సోమవారం, మార్చి 14, 2016

మాట్లాడే జ్ఞాపకాలు

"భలే రాశాడు" అనిపిస్తుంది, వంశీ రాసే కబుర్లు చదువుతూ ఉంటే. కథలు, నవలల్లో కొన్ని చాలా బాగుండడం, మరికొన్ని అస్సలు బాగోకపోవడం ఉంటుంది కానీ, వంశీ కబుర్లకి మాత్రం పెద్దగా వంక పెట్టలేం. అందుకే కాబోలు, వంశీ రాసిన కథనం ఎక్కడ కనిపించినా కత్తిరించి దాచుకోడం ఓ అలవాటుగా మారిపోయింది. అదిగో, అలా దాచుకున్న కబుర్లలో కొన్ని ఇప్పుడు పుస్తక రూపంలో వచ్చేశాయి. పుస్తకం పేరు 'మాట్లాడే జ్ఞాపకాలు.'

దశాబ్దాల నాడు ఏదో సినిమా పత్రికలో చదివి దాచుకోడానికి వీలుపడని ఆర్టికల్ 'ఒక హార్మోనియం పెట్టి కథ.' దాచుకోడం కుదరలేదని గుర్తొచ్చినప్పుడల్లా బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే 'మాస్ట్రో' ఇళయరాజా గురించి వంశీ రాసిన కథనం అది. అసలు అదే శీర్షికతో ఇళయరాజా ఆత్మకథ వంశీ అక్షరాల్లో రాబోతోందని కూడా అప్పట్లో ఓ రూమరు వినిపించింది. కానీ, వంశీకి సంబంధించిన అనేకానేక రూమర్లలో అదీ ఒకటని తర్వాత తెలిసింది. ఇంతకీ, ఆ ఆర్టికల్ కి ఈపుస్తకంలో చోటు దొరికింది!

అల్లపుడెప్పుడో ఆదివారం ఆంధ్రజ్యోతి వాళ్ళు ప్రతివారం ప్రముఖుల 'ఫెయిల్యూర్ స్టోరీ' లు ప్రచురిస్తూ ఓ వారం వంశీ చెప్పుకున్న తన వైఫల్యగాధకీ చోటిచ్చారు. 'ఒక వృత్తిని ఎన్నుకున్న తర్వాత, అందులోనే లైఫ్ కంటిన్యూ చేయాలనుకున్న తర్వాత ఒకోసారి వ్యక్తిగతమైన అభిరుచుల్ని ఇష్టాల్నీ పక్కన పెట్టాల్సి ఉంటుంది" అన్నమాటలు ఎంతగా నచ్చేశాయో చెప్పలేను. అదిగో, ఆ 'ఫెయిల్యూర్ స్టోరీ' కూడా ఉందీ పుస్తకంలో. కాకినాడ-కోటిపల్లి రైల్ కార్ ప్రయాణాన్ని గురించి రెండు కథనాలూ, హంపీ-విజయనగరం యాత్రవి ఓ రెండు కథనాలూ వెంటాడతాయి బాగా.


'నా కాస్త బెస్ట్ అనిపించిన సినిమాలు' అంటూ తను ఇప్పటివరకూ తీసిన సినిమాల్లోనుంచి ఐదు సినిమాలని యెంచారు వంశీ. ఇందులో చేర్చిన 'ఏప్రిల్ ఒకటి విడుదల' కి సంబంధించి రెండు ప్రశ్నలు: ఈ సినిమాకి మూలమైన ఎమ్. ఐ. కిషన్ నవల 'హరిశ్చంద్రుడు అబద్దమాడితే' ని అస్సలు ప్రస్తావించకపోవడం. అలాగే సినిమా టైటిల్స్ లో సంభాషణల క్రెడిట్ మొత్తం ఎల్బీ శ్రీరాం కి ఇచ్చి ఈ కథనంలో (ఆ మాటకొస్తే ఈ మధ్య ఇచ్చిన చాలా ఇంటర్యూలలో కూడా) సంభాషణల్లో సింహభాగం కృష్ణ భగవాన్ రాశారని చెప్పడం. మరి టైటిల్స్ లో ఎల్బీ పేరు ఎందుకు వేసినట్టు? 'బెస్ట్ సినిమా ఇంకా నేను తియ్యలేదు. ఎప్పటికైనా తియ్యాలి' అంటూ ముగిసిందీ కథనం.

ఎలిజీలు రాయడంలో వంశీది ఓ ప్రత్యేకమైన శైలి. సంగీత దర్శకుడు చక్రి, గీత రచయిత వేటూరి సుందర రామమూర్తి, రచయిత ముళ్ళపూడి వెంకటరమణ, హాస్యనటుడు మల్లికార్జున రావు భౌతికంగా దూరమైన సందర్భాల్లో రాసిన నివాళి వ్యాసాలు ఆయా ప్రముఖుల వ్యక్తిత్వాలని వంశీ అక్షరాలు ప్రత్యేకంగా చూపుతాయి మనకి. మ్యూజిక్ కంపోజర్ మొజార్ట్, సస్పెన్స్ సినిమాల దర్శకుడు ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్, అభినేత్రి సావిత్రి లని గురించి రాసిన వ్యాసాలూ ఉన్నాయిందులో.

దిండి రిసార్ట్స్ దగ్గర గోదారి మీదా, కేరళలో హౌస్ బోటు మీదా చేసిన ప్రయాణాలు, ఏజెన్సీ ఏరియా వి. రామన్నపాలెం ప్రయాణం ముచ్చట్లు, పసలపూడి కబుర్లు, ఆ ఊరి వాడైన 'జక్కం వీరన్న' కబుర్లు, పుస్తకాలు, సినిమా విశేషాలు, షూటింగుల్లో జరిగే సంగతులు.. ఇలా మొత్తం ముప్ఫై ఆరు కథనాలు. ఏ వ్యాసమూ నాలుగైదు పేజీలు  మించదు. ఎక్కడా విసుగు అనిపించదు. కాసిన్ని కబుర్లు పునరుక్తులయితేనేమి, అవి వంశీ చెప్పిన గోదారి కబుర్లు అయినప్పుడు.. వంశీ రచనలు నచ్చే వారికి నచ్చేసే పుస్తకం ఇది. (సాహితి ప్రచురణలు, పేజీలు  192, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

2 కామెంట్‌లు: