ఆదివారం, జనవరి 09, 2011

సాగర సంగమం

మాధవి.. పేరుకి తగ్గట్టే అందమైన అమ్మాయి. అంతకు మించిన సున్నితమైన హృదయం. లలిత కళలంటే, ముఖ్యంగా నాట్యం అంటే ప్రాణం ఆమెకి. ఆమె ఇష్టాలకి అభ్యంతరం చెప్పని తండ్రి. పుట్టింది కలిగినింటే కావడం వల్ల ఆర్ధిక ఇబ్బందుల చింత లేదు. తనకి నచ్చినట్టుగా జీవిస్తూ అందులో ఆనందాన్ని వెతుక్కుంటున్న మాధవి నీలి కళ్ళలో కనీకనిపించని నీలి తెర. గతం చేసిన గాయం తాలూకు జ్ఞాపకం కావొచ్చు.


భారతీయ నృత్య రీతులమీద సాధికారికంగా మాట్లాడగల మాధవి వాటిని గురించి ఆంగ్ల పత్రికకి వ్యాసాలు రాస్తూ ఉంటుంది. అదిగో, పనిలో ఉండగానే మాధవికి బాలూ పరిచయ మవుతాడు. నాట్యం అంటే ప్రాణం బాలూకి. భారతీయ నాట్య రీతులన్నీ ఔపోసన పట్టి కొత్త రీతిని తయారు చేయాలన్నది బాలూ కల. అయితే, మాధవి లాగా అతను డబ్బున్నవాడు కాదు. వంటలు చేసి పొట్ట పోషించుకునే తల్లి, కష్టమైనా సుఖమైనా కలిసి పంచుకునే మిత్రుడు రఘు.. ఇవీ బాలూ ఆస్థిపాస్తులు.


బాలూ ఎంతటి అభిమానధనుడంటే, మాధవి తీసిన తన ఫోటోలలో ఒకదానిని తన తల్లికోసం అడిగి తీసుకోడానికి కూడా మొహమాట పడేటంత. అప్పటికే బాలూ నేర్చుకున్న నాట్య రీతుల మీద అతనికున్నట్టు, అంతకు మించి నాట్యం పట్ల అతడికున్న అవ్యాజమైన  ప్రేమని అతితక్కువ కాలంలోనే అర్ధం చేసుకుంది మాధవి. త పరపతి ఉపయోగించి, ఆలిండియా డాన్స్ ఫెస్టివల్ లో నృత్య ప్రదర్శన చేయగలిగే  అరుదైన అవకాశాన్ని బాలూకి ఇప్పించగలిగింది. మాధవి సాంగత్యంలో అప్పుడప్పుడే ఎదుటివారిని అర్ధం చేసుకోడం మొదలు పెట్టిన బాలూ, ఇన్విటేషన్లో తన ఫోటో చూసుకుని చేష్టలుడిగి పోతాడు. ఆక్షణంలో అతడు తన భావోద్వేగాలని నిస్సంకోచంగా పంచుకున్నది మాధవితోనే.


తనతోపాటు తల్లినీ ఫెస్టివల్ కి తీసుకెళ్ళి, ప్రేక్షకుల్లో ముందువరుసలో ఆమెని కూర్చోబెట్టి, ఆ మహాజనం ముందు తను నాట్యం చేస్తుండగా ఆమె కళ్ళలో కనిపించే సంతోషాన్ని చూడాలన్న బాలూ కోరిక మాధవికి తెలియనిది కాదు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది. అన్నీ అనుకున్నట్టుగా జరిగిపోతే విధినీ, దేవుడినీ తలచుకునే వాళ్ళెవరు? ప్రయాణం రెండు రోజులుందనగా తీవ్ర అనారోగ్యంతో కన్ను మూస్తుంది బాలూ తల్లి. పోతూపోతూ తన అంత్యక్రియల కోసం దాచుకున్న డబ్బు కొడుక్కి అందేలా చేస్తుంది. ఆ మహా విషాదాన్ని బాలూ పంచుకున్నది కూడా మాధవితోనే.



బాలూని మామూలు మనిషిని చేయాలన్నది మాధవి సంకల్పం. అందుకే అతడిని తనున్నాననీ, ఎప్పటికీ అతడితోనే ఉంటాననీ చెబుతుంది మాధవి. తల్లి మరణంతో కుంగిపోయిన బాలూలో కదలిక ఉవ్వెత్తున ఎగసింది. మాధవిని తను ప్రేమిస్తున్నాననీ, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాననీ ఆమెకి చెబుతాడు బాలూ. మాధవిలో సంకోచం, సందిగ్ధత. అతనికి ఏమని చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియని అయోమయం. అతడు సున్నితంగా అందించిన గులాబీని సంకోచంగా అందుకుని తన జడలో తురుముకుంటుంది. ఆమె నీలి కళ్ళలో మాటలకందని భావాలు.


గతాన్నితుడిచేయగలమా? వెంటాడే జ్ఞాపకాలని కడిగేయగలమా? తనకో తోడు దొరికిందన్న ఆనందం బాలూని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న క్షణాల్లోనే, గత జ్ఞాపకాలని వదిలించుకుని కొత్తజీవితం మొదలుపెట్టే ప్రయత్నం ఆరంభించింది మాధవి. స్వతహాగా ఆవేశ పరుడు బాలూ. అందుకే కావొచ్చు, తన ప్రతిపాదనకి మాధవి నోటినుంచి ఎలాంటి జవాబూ రాకముందే, మాధవిని పెళ్లి చేసుకోవాలన్న తన ఆలోచనని ఆమె తండ్రితో పంచుకున్నాడు. మాధవి వివాహిత అనీ, ఆస్తి తగాదాల కారణంగా పెళ్ళైన మూడో రోజే పుట్టింటికి తిరిగి వచ్చేసిందనీ చెబుతాడు ఆమె తండ్రి.


సున్నిత మనస్కుడైన ఆ కళాకారుడు తన సంతోషాన్నైనా, విషాదాన్నైనా ప్రకటించ గలిగే మాధ్యమం ఒక్కటే.. నృత్యం. ఎగిసి పడుతున్న సముద్ర కెరటాలతో పోటీ పడి, బీచ్ లో నృత్యం చేస్తున్న బాలూని చూస్తుంది మాధవి. గతాన్ని పూర్తిగా తుడిచేసి అతడి చేయందుకోవాలన్న నిర్ణయానికి వచ్చి, తేలికపడ్డ మనసుతో అతడివైపు పరుగు తీస్తున్న మాధవి కాళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి, బాలూకి ఏడడుగుల ముందు ఓ పడవ మీద కూర్చున్న గోపాలరావుని చూడగానే. అతడితోనే ఆమె వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు నడిచింది.




మాధవి అదృష్టవంతురాలు. ఆమెని పెళ్ళిచేసుకున్న గోపాలరావు, ప్రేమించిన బాలూ ఇద్దరూ మంచివాళ్ళే. మాధవి-బాలూల పెళ్లి చేయాలని గోపాలరావు నిర్ణయించుకుంటే, మాధవిని గోపాలరావుతో కాపురానికి పంపాలని అనుకుంటాడు బాలూ. దేవుడిమీద భక్తి, బాలూమీద నమ్మకం ఉన్న మాధవి బాలూ మాటని గౌరవించింది. సకోచంగా జడతో తురుముకున్న గులాబీని తీసి తన పెళ్లి ఆల్బం మీద ఉంచింది, స్థిరంగా. ఆమె పక్కన తనకి చోటులేదన్న వాస్తవాన్ని అంగీకరించిన బాలూ, శాశ్వితంగా కెనడా వెళ్ళిపోతున్న గోపాలరావు, మాధవిల ఫోటో తీసుకున్నాడు. తర్వాత అతను ఏడాదంతా బతికింది తను వాళ్ళిద్దరినీ కలిపిన రోజు కోసమే.. రోజున వాళ్ళ క్షేమం కోరుతూ అన్ని గుళ్ళూ తిరగడానికే.



కాలానికి కనికరం లేదు. అందుకే అది ఎవ్వరికోసమూ ఆగదు. నాట్యం అంటే తనకున్న మక్కువని తన కూతురు శైలజని నర్తకిగా తీర్చి దిద్దడం ద్వారా తీర్చుకుంది మాధవి. గోపాలరావు మరణం తర్వాత, కూతురితో కలిసి స్వదేశానికి తిరిగి వచ్చేసింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బాలూని చూసిన మాధవి అతడి స్థితికి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. కళలో ఏకోన్ముఖుడు కాలేకపోయిన సున్నిత హృదయుడు మద్యానికి బానిసై, మరణానికి చేరువగా ఉన్నాడు. మరోపక్క శైలజ మిడిమిడిజ్ఞానంతో తానో గొప్ప నాట్యకత్తెనని మిడిసిపడుతోంది. నేర్చుకోవాల్సింది ఏదీ లేదన్న అహంకారం కమ్మేసిందామెని.



బాలూలోని కళాకారుడు బహిర్గతం కాకుండా ఉండిపోయిన సంగతి తెలుసు మాధవికి. అందుకు కారణాలనీ అర్ధం చేసుకుంది. అతడి ఆరోగ్యాన్ని బాగు చేయడం అసాధ్యం అని అర్ధమయ్యాక, శైలజని బాలూ శిష్యురాలిగా చేసి, బాలూ కళని బతికించే ప్రయత్నం చేయాలన్న ఆలోచన వచ్చింది మాధవికి. అటు బాలూ స్నేహితురాలిగానూ, ఇటు శైలజ తల్లిగానూ ఆలోచించి తీసుకున్న నిర్ణయం అది. చివరిరోజుల్లో ఉన్న బాలూని బాధ పెట్టడం ఇష్టం లేక తను వితంతువన్న నిజాన్ని దాస్తుంది మాధవి. ఇందుకుగాను కన్న కూతురి నుంచి ఏతల్లీ పొందకూడని అవమానాన్ని పొందుతుంది.

తన కళని బతికించుకోవడం కోసం, అంతకు మించి మాధవికిచ్చిన మాట కోసం, మరణంతో పోరాడి మరీ నాట్య కళలో మెళకువలన్నీ శైలజకి నేర్పాడు బాలూ. తన నాట్యం చూడకుండా మరణించిన తల్లిలా మాధవి కాకూడదని అనుకున్నాడు. తన కళకి గుర్తింపు, గౌరవం తేవడం కోసం కృషి చేసిన 'మహాతల్లి' మాధవికి మనఃపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. పరివర్తన వచ్చిన శైలజలో పరిపూర్ణమైన తన కళని చూసుకుని కన్నుమూశాడు. స్నేహితుడి పార్ధివ దేహం వర్షంలో తడవకుండా రఘు తన శరీరాన్నే గొడుగుగా చేస్తే, గొడుగుతో పరుగున వచ్చిన మాధవి తను తడుస్తూ బాలూ శరీరానికి గొడుగు పట్టింది.

నది సముద్రంలో కలిసినట్టుగా కళ, కళతోనే కలుస్తుంది. అది కళా సాగర సంగమం. స్త్రీ జీవితాన్ని నదితో పోల్చడానికి మాధవిని మించిన ఉదాహరణ ఎవరు. ఎన్నో ఎత్తుపల్లాలని దాటుకుని గంభీరంగా ప్రవహించే నది, సాగర సంగమ వేళ పిల్ల కాలువగా మారిపోతుంది. అలాగని నదిని శాంత స్వరూపిణి అనుకోగలమా? తరచి చూస్తే ఎన్ని సుడిగుండాలో... మాధవిని కేవలం కల్పిత పాత్రగా మర్చిపోలేం. 'సాగర సంగమం' చూసిన ప్రతిసారీ తను విడవకుండా వెంటాడుతుంది మనల్ని.

.....రాస్తుండగానే మూడొందల టపాలు పూర్తయ్యాయి.....