మంగళవారం, మార్చి 22, 2016

కాల ప్రవాహం

అనువాద సాహిత్యం చదివే వాళ్లకి, మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయి వస్తున్న కథలు, నవలలు చదివే వారికి జిల్లేళ్ళ బాలాజీ పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సుప్రసిద్ధ తమిళ రచయిత జయకాంతన్ రాసిన నవలని 'కల్యాణి' పేరుతో తెనిగించి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గెలుచుకున్న రచయిత/అనువాదకుడు. బాలాజీ అనువదించిన ఇరవై ఒక్క కథలతో వచ్చిన సంకలనమే 'కాల ప్రవాహం.'

తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి ఎమ్. కరుణానిధి, ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ వ్యవస్థాపకులు సి. ఎన్. అణ్ణాదురై - వీళ్ళిద్దరూ రాజకీయనాయకులకన్నా ముందు రచయితలన్న సంగతి తక్కువమందికి తెలుసు. వీళ్ళిద్దరిదీ చెరో కథా ఈ సంకలనంలో చోటు చేసుకోవడం విశేషం. బాబ్రీ మసీదు విధ్వసం నేపధ్యంలో తలెత్తిన మత ఘర్షణలు ఇతివృత్తంగా కరుణానిధి రాసిన కథ 'ఉడుత పిల్ల' డీఎంకె సిద్ధాంతాలు తెలిసిన వాళ్లకి ఏమాత్రం ఆశ్చర్యం కలిగించదు. ఇక, అణ్ణాదురై రాసిన 'ఎర్ర అరటి' పేరుకి తగ్గట్టే కాస్త ఎర్రగా ఉంటుంది. చక్కని కథ ముగింపులో వామపక్ష రాజకీయ నినాదం వినిపిస్తుంది.

ఇందిరా పార్థసారథి రాసిన 'కాల ప్రవాహం,' 'స్పష్టం,' ప్రభంజన్ కథ 'నాన్న పంచె,' వణ్ణ నిలవన్ 'వాన,' కందసామి రాసిన 'పాండిచ్చేరి,' ఎస్. రామకృష్ణన్ కథ 'రెండు బుడగలు' చాలాకాలం గుర్తుండిపోతాయి. వీటిలో 'స్పష్టం' 'నాన్నపంచె' కథల నేపధ్యాలు దగ్గరగా అనిపిస్తాయి. 'వాన' 'పాండిచ్చేరి' కథల మెరుపు ముగింపులు ఆ కథల్ని గుర్తు పెట్టుకునేలా చేస్తాయి. 'రెండు బుడగలు' కథని స్త్రీవాద కథ అనొచ్చేమో. దాదాపు ఒకే ఈడు వాళ్ళయిన ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్, దొంగతనం కేసులో నేరస్తురాలు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి చేసే ప్రయాణమే ఈ కథ.


సుజాత (రంగరాజన్) రాసిన 'కుందేలు,' ఇందిరా పార్ధసారథి కథ 'సుమంగళి ప్రార్ధన' కరుణ రస ప్రధానంగా సాగే కథలు. రోమన్ శాస్త్రవేత్త జియార్డినో బ్రూనో మరణం వెనుక కథకి అక్షరరూపం ఎస్. రామకృష్ణన్ రాసిన 'ఔను బ్రూనో.. వాళ్ళు నేరస్తులే!' కోర్టు కేసు నేపధ్యంగా సాగే కథ ఇది. రామకృష్ణన్ దే మరోకథ 'బుద్ధుడు కావడం సులభం' కథలో కథకుడితో మగ పిల్లల తండ్రులందరూ తమని తాము ఐడెంటిఫై చేసుకుంటారు. సుజాతదే మరో కథ 'నిబంధన,' జీవిదన్ రాసిన 'మౌనమే..' కథలు చదువుతున్నంతసేపూ మామూలు కథల్లాగే అనిపించి, చదవడం పూర్తయ్యాక ఆలోచనల్లో పడేస్తాయి.

మర్డర్ మిస్టరీ నేపధ్యంలో సాగే కథ తిలకవతి 'శిక్ష.' ఈ కథ ముగింపు పాఠకులకి ఓ పజిల్. ఏం జరిగిందో కథలో చెప్పారు తప్ప, అలా ఎందుకు జరిగిందన్నది పాఠకుల ఊహకే వదిలేశారు. మయూరన్ రాసిన 'సవాల్,' వాణది తిరునావుక్కరసు 'మార్గదర్శి,' నల్లతంబి కథ 'కొడుకుని వెతుక్కుంటూ...' పూర్తిగా బాల సాహిత్యం. ఒక్కమాటలో చెప్పాలంటే చిన్నపిల్లలకి ఉద్దేశించిన నీతికథలివి. సుబ్రహ్మణ్యరాజు రాసిన 'నాలుక' కథలాంటిదే తెలుగులో ఉంది. ఎవరి రచనో ఎంత ప్రయత్నించినా గుర్తు రావడంలేదు.

బాలాజీ అనువాదం చాలా సాఫీగా సాగింది. తమిళ ప్రాంతాలు, అక్కడి సంస్కృతులు పరిచయం అవుతాయి ఈ కథల ద్వారా. అనువాదం ప్రచురితమైన తేదీలు ఇచ్చారు కానీ మూలకథల తొలి ప్రచురణ తేదీలు కూడా ఇచ్చి ఉంటే ఆ కథల్ని మరింత బాగా అర్ధం చేసుకోడానికి వీలుండేది. కథల్లో సంభాషణలని బట్టి కథా కాలాన్ని కొంతవరకూ ఊహించే వీలున్నప్పటికీ, ప్రకాశాకులే తేదీలు ఇచ్చేస్తే పాఠకులకి సులువుగా ఉండేది. ప్రింటింగ్ కంటికింపుగా ఉంది. అచ్చుతప్పులు లేవనే చెప్పాలి. అనువాద సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్లకి నచ్చే సంకలనమిది. ('కాల ప్రవాహం,' నవచేతన పబ్లిషింగ్ హౌస్ ప్రచురణ, పేజీలు  165, వెల రూ. 110, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

2 కామెంట్‌లు:

  1. మీరు ఉదహరించిన సుబ్రమణ్య రాజుగారి కధ "నాలుక " కి నేను చేసిన అనువాదం ఈ మాటలో వచ్చింది. దాని లింక్ ఇస్తున్నాను. రెండూ ఒకటే అనుకుంటున్నాను.

    http://eemaata.com/em/issues/201209/1984.html

    రిప్లయితొలగించండి
  2. @గౌరీ కృపానందన్ : అవునండీ.. అదే కథ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి