ఆదివారం, సెప్టెంబర్ 21, 2025

కన్యాకుమారి

ఉత్తరాంధ్ర కథకులు, నవలా రచయిత అట్టాడ అప్పల నాయుడు. ఈయన కథల్లో 'సూతకం కబురు' కథంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. నాయుడుగారబ్బాయి సృజన్ అట్టాడ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'కన్యాకుమారి'. ఈ సినిమాకి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ప్లే అందించడంతో పాటు, నిర్మాణాన్నీ భుజాన వేసుకున్నారు సృజన్. గత నెలలో థియేటర్లలో విడుదలైన 'కన్యాకుమారి' ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీకాకుళం జిల్లా పెంటపాడు కుర్రాడు తిరుపతి (శ్రీచరణ్ రాచకొండ), అదే ఊరి అమ్మాయి కన్యాకుమారి (గీతా సైనీ) ల ప్రేమకథ ఇది. చూడచక్కని విజువల్స్, ఇంపైన నేపధ్య సంగీతం, ఆసక్తిగా సాగే కథనం కారణంగా 135 నిముషాలు అప్పుడే అయిపోయేయా అనిపించింది, ఎండ్ టైటిల్స్ పడుతుంటే. 

హైస్కూల్ లోనే కన్యాకుమారి కి ప్రపోజ్ చేసి భంగ పడతాడు తిరుపతి. కన్యాకుమారి లక్ష్యం సాఫ్త్వేర్ ఇంజనీర్ కావాలని. తిరుపతి కేమో రైతు కావాలని కోరిక. ఊళ్ళో పొలం ఉండడంతో పాటు, కొడుకు కోరికకి అడ్డుచెప్పని తండ్రి కావడంతో, తిరుపతి హైస్కూల్ లోనే చదువు మానేసి వ్యవసాయంలో స్థిరపడి పోతాడు. కన్యాకుమారి చదువులో ముందున్నా, ఎంసెట్ లో మంచి రేంక్ తెచ్చుకున్నా, ప్రభుత్వ కళాశాలలో బీకామ్ లో చేరాల్సి వస్తుంది, ఇంట్లో మద్దతు లేకపోవడం వల్ల. శ్రీకాకుళంలో బట్టల షాపులో సేల్స్ గర్ల్ గా చేరినా తన సాఫ్ట్వేర్ ఆశల్ని చంపేసుకోదు. రైతు అయిన కారణానికి తిరుపతికి పెళ్లి సంబంధాలు కుదరవు. అప్పుడే అనుకోకుండా కన్యాకుమారి అతని జీవితంలోకి మళ్ళీ వస్తుంది. 

నాయికా నాయకులు కనుక సహజంగానే కన్యాకుమారీ, తిరుపతీ ప్రేమలో పడతారు. సాఫ్ట్ వేర్ రెక్కలు కట్టుకుని ఎగిరిపోవాలి అనుకునే కన్యాకుమారికీ, మట్టిని విడిచి, ఊరిని వదిలి బయటకి వెళ్లలేని తిరుపతికీ మధ్య ప్రేమ, పెళ్లి వరకూ వెళ్లాలంటే ఎవరో ఒకరు తమ కలల్ని 'త్యాగం' చేయాలి. అటు చూస్తే ఆడపిల్ల చదువు, కలలు, ఇటు చూస్తే వ్యవసాయం, గ్రామీణ జీవితం. చక్కని చిక్కుముడి. వాళ్ళ ప్రేమ త్యాగాన్ని కోరదు కానీ, ఓ ఆసక్తికరమైన తీరాన్ని చేరుతుంది. అదేమిటో అమెజాన్ ప్రైమ్ లోనే చూడండి. సినిమా మొదటి నుంచి చివరి వరకూ ఆకట్టుకున్నది నేటివిటీ. ఎక్కడా శ్రీకాకుళం, పరిసర గ్రామాలు దాటి వెళ్ళలేదు కెమెరా. ప్రతి సన్నివేశం కంటికి ఇంపుగా వుంది. 

సంభాషణలు పూర్తి మాండలికంలో లేవు. నిజానికి గ్రామాల్లో కూడా మాండలికం నెమ్మదిగా కనుమరుగవుతోంది, టీవీ చానళ్ల ప్రభావంతో. మెజారిటీ తారాగణం ఆ ప్రాంతం వాళ్ళే. మేకప్పులు, కాస్ట్యూమ్స్ లాంటి పటాటోపాలు ఏవీ లేవు. స్థానికతని చూపించడంలో లోటుగా అనిపించిన విషయం మాత్రం ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన పండుగలు, పబ్బాలు, జాతరలు లాంటివి ఏవీ కథలో భాగం కాకపోవడం. వరి కోతలప్పుడు చేసే పూజని మాత్రమే చూపించారు. నిజానికి ఆ ప్రాంతపు ప్రత్యేక సంప్రదాయాలని కథలో భాగం చేసే అవకాశం వుంది, సన్నివేశాల నేపధ్యం మార్చుకోవచ్చు. ఎందుకో దృష్టి పెట్టలేదు. గుర్తుండిపోయే ఒక పాటో, హాంటింగ్ గా ఉండే నేపధ్యపు సంగీతపు బిట్టో వుండి వుంటే ప్రేమ సన్నివేశాలకి మరింత బలం చేకూరి ఉండేది. 

మరింత బాగా ఉండవచ్చునని బాగా అనిపించిన విభాగం ఎడిటింగ్. సినిమా నిడివి మరీ పెద్దది కాకపోయినా కొన్ని సన్నివేశాల నిడివి ఎక్కువగా ఉండడం (ముఖ్యంగా ప్రథమార్ధంలో), కీలక సన్నివేశాలని మరీ క్లుప్తంగా చూపడం లేదా వాయిస్ ఓవర్ తో సరిపెట్టేయడం (ద్వితీయార్ధంలో) కాస్త అసంతృప్తిగా అనిపించింది. అయితే, జామకాయని కథలో భాగం చేయడం లాంటి సూక్ష్మ విషయాలు నచ్చేశాయి. నాయికా నాయకులు మాత్రమే కాదు, నటీనటులందరూ వంక పెట్టలేని విధంగా నటించారు. ముఖ్యంగా రెండు నిశ్చితార్ధం సన్నివేశాలు, వాటిలో కాంట్రాస్టు బాగా గుర్తుండిపోతాయి. అలాగే వెంకాయమ్మ పాత్రధారిణి, ఆవిడ కనిపించే రెండు మూడు సన్నివేశాలు కూడా. డ్రీమ్ సాంగ్స్, ఐటెం సాంగ్స్, ఫైట్స్ లాంటివి ఏవీ ఇరికించకుండా హాయిగా అనిపించేలా తీశారు సినిమాని. 

సినిమా టైటిల్స్ మొదట్లో 'విప్లవ్ పిక్చర్స్' అని చూసి, ఆర్. నారాయణమూర్తి తరహా ఎర్ర సినిమా చూడడానికి సిద్ధ పడిపోయాను. కానైతే, ప్రేమకథతో ఆశ్చర్య పరిచింది చిత్రబృందం. ఓటీటీలో మలయాళం సినిమాలని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకి నచ్చే సినిమా ఇది. ఇక, అప్పలనాయుడు గారి 'సూతకం కబురు' కథానాయిక పరిస్థితులకి లొంగిపోతుంది. జీవితం తనని దెబ్బ మీద దెబ్బ కొట్టినప్పుడు, వాటిని తట్టుకునే శక్తిని కోల్పోతుంది. కానీ, సృజన్ సృష్టించిన 'కన్యాకుమారి' మాత్రం పరిస్థితులకి ఎదురీదుతుంది. తన కలల్ని చంపుకోదు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోదు. అలాగని, తన కలల సాధన కోసం ప్రేమని పణం గానూ పెట్టదు. అవును, ఆమె ఈతరం అమ్మాయి. 

బుధవారం, సెప్టెంబర్ 03, 2025

దొండ విత్తనాలు

నేను క్రమం తప్పకుండా చదివే ఓ కాలమ్ లో "దొండపాదు బాగా కాస్తోందిటనా? విత్తనాలు తీసుకెళ్లారుగా?" అని చదివి ఉలిక్కి పడ్డాను. సరిగ్గానే చదివేనా? అని సందేహ పడి, కళ్ళు నులుముకుని మళ్ళీ చూసినా అక్షరాలు మారలేదు. ఆనప, గుమ్మడి లాంటి పాదులు విత్తనాల నుంచి మొలుస్తాయి. కానైతే, దొండపాదు కోసం నాటాల్సింది దొండ వేరు. చిన్న వేరు ముక్క పాతి, కాస్త పందిరేసి, తీగ ఎగబాకే వరకూ జాగ్రత్తగా చూసుకుంటే చాలు, ఆపైన వద్దన్నా కాయలు కాస్తూనే ఉంటాయి. మిగిలిన పాదులతో పోలిస్తే, దొండ కాస్త మొండి జాతి. పోషణ పెద్దగా లేకపోయినా హాయిగా బతికేస్తుంది, కాపులో ఏమాత్రం తేడా పెట్టదు. ఇంకా చెప్పాలంటే, 'చాలమ్మా తల్లీ' అని బతిమాలినా కూడా ఆపకుండా కాసేస్తుంది దొండపాదు. 

అమ్మకూడా అంతే, 'వద్దమ్మా తల్లీ' అన్నా వినకుండా వారంలో కనీసం రెండు మూడు రోజులు దొండకాయ వండేసేది. ఎక్కువగా దొండకాయ, కొబ్బరి కోరు కూర, తప్పితే బెల్లం పెట్టిన కూర. "దొండకాయ ఎక్కువగా పెడితే పిల్లలు మందబుద్ధులవుతారు" అనేది మా బామ్మ, విస్తట్లో దొండకాయ కూరని, పక్కన కూచున్న నన్నూ మార్చి మర్చి చూస్తూ. అమ్మ విననట్టుగా ఊరుకునేది. "ఎప్పుడూ కూరేనా? చక్కగా వేపుడు చేయచ్చు కదా?" అనేది నా ఘోష. 'చక్రాల వేపుడు' అని పాడుతూ ఉండేవాడిని. అంటే, దొండకాయని చక్రాలుగా కోసి చేసే వేపుడన్న మాట. మామూలుగానే ఇంట్లో వేపుళ్ళు తక్కువ. వేపుడు వేయిస్తే చిన్న సైజు పండగ మాకు. ఎప్పుడన్నా బంగాళా దుంపలన్నా వేయించేది కానీ, దొండకాయ మాత్రం కూరే. "వెధవ దొండకాయలు గంటసేపు వేగుతాయి" అనేది. 

అచ్ఛం ఇదే మాట డాక్టర్ సోమరాజు సుశీల గారి అమ్మగారు సరోజిని గారి నోటి వెంట విన్నాను 'ఇల్లేరమ్మ కతలు' లో. ఇల్లేరమ్మ (సుశీల ముద్దుపేరు) వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వర రావు, గృహసంబంధ విషయాలేవో మాట్లాడడానికి సరోజిని గారిని పిలవడం, ఆవిడేమో దొండకాయలు, కత్తిపీట, రెండు పళ్లాలతో రావడాన్ని వర్ణించారు 'పిల్లేటి సొగసులు' కథలో. రెండు పళ్ళాలు ఎందుకంటే, "అమ్మ ముచికలు కూడా నేలమీద తరగదు, వాటికో ప్లేటు పెడుతుంది." ఎంతటి పనిమంతురాలావిడ!! "నే ఎప్పుడు పిలిచినా కత్తిపీటతో సహా వస్తావేవిటే హడలిపోయేలాగా" అని నాన్నంటే, "ఏమో! ఎవరి జాగ్రత్త వాళ్ళది. ఈ వెధవ దొండకాయలు గంటసేపు తరగాలి. రెండు గంటల సేపు వేయించాలి. అయినా మీతో చేతులు కబుర్లు చెప్పవుగా!" అంటారు అమ్మ. 

దండిగా కాసే దొండకాయలు మాకు మాత్రమే కాదు, 'కన్యాశుల్కం' కరటక శాస్త్రులు గారికి కూడా సమస్య అయి కూర్చున్నాయి పాపం. "వర్ణ ప్రకర్షే సతికర్ణి కారం! ధునోతినిర్గంధ తయాస్మి చేతః !!" పాఠం చదువుకుంటుంటున్న మహేశం, "ఆ పువ్వేదో కవికిష్టం లేదట. యిష్టం లేకపోతే ములిగిపోయింది కాబోలు? మా గురువుగారికి దొండకాయ కూర యిష్టం లేదు. గురువుగారి పెళ్ళాం పెరట్లో దొండపాదుందని రోజూ ఆ కూరే వొండుతుంది. బతికున్న వాళ్ళ యిష్టవే యిలా యేడుస్తూంటే చచ్చిన వాడి యిష్టాయిష్టాలతో ఏంపని?" అనుకుంటాడు నాటకం ద్వితీయాంకంలో. తన భార్య చేసే 'మర్యాద' గురించి కరటకుడు కూడా మధురవాణి తో మొర పెట్టుకుంటాడు కానీ, దొండకాయ కూర విషయం ప్రస్తావించడు పాపం. మరి ఆయొక్క దొండపాదు ఒక్క భారద్దేశంలోనే కాదు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ  అనూపంగా అల్లుకుంది. దీని వెనుక ఉన్నది అక్షరాలా ఓ తెలుగు వాడే. 

హాస్య రచయితగానూ, తెలుగు సాహిత్య కార్యక్రమాల నిర్వాహకుడిగానూ పేరు గాంచిన వంగూరి చిట్టెన్ రాజు, స్వస్థలం కాకినాడ నుంచి దొండవేరుని అత్యంత సాహసోపేతంగా అమెరికా తరలించిన వైనాన్ని రికార్డు చేశారు. అప్పటికింకా స్కానర్లు కన్ను విప్పక పోవడం వల్ల, దొండ వేరుని కోటు వెనుక దాచి కస్టమ్స్ వాళ్ళని మాయ చేయగలిగారు కానీ, ఇప్పుడైతే అలా తరలించే వీలే లేదు. అనేక శ్రమదమాదులకి ఓర్చి హ్యూస్టన్ చేర్చిన దొండవేరుని తన పెరటికే పరిమితం చేసేసుకోకుండా, అమెరికాలో అడిగిన తెలుగు వాళ్ళందరి పెరళ్ళలోనూ వ్యాపింపజేశారు వంగూరి. ఇంకా ఇలాంటి సాహసాలు చాలానే చేసి వుంటారు కదా. వాటి వివరం కోసం ఆ మధ్య ధారావాహికంగా మొదలైన  ఆయన ఆత్మకథని శ్రద్ధగా చదవడం మొదలు పెట్టాను. కారణాలు తెలియవు కానీ, అమెరికాలో ఉద్యోగం దొరకడంతో ఆ ధార ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడో మొదలు పెట్టి మరికొన్ని అధ్యాయాలు రాయకపోరని ఎదురు చూస్తున్నా. 

మళ్ళీ నేను చదివిన కాలమ్ దగ్గరికి వచ్చేస్తే 'అప శుభం' అనే పదప్రయోగం కూడా చేశారు కాలమిస్టు. ఆవిడేమీ చిన్నా చితకా కాదు, పేరున్న రచయిత్రి. హాస్యం మాటున అలవోకగా జీవిత సత్యాలనీ, సాఫ్ట్ స్కిల్స్ చిట్కాలనీ చెబుతూ వుంటారు తన కాలమ్ లో. అలాంటిది, "అపశుభం మాట్లాడకమ్మా" అని రాయడం చూసి అవాక్కయ్యా. అప్పటికింకా దొండ విత్తనాల నుంచి తేరుకోలేదు. ఇవి చాలవన్నట్టు "నాలో ఊహలకి.. నాలో ఊసులకి నటనలు నేర్పావూ.." అని కూడా రాసేశారు. ఇష్టానుసారం అక్షరాలని విరుస్తూ ఆశాభోంస్లే పాడిన ఆ పాట సాహిత్యంలో వున్నవి 'నడకలు' తప్ప 'నటనలు' కావు మరి. 'నవతరం రచయితలతో పోటీ పడడం కోసమని ఈ తరహా పదప్రయోగాలు చేస్తున్నారా ఈవిడ?' అని ఆలోచనలో పడ్డాను. ఏమో, రేపన్ననాడు 'దొండ చెట్టుక్కాస్తాయ్ దొండకాయలూ.. దొండకాయలూ' లాంటి సినిమా పాటలు కూడా వినాల్సి వస్తుందో ఏవిటో.. ఇప్పటికివీ దొండకాయ కబుర్లు.

సోమవారం, ఆగస్టు 04, 2025

నలుపు, తెలుపు, కొన్ని రంగులు...

కన్నడలో వచ్చిన పదిహేను కథలకి రంగనాథ రామచంద్ర రావు చేసిన తెలుగు అనువాదం తో వచ్చిన కథల సంపుటి 'నలుపు, తెలుపు, కొన్ని రంగులు...' ప్రత్యేకత ఏమిటంటే ఇవన్నీ రచయిత్రులు రాసిన కథలు. మూలకథలన్నీ 1932-2012 మధ్య కాలంలో తొలిసారి ప్రచురితమయ్యాయి. ఎనభయ్యేళ్ళ కాలంలో వచ్చిన కన్నడ సాహిత్యం నుంచి ఎంచిన పదిహేను కథలు కావడంతో వస్తు విస్తృతికి లోటు లేదు. పైగా, ఎంపికకి ప్రాతిపదిక 'కేవలం స్త్రీవాద కథలు మాత్రమే' కాకపోవడం విషయ విస్తృతికి దోహదం చేసింది. స్త్రీ పాత్రలతో పాటు, పురుష పాత్రలూ బలంగా ఉండడం, ఎక్కువ కథలు ఆశావహ దృక్పథంతో ముగియడం ఈ సంపుటి ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. 

తొలి కథ 'ఆహుతి' ని కొడిగిన గౌరమ్మ 1932 లో రాశారు. ఇతివృత్తం వరకట్న సమస్య. కథానాయకుడు వరకట్నాన్ని ఆశించడానికి బలమైన కారణాన్ని ఏర్పాటు చేశారు రచయిత్రి. ఇందువల్ల, ఇది వ్యక్తుల సమస్య కాదనీ వ్యవస్థకీ భాగం వుందనే ఆలోచన పాఠకుల్లో కలుగుతుంది. కట్నం ఇచ్చుకోలేని నాయిక నేపధ్యం సరేసరి. రెండవ కథ దేవాంగనా శాస్త్రి రాసిన 'వేణీ సంహారం', 1941లో వచ్చింది. ఇతివృత్తం బాల్యంలో వితంతువైన ఓ అమ్మాయికి ఆమె యవ్వనంలో అడుగు పెట్టాక శిరోముండనం చేయించే ఏర్పాట్లు చేయడం. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగానూ, అనుకూలంగానూ జరిగే వాదోపవాదాలు. అమ్మాయి తండ్రికి కూడా ఇది ఇష్టంలేని క్రతువే. అయితే, జరిపించకపోతే, అతడు తన పౌరోహిత్య వృత్తిని వదులుకోవాల్సిన పరిస్థితి.  

ఇక్కడి నుంచి ఒక్కసారిగా నలభై ఏళ్ళు గడిచిపోయి, మూడో కథ 1990 దశకం నాటిది కనిపిస్తుంది. అలాగే, ఇక్కడి నుంచి వచ్చే పదమూడు కథల తొలి ప్రచురణ తేదీలకి, ఈ పుస్తకంలో వాటి క్రమానికి సంబంధం వుండదు (ఇది కాస్త ఇబ్బంది పెట్టే విషయం, మరీ ముఖ్యంగా పుస్తకాన్ని ఒకే వరసలో ఏకబిగిన చదివేప్పుడు). వైదేహి రాసిన 'అక్కు' కథ, ఆమె కథలని చదివిన వాళ్ళని ఆశ్చర్య పరచదు కానీ, కొత్తగా చదివే వాళ్ళని ఆగి ఆలోచించేలా చేస్తుంది. అక్కు పాత్ర పట్ల పాఠకుల్లో జాలో, కరుణో కలిగించే ప్రత్యేక ప్రయత్నం ఏదీ రచయిత్రి చేయకపోవడం వల్ల, అక్కుతో పాటు, ఆమె వల్ల ఇబ్బందులు పడే కుటుంబ సభ్యులని గురించి కూడా ఆలోచిస్తారు పాఠకులు. డాక్టర్ వీణా శాంతేశ్వర రాసిన 'విముక్తి' నూరుశాతం స్త్రీవాద కథ. ఊహకు అందే కథనం, ముగింపు. 

డాక్టర్ ఎల్.సి. సుమిత్రా రాసిన 'పిచ్చుకల వాగు సాక్షిగా' మిగిలిన కథల కన్నా ప్రత్యేకమైనది. కథలో ముఖ్యమైన పాత్ర పరిచయం చెప్పీ చెప్పకుండా చేయడం, ముగింపు పాఠకులకి వదిలివేయడంతో పాటు కథనం కూడా మిగిలిన కథలకి భిన్నంగా సాగింది. డాక్టర్ వినయా రాసిన 'ఒక వ్యక్తిగత పత్రం' చాలా ఆసక్తిగా సాగే కథ. అమాయకపు స్త్రీ-దుర్మార్గపు పురుషుడు కథే అయినప్పటికీ లేఖా రూపంలో సాగడం వల్ల ఆద్యంతమూ ఆసక్తిగా చదివిస్తుంది. డాక్టర్ కె. ఆర్. సంధ్యా రెడ్డి 'ఒక ఆత్మకథ' కి మన పి. సత్యవతి 'సూపర్ మామ్ సిండ్రోమ్' తో రేఖా మాత్రపు పోలిక కనిపిస్తుంది. సునంద ప్రకాశ కడమె కథ 'చిట్టి పాదాల గురుతు...' ఒక వృద్ధురాలి కథ. వృద్ధాప్య సమస్యలకి పరిష్కారాన్ని బాల్య జ్ఞాపకాల్లో కనుక్కుంటుంటుందామె. 

సుమంగలా రాసిన 'అడుగుజాడలు' నోస్టాల్జియా కథ. నీట మునిగిన తన ఊరిలో చిన్ననాటి జ్ఞాపకాలని వెతుక్కునే నాయిక కథ. డాక్టర్ జయశ్రీ సి. కంబార రాసిన 'ముఖాముఖి'ని మేజిక్ రియలిజంతో నడిపించారు. ఒక రచయితకి-పాత్రకి నడుమ సంభాషణ. వర్షపు నేపధ్యం చక్కగా అమరింది ఈ కథకి. మాలతీ ముదకవి రాసిన 'గంధపతీ పృథ్వీ' కి శ్రీరమణ 'మిథునం' లో రేఖా మాత్రపు పోలిక తోచక మానదు. ఈ సంపుటి శీర్షిక కి దగ్గరగా ఉండే పేరు 'నలుపు, తెలుపు, కొన్ని రంగుల చిత్రాలు...' శుభదా అ. అమినభావి రాసిన ఒక మహిళా ఫోటోగ్రాఫర్ కథ. తాజ్ హోటల్ పేలుళ్లు నేపధ్యం. నాయిక తాతగారి ఫ్లాష్ బ్యాక్ లో స్వతంత్ర పోరాటాన్ని ప్రస్తావించడం ఈ కథ ప్రత్యేకత. 

ఆద్యంతమూ ఆసక్తిగా సాగడమే కాక, ఆపై ఎప్పటికీ గుర్తుండిపోయే కథ సి. ఎస్. ముక్త రాసిన 'నాన్న'. భార్యని కెరీర్ వుమన్ గా కొనసాగనిచ్చి, తాను ఇంటి బాధ్యతలు నెరవేర్చిన విద్యావంతుడైన ఓ పురుషుడి కథ. వృద్ధుల కళ్ళ నుంచి ప్రపంచాన్ని చూసిన కథలు విజయా శంకర రాసిన 'అసహాయులు', లీలా ముణ్ణాల రాసిన 'మునిమాపు పక్షులు'. రెండూ ప్రత్యేకమైన ఇతివృత్తాలు, తెలుగు పాఠకులకి తెలిసినట్టుగా అనిపించే కథలు కూడా. "కథలు చెప్పిన విధానంలో ఎక్కడా అనవసర భేషజాలు, కృత్రిమ శిల్పాలు లేవు. హాయిగా చదివించే కథలు. దానికి ముఖ్య కారణం రంగనాథ రామచంద్ర రావు గారి అనువాదమనే చెప్పాలి" అన్నారు ఆచార్య సి. మృణాళిని తన ముందుమాటలో. 

లక్ష్మీ ప్రచురణలు ప్రచురించిన ఈ 136 పేజీల పుస్తకం వెల రూ. 120. పుస్తకం చివర్లో మూల రచయిత్రులందరి క్లుప్త పరిచయం ఇవ్వడం బాగుంది. 

బుధవారం, జూన్ 25, 2025

అడుగడుగున తిరుగుబాటు

సాహిత్యంతో ఏమాత్రం పరిచయం ఉన్నవారికైనా గీతా రామస్వామి పేరు వినగానే 'హైదరాబాద్ బుక్ ట్రస్ట్' గుర్తొస్తుంది. మిగిలిన ప్రచురణ సంస్థలు ప్రచురించడానికి అంతగా ఆసక్తి, ఉత్సాహం కనబరచని విలువైన పుస్తకాలు - ముఖ్యంగా అనువాదాలు - తెలుగునాట కనిపించడం వెనుక ప్రత్యక్ష కారణం హెచ్.బీ.టీ కాగా పరోక్ష కారణం ఆ సంస్థ వ్యవస్థాపకురాలు గీత. ఆమె అభిరుచులు ఏవిటన్నది హెచ్.బీ.టీ పుస్తకాలు చదివే పాఠకులందరికీ తెలుసు. ఆమె జీవితం ఏవిటన్నది వివరిస్తూ రాసిన ఆత్మకథ 'అడుగడుగున తిరుగుబాటు' ఈమధ్యనే మార్కెట్లోకి వచ్చింది. ఆమె కేవలం ప్రచురణ కర్త మాత్రమే అయితే ఈ పుస్తకంలో పెద్దగా విశేషాలు ఏవీ ఉండక పోయేవేమో.. కానీ ఆమె విద్యార్థి జీవితం నుంచే రాజకీయాల్లోకి వచ్చి, నక్సలెట్లతో కలిసి కొంతకాలం పనిచేసి, అటుపైన ఉద్యమకారిణిగా జీవితాన్ని కొనసాగించారు. 

పుస్తకం పేరుకు తగినట్టే గీత జీవితంలో అడుగడుగునా తిరుగుబాటే. మృత్యువు అంచు వరకూ వెళ్లొచ్చిన సందర్భాలు ఎన్నెన్నో. ఉద్యమాలతోనూ, రాజకీయాలతోనూ ఏమాత్రం సంబంధం లేని సాంప్రదాయ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన గీతకి చిన్ననాడు ఆ సంప్రదాయాలే బందిఖానాలుగా అనిపించాయి. తండ్రి ఉద్యోగ రీత్యా అనేక ప్రాంతాలలో నివాసం ఉన్నా, కాలేజీ చదువు నాటికి చేరుకున్న హైదరాబాద్ నే తన స్థలంగా నిర్ణయించుకున్నారామె. ఉస్మానియా యూనివర్సిటీలో చేరడం, వామపక్ష రాజకీయాలతో పరిచయం ఏర్పడడాన్ని తన వికాసపు ప్రారంభ దినాలుగా భావిస్తారామె. మడి, మైలలని తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు గొడ్డు మాసం తినడం ద్వారా సంప్రదాయం నుంచి స్వేచ్ఛని ప్రకటించుకున్న ఆమె, తర్వాత జీవితంలో ఎప్పుడూ మాంసాహారాన్ని విడిచిపెట్టలేదు, ఏ సంప్రదాయాన్నీ పాటించనూ లేదు. 

సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జన్సీ ని ప్రకటించే నాటికి గీత నక్సల్బరీ ఉద్యమంలో వున్నారు. అది కూడా  అడవుల్లో కాదు, హైదరాబాద్ నగరంలో. మురికి వాడల ప్రజల కోసం పని చేస్తూ ఉన్న కాలం లోనే ఉన్నట్టుండి ఎమర్జన్సీ వచ్చి పడడంతో, తప్పనిసరిగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళవలసి రావడం, కుటుంబంతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవడం జరిగాయి. నగర నేపధ్యం నుంచి వచ్చిన గీతకు నిజానికి కుల సమస్య పట్ల మొదట్లో అవగాహన లేదు. ఆమె పనిచేసిన రాజకీయ విభాగాలలోనూ, తొలిగా చదివిన ఉద్యమ సాహిత్యం ద్వారానూ ఆమెకి 'వర్గం' పరిచయం అయింది తప్ప, కులం కాదు. ఎమర్జన్సీ అనంతర కాలంలో ఆమె పార్టీ రాజకీయాలకి అతీతంగా ప్రజలతో కలిసి పనిచేయాలని భావించినప్పుడు, హైదరాబాద్ సమీపంలోని ఇబ్రహీంపట్నం కి ఓ సర్వే నిమిత్తం వెళ్లే అవకాశం వచ్చింది. ఆమె జీవితాన్ని పెద్ద మలుపు తిప్పిన సంఘటనల్లో ఇది ముఖ్యమైనది. 

ఇబ్రహీంపట్నం ని తన కార్యక్షేత్రం గా చేసుకుని, ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములని భూమి లేని నిరుపేదలకి ఇప్పించే ఉద్యమాన్ని సుదీర్ఘ కాలం పాటు పెద్ద ఎత్తున నిర్వహించారు గీత. హైదరాబాద్ సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనమైన తర్వాత, ముస్లిం జాగీర్దార్లు సంస్థానాన్ని విడిచి వెళ్లడంతో, ఆ భూములని  స్థానిక భూస్వాములైన రెడ్డి కులస్థులు తమ ఆస్తులుగా ప్రకటించుకున్నారు. కొన్ని చోట్ల దొంగ డాక్యుమెంట్లతో, చాలా చోట్ల అసలు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా. ఆ భూములని నిరుపేదలకు ఇప్పించడం కోసం స్థానిక మాదిగ కులస్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించారు గీత. ఇందుకు అటు నక్సలైట్ల నుంచి కానీ, ఇటు వామపక్షాల నుంచి కానీ ఎటువంటి సహాయం తీసుకోలేదామె. స్థానికంగా వ్యవసాయ కూలీల సంఘాన్ని ఏర్పాటు చేసి, మొదట వెట్టి కార్మికుల విముక్తితో మొదలు పెట్టి, అటుపైన భూముల పంపిణీ వరకూ ఉద్యమాన్ని పెంచుకుంటూ వచ్చారు. 

జార్జి రెడ్డి సోదరుడు సిరిల్ గీతకి సహచరుడు. అతడు న్యాయ విద్యని అభ్యసించడంతో పాటు, 'ఆసరా' అనే సంస్థని స్థాపించి నడిపించాడు.  భూసంబంధ కోర్టు కేసులన్నీ ఆసరా చూసేది. ఉస్మానియా సహాధ్యాయులలో కొందరు ఆమెకి మద్దతిచ్చారు. మరికొందరు బహిరంగానే విభేదించారు. భూస్వాములందరూ ప్రభుత్వంలో బాగా పలుకుబడి ఉన్నవాళ్లు కావడంతో భూ పంపిణీకి అడుగడుగునా అడ్డంకులే వచ్చాయి. ఎప్పటికప్పుడు తన కార్యచరణని సమీక్షించుకుంటూ, తప్పులు సరిదిద్దుకుంటూ ముందుకు సాగారు గీత. ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల అనేక గ్రామాల ప్రజల విశ్వాసాన్ని సంపాదించారు. పెద్దలతో విరోధాలకి లెక్కేలేదు. "మేమందరం కలిసి ఇబ్రహీంపట్నం లో రెడ్డి రాజ్యాన్ని కూలదోశాము" అని రాసుకున్నారామె. 'ఈనాడు' రామోజీరావు ఆమె భూ పోరాట కథని సినిమాగా తీస్తానని ప్రతిపాదించడం కొసమెరుపు. 

ఒకపక్క హెచ్.బీ.టీ ద్వారా పుస్తకాలని ప్రచురిస్తూనే, మరోపక్క ఇంత బలమైన ప్రజా ఉద్యమాన్నిప్రజాస్వామిక పద్ధతిలో నిర్మించి, కొనసాగించడం, తనని నమ్మిన ప్రజలందరినీ ఏకతాటిపై నిలిపి వారి హక్కుని సాధించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. బాల్యం మొదలు కాలేజీ వరకూ వ్యక్తిగత జీవితం కనిపించే ఈ ఆత్మకథలో, అటుపైన ఉద్యమాలు, పోరాటాలు మాత్రమే కనిపిస్తాయి. నేను బదులు 'మేము' కనిపిస్తుంది పేజీలన్నింటా. 'Land Guns Caste Woman: The Memoir of a Lapsed Revolutionary' పేరిట గీత ఇంగ్లీష్ లో రాసుకున్న ఆత్మకథని ప్రభాకర్ మందార తెనిగించారు. ఎక్కడా అనువాదంలాగా అనిపించక పోవడం, పురుష హృదయం ఏమాత్రం తొంగి చూడకపోవడం ఈ పుస్తకం ప్రత్యేకత. హెచ్.బీ.టీ ప్రచురించిన ఈ 456 పేజీల పుస్తకం వెల రూ. 499. సాహిత్యంతో పాటు ప్రజా ఉద్యమాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళని ఆపకుండా చదివించే రచన. 

సోమవారం, మే 26, 2025

కార్తీక దీపాలు

తెలుగులో ఉత్తమ కథా సంకలనాలు జాబితాలో మొదటి వరుసలో ఉండే పేరు 'అమరావతి కథలు'. అమరావతి నేపధ్యంగా సాగే చిన్న చిన్న కథలని ఒక్కసారి చదివితే చాలు మరి మరిచిపోవడం కష్టం. భిన్నమైన ఇతివృత్తాలు, ఉత్కృష్టమైన శిల్పం, సజీవ పాత్రలు, క్లుప్త సంభాషణలు ఆ కథలని చిరస్మరణీయం చేశాయి. వాటిని రాసిన వారు సత్యం శంకరమంచి. ఎప్పుడు 'అమరావతి కథలు' చదివినా, 'ఈ రచయిత రాసిన మిగిలిన రచనలు కూడా అచ్చులోకి వస్తే బాగుండు' అనిపిస్తూ ఉంటుంది. కాస్త ఆలస్యంగానే అయినా ఆ కోరిక తీరింది. సత్యం రాసిన ఇరవై ఒక్క కథలు ప్లస్ ఒక నవలిక ని 'కార్తీక దీపాలు' పేరుతో ప్రచురించింది విజయవాడ నవోదయ ప్రబ్లిషర్స్ సంస్థ. ఈ కథల్లో కొన్ని 'అమరావతి కథలు' లాగే క్లుప్తమైనవి కాగా, ఎక్కువ కథలు పది-పదిహేను పేజీల నిడివి కలిగినవి. 

పుస్తకాన్ని ఏకబిగిన చదవడం పూర్తి చేసినప్పుడు ఈ కథలన్నింటి ఏక సూత్రం 'వేదన' - స్పష్టంగా చెప్పాలంటే 'జీవుడి వేదన' - అనిపించింది. ఇతివృత్తం ఏదైనప్పటికీ, పాత్ర నేపధ్యం ఎటువంటిది అయినప్పటికీ రచయిత వేదన పాఠకులకి అందుతుంది. కథల తాలూకు తొలి ప్రచురణ తేదీ, వివరాలని ఇవ్వక పోవడం వల్ల, ఇతివృత్తాన్ని, కథన రీతిని ఆధారం చేసుకుని రచయిత ఏ కాలంలో ఈ కథని రాసి ఉంటారన్నది ఊహించుకోవాలి పాఠకులు. ఇది చాలా పెద్ద శ్రమ. ఉదాహరణకి సంపుటిలో మొదటి కథ 'మేల్కొన్న మానవులు' చదువుతుంటే, 'ఈ కథ 'అమరావతి కథలు' రాసిన రచయిత నుంచి వచ్చిందేనా?' అన్న ప్రశ్న పదేపదే ఎదురవుతుంది. సత్యం తన తొలినాళ్లలో రాసిన కథ అయి ఉండవచ్చు అనిపిస్తుంది. ఇదే ప్రశ్న ఎదురయ్యే కథలు మరో నాలుగైదు ఉన్నాయి. 

రెండో కథ 'కాశీ చెంబు' కి తగినంత నగిషీ పని చేస్తే 'అమరావతి కథలు' సరసన నిలబడుతుంది. ఇతివృత్తం అమరావతి కథే కానీ, కథనంలో క్లుప్తతకి బదులు సాగతీత కనిపిస్తుంది. మూడో కథ 'ఫలశృతి' లో నాటకీయత పాళ్ళు అధికం. బుచ్చిబాబు తరహా ఇతివృత్తానికి సత్యం మార్కు ముగింపు. 'అన్నదమ్ములు' 'ఇంటిదీపం' మినీ కథలు లేదా స్కెచ్ లు. 'ఇక మీదట రాబోయే కథలు బాగుండవచ్చు' అనే నమ్మకాన్ని ఇచ్చిన కథ 'కలనేత చీర'. అనూహ్యమైన ముగింపుకి తీసుకెళ్లారు ఈ కథని. పేకాట వ్యసనపరుల కథ 'రమ్మీ'. జీవుడి వేదనే ఇతివృత్తంగా నడిపిన కథ 'ప్రశ్న'. పేరులాగే ప్రత్యేకంగా అనిపించే కథ 'ఎతికిరె సేసేలా'. పేరుకి తగ్గట్టే జయపూర్ కథా స్థలం. కథ మొత్తం ఒక పూట లో జరిగే ఎదురుచూపు. కుంభవృష్టి వర్షం నేపధ్యం. 

'అవతలిగట్టు' కథ సాధారణమే అయినా కథనం అపూర్వం. పద్మరాజు గారి 'గాలివాన' 'పడవ ప్రయాణం' గుర్తొస్తాయి, కథనం వరకూ. 'నీ వెనుక నేను' 'ఎర్ర మల్లె' ఒకే నాణెం తాలూకు బొమ్మా బొరుసూ అనవచ్చు. 'అండ్ దే లివ్డ్ హేపిలీ' అనిపించే కథ 'ఇంద్రధనస్సు', ఆనందార్ణవ  చిత్రణతో  పాటే అస్తిత్వపు ప్రశ్ననూ సంధిచడం ఈ కథ ప్రత్యేకత. 'మేల్కొన్న మానవులు' తరహాలోనే గ్రామీణ జీవన చిత్రణ చేసిన కథ 'పొడవని పొద్దు'. గ్రామ రాజకీయాల చుట్టూ అల్లిన కథ ఇది. స్త్రీ-పురుష సంబంధాల చుట్టూ అల్లిన కథలు 'మర్త్య లోకం - మరో లోకం', 'గుండె గొంతుకలోన'. చలం, బుచ్చిబాబుల కథలని గుర్తు చేసే కథలు ఈ రెండూ. 'అమరావతి కథలు' ని గుర్తు చేసే మరో కథ 'బందీ'. 'ఇహ సంసారం బహు దుఃఖారం' ఎందుకయ్యిందో సరదాగా చెప్పిన కథ ఇది. 

ఆపకుండా చదివించే కథ 'వియోగాంతే'. ఈ కథ పూర్తి చేశాక మరో కథకి వెళ్ళడానికి సమయం పడుతుంది. తర్వాతి కథ 'తెరసెల్లా' ఆ తర్వాతి కథ 'నర్తకి' లో నాటకీయత పాళ్ళు కొంచం ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా 'నర్తకి' కథ ఇతివృత్తం, కథనం బాగున్నా, ముగింపులో వచ్చే నాటకీయత నిరాశ పరిచింది. పుస్తకానికి శీర్షికగా ఉంచిన 'కార్తీక దీపాలు' కృష్ణ ఒడ్డున జరిగే కథ. నాయకుడి బాల్య స్నేహితురాలి కథ. కార్తీక దీపాలు కొండెక్కడాన్ని ఆమె కథకి అన్వయించిన కథ. ఈ కథలతో పాటు చేర్చిన నవలిక 'ఆఖరి ప్రేమలేఖ'. 'అనుబంధం' శీర్షికతో వెనుక మాట రాసిన వెల్చేరు నారాయణ రావు దీనిని నవల అన్నారు కానీ, పెద్ద కథ లేదా నవలిక అనవచ్చు. అమరావతి గాలిగోపురంలో కూర్చుని పుస్తకం చదువుకునే ఓ కుర్రాడికీ, తన కుటుంబంతో కలిసి 'కారులో' గుడికి వచ్చిన అమ్మాయికి మధ్య నడిచిన కథ. నవలిక మొత్తం నాయకుడు, నాయికకి రాసే ఉత్తరమే. అతడి వైపు కథ మాత్రమే. 

"'అమరావతి కథలు' వంటి గొప్ప రచనలు చేయడానికి గల పూర్వపు అర్హతను ఈ కథలు చదువరులకు తెలియజెపుతాయి" అన్నారు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ తన ముందుమాటలో. "మనస్సులో కొన్ని గాయాలతో, విసుగుదలతో, అసహనం అనుభవిస్తూ, ఆలయానికి, బయట ప్రపంచానికీ మధ్య సంప్రదాయం పేరిట కనిపించే అంతరువుని నిరసిస్తూ - ఆలయ పూజారుల ఇంటినుంచి విశాల ప్రపంచం లోకి ప్రయాణం చేసిన రచయిత..." అంటూ శ్రీకాంత శర్మ రాసిన వాక్యాలు ఈ కథల్ని మరింత బాగా అర్ధం చేసుకోడానికి దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు. అచ్చంగా 'అమరావతి కథలు' లాంటి కథలకోసం కాకుండా, 'అమరావతి కథలు' ని తన గమ్యంగా చేసుకున్నరచయిత ప్రయాణంలో మజిలీలు అని భావించి చదివితే పాఠకులని నిరాశ పరచవు ఈ కథలు. (పేజీలు 270, వెల రూ. 300, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

మంగళవారం, ఫిబ్రవరి 04, 2025

విప్లవ తపస్వి పి.వి.

పుస్తకం పేరు చూడగానే 'ఏవిటీ విరోధాభాస?' అనుకున్నాను. విప్లవం, తపస్సు రెండూ భిన్న ధృవాలు కదా. ఈ రెంటినీ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి ఎలా అన్వయించి వుంటారు? అన్న ఆసక్తి కలిగింది. పుస్తకం పీవీకి సంబంధించింది కావడం మొదటిదైతే, రాసిన వారు సీనియర్ జర్నలిస్టు (పీవీ ప్రధాని పదవిని నిర్వహించిన కాలంలో ఢిల్లీ లో పనిచేసిన వారు), కవి, అనువాదకుడు (సాహిత్య అకాడెమీ బహుమతి గ్రహీత) కూడా కావడంతో పుస్తకాన్ని కొని ఏకబిగిన చదివేశాను. ఎ. కృష్ణారావు రాసిన మొత్తం ఏడు అధ్యాయాల ఈ పుస్తకంలో చివరి అధ్యాయం పేరు 'విప్లవ తపస్వి' స్వతంత్ర రజతోత్సవాల సందర్భగా 1972 ఆగస్టు 15 అర్ధరాత్రి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో పీవీ ఆవేశంగా చదివిన స్వీయ కవితలో సామాన్యుడిని వర్ణిస్తూ వాడిన మాట 'వాడు విప్లవ తపస్వి'. "పి.వి. నరసింహారావుకు సమయం ఉంటే ఇంకా ఎన్నో రచనలు చేసి ఉండేవారు. అయితే, పీవీ సాహిత్యం పైనే దృష్టి కేంద్రీకరించి ఉంటే, భారత దేశంలో ఇవాళ సమాన అనుభవంలో ఉన్న ఆర్ధిక, సామాజిక పరివర్తనాన్ని చూసి ఉండేవారం కాదేమో..!" అనే వాక్యంతో ఈ అధ్యాయమూ, ఈ పుస్తకమూ ముగిశాయి. ఆ ఆర్ధిక, సామాజిక పరివర్తనం ఏమిటన్నది మిగిలిన పుస్తకం చెబుతుంది.

"'ఆయనదొక రికార్డు కాని విజయవంతమైన చరిత్ర' అని పి.వి. నరసింహారావును 1994లో ప్రపంచ ఆర్ధిక వేదిక అధ్యక్షుడు క్లాస్ స్క్వాబ్ బహిరంగంగా ప్రశంసించారు" అనే వాక్యంతో ప్రారంభమయ్యే మొదటి అధ్యాయం 'పి.వి. ఒక చారిత్రక అవసరం' లో  భారత దేశంలో ఆర్ధిక సంస్కరణల పూర్వరంగాన్ని వివరించడంతో పాటు, పీవీ దేశ ప్రధాని కావడానికి నేపధ్యం, నాటి రాజకీయ, ఆర్ధిక పరిస్థితులు, అన్ని రాజకీయ పక్షాలనీ సమన్వయం చేసుకుంటూ ఆర్ధిక సంస్కరణలని విజయవంతంగా ప్రవేశ పెట్టిన తీరు, అదే సమయంలో సంస్కరణల దుష్ప్రభావం పేదలపై పడకుండా ఉండడం కోసం తీసుకున్న ప్రత్యేక చర్యలని సమగ్రంగా వివరించారు. "1991 ఎన్నికల్లో రాజీవ్ గాంధీ గెలిచి ఉంటే సంస్కరణలు ప్రవేశ పెట్టి ఉండేవారన్న వాదన అర్ధరహితం. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు మొదటి సగం సంవత్సరాలు ఉత్సాహంగా పని చేశారు కానీ తర్వాతి కాలంలో వెనక్కి తగ్గడం మొదలు పెట్టారు. దీనితో ఆయన హయాంలో ఆర్ధిక లోటు తీవ్రంగా పెరిగింది. ప్రభుత్వ తప్పుడు ఆర్ధిక  విధానాల గురించి హెచ్చరించిన ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారు, బ్యాంకింగ్ సెక్రటరీ బిమల్ జలాన్ ను రాజీవ్ గాంధీ ప్రపంచ బ్యాంకుకు పంపించారు" లాంటి ఆసక్తి కరమైన విశేషాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. 

"మొత్తానికి రాజీవ్ హయాంలో ప్రారంభమైన మోదీ ప్రాభవం, పి.వి. హయాంలో తిరుగులేనిదిగా మారింది. వారిద్దరూ కలుసుకున్నారనడానికి సమాచారం లేదు కానీ నరేంద్ర మోదీ పీవీ పట్ల అభిమానం పెంచుకున్నారనడానికి నిదర్శనాలున్నాయి" ..ఈ ప్రతిపాదనతో  'అయోధ్య-ఒక అధ్యాయం' ముగుస్తుంది. "పి.వి. మాజీ ప్రధానిగా ఉన్నప్పుడు అనేకసార్లు నేను (రచయిత) ఆయనతో అయోధ్య గురించి చర్చించాను. నేను బాబ్రీ మసీదు కూలిపోతున్న సమయంలో అక్కడే ఉన్నానని చెప్పినప్పుడు ఆయన ఆసక్తిగా అక్కడేం జరిగిందో తెలుసుకున్నారు. పి.వి. వాదనలు విన్న వారికెవరికైనా అయోధ్య ఉదంతంలో ఆయన పొరపాటు ఏమీ చేయలేదని అనిపిస్తుంది" అంటూ మొదలు పెట్టి, కరసేవ పూర్వాపరాలని కళ్ళకి కట్టినట్టు చెప్పారు కృష్ణారావు. "దేశంలో మత రాజకీయాలను ప్రవేశపెట్టి, రామ జన్మభూమి ఉద్యమాన్ని వ్యాపింపజేసి, బాబ్రీ మసీదు కట్టడం కూల్చివేత, గుజరాత్ అల్లర్లు వంటి ఘటనలకు కారణమైన భారతీయ జనతా పార్టీనే దేశ ప్రజలంతా ఆదరించడం దేశంలో మారుతున్న ప్రజల ఆలోచనా విధానానికి నిదర్శనం. ఈ మొత్తం క్రమంలో ఒక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పూర్తిగా కుదించుకుపోయింది. ఈ పరిణామాల క్రమంలో పి.వి. నరసింహారావును దోషిగా చిత్రించిన కాంగ్రెస్ పార్టీ ఏమి సాధించింది? దేశాన్ని మలుపు తిప్పిన ఆర్ధిక సంస్కరణలను ప్రవేశ పెట్టిన ఆయనను తమ నేతగా చెప్పుకోలేని దుస్థితిని స్వయంగా కల్పించుకున్న కాంగ్రెస్ పార్టీ, చరిత్ర మలుపులో స్వయం దోషిగా మిగిలిపోయిందని చెప్పక తప్పదు" అంటారు ఈ రచయిత. 

రాజకీయ చదరంగపుటెత్తులు, పై ఎత్తుల సమాహారం ఈ పుస్తకంలో మూడో అధ్యాయం 'వ్యూహాలు, ప్రతి వ్యూహాలు'. అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న పీవీ, పార్టీలోనూ, బయటా ఉన్న ప్రత్యర్థుల్ని అత్యంత బలంగా ఎదుర్కొన్న రాజకీయ సన్నివేశాలెన్నింటినో కళ్ళముందు ఉంచింది ఈ అధ్యాయం. "పి.వి. హయాంలో అసమ్మతి శిబిరాన్ని పరోక్షంగా నిర్వహించిన సోనియా క్రమంగా పీవీ తర్వాత అధికారం కోసం వేగంగా పావులు కదిపారు. ఆమెకు అధికారం పట్ల కాంక్ష లేదన్న అభిప్రాయాలు పటాపంచలయ్యాయి. 1998లో సీతారాం కేసరిని ఇంటికి పంపించి సోనియా పార్టీ అధ్యక్షురాలయ్యారు. పి.వి. పై అసమ్మతి శిబిరం నడిపిన వారందర్నీ పార్టీలో కీలక పదవుల్లో చేర్చుకున్నారు" అంటూ స్పష్టంగానే పార్టీలో అసమ్మతికి మూలకారణాన్ని చెప్పారు కృష్ణారావు. ఇక, ప్రతిపక్షాల నుంచి ఒత్తిళ్లు, గద్దె దింపే ప్రయత్నాలు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సభలో పూర్తి మెజారిటీ లేకపోవడం, పీవీని అత్యంత బలహీన ప్రధానిగా వాళ్ళు భావించడం, వీపీ సింగ్ ని బలహీన పరిచినట్టే పీవీని కూడా బలహీన పరిచి బిజెపిని అధికారంలోకి తేవాలన్న ఆ పార్టీ నాయకత్వపు ఆత్రుత అంటారు ఈ రచయిత. 

మూడో అధ్యాయానికి కొనసాగింపుగా నాలుగో అధ్యాయం 'కుంభకోణాల వెనుక కోణాలు' ని చెప్పాలి. ప్రధాని స్థాయి వ్యక్తి మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడం బోఫోర్స్ కుంభకోణంతో మొదలైతే, అది పరాకాష్టకి చేరింది పీవీ హయాంలోనే అని చెప్పాలి. ఐదేళ్ల కాలంలో అనేక కుంభకోణాలు, లెక్కకి మించిన కేసులు. పెద్ద పదవిని నిర్వహించి, పదవి నుంచి దిగిన తర్వాత చాలా ఏళ్ళ పాటు కోర్టుల చుట్టూ తిరిగిన మరొక నాయకుడు లేడు బహుశా. "పి.వి. నరసింహారావు హయాంలో జరిగాయని ప్రచారం జరిగిన కుంభకోణాలు ఏవీ నిజంగా కుంభకోణాలు కావని, అవన్నీ పీవీని అప్రతిష్ట పాలు చేయడానికి కుట్ర పూరితంగా సృష్టించినవని అర్ధం చేసుకోడానికి పెద్ద ఆలోచన అవసరం లేదు" అంటారు కృష్ణారావు. "స్టాక్ మార్కెట్ కుంభకోణం, జైన్ హవాలా వ్యవస్థీకృత లోపాలు, వారసత్వంగా వచ్చిన అవినీతి కార్యకలాపాల మూలంగా తలెత్తినవి కాగా, ప్రధానమైన లఖుభాయి పాఠక్, సెయింట్ కిట్స్ ఆరోపణలు పీవీపై దుష్ప్రచారం చేసేందుకు సృష్టించినవని వేరే చెప్పక్కర్లేదు. దక్షిణాది నుంచి మొట్టమొదటిసారి ప్రధాని అయిన పీవీని నిందలపాలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత శక్తులు ప్రయత్నించాయి. ఇవన్నీ అధికార పరమపద సోపాన పటంలో ఎత్తుకు పై ఎత్తుల్లాంటివి" అంటారు. 

అణు పరీక్షలు, విదేశాలతో సంబంధాలు -- ముఖ్యంగా పీవీ 'లుక్ ఈస్ట్' పాలసీ, కాశ్మీర్ సమస్య తదితర అంశాలని నిశితంగా చర్చించిన అధ్యాయం 'ఇంటా బయటా సాహసాలు'. ప్రధానిగా స్వరాష్ట్ర రాజకీయ శక్తులతో వ్యవహరించిన తీరుని 'తెలుగదేలయన్న' అధ్యాయంలో చదవచ్చు. పీవీ-ఎంటీఆర్, పీవీ-వైఎస్ రాజశేఖర రెడ్డి సంబంధాలు ఆసక్తిని కలిగిస్తాయి. ముఖ్యంగా నాటి రాష్ట్ర కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు, పై చేయి కోసం గ్రూపుల ప్రయత్నాలు, తాపత్రయాలు వీటన్నిటినీ ఒకింత వివరంగానే రాశారు. పుస్తకంలో చివరి అధ్యాయం ముందుగా చెప్పుకున్న 'విప్లవ తపస్వి'. సాహితీవేత్తగా పీవీని గురించి వివరంగా చెప్పే అధ్యాయం ఇది. "స్పానిష్ రచయిత గాబ్రియల్ గార్షియా మార్క్వెజ్ రచించిన 'వన్ హండ్రెడ్ ఇయర్స్ అఫ్ సాలిట్యూడ్' ను ఇంగ్లీషులో చదివి, పీవీ దాని స్పానిష్ మూలాన్ని తెప్పించుకుని చదివారు. ఆ తర్వాత మార్క్వెజ్ రచించిన 'లవ్ ఇన్ ది టైం అఫ్ కలరా' కూడా చదివారు. 'ఇంగ్లీషులో కన్నా స్పానిష్ భాషలో చదివితే ఇంకా మంత్రముగ్ధులమైపోతాం' అన్నారు" లాంటి విశేషాలెన్నో వున్నాయి ఈ అధ్యాయంలో. ఆధునిక భారతదేశపు చరిత్ర మలుపు తిరిగిన కాలాన్ని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న వారిని ఆపకుండా చదివించే రచన ఈ 'విప్లవ తపస్వి'. శ్రీ రాఘవేంద్ర ప్రచురణ, పేజీలు 224, వెల రూ. 150, అన్ని పుస్తకాల షాపుల్లోనూ, అమెజాన్ లోనూ లభిస్తోంది. 

శుక్రవారం, జనవరి 24, 2025

పదహారు ...

చెప్పుకోడానికి పెద్దగా ఏమీ లేదు.. మరో ఏడాది గడిచింది.. 

అత్యల్పంగా సగటున రెండు నెలలకి ఒక పోస్టు.. 

అయినా అదే ఆదరణ.. మీకేం చెప్పగలను, ధన్యవాదాలు తప్ప... 

Google Image