని సరళమైన తెలుగులో వ్యాఖ్యానించారు రంగాచార్య. పన్నెండేళ్లవయసులో బాల్య వివాహం జరగడం, అటుపై దాదాపు పదేళ్ల తర్వాత కాపురం ఆరంభించడం తదనంతరం ఒడిడుకులు ఇవన్నీ ఎంతో ఆసక్తికరంగా చెప్పారు. అప్పుడే మొదలవుతున్న కన్యాశుల్క పద్ధతి మొదలు, కుటుంబంలో వచ్చిన చీలికలు వరకూ ఒకే ధోరణిలో చెప్పుకొచ్చారు.  రామాయణ మహా భారతాలని సిద్ధాంతాల చట్రాలనుంచి సమీక్షించే ఔత్సాహికులు ఎక్కడ పొరబడుతున్నారన్నదీ అంతే వివరంగా, కుండ బద్దలుకొట్టినట్టు చెప్పారు.

రంగాచార్యలో తిరుగుబాటు ధోరణి చిన్ననాటి నుంచీ ఉన్నదే. అది వయసుతోపాటు పెరిగిందే తప్ప తగ్గలేదు. పల్లెటూరి పోరాటాలు, ఉద్యోగ జీవితంలో చేసిన ఉద్యమాల మొదలు, అపౌరుషేయాలుగా పేరుపొందిన వేదాల తెనిగింపు వరకూ ఎన్నెన్నో ఉదాహరణలు జీవితపర్యంతం కనిపిస్తూనే ఉంటాయి. ఆత్మకథలో తప్పనిసరేమో అనిపించే ఆత్మస్తుతి, పరనింద అక్కడక్కడా ఎదురుపడతాయి. అలాగని, ధూమపానం మొదలు, మద్యపానం వరకూ తన అలవాట్లు వేటినీ దాచే ప్రయత్నం చేయలేదు. వాటిని మానుకున్న సందర్భాలని ప్రస్తావించక మానలేదు. ప్రత్యేకంగా గుర్తుండిపోయే అనేక విషయాల్లో మొదటిది అన్నతో అనుబంధం. ఎంతగా ప్రేమించి, గౌరవించారో,  సందర్భాన్ని బట్టి కృష్ణమాచార్య చర్యల్ని విమర్శించేందుకూ వెనుకాడలేదు. అలాగే తనని అభిమానించి, రచనలని ప్రోత్సహించిన వట్టికోట ఆళ్వార్ స్వామి, నార్ల చిరంజీవిల మీద అభిమానాన్నీ దాచుకోలేదు.

'చిల్లర దేవుళ్ళు' నవల గురించీ, మరీ ముఖ్యంగా 'వనజ' పాత్రని గురించీ చాలాసార్లే ప్రస్తావించారు. ఆ పాత్రకి రేడియాలో ప్రాణం పోసిన శారదా శ్రీనివాసన్, వెండితెరపై అభినయించిన కాంచన లను అభినందించారు. రంగాచార్య నవల 'మానవత' లో భిన్న మతాలకి చెందిన పాల్, జానకి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. నిజజీవితంలో రంగాచార్య చిన్న కొడుకు ప్రేమ వివాహం కారణంగా కొన్నేళ్ల పాటు కుటుంబానికి దూరం జరిగాడు!! జరిగినదాన్ని 'తల్లీ కొడుకులమధ్య ఘర్షణ' అంటారాయన. నిజాం వ్యతిరేక పోరాటాన్ని, తన జీవిత కథనీ పడుగు పేకలుగా అల్లిన అల్లిక పుస్తకాన్ని ఆసాంతమూ ఒకే రకమైన ఆసక్తితో చదివేందుకు దోహదం చేసింది. పుస్తకం పూర్తి చేసేసరికి ఏ ఒక్క జీవితాన్నో కాక, ఓ శతాబ్ద కాలపు సమాజ గతిని నిశితంగా పరిశీలించిన అనుభూతి కలుగుతుంది పాఠకులకి.

వైష్ణవ సంప్రదాయాల ప్రస్తావన మహామహోపాధ్యాయ తిరుమల రామచంద్ర ఆత్మకథ 'హంపీ నుంచి హరప్పా దాక..' ని జ్ఞాపకం చేసింది. రెండు కుటుంబాలూ ఆచార వ్యవహారాల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించేవే.. రెండూ కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా సర్దుబాట్లు చేసుకున్నవే. "మనం నిజాలు చెప్పకపోతే ముసలినక్క నిజాంని కొంత కాలానికి దేవుణ్ణి చేసేసే ప్రమాదం ఉంది" అంటూ ఒక సందర్భంలో రంగాచార్య తన మిత్రులతో అన్న మాట, తర్వాతి కాలంలో నిజమయ్యింది. ఆత్మకథల మీద ఆసక్తి ఉన్నవాళ్లు, తెలంగాణ పోరాట చరిత్రని తెలుసుకో గోరే వాళ్ళూ, వందేళ్ల కాలంలో తెలంగాణ ప్రాంతంలో వచ్చిన మార్పుని గురించి పరిశోధించాలనుకునే వాళ్ళూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఈ 'జీవనయానం.' (విశాలాంధ్ర ప్రచురణ, పేజీలు 508, వెల రూ. 300).

2 కామెంట్‌లు:

  1. గుండెని సూటిగా తాకే రచన.నాకు చాలా ఇష్టమైన నవల.తెలంగానాన్ని,తెలుగందాన్ని ,జీవితపు మకరందాన్ని కలబోసి పోతపోసిన సజీవ శిల్పం జీవనయానం.

    రిప్లయితొలగించండి
  2. @శశి: నవలలా అనిపించే ఆత్మకథ అండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి