గురువారం, సెప్టెంబర్ 21, 2017

సిద్ధాంతి

"పంచాంగానికేం ఈ వెధవ పల్లిటూర్లో? సిద్ధాంతి ఆడింది ఆటా. పాడింది పాటా. యంత ద్రోహం చేశాడయ్యా సిద్ధాంతి?" అంటూ సిద్ధాంతి మీద చిందులు తొక్కుతాడు రామప్పంతులు - లుబ్దావధాన్లు పెళ్లి కోసమని తాను పెద్దిపాలెం వెళ్లి లౌక్యుల్ని పిలుచుకుని వచ్చేసరికే ఆ పెళ్ళి కాస్తా అయిపోవడం చూసి. తెల్లవారి నాలుగు ఘడియలకి ముహూర్తమని చెప్పిన సిద్ధాంతి, రామప్పంతులు అటు వెళ్ళగానే శుభ ముహూర్తాన్ని నాలుగు ఘడియల రాత్రి ఉందనగాకి మార్చేసి, మాయగుంటతో లుబ్ధావధాన్లుకి పెళ్లి జరిపించేసి, గుంటూరు శాస్త్రులు వేషంలో ఉన్న కరటక శాస్త్రిని 'కన్యాశుల్కం' తో సహా ఊరి పొలిమేర దాటించేస్తాడు. ఆ శుల్కంలో సగం వాటా తనకి ఇచ్చేలా గుంటూరు శాస్త్రులుతో ఒప్పందం కుదుర్చుకున్నాకే, లుబ్దావధాన్లుకి సుబ్బితో జరగాల్సిన పెళ్లిని రద్దుచేసి, మాయగుంటతో స్థిరపరుస్తాడు రామప్పంతులు.

పంతులు చెప్పినట్టుగానే రామచంద్రపురం అగ్రహారంలో సిద్ధాంతి ఆడింది ఆట, పాడింది పాట. కాబట్టే, ఆ సిద్ధాంతినే అడ్డం పెట్టుకుని వృద్ధుడైన లుబ్ధావధాన్లుని పెళ్ళికి ఒప్పిస్తాడు రామప్పంతులు, తన లౌక్యప్రజ్ఞని అంతటినీ వినియోగించి. "మన సిద్ధాంతిని దువ్వేటప్పటికి వాడేం జేశాడనుకున్నావు? లుబ్ధావధాన్లు జాతకం యగాదిగా చూసి శీఘ్రంలో వివాహ యోగవుందన్నాడు. ఆ వివాహం వల్ల ధనయోగవుందన్నాడు. దాంతో ముసలాడికి డబ్బొస్తుందన్న ఆశ ముందుకీ, డబ్బు ఖర్చవుతుందన్న భయం వెనక్కీ లాగడం ఆరంభించింది," అంటూ నాటకం తృతీయాంకంలో లుబ్దావధాన్లుని పెళ్ళికి ఒప్పించిన వైనాన్ని రామప్పంతులు మధురవాణితో చెబుతున్నప్పుడు మొదటిసారిగా సిద్ధాంతి ప్రస్తావన వస్తుంది. పంతులు ప్రలోభానికి లొంగి, జాతకంలో వివాహ యోగాన్ని కల్పించినప్పుడే సిద్ధాంతి ఎలాంటివాడన్నది తెలిసిపోతుంది.

అదే అంకం తర్వాతి సన్నివేశంలో, మాయగుంట వేషంలో ఉన్న మహేశాన్ని తీసుకుని, గుంటూరు శాస్త్రులు వేషంలో వచ్చిన కరటక శాస్త్రి తన పథకాన్ని మధురవాణికి వివరంగా చెప్పినప్పుడు కూడా, "మా పంతులు వక్కడివల్లా ఈ పని కానేరదు" అంటుంది మధురవాణి. ఇంకా ఎవరెవరి సహాయం అవసరమవుతుందో చెబుతూ, సిద్ధాంతిని చూసి అతనికో రెండు కాసులిస్తానని చెప్పమని సలహా ఇస్తుంది. "ఈ పనికి సిద్ధాంతే కీలకం" అని హెచ్చరిస్తుంది కూడా. సరిగ్గా రామప్పంతులు మాయగుంటని లుబ్దావధాన్లుకి పరిచయం చేసే సన్నివేశంలోనే సిద్ధాంతి ప్రవేశిస్తాడు నాటకంలోకి. వస్తూనే, "యవరు మావా ఈ పిల్ల?" అని లుబ్దావధాన్లునే వాకబు చేసి, "భాగ్య లక్షణాలేం పట్టాయీ ఈ పిల్లకీ.. విశాలమైన నేత్రాలూ, ఆ కర్ణాలూ, ఆ ఉంగరాలు జుత్తూ.." అంటూ ఆరంభించి, ఆ పిల్ల (పిల్లాడు మహేశం) చేయి అందుకుని "ఏ అదృష్టవంతుడు ఈ పిల్లని పెళ్లాడాడో కానీ.." అంటూ అర్ధోక్తిగా ఆగుతాడు.

'భాగ్యలక్షణాలు' అన్న మాట పిసినారి లుబ్ధావధాన్లుకి కర్ణపేయమని బాగా తెలుసు సిద్ధాంతికి. పైగా, మాయగుంట విషయం తనకేమాత్రం తెలియదని చెప్పడానికన్నట్టు, ఆ పిల్లకి పెళ్ళయిపోయిందేమో అన్న - ఏమాత్రమూ అతకని - అనుకోలు ఒకటి వినిపిస్తాడు. "యింకా పెళ్లి కాలేదండీ" అని రామప్పంతులు అనడమే తరువాయిగా, "మీరు పెళ్లి చేసుకోవాలని ఉంటే ఇంతకన్నా అయిదోతనం, అయిశ్వర్యం, సిరీ, సంపదా గల పిల్ల దొరకదు" అంటూ కవిత్వంలోకి దిగడమే కాదు, ఆ పిల్ల చెయ్యి చూసి "ఇది సౌభాగ్య రేఖ. ఇది ధన రేఖ. పంతులూ! భోషాణప్పెట్టెలు వెంటనే పురమాయించండి" అంటున్నప్పుడు, వింటున్న లుబ్దావధాన్లు మనసు వెయ్యిగంతులు వేసే ఉంటుంది. అక్కడితో ఆగలేదు సిద్ధాంతి, "యేదీ తల్లీ, చెయి తిప్పూ. సంతానం వొకటి, రెండు, మూడు.." ... పెళ్ళిచేసుకుంటే వారసుణ్ణి కనొచ్చని ఆశ పడుతున్న లుబ్దావధాన్లుకి అంతకన్నా కావాల్సింది ఏముంది?

"పోలిశెట్టి కూతురికి ప్రసవం అవుతూంది. జాతకం రాయాలి" అని నిష్క్రమించబోతూ, రామప్పంతులుని చాటుకి తీసుకెళ్లి మాట్లాడతాడు సిద్ధాంతి. రామప్పంతులే పెళ్లికొడుకనుకుని "రేపటి త్రయోదశి" ని ముహూర్తంగా నిర్ణయించేశాడు ఇంతకీ. అక్కడికీ, "ఆరోజు ముహూర్తం లేదే?" అని అవధాన్లు సందేహ పడితే, "శుభశ్య శీఘ్రం. ద్వితీయానికి అంత ముహూర్తం చూడవలసిన అవసరం లేదు" అని తొందరపెడతాడు రామప్పంతులు. గుంటూరు శాస్త్రులుకి దక్కబోయే పన్నెండు వందల రూపాయల కన్యాశుల్కంలో సంగోరు వాటా తనదే అన్న ఆశ పంతుల్ని పరుగెత్తించింది. ఇక పెళ్లి వేడుకలో హడావిడంతా సిద్ధాంతిదే. రామప్పంతులు అలా పెద్దిపాలెం బయలుదేరగానే, ముహూర్తం ముందుకు జరిగిన విషయం బయట పెట్టి ఆడవాళ్ళని తొందరపెట్టడం మొదలు, ఊళ్ళో బ్రాహ్మలందరినీ పిలిచేయడం వరకూ అన్నీ తానే అవుతాడు.

"పంతులు లేకుండా లగ్నం అయితే" అని సందేహిస్తున్న లుబ్దావధాన్లుని " పంతులుకా, మీకా పెళ్లి? జంకవోడక స్నానం కానీయండి" అని అతగాణ్ణి కోప్పడే చనువు సిద్ధాంతి సొంతం. రామప్పంతులు తిరిగొచ్చి, తనకి జరిగిన మోసం తెలుసుకుని, ఒళ్ళు తెలియని కోపంతో పెళ్లికూతురు రెండో పెళ్లి పిల్లన్న ప్రచారం మొదలుపెట్టినప్పుడు, గట్టిగా అడ్డుకున్నవాడు సిద్ధాంతే. పంతుల్ని రెక్క పట్టి నిలబెట్టడమే కాదు, తన్నేందుకు కూడా సిద్ధ పడతాడు. అటుపైని, పంతులుకి లాభించే మాట చెప్పి శాంతింపజేస్తాడు. సిద్ధాంతి మళ్ళీ కనిపించేది, మధురవాణి ఇంట్లో జరిగే పేకాట సన్నివేశంలోనే. మధురవాణి మీద ఆశు కవిత్వం చెప్పిన పూజారి గవరయ్యని మెచ్చుకుని, గవరయ్య మీదే అప్పటికప్పుడు పద్యమల్లి తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తాడు. పేకాట సాగుతూ ఉండగానే రామప్పంతులు తిరిగి రావడంతో, పెరటిదారిలో గోడ గెంతి పారిపోడానికి గాజుపెంకులు అడ్డమని బాధపడతాడు.అటుపైని, సిద్ధాంతి మళ్ళీ కనిపించడు నాటకంలో.

మాయగుంట ఖూనీ కేసులో అందరినీ సాక్షులుగా వేసిన పోలీసులు, పెళ్లి చేసిన సిద్ధాంతిని వదిలేశారెందుకో మరి. జ్ఞానం అనే ముసుగు వేసుకుని, అబద్ధాలతో జీవితం గడిపే మనుషులకి మహ చక్కని ఉదాహరణ సిద్ధాంతి. శాస్త్రాన్నీ, శాస్త్రంలో అతని జ్ఞానాన్ని నమ్మిన వాళ్ళని మోసం చేస్తూ వచ్చిన సిద్ధాంతికి, ఏమాత్రం శాస్త్ర జ్ఞానం ఉందన్నది ప్రశ్నార్థకం. జాతకం పేరుతో కవిత్వం అల్లేసి, మాయగుంట పెళ్లి అనే కార్యాన్ని గట్టెక్కించడంతో పాటు, నాలుగు రాళ్ళ సంపాదనతో తన పబ్బం గడిపేసుకున్న ఈ లౌక్యుడి తాలూకు వారసులు, ఇప్పటికీ అనేక రూపాల్లో తిరుగాడుతూ ఉండడం అసలైన విషాదం.

2 కామెంట్‌లు:

  1. సాక్ష్యులు..... మురళి గారూ, మీరు కూడానా! :(

    రిప్లయితొలగించండి
  2. @పురాణపండ ఫణి: Corrected, thank you. ఇంకా ఉన్నాయండీ, సిరీస్ పూర్తయ్యాక మొత్తం ఓసారి చూడాలి.

    రిప్లయితొలగించండి