బుధవారం, జనవరి 29, 2020

ఒక మనిషి... ఒక ఇల్లు... ఒక ప్రపంచం...

తమిళనాడు లోని మారుమూల పల్లెటూరు కృష్ణరాజపురానికి తన తండ్రి తాలూకు మూలాలు వెతుక్కుంటూ వస్తాడు హెన్రీ. మూడు దశాబ్దాల క్రితం ఓ తెల్లవారుజామున తన తండ్రి తాళం వేసిన ఒక ఇంటికీ, కొద్దిపాటి పొలానికి వారసుడతను. హెన్రీ నుంచి 'పప్పా' అని పిలుపు రావడం ఆలస్యం, 'కన్నా' అంటూ బదులిచ్చేవాడు సభాపతి పిళ్ళై. కొడుకు మీద ఎంత ప్రేమంటే, విడిచి ఉండలేక బిడ్డని బడికి కూడా పంపలేదు. 'ఏదోలా బతకలేక పోడు' అని మొండి ధైర్యం. అక్షరాలా తల్లిదండ్రుల ప్రేమతోనే పెరిగాడు హెన్రీ. మొదట తల్లి, ఆ వెనుక తండ్రి లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మరణించే ముందు, హెన్రీ కి వారసత్వపు ఆస్తి తాలూకు పత్రాలనీ, ఇంటి తాళాన్నీ అందించాడు సభాపతి పిళ్ళై. 

ఆ ఇంటిని వెతుక్కుంటూ వెళ్లిన హెన్రీ కి ఎదురైన అనుభవాలే జయకాంతన్ తమిళంలో రాయగా, జిల్లేళ్ళ బాలాజీ తెనిగించిన 'ఒక మనిషి... ఒక ఇల్లు... ఒక ప్రపంచం...' నవల. కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన ఈ నవలని, అకాడెమీ ప్రచురణల విభాగం అచ్చులోకి తెచ్చింది. మూల నవల 'ఒరు మనితన్ ... ఒరు వీడు... ఒరు ఉలగం...' 1973 లో విడుదలైతే తెలుగు అనువాదం 2012 లో ముద్రితమయ్యింది. కొండల మధ్యలో వాగు ఒడ్డున ఉన్న కృష్ణరాజపురమే కథా స్థలం. బెంగళూరు నగరం నుంచి ఆ ఊరికి వచ్చిన హెన్రీ తప్ప, నవలలో మిగిలిన పాత్రలన్నీ స్థానికమైనవే. ఉండీ లేనట్టుగా బస్సు సౌకర్యం ఉన్న ఆ ఊరిని చేరుకోడానికి దొరైకణ్ణు నడిపే లారీని ఆశ్రయిస్తాడు హెన్రీ. అదే లారీలో సహా ప్రయాణికుడు, ఆ ఊరి బళ్ళో డ్రిల్ మేష్టారు అయిన దేవరాజన్, హెన్రీని తన ఇంటికి ఆహ్వానిస్తాడు. 

ఇంతకీ దేవరాజన్ ఎదురిల్లే సభాపతి పిళ్ళైది. కొన్నేళ్ల క్రితం ఆ ఊరి క్షురకుడు పళని అదే ఇంటి అరుగు మీద ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం హెన్రీ కి చెబుతాడు దేవరాజన్. 'పప్పా' ద్వారా పళని గురించి విని ఉన్నాడు హెన్రీ, కానీ అతడు మరణించాడన్నది కొత్త విషయం. పప్పా మాటల్లో కృష్ణరాజపురాన్ని గురించి అనేకసార్లు విని ఉండడం వల్ల ఊరు మరీ కొత్తగా అనిపించలేదు హెన్రీకి. కానీ, ఆ ఊరి వాళ్లకి మాత్రమే హెన్రీ కొత్తగానూ, వింతగానూ అనిపించాడు. అతని కనుపాపలు నీలంగా ఉన్నాయ, అయితే అతని ఒంటిరంగు తెల్లదొరల లాగా లేదు. తలవెంట్రుకలు మాత్రం పూర్తిగా నల్లగా కాక కాస్త ఎర్రగా ఉన్నాయి. అతని రుమేనియా ముక్కు ఆ ప్రాంతపు మనుషుల్లో కనిపించని విధంగా ఉంది. "ఇతడితో తెలుగులో మాట్లాడితే అర్ధమవుతుందా?" అనే సందేహమే ఊరి వారందరికీ. 


దేవరాజన్ ఇంటికి పెద్దదిక్కు బాల్య వితంతువైన అతని సోదరి అక్కమ్మ. తమ్ముడి స్నేహితుడిని ఎంతగానో ఆదరిస్తుందామె. ఆ ఇంటికి హెన్రీని వారసుడిగా నిర్ణయించే నిమిత్తం ఊరి మునసబు పంచాయితీ ఏర్పాటు చేసేలోగా అందరితోనూ కలివిడిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంటాడతను.  దేవరాజన్ కైతే ఎంతో ఆప్తుడు అయిపోతాడు. హెన్రీ తన పప్పా చనిపోయిన మూడో రోజునే బెంగుళూరు విడిచి ఆ పల్లెకి వచ్చేశాడని తెలిసి ఆశ్చర్యపోతాడు దేవరాజన్. పరమ నిష్టాగరిష్టుడిగా జీవించిన సభాపతి పిళ్ళై ఓ తెల్లవారు జామునే ఇంటికి తాళం వేసి భార్యతో సహా ఊరినుంచి అదృశ్యం అయిపోడాన్ని గురించే ఇంకా వింతగా చెప్పుకుంటున్న ఆ ఊరి జనానికి, సభాపతికి హెన్రీ లాంటి బిడ్డ కలగడం ఎలా సాధ్యమో అర్ధం కాదు. మామూలు పంచాయితీల కన్నా, ఈ పంచాయితీ ప్రత్యేకమైనది అవుతుంది ఊరి పెద్దమనుషులకి. 

మునసబు నిర్వహించిన పంచాయితీలో తాను సభాపతి పిళ్ళై వారసుణ్ణి అనే ఆధారాలు అన్నీ చూపిస్తాడు హెన్రీ.  వాళ్ళ కోరిక మేరకు తన తల్లిదండ్రుల ఫోటోని చూపిస్తాడు. పిళ్ళై ఒక విదేశీ వనితతో ఉన్న ఆ ఫోటోని చూసి నిట్టూరుస్తారు వాళ్ళు. ఇన్నాళ్లూ పిళ్ళై ఆస్తిని అనుభవించింది మరెవరో కాదు, హెన్రీని కృష్ణరాజపురం తీసుకొచ్చిన లారీ డ్రైవర్ దొరైకణ్ణు. సభాపతి పిళ్ళైకి సాక్షాత్తూ తమ్ముడతను. కొంచం మొరటు మనిషి. ఐదుగురు సంతానం. అత్తగారింట్లో ఉంటూ, అన్నగారి భూములని చూసుకుంటూ ఫలసాయం అనుభవిస్తున్నాడు. పెద్దమనుషుల్లో కొందరికి కొత్తగా వచ్చిన హెన్రీకి ఆస్తిని అప్పగించడం అంటే దొరైకణ్ణుకి అన్యాయం చేయడమే అన్న ఆలోచన వస్తుంది. గొడవ చేయమని, కోర్టుకి వెళ్ళమని దొరైకణ్ణుకి సలహాలిస్తుంటారు కూడా. అయితే, మునసబు మాత్రం సాక్ష్యాలన్నీ పరిశీలించి హెన్రీని సభాపతి పిళ్ళై వారసుడిగా ప్రకటిస్తాడు. దొరైకణ్ణు సంతకం చేయాల్సిన ఆస్థిపత్రం  తయారు చేయిస్తాడు. 

ఆ పత్రానికి దొరైకణ్ణు చెప్పిన ఒకే ఒక్క అభ్యంతరం - తన అన్న సభాపతి పిళ్ళై కొడుకు పేరుని హెన్రీ పిళ్ళై అని మార్చాలని!!  హెన్రీ అందుకు అంగీకరించడంతో అప్పటికప్పుడే ఆ మార్పు చేసేస్తారు. అయితే ఆ తర్వాత హెన్రీ తీసుకున్న నిర్ణయం ఊరివారినే కాక, నవల చదువుతున్న పాఠకులనీ ఆశ్చర్య పరుస్తుంది. ఇంతకీ సభాపతి పిళ్ళై  ఊరినుంచి ఉన్నట్టుండి ఎందుకు మాయమయ్యాడు?  పళని ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? పిళ్ళై భార్య స్థానంలోకి విదేశీ వనిత ఎలా వచ్చింది? లాంటి ప్రశ్నలతో పాటు కథలో కీలక పాత్రల వ్యక్తిత్వాలని దగ్గరగా తెలుసుకోవాలంటే 'ఒక మనిషి... ఒక ఇల్లు... ఒక ప్రపంచం...' నవలని చదవాల్సిందే. బాలాజీ అనువాదం సాఫీగానే సాగినా, మిక్కిలిగా కనిపించే అచ్చుతప్పులు చికాకు కలిగిస్తాయి. నవలతో పాటు మనస్తత్వ చిత్రణకి పెట్టింది పేరైన జయకాంతన్ రాసిన ముందుమాటని తప్పక చదవాల్సిందే. (పేజీలు 226, వెల రూ. 110, కేంద్ర సాహిత్య అకాడెమీ స్టాళ్లలో లభ్యం). 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి