శుక్రవారం, మార్చి 11, 2016

నెమరేసిన మెమరీస్

పుట్టింట్లో ఇరవై ఏళ్ళు, మెట్టినింట్లో యాభై ఏళ్ళు గడిపిన ఓ స్త్రీ తన జీవిత కథని రాస్తే, సింహభాగం విశేషాలు ఎక్కడివయి ఉంటాయి? జవాబు చెప్పడానికి పెద్దగా ఆలోచించనవసరం లేదు. అత్యంత సహజంగానే అవి పుట్టింటికి సంబంధించినవే అయి ఉంటాయి. ఉదాహరణ కావాలంటే ముళ్ళపూడి శ్రీదేవి రాసిన 'నెమరేసిన మెమరీస్' పుస్తకం తిరగేయచ్చు. పాత్రికేయుడు, కథకుడు, సినిమా రచయిత, నిర్మాత, అన్నింటినీ మించి బాపూకి ప్రాణ స్నేహితుడు.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ముళ్ళపూడి వెంకటరమణ సతీమణి రాసుకున్న తన కథలో సగానికి పైగా పేజీలు  ఆవిడ బాల్యం తాలూకు జ్ఞాపకాలే.

కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని ఆరుగొలను గ్రామ కరణం గారమ్మాయి నండూరు శ్రీదేవి, ముళ్ళపూడి వెంకటరమణతో వివాహం అయ్యాక ముళ్ళపూడి శ్రీదేవిగా మారారు. తండ్రిగారి నుంచి అన్నల తరం వచ్చేసరికి 'నండూరు' కాస్తా 'నండూరి' గా మారిపోయింది. అన్నలందరూ పత్రిక, రచనా రంగాలలో ఉన్నవారే. ఆ ఊళ్ళో ఆరు కొలనులు ఉండేవి కాబట్టి 'ఆరుగొలను' అని పేరొచ్చిందన్న వివరం మొదలు, తన బడిచదువు, పరీక్షలహడావిడి, బంధువులు, స్నేహితులతో ఆటపాటలు.. ఒకటేమిటి, ఎన్నో, ఎన్నెన్నో కబుర్లు పాఠకులని ఒక్కసారిగా వాళ్ళ బాల్యాల్లోకి తీసుకుపోతాయి.

అన్నలు, వదినలు, కసిన్స్, బంధువులు.. ఈ విషయాలన్నీ ఆవిడ వాళ్ళ పిల్లలకి చెబుతున్నంత సహజంగా రాసుకుపోయారు. ఒక్కోచోట ఆ బంధువులు ఎవరెవరో అర్ధం కాక ఒకలాంటి అయోమయం కలుగుతూ ఉంటుంది. అయితే, అక్కడ రచయిత్రి చెప్పదలచుకున్న విషయానికి ఆ బంధుత్వపు వరస ఏమిటన్నది అడ్డంకి అవ్వదు. నచ్చిన విషయం ఏమిటంటే, ఉమ్మడి కుటుంబం అనగానే అదో ఆనందాల హరివిల్లు అని కాక, అందులో ఉండే కష్ట సుఖాలు రెంటినీ సమంగా చెప్పడం. అలాగే, బాల్యంలో దగ్గరి వాళ్ళతో వచ్చే మాట పట్టింపులు, వాటి తాలూకు పరిణామాలు ఇవన్నీ పుస్తకాన్ని అలవోకగా చదివించేస్తాయి.


పెళ్ళికి ముందే రమణ రచనలతో పరిచయం ఉండడం, పెళ్ళిసంబంధం అనుకున్నప్పుడు జరిగిన సంఘటనలూ ఇవన్నీ ఏమాత్రం నాటకీయత లేకుండా చాలా సహజంగా చెప్పారు. పెళ్లి తర్వాత మద్రాసు జీవితం, సినిమా రంగంతో దగ్గరగా మసలడం ఇవన్నీ ఆవిడ పాయింటాఫ్ వ్యూ నుంచి తెలుసుకునే అవకాశం ఇస్తుందీ పుస్తకం. మంచి విషయాలు చెప్పినప్పుడు ఆ తారల పేర్లని ప్రస్తావించిన శ్రీదేవి, తనకి బాధ కలిగించిన సంఘటనల దగ్గరకి వచ్చేసరికి అవతలివారి వివరాలు ఏమాత్రం ఇవ్వకుండా ఆయా సంఘటనలని మాత్రం ప్రస్తావించి ఊరుకున్నారు. రెండో తరహా విషయాలకి పెద్దగా చోటివ్వలేదు కూడా.

"భాగ్యవతితో నా సహజీవనం యాభై ఏళ్ళ నాటిది" అంటూ మొదలు పెట్టి బాపూ భార్య భాగ్యవతిని గురించి ఎన్నో విశేషాలు పంచుకున్నారు శ్రీదేవి. "చాలామంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని ఇద్దరినీ చూసి, బాపు గారు రమణగారు కలిశారు సరే మరి మీరిద్దరూ కూడా కలిసి ఎలా ఉంటున్నారు ఇన్నేళ్ళుగా, పంతాలూ పేచీలూ, పట్టింపులూ రావా, ఎలా సాగుతున్నారు అని. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. మేమూ అందరిలాంటి వాళ్ళమే. మాకూ పంతాలూ, పేచీలూ, పట్టింపులూ వస్తాయి. కాని అంతవరకే. పోట్లాడుకునేంతగా, కలిసి ఉండలేనంతగా అభిప్రాయ భేదాలు ఎప్పుడూ రాలేదు" అంటారు.

ఆరుగొలను నుంచి మద్రాసు వరకూ జరిగిన ప్రయాణంలో ఎదురైన ఎన్నో ఎత్తుపల్లాలు, ఆనంద విషాదాలు, మాట పట్టింపులు, సర్దుబాట్లు, సాయం ఇచ్చి పుచ్చుకోడాలు, కష్టాలు వచ్చినప్పుడు ఓర్చుకుని నిలబడ్డ వైనాలు ఇవన్నీ ఆపకుండా చదివిస్తాయీ పుస్తకాన్ని. చదువుతున్నంతసేపూ బాపూ రమణలు కూడా శ్రీదేవి పాయింటాఫ్ వ్యూ నుంచి పాఠకులకి కనిపించడం ఈ పుస్తకం ప్రత్యేకత. ఓ మామూలు గృహిణి ఆత్మకథ అనిపిస్తుందే తప్ప, సెలబ్రిటీ కుటుంబానికి చెందిన స్త్రీ రాసిన పుస్తకం అని ఎక్కడా అనిపించదు. చివరి పేజీల్లో ఎమోషన్, ఈ పుస్తకాన్ని చాలా రోజులపాటు గుర్తు పెట్టుకునేలా చేస్తుంది. ముళ్ళపూడి వెంకటరమణ చాలా అదృష్టవంతులని మరోమారు అనిపిస్తుంది. (రాజాచంద్ర ఫౌండేషన్ ప్రచురణ, పేజీలు  144, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి