సోమవారం, సెప్టెంబర్ 21, 2020

పూర్ణమూ... నిరంతరమూ...

శ్రీకాళహస్తి కి చెందిన జర్నలిస్టు, కథకుడు సురేష్ పిళ్లె రాసిన పందొమ్మిది కథలతో వెలువడిన సంకలనం 'పూర్ణమూ... నిరంతరమూ... ' మూడు దశాబ్దాలకి పైగా రచనా వ్యాసంగాన్ని నిర్వహించాక ఒకేసారి రెండు కథాసంపుటాలు, ఒక నవలా వెలువరించారు సురేష్. వాటిలో ఇది తొలి సంకలనం. జర్నలిస్టు రాసిన కథలు కావడంతో సహజంగానే బోల్డంత వస్తు వైవిధ్యం కనిపించింది. పేపరు భాష అస్సలు కనిపించకపోవడం హాయిగా అనిపించింది. ఎక్కువ కథలకి కథాస్థలం కాలాస్త్రిగా, కొన్నింటికి హైదరాబాదు, ఒకట్రెండు కథలకి అమెరికా మరియు ఒకే ఒక్క కథకి తూర్పు గోదావరి. కథాస్థలానికి వెళ్లడంలో పాఠకులకి ఎలాంటి కష్టమూ లేకుండా, వేలుపట్టి తీసుకుపోయారు రచయిత. చుట్టూ జరిగే విషయాల తాలూకు పరిశీలన, కొంత తాత్వికత, మరికొంత వ్యంగ్యం కలగలిపిన కథలివి. 

కోతినుంచి మనిషి పుట్టాడనే పరిణామ సిద్ధాంతం కేవలం శారీరక నిర్మాణానికేననీ, ఒక్కో తరమూ జ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్లడం అన్నివేళలా సాధ్యపడకపోగా ఒక్కోసారి తిరోగమించే తరాలూ పుట్టుకు రావచ్చునని చెప్పే కథ '2.0', సంపుటిలో ఇదే మొదటి కథ. జ్ఞానాన్ని మాత్రమే నమ్ముకున్న వేంకటేశ్వరుడి కడుపున పుట్టినా, ఆ జ్ఞానం జోలికి వెళ్లని అవధాన్ల పరమేశ్వరుడి కథ ఇది.  నాస్తికత్వం- ఆస్తికత్వాలని రచయిత చర్చకి పెట్టలేదు కానీ, నాస్తికుల కడుపున పుట్టిన పరమభక్తులు గుర్తొస్తారు ఈ కథ చదువుతూ ఉంటే. ఆదర్శానికి-ఆచరణకి మధ్య జరిగే సంఘర్షణని 'ఆరోజు' చెబితే, దైవదర్శనాంతరపు ఓ భక్తురాలి మానసిక స్థితిని 'ఇక్కడే ఉన్నాడేమిటీ?' కథ వర్ణిస్తుంది. దాదాపు ఇరవయ్యేళ్ళ క్రితం రాసిన 'కొత్త చెల్లెలు' కథలో పాయింట్ ఆ తర్వాత వచ్చిన అనేక ఫ్యాక్షన్ సినిమాల్లో వాడుకోబడింది. 


'రూట్స్' నవల (తెలుగు అనువాదం 'ఏడు తరాలు') చదివిన వాళ్ళకి మరింతగా నచ్చేసే కథ 'ఈగ'.  ఆఫ్రికన్ పాత్రలతో అమెరికాలో కథ నడిపినా, నాకెందుకో మన సమాజపు కథనే  ప్రతీకాత్మకంగా చెబుతున్నట్టుగా అనిపించింది. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకి సిద్ధ పడిన ఓ స్త్రీ కథ 'తోటకాడ బావి'. దీనిని స్త్రీవాద కథ అనొచ్చు. రైతు ఆత్మహత్య ఇతివృత్తంగా రాసిన కథ 'నా నూకలు మిగిలే ఉన్నాయి' నాస్టాల్జియా కథలా అనిపించే 'పశువుల కొట్టం' కథలో ఓ సన్నివేశం కొన్నేళ్ల క్రితం మా ఇంట్లో జరగడమూ, ఆ కథ ముగింపులో 'పెద్దక్క' పాత్ర మాట్లాడిన మాటల్నే ఇంచుమించుగా అప్పుడు నేనూ మాట్లాడి ఉండడమూ నా వరకూ ఓ విశేషం (అప్పటికే ఈ కథ పత్రికలో అచ్చయింది కానీ, నేను ఇప్పుడే చదివాను). మూన్నాలుగేళ్ల క్రితం నిత్యం వార్తల్లో నలిగిన విజయవాడ కాల్ మనీ లాంటి ఇతివృత్తంతో తూర్పుగోదావరి నేపధ్యంగా రాసిన కథ 'వరాలత్త గాజులు.' వరాలత్త లాంటి స్త్రీలు నాక్కూడా తెలుసు కాబట్టి  ఈ కథని కల్పితం అనుకోలేను. 

కెమెరా కంటితో చూసి రాసినట్టుగా అనిపించే కథ 'ఆ 5 నిమిషాలు.'  మన చుట్టూ జరిగిన, జరుగుతున్న కథలో మనకి బాగా తెలియని అంశం ఇతివృత్తం. అమెరికాలో బాగా సంపాదించి అటుపై తెలుగు నేల మీద రాజకీయ ప్రవేశం చేసి, ఎమ్మెల్యే కావాలని కలగన్న ఓ ఎన్నారై కథ 'పులినెక్కిన గొర్రె.' రచయిత ఒక్క గొర్రెని గురించే చెప్పినా, నిత్యం వార్తలను ఫాలో అయ్యే వాళ్ళకి మరికొన్ని 'గొర్రెలు' గుర్తు రాక మానవు. వాటిపట్ల సానుభూతి కలిగించేలా రాశారీ కథని. స్త్రీ గొంతుతో వినిపించిన పురుషుల కథ 'మా ఆయన అపరిచితుడు.'  సంకలనానికి శీర్షికగా ఉంచిన 'పూర్ణమూ... నిరంతరమూ...' తో పాటు, 'అనాది అనంతం' 'గార్డు వినాయకం భజే' కథల్ని గురించి నా బ్లాగు తొలిరోజుల్లో ఓ టపా రాశాను. ఈ కథా సంకలనం చివర్లో ఆ టపాకి చోటిచ్చారు రచయిత. థాంక్యూ సురేష్ పిళ్లె గారూ. 


నాకు ఎక్కువగా నచ్చేసిన కథలు 'గడ్డి బొగ్గులు' 'తపసుమాను' 'పేరు తెలియని ఆమె' 'రుచుల జాడ వేరు.' మొత్తం కథా సంకలనంలో లాగే ఈ నాలుగింటిలో కూడా ఏ రెండు కథలకీ పోలిక లేదు. 'గడ్డిబొగ్గులు' లో ఇస్మాయిల్ ని తలచుకోగానే చెరుకురసం మిషన్ నుంచి బయటికి వచ్చే పిప్పి జ్ఞాపకం వస్తుంది. చిత్తూరు జిల్లాకి మాత్రమే ప్రత్యేకమైన 'భారతాలు' ఇతివృత్తంగా రాసిన 'తపసుమాను' ఆ జిల్లాలో నేను స్వయంగా తెలుసుకున్న స్థానిక సాంస్కృతిక విషయాన్ని చెప్పింది. హైవేని బతుకుతెరువుగా చేసుకున్న 'పేరుతెలియని ఆమె' కథలో ముగింపు వెంటాడుతుంది. గత కొంతకాలంగా స్థాయీ ప్రదర్శనగా మారిపోయిన పూర్వ విద్యార్థుల కలయిక ఇతివృత్తంగా సాగే 'రుచుల జాడ వేరు' లో రచయిత జీవన వైరుధ్యాల్ని పట్టుకున్న తీరు ఇట్టే ఆకర్షిస్తుంది. నావరకూ, వెంటాడుతున్న కథలివి. 

"ద్రౌపతమ్మ  అగ్నిగుండాం తొక్కినట్టుగా భారతంలో యేడుండాదో మాకు దెలవదు. మా తిరనాల్లలో మాత్రం అదే ఆచారం" ('తపసుమాను'), "దేవుడు విటుడిగా వస్తే ఇలాగే ఉంటాడేమో అనిపించింది నాకు" ('పేరు తెలియని ఆమె'), "ఆయన అనే వాడికీ అన్నయ్యకీ అక్షరాల అమరికలో ఒకింత తేడా తప్ప భేదం ఏమీ ఉన్నట్టు అనిపించలేదు నాకు" ('తోటకాడ బావి'), "ఎన్ని గడ్డిపరకలు కాలిస్తే బొగ్గులవుతాయ్?" ('గడ్డి బొగ్గులు) లాంటి వాక్యాలు, చదువుకుంటూ వెళ్లిపోకుండా ఆపి ఆలోచనలో పడేస్తాయి.  ద్రౌపతమ్మ  అగ్నిగుండం ప్రశ్నయితే, గురజాడ 'మీ పేరేమిటి?' కథలో రాసిన "ఈ దేశంలో పాండవులు ఉండని గుహలూ, సీతమ్మవారు స్నానమాడని గుంటలూ లేవు" వాక్యాన్ని గుర్తు చేసింది. మధురాంతకం నరేంద్ర రాసిన ముందుమాట కథల నేపధ్యాన్ని వివరిస్తే, సురేష్ పిళ్లె రాసుకున్న 'న వినుతి.. నా వినతి' రచయిత నేపధ్యాన్ని చెబుతుంది. ఆదర్శిని మీడియా ప్రచురించిన ఈ పుస్తకం, పుస్తకాల షాపులతో పాటు అమెజాన్ లో దొరుకుతోంది. (పేజీలు 200, వెల రూ. 200). 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి