శుక్రవారం, మార్చి 18, 2016

అనుభవాలూ-జ్ఞాపకాలూను

"ఈ శతాబ్దంలో వచన రచనకు పెట్టినది పేరు, ఒక్క యిద్దరికే..శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారూ, శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారూ! వేంకటశాస్త్రిగారు కబుర్లలో ఎన్నో కథలు చెప్పారు. సుబ్రహ్మణ్యశాస్త్రి గారు కథలుగా ఎన్నెన్నో కబుర్లు చెప్పారు.." ఈ మాటలన్నది మరెవరో కాదు, తెలుగునాట 'వచన రచనకి మేస్త్రి' గా వినుతికెక్కిన మల్లాది రామకృష్ణ శాస్త్రి. పండితుడు మెచ్చిందే కదా పాండిత్యం. విజయనగరంలో పురుడుపోసుకున్న ఆధునిక తెలుగు కథకి గోదారి నీళ్ళు తాగించి పరిపుష్టం చేసిన వారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. వారి ఆత్మకథ 'అనుభవాలూ-జ్ఞాపకాలూను.'

తెలుగులో కథ రాయాలంటే, శ్రీపాద వారి కథలన్నీ కనీసం ఒక్కసారన్నా చదివి ఉండాలి. ఆత్మకథ రాయాలంటే 'అనుభవాలూ-జ్ఞాపకాలూను' పుస్తకాన్ని పదేపదే చదవాల్సిందే. కథకే కాదు, ఆత్మకథకీ ఒరవడి పెట్టిన ఘనత వారిది. మొత్తం ఎనిమిది సంపుటాలుగా ఆత్మకథని వెలువరించాలని శ్రీపాద పథకం వేసుకోగా, మూడో సంపుటం పూర్తికావస్తూ ఉండగానే అనారోగ్యంతో కలిసొచ్చిన మృత్యువు ఆయన్ని జయించడంతో కథ అక్కడితో ఆగిపోయింది. అంతే ప్రాప్తం అనుకోవడం మినహా చేయగలిగేది ఏమీ లేదు. ఇంతకీ ఈ ఆత్మకథలో ఏమేం విశేషాలు ఉంటాయి?

తొలినుంచీ శ్రీపాద వారిది పోరాట జీవితమే. ఇంటా బయటా ఆయన చేసిన యుద్ధాలు అన్నీ ఇన్నీ కాదు. తొలుత తెలుగు నేర్చుకోడానికి, అటుపై తెలుగు జాతీయత కోసం ఆయన జీవితాంతం శ్రమించారు. తూర్పు గోదావరి జిల్లా పొలమూరు గ్రామంలో సంప్రదాయ వైదిక బ్రాహ్మణ కుటుంబంలో సుబ్రహ్మణ్య శాస్త్రి చిన్ననాడు సంస్కృతం చదువుకోవడంతో పాటు కులవిద్య అయిన పంచాంగాల తయారీనీ నేర్చుకున్నారు. అనుకోకుండా ఆయనకి తెలుగు మీద ఆసక్తి కలగడం, తెలుగు చదవొద్దంటూ ఇంట్లో నిర్బంధించడంతో మొదలైన యుద్ధం, జీవిత పర్యంతమూ కొనసాగింది.


సంస్కృతం చదువు పూర్తవ్వొస్తూ ఉండగానే నన్నయ తెనిగించిన భారత భాగాన్ని చదవడం ఆయన తొలి విజయం కాగా, పిఠాపురం జంటకవులు వేంకటరామకృష్ణ కవుల దగ్గర శిష్యరికం చేయడం ఆయన రెండో విజయం. పద్యాల మీదా, అవధానాల మీదా మొదట మక్కువ పెంచుకుని, తదుపరి తుంచుకుని పూర్తిగా వచన రచన వైపుకి మళ్ళిన వైనాన్ని వివరిస్తుందీ ఆత్మకథ. తిరుపతి వేంకట కవులకి, వేంకట రామకృష్ణ కవులకీ ఆసరికే ఉండుకున్న వైరం కారణంగా గురువుల తరపున బరిలోకి దిగి చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రితో యుద్ధం చేసిన వైనాన్ని చదవాల్సిందే.

నిజానికి ఆత్మకథలో తనని గురించిన వివరాలు క్లుప్తంగానూ, ఆనాటి పరిస్థితులని గురించి సవివరంగానూ రాశారు శ్రీపాద. ఫలితంగా, వందేళ్ళ క్రితం నాటి సాంఘిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు, దొరల పాలన, విద్యావిధానం, అనేక రంగాల్లో నెమ్మదిగా వస్తున్న మార్పులు లాంటి విశేషాలెన్నో కళ్ళకి కడతాయి. వారాలు చెప్పుకుంటూ, గురు శుశ్రూష చేసుకుంటూ చదువుకోవడం, ఎక్కడికి వెళ్ళాలన్నా కాలినడకన బయలుదేరడం, హోటల్లో తినడాన్ని తప్పుగా పరిగణించడం.. ఇలాంటివన్నీ ఇప్పుడు మనం నడుస్తున్న నేల మీద ఒకప్పుడు జరిగాయంటే ఆశ్చర్యం కలిగిస్తుంది.

ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది శ్రీపాద వారి శైలి. ఏ విషయాన్ని ఎత్తుకున్నా, 'అనగా అనగా' అంటూ కథ చెబుతున్నట్టుగా మొదలు పెట్టి, అలవోకగా పిట్ట కథల్లోకి వెళ్లి, ఒక్కో కథనీ ముగించుకుంటూ వచ్చి అసలు విషయాన్ని పూర్తి చేయడం అన్నది ఆయనకి మాత్రమే సాధ్యమైన విద్యేమో అనిపిస్తుంది చాలాసార్లు. అలాగే, తనకెదురైన 'మంచి' విశదంగా చెప్పి 'చెడు' ని ఒకట్రెండు మాటల్లో ముగించడం ద్వారా తర్వాత కాలంలో ఆత్మకథ రాసేవారికి మర్గనిర్దేశనం చేశారు. ఒకే పుస్తకంగా లభిస్తున్న మూడు సంకలనాలనీ చదవడం పూర్తి చేయగానే 'మిగిలిన ఐదూ కూడా దొరికేతేనా...' అనిపించక మానదు. ('అనుభవాలూ-జ్ఞాపకాలూను,' పేజీలు 570, వెల రూ. 300, ప్రగతి పబ్లిషర్స్ ప్రచురణ, అన్ని ముఖ్య పుస్తకాల షాపులు).

2 కామెంట్‌లు:

  1. అసలే శ్రీపాద వారి కబుర్లు.. ఆపై మీ సమీక్ష! విందుభోజనమే! :) పుస్తకం తిరగేయాలెప్పుడో..

    రిప్లయితొలగించండి
  2. @కొత్తావకాయ: ఎప్పుడు మొదలు పెట్టినా పూర్తి చేయకుండా ఆపలేమండీ.. ..ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి