బుధవారం, జులై 20, 2016

'శారద' నవలలు

వామపక్ష భావజాలం కలిగిన మిగిలిన రచయితల రచనలకన్నా, 'శారద' కలంపేరుతో తెలుగులో కథలూ, నవలలూ రాసిన ఎస్. నటరాజన్ రచనలు భిన్నంగా ఉంటాయి. మెజారిటీ రచయితలు పేదరికాన్నీ, పేదల కష్టాలనీ ఊహించి రాస్తే, నటరాజన్ వాటన్నింటినీ స్వయంగా అనుభవించి రాశారు. అందుకే కావొచ్చు, 'గొప్పవాళ్లందరూ చెడ్డవాళ్ళు.. పేదవాళ్లందరూ బహు మంచివాళ్ళు' అనే సూత్రీకరణ ఈ తమిళుడైన తెలుగు రచయిత కథల్లోనూ, నవలల్లోనూ కూడా కనిపించదు. ఆరవ దేశంలో పుట్టి, పదమూడేళ్ల వయసులో పొట్ట చేతపట్టుకుని తెనాలికి వలస వఛ్చి, హోటల్ కార్మికుడిగా పనిచేస్తూనే తెలుగు నేర్చుకుని, సాహిత్యం చదివి, తనదైన ముద్రతో రచనలు చేసిన శారద ముప్ఫయిరెండేళ్ల వయసులోనే లోకాన్ని విడిచి వెళ్లిపోవడం, అతని కుటుంబానికే కాదు, తెలుగు సాహిత్యానికే పెద్ద లోటు.

నటరాజన్ ఈ లోకాన్ని విడిచిన అరవయ్యేళ్ళ తర్వాత, అతని రచనలన్నీ మరోసారి అచ్చుకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇది సాహిత్యాభిమానులకు కచ్చితంగా శుభవార్తే. కాలపరీక్షకి నిలబడే రచనలు కావడంతో నటరాజన్ రాసిన కథలూ, నవలల్లోని వస్తువులు ఇవాళ్టికీ సమకాలీనమే. ప్రస్తుతానికి వస్తే, 'శారద రచనలు - మొదటి సంపుటం' లో నటరాజన్ రాసిన మూడు నవలలు 'ఏది సత్యం,' 'మంచీ-చెడూ,' 'అపస్వరాలు' చాన్నాళ్ల తర్వాత మళ్లీ వెలుగు చూశాయి. పేద, మధ్యతరగతి మనస్తత్వాలు, వారి జీవన విధానాలపై నటరాజన్ కి ఉన్న పట్టుని సూచించే నవలలివి. అలాగే, మధ్యతరగతి నుంచి ఉన్నత తరగతికి ఎగబాకిన మనుషులు, పరిస్థితుల ప్రభావం వల్ల - వైకుంఠపాళిలో పెద్ద పాము నోట పడినట్టుగా - ఒక్కసారిగా పేదరికంలోకి జారిపోతే జీవితాన్ని ఎలా ఎదుర్కొంటారో నిశితంగా చిత్రించారు.

కొత్తగా పెళ్ళైన సాంబశివరావు-పార్వతి దంపతుల కథ 'ఏది సత్యం.' సాంబశివరావుకి నా అన్నవాళ్ళు లేరు. పార్వతి పరిస్థితీ ఇంచుమించు అంతే. ఓ మిల్లులో గుమస్తాగా పనిచేసే రావుకి పార్వతి అంటే పంచ ప్రాణాలు. ఇరుగుపొరుగులకి చూడ ముచ్చట ఆ జంట.  ఉన్నట్టుండి మిల్లులో జరిగిన ఓ ప్రమాదంలో రావు కాలికి బలమైన గాయం తగలడంతో ఉద్యోగం పోతుంది. మిల్లు వాళ్ళిచ్చిన నామ మాత్రపు నష్టపరిహారం ఖర్చైపోతే 'రేపు ఎలా?' అన్నది పెద్ద ప్రశ్న ఆ దంపతులకి. పొరుగింటి ప్లీడర్ దంపతులు వీళ్ళ పరిస్థితి చూసి జాలిపడతారు. ఎస్సెస్సీతో పాటు టైపు పరీక్షలు పాసైన పార్వతికి ఓ చిన్న ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తారు. ఇల్లు తప్ప బయటి ప్రపంచం తెలియని పార్వతి భయం భయంగా ఉద్యోగంలో ప్రవేశిస్తుంది. తన భర్త ఆరోగ్యం బాగై, తాను మళ్లీ గృహిణి బాధ్యతల్లోకి వెళ్ళిపోగలిగే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

ఆఫీసు సమస్యల్ని ఇంటికి తేని పార్వతికి ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. మంచాన పడిన రావుకి పార్వతి మీద అనుమానం మొదలవుతుంది. అతని ఆగడాలని ఓరిమితో భరిస్తుంది పార్వతి. అటు ఆఫీసులో ఒకదానిపై ఒకటిగా ఇబ్బందులు వఛ్చి పడుతూ ఉంటాయి. వాటిని నిర్వహించుకోడంలో సతమతమవుతున్న పార్వతికి రావు గురించి ఓ నిజం తెలియడం, మరోపక్క రావుకి ఆమె మీద అనుమానం నానాటికీ బలపడడంతో కథ ముగింపుకి చేరుతుంది. డెబ్భయ్యేళ్ళ నాటి నవల అని ఎంతమాత్రమూ అనిపించక పోవడం ఈనవల ప్రత్యేకత. మధ్యతరగతి ఆలోచనల్నీ, సంఘర్షణాల్నీ రచయిత చిత్రించిన తీరు ఈ నవలని ప్రత్యేకంగా నిలుపుతుంది. తర్వాతి కాలంలో వచ్చిన ఓ కమర్షియల్ నవలలో ముఖ్యమైన పాయింటు ఈ నవలలోదే. (కథంతా గుర్తుంది కానీ, నవల పేరు, రచయిత(త్రి) పేరూ జ్ఞాపకం రావడం లేదు).


ఇరవయ్యేళ్ళ కొడుక్కి తండ్రైన భద్రయ్య, భార్య మరణించిన కొన్నేళ్ళకి తన కొడుకు కన్నా వయసులో చిన్నదైన పద్మని ద్వితీయ వివాహం చేసుకోవడం, ఫలితంగా జరిగిన పరిణామాలే 'మంచీ-చెడూ' నవల. భద్రయ్య కొడుకు భాస్కరరావు పద్మని మాతృ స్థానంలో స్వీకరిస్తాడు. కానీ, పద్మకి భాస్కరరావు పునర్ యవ్వనం పొందిన భద్రయ్యలా కనిపిస్తాడు. 'సారంగధర' కథలా ఉందే అనుకునే లోగానే మొదటి మలుపు ప్రవేశిస్తుంది. వ్యవసాయం చేసుకునే భద్రయ్యని పట్నానికి తీసుకొచ్చి, వ్యాపారం పెట్టించి, గొప్పవాణ్ణి చేసిన సుదర్శనం, అనుకోని పరిస్థితుల్లో భద్రయ్య మీద పగ పట్టడంతో రోడ్డునపడుతుంది భద్రయ్య కుటుంబం. పెళ్లి నుంచి ఏమీ పొందలేకపోయిన పద్మ, భద్రయ్య మరణం తర్వాత తన దారి తను చూసుకునే క్రమంలో వేసిన తప్పటడుగులు ఆమెను ఓ బిడ్డకి తల్లిని చేస్తాయి. జీవితాన్ని పునర్నిర్మించుకునే కృషిలో నిమగ్నమవుతాడు భాస్కర రావు.

మరోపక్క సుదర్శనం, భద్రయ్యని దూరం చేసుకుని సాధించింది ఏమీ కనిపించదు. ఏ కారణానికి భద్రయ్యని దూరం చేసుకున్నాడో, అదే విషయంలో ఊహించని సమస్యల్లో చిక్కుకుంటాడు సుదర్శనం. పద్మ, భాస్కరరావు, సుదర్శనం.. వీళ్ళ ముగ్గురి జీవిత పథాన్ని చిత్రిస్తూ, ఆర్ద్రతతో ముగుస్తుందీ నవల. సంపుటంలో చివరి నవల 'అపస్వరాలు.' ధనిక, పేద, మధ్యతరగతి జీవితకథల కలబోత అయిన ఈ నవలలో ప్రధాన కథ, ఓ పేద వాడికి ఉన్నట్టుండి బోలెడంత డబ్బు దొరకడం.. ఆ డబ్బు విసుగెత్తించేత డబ్బుని సృష్టించడం.. చివరకి అతనికి కావాల్సినవి ఏవీ కూడా ఆ డబ్బుతో దొరకని పరిస్థితులు రావడం. వరదరాజు ఓ దొంగ. పదిమంది సభ్యులున్న ఓ ముఠాకి నాయకుడు. రంగయ్య ఓ మధ్య తరగతి స్కూల్ మేష్టారు. వీళ్లిద్దరికీ ఉన్న అలవాటు 'బ్రాకెట్' ఆట. బ్రాకెట్ గెలిస్తే తన డబ్బు కష్టాలు తీరతాయని రంగయ్య ఆశ. దరిద్రం నుంచి ఐశ్వర్యంలోకి మళ్లాలని వరదరాజు కోరిక.

బ్రాకెట్ ఆటలో కాక, మరోరకంగా వరదరాజుకి పెద్ద మొత్తంలో డబ్బు చేరుతుంది. ఆ డబ్బుతో మొదలు పెట్టిన వ్యాపారం, అతని కృషి లేకుండానే మరింత డబ్బు సంపాదించి పెడుతూ ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టే మార్గాల కోసం వెతుకుతున్న వరదరాజుకి నాటకాలు నిర్వహించే మృత్యుంజయ శాస్త్రి, అతని శిష్యుడు, పుస్తక ప్రచురణ కర్తా అయిన కరుణామూర్తి పరిచయమై ఎన్నికల్లో నిలబడమని ప్రోత్సహిస్తారు. ఒకప్పుడు తనకి అన్నం పెట్టిన వెలయాలు వసంతం, తనని మామా అని పిలిచే పక్కింటి పిల్లాడు చిన్నా, బ్రాకెట్ లో సలహాలు ఇచ్చిన రంగయ్య.. వీళ్ళకి ప్రాణావసరాలు వచ్చినప్పుడు వాటిని తీర్చేందుకు తన డబ్బు ఎందుకూ పనికిరాకపోవడం నివ్వెర పరుస్తుంది వరదరాజుని. అతను తీసుకున్న నిర్ణయం నవలకి ముగింపు. రంగయ్య కుటుంబం, మరీ ముఖ్యంగా అతని కొడుకు సదానందంతో పాటు వసంతం పాత్రని బలంగా చిత్రించారు రచయిత. కథనం మీద రావిశాస్త్రి ప్రభావం కనిపిస్తుంది. అయితే, సూటిగా, స్పష్టంగా సాగే వచనం నటరాజన్ ది. వర్ణనలు ఎక్కడా శ్రుతి మించవు.

ఈ మూడు నవలల సంపుటానికి నటరాజన్ స్నేహితుడు ఆలూరి భుజంగరావు, శ్రీవాసవ్య రాసిన ముందు మాటలు 'శారద' జీవితాన్ని గురించీ, రచనల్ని గురించీ ఆసక్తికరమైన విషయాలెన్నో చెబుతాయి. సాహిత్యం పట్ల నటరాజన్ తపన, వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నా సాహిత్యం కోసం సమయాన్ని వెచ్చించిన తీరు చదివినప్పుడు అతని మీద గౌరవం పెరుగుతుంది. నవలలు చదువుతున్నంతసేపూ రాసింది ఓ తమిళుడు అన్న మాట జ్ఞాపకం రాదెక్కడా. చక్కని తెలుగు నుడికారంతో పాటు, వాక్యం మీద పట్టుని సాధించడం నటరాజన్ ప్రత్యేకత అని చెప్పాలి. ఏ వాక్యమూ సుదీర్ఘమనీ, అనవసరమని అనిపించదెక్కడా. నవచేతన పబ్లిషింగ్ హౌస్ (మరేదో కాదు, తెలంగాణ లో 'విశాలాంధ్ర') ప్రచురించిన ఈ 497 పేజీల సంపుటం తెలుగు సాహిత్యాభిమానులు దాచుకోవలసినది. (వెల రూ. 325, నవచేతన, విశాలాంధ్ర అన్ని శాఖలూ). 'శారద' మిగిలిన రచనల్ని కూడా వీలైనంత త్వరగా ప్రచురించాల్సిందిగా ప్రచురణకర్తలకి విన్నపం.

3 కామెంట్‌లు:

  1. thx for the writeup...my blog dedicated to sarada: http://sahithyabatasarisarada.blogspot.in

    రిప్లయితొలగించండి
  2. Thanks for the review.

    These three novels were first published by 'Perspectives' in 1999 (with help of Sarada Saahitya Vedika,Tenali).

    Sarada Saahitya Vedika also published 'Raktasparsa' collected Short stories of Sarada in 1998, Remaining misc works as ' Sarada Rachanalu' in 2002.

    All these were uploaded by Anil B.

    One may get those old copies in Navodaya (Hyd or VJW).

    regards,
    Suresh

    రిప్లయితొలగించండి
  3. @అనిల్ బత్తుల: ధన్యవాదాలండీ..
    @Unknown: 'రక్తస్పర్శ' సంకలనం చదివానండీ (ఆ కథ గురించి ప్రత్యేకం రాయాలోసారి).. మిగిలిన రచనల కోసం ఎదురు చూస్తున్నా.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి