బుధవారం, సెప్టెంబర్ 20, 2017

వెంకమ్మ

చదువుకీ, లోకజ్ఞానానికీ సంబంధం లేదు అనడానికి ఉదాహరణ వెంకమ్మ. ఆమె చదువుకోలేదు. కానీ లోకం పోకడని ఆకళింపు చేసుకుంది. తన భర్త ఎంతటి మూర్ఖుడో ఆమెకి బాగా తెలుసు. అతడితో కాపురం చేస్తూనే తనకి కావాల్సినవి సాధించుకుంది. కొడుకుని ఇంగ్లీషు చదివించడం కావొచ్చు, చిన్న కూతురి పెళ్లి సంబంధాన్ని తప్పించడం కావొచ్చు.. అన్నీ వెంకమ్మ ఇష్టప్రకారమే జరుగుతాయి చివరికి. అమాయకపు గృహిణిలా కనిపిస్తుంది కానీ ఆమె కార్యసాధకురాలు. మాట్లాడేది తక్కువే అయినా, ఆమె మాటలు సూటిగానూ, స్పష్టంగానూ ఉంటాయి. 'కన్యాశుల్కం' నాటకంలో కేవలం రెండు అంకాల్లో మాత్రమే కనిపించే వెంకమ్మ, కృష్ణరాయపురం వాసి అగ్నిహోత్రావధానులుకి ఇల్లాలు. బుచ్చమ్మ, వెంకటేశం, సుబ్బిలని కన్నతల్లి. వెంకటేశాన్ని పట్టుపట్టి ఇంగ్లీషు చదువులకోసం పట్నం పంపింది వెంకమ్మే.

అసలు వెంకటేశం ఇంగ్లీషు చదువులు ఎందుకు చదువుకోవాలి? చదివి ఏమి సాధించాలి? ఈ ప్రశ్నలకి కచ్చితమైన జవాబులున్నాయి వెంకమ్మ దగ్గర. "మీలాగే వాడూ జంఝాలు వొడుక్కుంటూ బతకాలని ఉందా యేవిఁటి?" అని భర్తని నిలదీస్తుంది, అతగాడు కొడుకు చదువుకి జరుగుతున్న, జరగబోయే ఖర్చు లెక్కలు, వాటితాలూకు పరిణామాలూ ఆలోచిస్తున్నప్పుడు. వేదం ఎనభై రెండు పన్నాలూ ఒక్క దమ్మిడీ పుస్తకాల ఖర్చు లేకుండా చదువుకున్న అగ్నిహోత్రావధానులుకి, ఇంగ్లీషు చదువుల్లో ఏడాదికి పదిహేనురూపాయలు (నూటపాతికేళ్ల క్రితం) పుస్తకాల కింద ఎందుకు ఖర్చు చెయ్యాలో ఏమాత్రం అర్ధం కాదు. కానీ, రాబోయే ప్రయోజనాలని ఊహిస్తున్న వెంకమ్మకి అదేమీ పెద్ద మొత్తం కాదు. "మీకంత భారవంతోస్తే మావాళ్లు నాకు పసుపూకుంకానికీ ఇచ్చిన భూవమ్మే కుర్రాడికి చదువు చెప్పిస్తాను" అని కచ్చితంగా చెబుతుంది.

ఆ పల్లెటూరి గృహిణికి ఇంగ్లీషు చదువుమీద ఎందుకంత మోజు? ఎందుకంటే, ఆమెకి చదువు లేకపోయినా లోకం పోకడ మీద మంచి అవగాహన ఉంది. మొన్నమొన్నటివరకూ తన వాకిట్లో జుట్టు విరబోసుకుని గొట్టికాయలాడిన నేమాని వారి కుర్రాడికి ఇంగ్లీషు  చదువుకోవడం వల్లే మునసబీ అయ్యింది. తన కొడుకు ఆపాటి ఉద్యోగం సాధించలేకపోడని ఆవిడకి గట్టి నమ్మకం. అందుకే, ఖర్చుకి వెరవొద్దని ఒకటికి పదిసార్లు చెబుతుంది భర్తతో. పైగా, పెట్టిన ఖర్చు పిల్లా పాపలతో తిరిగొస్తుందని కూడా బాగానే తెలుసు. "మనవాడికో మునసబీ ఐనా, పోలీసు పనైనా అయితే రుణాలిచ్చి ఈ అఘ్ఘురారం భూవులన్నీ కొనేస్తాడు.." అదీ సంగతి. భూముల్ని తనఖా పెట్టి అప్పు తీసుకుని, ఆ బాకీ తీర్చలేక అప్పిచ్చిన వాళ్ళకే భూములు అమ్ముకుని చెల్లు చేసుకోవడం నాటి పధ్ధతి. కొడుకు తన సంపాదనతో అగ్రహారీకులకి అప్పులిచ్చి, భూములన్నీ సొంతం చేసేసుకుంటాడన్నది వెంకమ్మ ఆలోచన.

అంతమాత్రాన, వెంకమ్మకి కొడుకు మీద ప్రేమ లేదనుకుంటే పొరపాటు. "యీ చదువుల కోసవని పిల్లవాణ్ణి వొదులుకుని వుండడం, వాడు పరాయి వూళ్ళో శ్రమదమాలు పడుతూండడం. నా ప్రాణాలు ఎప్పుడూ అక్కణ్ణే వుంటాయి," అంటుంది గిరీశంతో. డబ్బంటే ఎన్నడూ వెనక చూళ్ళేదని చెబుతూనే, "మేం కనడం మట్టుకు కన్నాం. మీరే వాడికి తల్లీ తండ్రీని. యల్లా కడుపులో పెట్టుకుని చదువు చెబుతారో మీదే భారం" అంటూ అప్పగింత పెడుతుంది. గిరీశం కాకుండా, మరెవరైనా సరైన గురువు దొరికి ఉంటే, వెంకటేశం తల్లి కోరుకున్నట్టే చదువులు చదివి ఆవిడ కలలు నెరవేర్చి ఉండేవాడేమో. "మా అబ్బాయీ మీరూ ఒక్క పర్యాయం యింగిలీషు మాట్లాడండి బాబూ," అని గిరీశాన్ని ఎంతో ఆదరంగా అడుగుతుంది వెంకమ్మ. ఇలాంటిదేదో జరగొచ్చని ముందే ఊహించిన గిరీశం, శిష్యుణ్ణి అందుకు తయారుచేసి ఉంచుతాడు.

వెంకమ్మకి ఇంగ్లీషు రాకపోవడం చేత, తనకొడుకు జంకూగొంకూ లేకుండా దొరలభాష మాట్లాడేయడం చూసి ఎంతో ముచ్చట పడుతుంది - ఏం మాట్లాడుతున్నాడో ఏమాత్రం తెలియకపోయినా. కొడుకు చదువొక్కటే కాదు, ఆడపిల్లల కష్టమూ తెలుసామెకి. పెద్దకూతురు బుచ్చమ్మని ముదుసలి వరుడికి ఇచ్చి పెళ్లి చేయడంతో కొద్దికాలానికే వితంతువై పుట్టింటికి తిరిగి వస్తుంది. చిన్నకూతురికి అదే కష్టం రానివ్వకూడదని నిశ్చయించుకుంటుంది వెంకమ్మ. భర్త ఎవరిమాటా వినని వాడు కాబట్టి, తాను చేయగలిగేది ఏదీ లేదని చేతులు ముడుచుకుని కూర్చోదు. లుబ్ధావధాన్లుతో సుబ్బి పెళ్లి జరక్కుండా చూడడానికి తన పరిధిలో ఏం చేయగలదో ఆలోచిస్తుంది. తన ఒక్కదానివల్లా జరిగే పని కాదని గ్రహించి అన్నగారు కరటక శాస్త్రి మీద కార్యభారం మోపుతుంది.

ఎట్టి పరిస్థితిలోనూ సుబ్బి పెళ్లి జరిపి తీరాలని అగ్నిహోత్రావధానులు పట్టుపట్టుకుని కూర్చోవడంతో, ఆ పెళ్లిని ఆపడం కోసం ప్రాణత్యాగానికి సిద్ధ పడుతుంది వెంకమ్మ. పెరట్లో ఉన్న నూతిలో దూకేస్తుంది. గిరీశం ఆమెని రక్షించి, "మీ అత్తగారు సాక్షాత్తూ అరుంధతి వంటివారు. మనలో మనమాట, ఆమెకి ఈ సంబంధం ఎంతమాత్రమూ యిష్టము లేదు. పుస్తె కట్టే సమయమందు, మీ ఇంటి నూతులో పడి ప్రాణత్యాగం చేసుకుంటానని యిరుగుపొరుగమ్మలతో అంటున్నారు" అంటూ లుబ్ధావధాన్లుకి ఉత్తరం రాస్తాడు. అదే గిరీశం, వెంకటేశంతో "నూతులో పడడం గీతులో పడడం నాన్సెన్స్. ఓ రెండు తులాల సరుకోటి మీ నాన్న చేయించి యిచ్చాడంటే మీ అమ్మ ఆ మాట మానేస్తుంది" అనేస్తాడు సులువుగా. అంతవరకే వస్తే, వెంకమ్మ ప్రాణత్యాగానికే సిద్ధపడి ఉండేది అనిపిస్తుంది, ఆమె పట్టుదలని పరిశీలించినప్పుడు.

'కన్యాశుల్కం' నాటకంలోని స్త్రీపాత్రల్లో భర్తచాటు భార్య వెంకమ్మ ఒక్కర్తే. పైగా, ఆ భర్త అక్షరాలా మూర్ఖప గాడిద కొడుకు. అతగాడితో సంసారాన్ని నిర్వహించుకుని వస్తూ, కొడుకుని ప్రయోజకుణ్ణి చేయడానికీ, పెద్ద కూతురి విషయంలో చేసిన పొరపాటు,  చిన్నపిల్ల విషయంలో జరక్కుండా చూడడానికీ కంకణం కట్టుకుంది. అన్నగారి మద్దతూ, పుట్టింటి ఆస్తి తాలూకు దన్నూ ఉన్నప్పటికీ, పెళ్లి నుంచి బయటకు రాలేని కాలంలో, ఆ వయసులో, సంసారనిర్వహణకి ఆమె ఎంత కష్టపడి ఉంటుందన్నది ఇప్పటి ఊహకి అందదు. ఆరో అంకంలో బుచ్చమ్మ గిరీశంలో లేచి వెళ్లిపోయిందని తెలిసినప్పుడు వెంకమ్మ పైకేమీ మాట్లాడదు. కానీ, లోపల్లోపల కూతురు చేసిన పనిని మెచ్చుకుని, అందుకు సంతోషించే ఉంటుంది బహుశా. ఆ నాటి వరకూ బుచ్చమ్మని "రొమ్ము మీద కుంపటల్లే" భరించింది ఆమే మరి. కుటుంబంలో తల్లి ఎలా ఉండాలో చెప్పే నిలువెత్తు ఉదాహరణ వెంకమ్మ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి