మంగళవారం, ఫిబ్రవరి 18, 2014

అందని చందమామ - నాగమల్లిక

"అయితే ఆ స్వారోచిష మన్వంతరంలో స్త్రీ పురుషుల కందరికి స్వరోచి తల్లిదండ్రుల వలపుల తారుమారులే సంక్రమిస్తాయేమో! ఆ తరవాత కూడా మానవుల కొందరిలోనైనా ఆ సంప్రదాయాలలాగే స్థిరపడి పోతాయేమోనే" అంటూ స్నేహితురాలు హేమ చెవిలో ఛలోక్తి విసిరింది హరిణి. హేమకా ఛలోక్తి అర్ధం కాలేదు. అదే విషయాన్ని స్నేహితురాలికి చెప్పింది. "దీనిలో అర్ధం కానిదేమిటి? వలపొకచోట, మనువింకొక చోట. ఇంతకన్నా వేరే వింతయిన తారుమారేమిటే?" పొడుపు కథ విప్పింది హరిణి.

పెద్ద జబ్బు పడి కోలుకున్న బాలుడు స్వరోచి, స్వారోచిష మనువన్న ప్రపంచ ప్రఖ్యాత నామధేయంతో మన్వంతరాధిపతి కాగలడని రజతగిరి స్వామి అనుగ్రహించిన సందర్భంలో హరిణి, హేమల మధ్య జరిగింది ఈ సంభాషణ. స్వరోచి మరెవరో కాదు, ఈ ఇద్దరు గుమ్మల నెచ్చెలి వరూధినీ ప్రియ పుత్రుడు. వరూధిని అంటే, అల్లసాని పెద్దన ఘంటపు కొస నుంచి ఆవిర్భవించిన నాయికే.. ప్రవరాఖ్యుడిని మోహించి, భంగ పడిన ఆమె కథ లోక విదితమే కదా. అల్లసాని వారి వరూధినికి మరిన్ని వన్నెచిన్నెలు అద్ది, ఆమె ప్రేమకథని తనదైన శైలిలో ఆవిష్కరించారు పిలకా గణపతి శాస్త్రి తన 'అందని చందమామ' నవలికలో.

పిలకా వారి వరూధిని, ప్రవరుడిని వలపించుకుంది. తన దగ్గరే ఉండిపోయేలా ఒప్పించింది.. ప్రేమఫలంగా స్వరోచికి జన్మనిచ్చింది. ఆ తర్వాతే మొదలయ్యింది అసలు కథ. ఆ జంట మధ్యన దూరం పెరిగింది.. తల్లిదండ్రుల భవంతుల మధ్య తిప్పబడుతూ, బెంగతో జబ్బు పడుతూ, కోలుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు, ఆటపాటలతో కాలం గడపాల్సిన స్వరోచి. అదిగో, ఆ సందర్భంలోనే స్వరోచి భవిష్యత్తు ని గురించి తన ఆందోళనలని రజతగిరి స్వామి ముందుంచింది వరూధిని. ఆమెని ఓదార్చి, ఆ బాలుడి భవిష్యత్తు చెప్పారు స్వామి. అది విని, తన స్నేహితురాలితో పరాచికం ఆడింది హరిణి. హరిణి పరాచికం వెనుక ఆంతర్యం ఏమిటో తెలియాలంటే 'అందని చందమామ' చదవాల్సిందే.'


నందయశోదా నందనుడి లీలావినోదాల గురించి ఎంతోమంది కవులూ, రచయితలూ ఎన్నో గ్రంధాలు రచించారు. ఒక్కొక్కరిదీ ఒక్కో దృష్టి కోణం. ఎవరి శైలి, శిల్పం, రచనా చమత్కృతి వారిదే. రాసే వారికే కాదు, చదివే వారికీ తనివి తీరనివి శ్రీకృష్ణ లీలలు. బాల్య చాపల్యాలు వీడి, యవ్వనంలో అడుగుపెట్టిన కృష్ణుడు రేపల్లె పడుచులతో నెరపిన సరాగాలని ఇతివృత్తంగా తీసుకుని పిలకా గణపతి శాస్త్రి రాసిన నవలిక 'నాగమల్లిక.' "మల్లిక గుండె ఒక్కమారుగా జల్లుమన్నది. ఒకింత దూరంలో పిల్లనగ్రోవి పాట సన్నగా జాలిగా పిలుస్తున్నట్టు వినిపించింది" అన్న ప్రారంభ వాక్యాలతో అమాంతం కథలోకి తీసుకుపోయి, పాఠకులని రేపల్లె వీధుల్లో తిప్పి తీసుకు వస్తారు పిలకావారు.

ఒద్దికగా సంసారం చేసుకుంటున్న గోపవనిత మల్లిక. ఆమె భర్త నాగమణి, ఇద్దరు పిల్లలు చిత్ర, చిన్నారి. ఆలమందలు, వ్యవసాయంతో ఆనందంగా జీవితం గదిపెస్తున్నదా జంట. మల్లికది ప్రేమవివాహం. ఆమెని ఏరికోరి వివాహం చేసుకున్నాడు దగ్గరి బంధువు నాగమణి. కార్తీక పున్నమి నాడు, నిండు జాబిల్లి చుక్కలతో కలిసి కొండమీద కొలువు దీర్చి కూర్చోగానే గోపూజ జరుపుకుని, ఒక్కొక్క ఆవుచేత ఏటి నీరు తాగించి, రవ్వంత ఆలస్యంగా ఇల్లుచేరాడు నాగమణి. ఆ లోగానే, మల్లిక జీవితంలో ఊహించని మార్పు ఒకటి ప్రవేశించింది. ఫలితంగా ఏం జరిగింది? సంతోషంగా సాగిపోతున్న మల్లిక జీవితం ఏ మలుపు తిరిగింది? అన్నదే 'నాగమల్లిక' నవలిక.

కృష్ణలీలల్లో అంతగా చర్చకి రాని అంశాన్ని ఇతివృత్తంగా తీసుకోవడం ఒకరకంగా సాహసమే. నిజానికి ఈ నవలని గురించి విశేషంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది. కానైతే, అలా జరిగిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. రష్యన్ రచయిత చెహోవ్ కథ గురించి ఎక్కిరాల వేదవ్యాస తో జరిగిన ఒక చర్చ నుంచి ఈ నవలిక పుట్టింది అన్నారు గణపతి శాస్త్రి తన ముందుమాట లో. 'విశాల నేత్రాలు,' 'గృహిణి,' 'హేమపాత్ర-అశోక వర్ధనుడు,' 'కాశ్మీర పట్టమహిషి' పుస్తకాలని ప్రచురించిన ఎమెస్కో 'వారే 'అందని చందమామ' 'నాగమల్లిక' నవలలు రెంటినీ కలిపి ఒక సంకలనంగా విడుదల చేశారు.(పేజీలు 216, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

4 కామెంట్‌లు: