బుధవారం, ఆగస్టు 04, 2021

ఒక వైపు సముద్రం

కావేరి, కస్తూరి, మాధురి, గోదావరి ఈ  నలుగురూ అక్కాచెల్లెళ్లు. వీళ్ళకి ఒక తమ్ముడు మంజునాథ. కస్తూరి కూతురు రత్న, గోదావరి కూతురు సునంద. కస్తూరి ఆడపడుచు కొడుకు పురందర, ఇతను తన చిన్ననాడే తన తండ్రిని పోగొట్టుకున్నాడు. ప్రధానంగా కస్తూరి కుటుంబం, కొంచంగా కావేరి కుటుంబం పురందర చదువుకి సాయం చేస్తాయి. చదువు పూర్తవుతూనే మంజునాథ సాయంతో ఉద్యోగస్తుడవుతాడు పురందర. రత్నని పురందరకి ఇచ్చి పెళ్లి చేయాలని కస్తూరి సంకల్పం. అటు పురందర తల్లి, ఇటు కావేరి కూడా ఇది చాలా సహజమైన విషయంగానే భావిస్తారు. పురందర కాదంటాడని ఎవరూ అనుకోరు. ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకునే పరిస్థితులు కూడా అతనికి ఉండవు. 

ఇక పెళ్లి జరగడమే తరువాయి అనే సందర్భంలో, "పురందరని సునందకు ఎందుకు చేసుకోకూడదు?" అన్న ఆలోచన వస్తుంది గోదావరికి. వచ్చిన ఆలోచన ఆమెని నిలవనివ్వదు. పురందర సుగుణాలు ఇందుకు ఒక కారణమైతే, కస్తూరి కుటుంబం పట్ల గోదావరికి ఉన్న విముఖత మరో కారణం. కావేరితో కూడా సంప్రదించకుండా రహస్యంగా తన పని ప్రారంభిస్తుంది. అప్పటివరకూ కార్యసాధకురాలిగా పేరు తెచ్చుకున్న గోదావరి ప్రయత్నం ఏమైంది? తదనంతర పరిణామాలు ఆ కుటుంబాల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించాయో వివరించే నవలే 'ఒక వైపు సముద్రం.' వివేక్ శానభాగ కన్నడ నవల  'ఒందు బది కడలు' కి రంగనాథ రామచంద్రరావు తెలుగు అనువాదం. 

కావేరి ఇంటి పొరుగున ఉండే వితంతువులైన అత్తాకోడళ్లు పండరి-యమునల పెరట్లో నింపాదిగా మొదలయ్యే కథనం, ఒక్కో పాత్ర పరిచయంతోనూ వేగం పుంజుకుంటూ సగానికి వచ్చేసరికి పుస్తకం పూర్తి చేసి కానీ పక్కన పెట్టలేని బలహీనతకి లోనుచేస్తుంది పాఠకుల్ని. కథకి కేంద్రం కుటుంబ రాజకీయాలు అయినందువల్ల పాత్రల చిత్రణలో ఎంతో శ్రద్ధ చూపించారు రచయిత. కథలో ప్రధానమైన మలుపులన్నింటికీ కారణాలు చిన్నవే అయి ఉండడం, వాటిని రచయిత ఎంతో నేర్పుగా చెప్పడం నవల ఆసాంతమూ ఆశ్చర్య పరిచే విషయం. ఒక్క పురందర మాత్రమే కాక, చిన్నాపెద్దా పాత్రలన్నీ కూడా పాఠకులకి గుర్తుండిపోతాయి. పాత్రలు తీసుకునే నిర్ణయాలు - క్షణికావేశంలో తీసుకున్నవి కూడా - ఎక్కడా అసహజం అనిపించవు. 

ఉత్తర కర్ణాటక సముద్ర తీరంలోని గ్రామాలు, పట్టణాల్లో సాగే కథ ఇది. కథాకాలం ఇప్పటికి దాదాపు ఓ యాభై ఏళ్ళ క్రితానిది. పండరీబాయి కథా నాయికగా నటించిన కొత్త సినిమా విడుదలవ్వడం మినహా కథా కాలానికి సంబంధించి ఎలాంటి క్లూ ఇవ్వలేదు రచయిత. నిజానికి ఇది ఏ కాలంలో అయినా జరగడానికి అవకాశం ఉన్న కథే. ఒక చోటునుంచి మరో చోటికి వెళ్ళడానికి బస్సుతో పాటు పడవ ప్రయాణమూ తప్పనిసరి. ఒకపక్క కొండలు, మరోపక్క సముద్రం తాలూకు 'ఉక్కపోత' పాఠకులకి అనుభవమవుతుంది. నవల మొదటి సగంలో కథ పురందర చుట్టూ తిరిగినా, రెండో సగంలో ఎక్కువ భాగం అతని స్నేహితుడు యశవంత చుట్టూ తిరుగుతుంది. చదువు తర్వాత నాటకాల్లోకి వెళ్లిన యశవంతకి అక్కడ ఎదురయ్యే అనుభవాలు, నాటి కన్నడ నాటక సమాజాల పనితీరుని కళ్ళముందు ఉంచుతాయి. 

కేవలం పురందర, యశవంతలది మాత్రమే కాదు. నవల్లో ఒక్కో పాత్రదీ ఒక్కో కథ. ప్రతీ కథకీ ఆద్యంతాలు ఉంటాయి. కొన్ని కథల్లో ఇవి విశదంగా ఉంటే, మరికొన్ని కథల్లో క్లుప్తంగా ముగుస్తాయి. కన్నడనాటి సముద్రపు పల్లెటూళ్లలో జరిగే కథ అవ్వడం వల్ల అక్కడక్కడా 'మరల సేద్యానికి' గుర్తొస్తుంది. అయితే, ప్రాంతాలు మినహా, కథల్లో ఎక్కడా పోలిక లేదు. మధ్యతరగతి సమాజం పాటించే కొన్ని విలువలు, స్నేహాలు, బంధుత్వాలు, అంతర్వాహినిగా డబ్బు చూపించే ప్రభావం వీటన్నింటినీ చాలా నిశితంగా చిత్రించారు రచయిత. పురందర విషయానికి వస్తే, కేవలం డబ్బు మాత్రమే కాదు, చిన్నప్పటి నుంచీ పరాయి పంచన, మరొకరి దయా దాక్షిణ్యాలతో పెరిగిన వాడు అవ్వడం వల్ల ఆత్మగౌరవమూ ముఖ్యమైన విషయమే. కష్టపడి ఓ జీవితాన్ని నిర్మించుకున్నాక "ఇంతకీ నేను సాధించింది ఏమిటి?" అన్న విచికిత్సలో పడతాడు. 

అనువాదం చాలావరకు సరళంగానే సాగింది. పాత్రలు. ప్రాంతాల పేర్లు, హాస్య సన్నివేశాలు మినహా మిగిలిన నవలంతా తెలుగు కథ చదువుతున్న భావననే కలిగించింది. "ఈ కథ జరిగేది ఉత్తర కన్నడ జిల్లాలో. కడలి తీరంలోని ఈ జిల్లాలో అనేక నదులు ప్రవహించి సముద్రాన్ని చేరతాయి. సముద్రాన్ని చేరే చోటు దూరం నుంచి శాంతంగా, మనోహరంగా కనిపించినా, ఆ సంగమం మధ్యకు వెళ్లి చూసినప్పుడే నది సాగరాన్ని చేరేటప్పటి కోలాహలం కనిపిస్తుంది. అదేవిధంగా మార్పులతో పోరాడుతున్న ఇక్కడి జీవితాలూ!" అన్నారు వివేక్ శానభాగ తన ముందుమాటలో. ఛాయ రిసోర్స్ సెంటర్ ప్రచురించిన ఈ 253 పేజీల నవల వెల  రూ. 180. ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఆన్లైన్ లోనూ కొనుగోలు చేయవచ్చు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి