గురువారం, నవంబర్ 24, 2016

పెళ్లి - ప్రదర్శన

వయసొచ్చిన పిల్లలకి తగిన  సంబంధం చూసి పెళ్లి చేయడం అన్నది చాలామంది తల్లిదండ్రులకి బాధ్యత. అతి కొద్దిమంది తల్లిదండ్రులకి మాత్రం పరపతిని ప్రదర్శించుకునేందుకు దొరికే అవకాశం. పారిశ్రామిక, సినీ, రాజకీయ రంగాల్లో ఉన్నవాళ్లకి తక్కువ సమయంలో ఎక్కువ మొత్తాలు సంపాదించుకునే అవకాశం ఉంటుందన్నది బహిరంగ రహస్యం. వాళ్ళు చేసే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండడాన్ని మనం చూస్తూనే ఉంటాం. రాజకీయనాయకులు ఎన్నికల సమయంలో భారీగా సొమ్ము వెదజల్లితే, మిగిలిన రెండు వర్గాలూ పెళ్లిళ్లు, వేడుకలకి బాగా ఖర్చు చేస్తూ ఉంటాయి.

నిన్నమొన్నటి వరకూ పెళ్లిళ్ల ఖర్చు విషయంలో రాజకీయ నాయకులు వెనకడుగు వేసేవాళ్ళు.. మరీ బయటపడిపోవడం ఎందుకని కావొచ్చు. ఎప్పుడైతే పబ్లిగ్గా డబ్బిఛ్చి ప్రజల నుంచి ఓట్లు కొనుక్కోడాలు, అలా గెలిచిన నాయకులని రాజకీయ పార్టీలు పెద్దమొత్తాలు చెల్లించి టోకున కొనుగోలు చేయడాలు - కొండొకచో కేసుల బారిన పడడాలు - లాంటివి నిత్యజీవితంలో భాగం అయిపోయాయో, హోదాని, దర్జాని చూపించుకుని విషయంలో రాజకీయ నాయకులు సైతం వెనకడుగు వేయడంలేదు. అలాంటి నాయకుల ఇళ్లలో జరుగుతున్న పెళ్లిళ్లు ఇప్పుడు హాట్ టాపిక్. జాతీయ స్థాయిని దాటేసి, అంతర్జాతీయ వార్తలుగా మారిపోయాయి ఆ వేడుకలు.

కాంగ్రెస్, బీజీపీ నాయకుల ఆశీస్సులతో, అండదండలతో వ్యాపారిగా ఎదిగి, రాజకీయనాయకుడిగా మారి కన్నడ రాజకీయాలని శాసించే స్థాయికి చేరుకున్న తెలుగువ్యక్తి గాలి జనార్దన రెడ్డి తన కుమార్తె బ్రాహ్మణి వివాహాన్ని బెంగళూరులో జరిపించారు గతవారం. పోలీసు కానిస్టేబుల్ కొడుకుగా జీవితాన్ని మొదలుపెట్టి, బళ్ళారి ప్రాంతంలోని ఇనుప గనులపై గుత్తాధిపత్యం సాధించడం ద్వారా తక్కువ కాలంలో వేలకోట్లు కూడబెట్టి, అక్రమాలు బయటపడడంతో జైలుకి వెళ్లి, బెయిలుపై బయటికి వఛ్చిన జనార్దన రెడ్డి కూతురి పెళ్లి నిమిత్తం ఖర్చు చేసిన మొత్తం ఐదొందల కోట్ల పైచిలుకు అంటున్నాయి ప్రసార సాధనాలు.

కేసుల కారణంగా తాను బెంగుళూరు విడిచి వెళ్ళకూడదు కాబట్టి, తన స్వస్థలం బళ్లారిని బెంగుళూరు పేలస్ గ్రౌండ్స్ లో సృష్టించుకున్నారు జనార్దన రెడ్డి. శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని గుర్తుచేసేలా వేయించిన భారీ సెట్లలో, రాచరికపు పద్ధతుల్లో జరిగిన వివాహం తాలూకు వీడియోలిప్పుడు యూట్యూబు లో అత్యధిక వ్యూయర్షిప్ దిశగా దూసుకుపోతున్నాయి.ఈ 'మైనింగ్ కింగ్' ని దక్షిణ భారతదేశంలో ఇంత భారీ స్థాయిలో పరపతిని ప్రదర్శించిన రెండో రాజకీయనాయకుడని చెప్పాలి. కొన్నేళ్ల క్రితమే పెంపుడు కొడుకు సుధాకరన్ పెళ్లిని ఇంత వైభవంగానూ జరిపి వార్తల్లో నిలిచారు - సినిమాల నుంచి రాజకీయాలకి వఛ్చిన - తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలిత.

ఇక, గడిచిన వారం రోజుల్లో తెలంగాణలో ఒకటి, ఆంధ్రప్రదేశ్ లో ఒకటి ఖరీదైన వివాహాలు జరిగాయి, రెండూ కూడా అధికారానికి దగ్గరగా ఉన్న నేతల కుటుంబాల్లోనే. రెండు చోట్లా పదుల కోట్లలో సొమ్ము ఖర్చు చేశారని వినికిడి. ఓ పక్క పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశవ్యాప్తంగా సామాన్యులు బ్యాంకులలో దాచుకున్న కష్టార్జితాన్ని డ్రా చేసుకోడానికి ఇబ్బందులు పడుతుండగా, రాజకీయ నాయకులు డబ్బును నీళ్ల ప్రాయంగా ఖర్చు చేయడాన్ని 'పారడాక్సికల్' అన్న మాటతో సరిపుచ్చేయాలా? చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని ఎదురు చూడాలా? లేక, చట్టాల్లో లొసుగులు పూడ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతాయని ఆశించవచ్చా?

'భారతదేశంలో సంపద పెరుగుతోంది..దానితో పాటే ధనిక, పేద మధ్య అంతరాలూ పెరుగుతున్నాయి' అన్నది ఆర్ధిక వేత్తలు గత రెండు దశాబ్దాలుగా విశ్లేషించి చెబుతున్న విషయం. మొత్తం దేశ సంపదలో యాభై శాతానికి పైబడి కేవలం పది శాతం జనాభా దగ్గర పోగుపడి ఉందంటున్నారు ఎకనామిస్టులు. పెళ్లిళ్ల పేరిట జరుపుతున్న సంపద ప్రదర్శనలు సామాజిక అంతరాలని పెంచి పోషిస్తాయనడంలో సందేహం లేదు. 'ఏం చేసైనా డబ్బు సంపాదించడం ముఖ్యం.. డబ్బుంటే చట్టం ఏమీ చేయలేదు' అన్న సంకేతాలని సమాజంలోకి పంపే ప్రమాదమూ ఉంది. కొందరి వినోదం, సామాజిక విషాదానికి దారితీయకూడదు కదా...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి