అభివృద్ధి, పునరావాసం అనేవి ఒకే నాణేనికి 
బొమ్మాబొరుసూ లాంటివి. 'అభివృద్ధి' లో ఉన్న ఆకర్షణ పునరావాసంలో ఉండదు. 
పైగా, పునరావాసం అంటే ఒక చోట బలంగా వేళ్ళు పాతుకుపోయిన వృక్షాన్ని ఆ పళాన 
పెకలించి వేరే చోట నాటే ప్రయత్నం చేయడం. ప్రాజెక్టు ఏదైనప్పటికీ, దాని 
నిర్మాణం కారణంగా నిర్వాసితులు కాబోయేవారిని నయానో, భయానో పునరావాసానికి 
ఒప్పించక తప్పదు. ప్రభుత్వంతో పాటు, స్వచ్చంద సంస్థలూ ఈ కార్యక్రమంలో భాగం 
పంచుకుంటూ ఉంటాయి, వాటి వాటి ఆసక్తుల మేరకు. 
వెలిగొండ 
ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులవుతున్నారు నల్లమల అడవులనే శతాబ్దాల తరబడి 
తమ ఆవాసంగా చేసుకున్న చెంచులు. ప్రాజెక్టు గురించి కానీ, అడవి 
మునిగిపోబోతుండడం గురించి గానీ వాళ్లకి ఏమాత్రం తెలియదు. పునరావాసం కోసం 
ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతుండగానే, నిర్వాసితులకి అండగా 
నిలబడాలనీ, వాళ్లకి సురక్షిత ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేయాలనీ 
సంకల్పించింది, విదేశీ ఫండ్స్ తో పనిచేసే ఒక స్వచ్చంద సంస్థ. ఆ సంస్థ 
ప్రతినిధిగా అడవిలోకి అడుగు పెట్టాడు వీర. పూర్తి పేరు వీరనరసింహం. 
ఉస్మానియా
 విశ్వవిద్యాలయంలో పీహెచ్ డీ పూర్తి చేసిన వీర అడవికి వెళ్ళడం వెనుక 
ప్రోత్సాహం అతని భార్య మోహినిది. ఆమె ఓ స్వచ్చంద సంస్థ నిర్వాహకురాలు. 
చెంచుల ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆమెకి పది లక్షల రూపాయల లాభం. వీరకీ 
మోహినికీ చాలా చిత్రంగా పరిచయం అయి, అంతకన్నా విచిత్రంగా పెళ్ళికి 
దారితీసింది. వీర పరిచయం నాటికే మోహిని గర్భవతి. భర్తతో విడిపోయి ఒంటరిగా 
ఉంటోంది. చాలా ఏళ్ళపాటు ఎం ఎల్ పార్టీలో పనిచేసి స్వచ్చంద సంస్థని 
ప్రారంభించింది. యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పరిచయమైన వీర, పెళ్లి
 ప్రతిపాదన తేవడమే కాదు, వెంటనే అమలు పరిచేశాడు కూడా. పెళ్ళైన కొన్నాళ్ళకే 
అడవికి ప్రయాణం అయ్యాడు. 
నిజానికి ప్రాజెక్టు పనిమీద వీర 
వెళ్తున్నది తన పుట్టింటికే. నల్లమలలోని ఒకానొక చెంచు గూడెంలో పుట్టి 
పెరిగాడతడు. బాల్యం లీలగా గుర్తుంది కూడా. బాల్యంతో వెంటాడిన తీవ్రమైన 
దుర్భిక్షం, ఆకలి, ఒకరోజు తన తల్లే తనని నగరానికి వెళ్ళిపొమ్మని రోడ్డు మీద
 వదిలేసి అడవికి వెళ్ళిపోవడం ఇవన్నీ బాగానే గుర్తున్నాయి వీరకి. అడవికి 
వెళ్ళిన వీరకి మొదట పరిచయం అయిన వాడు అలలసుందరం. ఆ అడవిలోనే పుట్టి పెరిగి
 రాజకీయ నాయకుడిగా ఎదిగినవాడు. చెంచులకి అడవితో ఉన్న అనుబంధాన్ని అర్ధం 
చేసుకున్న వీర, ప్రాజెక్టు పని చేయలేనని మోహినికి ఉత్తరం రాసి, ఆమె ఇచ్చిన
 డాక్యుమెంట్స్ వెనక్కి పంపేస్తాడు. 
అధికారులు, పోలీసుల 
సాయంతో చెంచులని అడవి వెలుపలికి లాగే  ప్రయత్నంలో అలలసుందరం, వాళ్లకి అండగా
 నిలవాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తూ, వాళ్ళలో ఒకడు కాలేకపోతున్న వీర.. ఈ 
రెండు పరస్పర భిన్న శక్తుల పోరాటం ఏ ముగింపుకి చేరుకుందన్నదే డాక్టర్ వి. 
చంద్రశేఖర రావు నవల 'ఆకుపచ్చని దేశం.' నిజానికి, 142 పేజీల ఈ పుస్తకం ఒక 
దీర్ఘ కవితని తలపిస్తుంది. ఏనాడూ అడవిని కళ్ళతో చూడని వాళ్లకి కూడా 
ఆదివాసీల జీవితాలని కళ్ళకి కడతారు రచయిత. బయట ప్రపంచంతో కలవలేని చెంచులు 
మనుగడకోసం చేసే మౌన పోరాటం పుస్తకాన్ని ఆసాంతమూ ఆపకుండా చదివిస్తుంది. 
అధికారులు,
 రాజకీయ నాయకులు, పోలీసులు, పత్రికల వాళ్ళు, ఎన్జీవోలు, చెంచులు.. 
వీళ్ళందరి గురించీ రచయిత చెప్పే ఒక్కో సంగతీ వెన్ను నిటారుగా ఉంచి 
పుస్తకాన్ని చదివేలా చేస్తుంది. అలలసుందరం తల్లి నవమణి మరణం, వీరా తన తన 
తల్లిని కలుసుకునే సన్నివేశం చాలా రోజులపాటు వెంటాడతాయి. నవల పూర్తి చేశాక ఏ
 ప్రాజెక్టు గురించి విన్నా మొదట నిర్వాసితులే గుర్తొస్తారు. అధికార 
చట్రంలో ఉన్న వాళ్ళలో కొందరన్నా ఈ నవల చదివితే బాగుండును అనిపిస్తుంది. 
('ఆకుపచ్చని దేశం,' పేజీలు  142, వెల రూ. 50, అన్ని ప్రముఖ పుస్తకాల 
షాపులు).  

మీ రివ్యూ మీద నమ్మకంతో ఈ పుస్తకం కినిగే లో కొన్నాను... చదవడం పూర్తి అయ్యాక , నా అభిప్రాయం చెబుతాను.
రిప్లయితొలగించండి@నాగ శ్రీనివాస: పుస్తకం పూర్తి చేశాక మీరేం చెబుతారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానండీ.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి