బుధవారం, జూన్ 12, 2013

ఆకెళ్ళ కథలు

వంటి పేరుతో కాక, ఇంటి పేరుతో ప్రసిద్ధులైన కథా, నాటక, సినిమా రచయిత ఆకెళ్ళ. వెంకట సూర్యనారాయణ అంటే తెలియని ఉంటారేమో కానీ, తెలుగు నాట సాహిత్యం, సినిమా, టీవీ, రంగస్థలంతో ఏ కొద్ది పరిచయం ఉన్నవారైనా ఆకెళ్ళ పేరు వినగానే గుర్తుపడతారు. సెంటిమెంట్ ప్రధానంగా రచన చేయడంలో ఆకెళ్ళది అందెవేసిన చేయి. 'స్వాతిముత్యం' 'శ్రుతిలయలు' 'సిరివెన్నెల' లాంటి సినిమాలకి రచన చేసినా, 'శ్రీనాధుడు' లాంటి పద్య నాటకాలు, సాంఘిక నాటికలు రాసి రాష్ట్ర ప్రభుత్వం నుంచీ నంది అవార్డులు అందుకున్నా అది ఆకెళ్ళ లోని బహుముఖీన సాహితీ ప్రజ్ఞకి నిదర్శనం. ఆకెళ్ళ రాసిన ఇరవై ఒక్క కథలతో వెలువడిన సంకలనమే 'ఆకెళ్ళ కథలు.'

ఎనభయ్యో దశకంలో తెలుగు నాట ఆకెళ్ళ కథ ప్రచురించని పత్రిక లేదనడం అతిశయోక్తి కాదు. ఆకెళ్ళ ముమ్మరంగా కథా రచన చేసిన కాలం కూడా అదే. అటు తర్వాత సినిమా రంగానికి, అక్కడి నుంచి నాటక రంగం మీదుగా బుల్లితెరకీ ప్రయాణించారీ కాకినాడ వాసి. ఎనభయ్యో దశకపు తెలుగు కథా సాహిత్యం అనగానే మొదట గుర్తొచ్చేవి మధ్యతరగతి జీవితాలు, నిరుద్యోగి కుర్రాళ్ళు, చిరుద్యోగి తండ్రులు, పెళ్ళికి ఎదిగొచ్చిన ఆడపిల్లలు పట్నవాసాల్లోనూ, పని వాళ్ళని పురుగుల్లా చూసే కామందులు, కొండొకచో ఎర్రజెండా సౌజన్యంతో చైతన్యవంతులై యజమానులకి బుద్ధి చెప్పే పనివాళ్ళూ పల్లెటూళ్ళ లోనూ కనిపించిన కాలం. ఈ కాలంలో రాసిన కథల్లో నుంచి కాల పరిక్షకి నిలబడ గలిగే వాటిని ఎంచి సంకలించారు ఆకెళ్ళ.

కథ చెప్పే పద్ధతిలోనూ, అక్కడక్కడా సంభాషణల్లోనూ కనిపించే కూసింత నాటకీయతని మినహాయించుకుంటే, ఏకబిగిన చదివించే కథలు ఇవన్నీ. తన తరంతో తన సంప్రదాయం అంతరించిపోతుందని బాధ పడే ఓ తండ్రి కథ 'కాలం కత్తెరలో' లో మొదలయ్యే ఈ సంకలనం, తన పగటి వేషాలతో ఎందరినో మెప్పించినా, జీవన యవనికపై భర్త వేషాన్ని రక్తి కట్టించ లేకపోయానని, తన భార్య అంతిమ ఘడియల్లో బాధ పడే భర్త యాజీ కథ 'సహస్ర ప్రయాణం' లో ముగుస్తుంది. కథలే కాదు, వాటికి పెట్టిన పేర్లూ ఆలోచింపజేస్తాయి. సంపుటిలో రెండో కథ 'చంద్రగ్రహణం,' ఎమ్వీఎస్ హరనాధ రావు రాసిన 'లేడి చంపిన పులి నెత్తురు' కథని జ్ఞాపకం చేసింది. (ఈ కథ ఆధారంగానే రాజేంద్రప్రసాద్-యమునలతో 'ఎర్ర మందారం' సినిమా తీశారు).



అలాగే, కాళీపట్నం రామారావు ప్రముఖ కథ 'యజ్ఞం' ను గుర్తుచేసిన కథ 'రాక్షసి బొగ్గు.' అయితే, ఇక్కడ రెండు కథలకీ పోలిక రేఖా మాత్రమే. 'కాముని పున్నమి' కథ చదువుతున్నప్పుడు బుచ్చిబాబు రచనలు, 'గొలుసు' కథ చదువుతున్నప్పుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలూ అప్రయత్నంగా గుర్తొచ్చాయి. పేదల బతుకుల గురించి రచయిత రాసిన తీరు, కనబరించిన ఆవేశం రావిశాస్త్రి రచనలని జ్ఞాపకం చేశాయి. "శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్ర రచనలు, రాచకొండ కథలు నేను రచయిత కావడానికి ప్రేరకాలుగా నిలిచాయి" అన్నారు రచయిత తన ముందుమాటలో. ఆకెళ్ళ యెంత అలవోకగా కథలు రాసేసేవారో గుర్తు చేసుకున్నారు ఆయన మిత్రుడు చెరుకువాడ సత్యనారాయణ తన 'ఆప్తవాక్యం' లో.

టైం మిషిన్ ఎక్కి ముప్ఫై ఏళ్ళు వెనక్కి ప్రయాణం చేసినట్టు అనిపిస్తుంది ఈ కథలు చదువుతూ ఉంటే. ముగ్గురు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాల్సిన ఆడపిల్లల తండ్రులు - మరీ ముఖ్యంగా అంది వచ్చిన కొడుకు కోడలితో కలిసి వేరు కాపురం పెట్టేసిన వాళ్ళు - చాలా కథల్లోనే కనిపిస్తారు. 'తోలు బొమ్మలు' 'సంకెళ్ళు' కథలు ఉదాహరణలు. అమెరికా యుద్ధ దాహాన్ని ప్రతీకాత్మకంగా చెప్పిన కథ 'యుద్ధం.' ఓ పల్లెటూరి దీపావళి సంబరాలని అంతర్జాతీయ సమస్యతో ముడిపెట్టి చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. 'చీకట్లో శిఖండి' 'లవ్ గేమ్' 'ఆకలిబల్లి' 'గంతలు' లాంటి వైవిద్యభరితమైన కథలు ఉన్నాయీ సంకలనంలో. అలాగే, పేద-ధనిక తారతమ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని రాసిన కథలూ ఎక్కువే - 'చేటపెయ్య' 'అడ్డుకట్ట' 'స్ట్రా' లాంటివి.

ఆకెళ్ళ కథలు క్లుప్తంగా ఉంటాయి. ఆరంభం, ముగింపు ఆకట్టుకుంటాయి. సుదీర్ఘమైన సంభాషణలు ఉండవు. ఈ కథలు చదువుతుంటే రంగస్థలం మీద ఓ నాటికను చూస్తున్న అనుభూతి కలుగుతుంది. రచనా కాలాన్ని గుర్తుపెట్టుకుని చదివితే నాటకీయత పెద్దగా ఇబ్బంది పెట్టదు. రచయిత శ్రద్ధ తీసుకున్న మరో అంశం ముగింపు. కొన్ని కథల ముగింపు ఆశ్చర్యపరిస్తే, చాలా కథల విషయంలో ముగింపు ఆలోచనలో పడేసేదిగా ఉంది. "వీటిలో పన్నెండు కథలు మళ్ళీ మళ్ళీ చదవదగ్గవి ఉన్నాయి" అంటూ ముందుమాటలో రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య చెప్పిన మాటతో ఏకీభవిస్తాం, పుస్తకం పూర్తిచేశాక. ('ఆకెళ్ళ కథలు,' విశ్వశాంతి పబ్లికేషన్స్ ప్రచురణ, పేజీలు 154, వెల రూ. 90, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

2 కామెంట్‌లు: