మంగళవారం, డిసెంబర్ 24, 2024

వంశీ మా పసలపూడి కథల కమామిషు

"అసలు కమామిషు అన్న మాట విని ఎన్నాళ్ళయింది?" అని ఆలోచనలో పడ్డాను పుస్తకం పేరు చూడగానే. చదవడం పూర్తిచేయగానే వచ్చిన ఆలోచన అయితే "ఏముంటాయి ఆ పసలపూడి కథల్లో? తిండి గోలా, సెక్సు గొడవలూ తప్పిస్తే" అని వెటకరించే మిత్రులకి నోటితో సమాధానం చెప్పే బదులు ఈ పుస్తకాన్ని చేతిలో పెడితే సరిపోతుంది కదా అని. వంశీ రాసిన 'మా పసలపూడి కథలు' అనే డెబ్బై రెండు కథల సంకలనాన్ని పరిశోధనాంశంగా తీసుకుని, కె. రామచంద్రా రెడ్డి అనే పరిశోధకుడు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సమర్పించిన పీహెచ్డీ థీసిస్ ఇది. సాహిత్యాభిమానుల కోసం పుస్తక రూపంలో మార్కెట్లోకి వచ్చింది. ఒక రచయిత/రచయిత్రి సమగ్ర రచనల మీద పరిశోధన జరగడం, లేదూ ఒక నవల మీద సమగ్ర పరిశోధన జరగడం తెలుగునాట ఆనవాయితీగా వుంది. అయితే కేవలం ఒక్క కథాసంకలనమే పరిశోధనాంశం కావడం అరుదు. 'మా పసలపూడి కథలు' ఈ అరుదైన ఘనతని సాధించడం వంశీ (కొన్ని) సినిమాలు, రచనల అభిమానిగా వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషాన్ని కలిగించింది.

సాహిత్యాంశానికి సంబంధించినవే అయినప్పటికీ చాలా పరిశోధనా గ్రంధాలు సామాన్య పాఠకులకి పఠనీయంగా వుండవు. రీసెర్చ్ ఫార్మేట్ లో చాలా అకడమిక్ గా వుండి, పుస్తకంలో పేజీలు బరువుగా కదులుతూ ఉంటాయి. ఈ పరిశోధనా గ్రంధం అందుకు మినహాయింపు. సూటిగా విషయంలోకి వెళ్లిపోవడం ఒకటైతే, చాలా చోట్ల ఈ పరిశోధకుడి ప్రతిపాదనలు, వెలికితీసిన విషయాలు చదువుతుంటే "ఇవి మనం చదివిన కథల గురించేనా?!" అని అడుగడుగునా కలిగే ఆశ్చర్యం మరొకటి.  ఉదాహరణకి: "వందేళ్ళకి మించిన తెలుగు కథా సాహిత్యంలో ఏ కథని తీసుకున్నా ఐదుకి మించిన పాత్రల పేర్లు చెప్పిన కథలు అత్యరుదుగా వుండవచ్చు. కానీ, వంశీ కథలలో ఐదుకు తక్కువగా పాత్రల పేర్లు చెప్పిన కథలు కూడా అత్యరుదుగా వున్నాయి. ఆయన ప్రతి కథలోనూ ఐదుకు పైగానూ అత్యధికంగా పద్ధెనిమి వరకూ (పన్నెండో కథ 'తామరపల్లి సత్యం గారి తమ్ముడు రామం') పాత్రల పేర్లు చెప్పిన కథలూ కనిపిస్తాయి", లాంటి పరిశీలనలు కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి.

మొత్తం పది అధ్యాయాలుగా విభజించిన ఈ పుస్తకంలో నాలుగో అధ్యాయం 'మా పసలపూడి కథల్లో మాండలికం -  భాషా విశేషాలు' అతి పెద్ద అధ్యాయం. మొత్తం 254 పేజీల పుస్తకంలో ఈ ఒక్క అధ్యాయమే 84 పేజీలు. నామవాచకాలు, సర్వనామాలు, క్రియా వాచకాలు, విశేషణ వాచకాలు, కథల కాలం దృష్ట్యా గృహోపకరణాలు, ప్రయాణ సాధనాలు, ఇతర కొలమానాలు, ఆహార పదార్ధాలు, అన్యభాషా పదాల, జంట పదాల, తిట్ల పలుకుబడి.. ఇవన్నీ ఈ అధ్యాయంలో భాగాలే. ఒక్క ఆహార పదార్ధాల లోనే అల్పాహారాలు, చిరుతిళ్ళు, మాంసం, చేపల వంటకాలు, ఇతర విభిన్న ఆహార పదార్ధాలు, పానీయాలు అనే విభాగాలు ఉన్నాయి. పరిశోధన 'లోతు' ఎంతో తెలుసుకోడానికి ఈ ఒక్క అధ్యాయం చాలు. "భారతదేశంలో ముసల్మానుల పరిపాలన ప్రభావం వల్ల ఉత్తర భారతంలో తయారయ్యే తీపి వంటకాలకు ఆ రాజుల నమ పదాలను పెట్టుకోవడం పూర్వం జరిగింది. ఆ వంటకాలు దేశం అంతా విస్తరించి నేడు అవే పేర్లు స్థానీయ పలుకుబడిలో వున్నాయి. ఖాజా-కాజా, బాదుషా, జహంగీర్-జాంగ్రీ మొదలైనవి" రెండు కథల్లో ప్రస్తావనకు వచ్చే తాపేశ్వరం కాజాని గురించి వివరణ ఇది.


'మా పసలపూడి కథలు-సింహావలోకనం-సమీక్షలు' అనే అధ్యాయంలో నాలుగో కథ 'కోరి రావులు గారి బస్ కండక్టర్' కథని గురించి చెబుతూ "మానవత్వం వున్న భద్రం ఏ పనిలోనూ ఇమడక కష్ఠాలు తెచ్చుకుంటూ వూరు వదిలి ఎటో వెళ్లిపోయాడని చెప్పడంలో రచయిత మంచి వాళ్ళకి ఈలోకంలో చోటు లేదని అన్యాపదేశంగా చెబుతారు" అన్నారు రామచంద్రారెడ్డి. అయితే, ఈ కథలో కండక్టర్ భద్రం తాను చేసే సాయాలకి తన యజమాని రావులు గారి బస్సుని వాడుకోవడం (బస్సులో ప్రయాణించే వాళ్ళ అవసరాలకి అనుగుణంగా అప్పటికప్పుడు రూటు మార్చేయడం - దాదాపు ప్రతిరోజూ) ఎంతవరకూ ఆమోదయోగ్యం అన్న ప్రశ్న వస్తుంది. తన శృతి మించిన మంచితనం కారణంగా యజమానికి (బస్సు వ్యాపారానికి) నష్టం చేస్తున్నానన్న ఆలోచన భద్రంలో వున్నట్టు కనిపించదు. 'మునగచెట్టు' కథకి శ్రీరమణ 'మిథునం' తో పోలిక తేవడం ముచ్చట గొలుపుతుంది. వంశీ కథలతో అతిపెద్ద సమస్య పేర్ల మార్పు. ఓకే కథ వేర్వేరు సంకలనంలో వేరే వేరే పేర్లతో వస్తూ వుంటుంది. ఇందుకు 'మా పసలపూడి కథలు' కూడా మినహాయింపు కాదని చెబుతుందీ పరిశోధనా గ్రంధం.

పసలపూడి కథలన్నీ, ఆ మాటకొస్తే వంశీ రచనలన్నీ, వర్ణన ప్రధానంగా సాగేవే. 'మా పసలపూడి కథలు - వర్ణనలు' అనే అధ్యాయాన్ని మానవ స్వాభావిక వర్ణనలు, ప్రకృతి వర్ణనలు, పల్లె వర్ణనలు, వంటల వర్ణనలు అనే నాలుగు భాగాలుగా విభజించారు. ప్రకృతి వర్ణనల్లో, ఋతు వర్ణనల్ని ప్రత్యేకంగా చేర్చారు. అయితే, వంశీ ప్రతి కథలోనూ చేసే ప్రకృతి వర్ణన రాబోయే సన్నివేశాన్ని లీడ్ చేసేదిగా వుంటుందన్నది నా గమనింపు. వర్ణనని చదువుతూనే పాఠకుడు ఒక మూడ్ లోకి వెళ్తాడు. జరగబోయే సన్నివేశం అచ్చంగా ఆ మూడ్ కి తగ్గట్టుగానే వుంటుంది. పచ్చని ప్రకృతి ఉంది కాబట్టి వర్ణించడం కాదు, వర్ణన ద్వారా తర్వాతి సన్నివేశానికి పాఠకుణ్ణి ప్రిపేర్ చేసి నెమ్మదిగా తీసుకువెళ్లడం. వంటల వర్ణనల్లో "ఎక్కడ అవకాశం దొరికినా అక్కడ వంటల గురించి వివరించిన తీరులో ఆ ప్రాంతపు జీవన శైలిని మరో కోణంలో పాఠకులకి పరిచయం చేయడం వుంది. ఇక్కడ విషయం బతకడం కోసం చేసే భోజనం గురించి కాదు. భోజనం వంకన అక్కడి ప్రజల నడుమ అనురాగానికి ఆ సందర్భాలు ప్రతీకలు. అక్కడి మనుషుల మధ్య పెనవేసుకున్న సాంఘిక జీవన విధానాలని ఆ భోజన పద్ధతుల ద్వారా వివరించే ప్రయత్నం. అలాంటి ప్రయత్నంలో ఈ కథకుడు విజయుడయ్యాడు" అంటారు.

శిల్పాన్ని గురించి చెబుతూ "వంశీ గారి పసలపూడి కథల్లో నిర్దిష్టమైన భౌగోళిక, ప్రాంతీయ స్వభావాన్ని చూడొచ్చు. గోదావరి పరివాహక ప్రాంతాన్ని నేపధ్యంగా తీసుకుని రాసిన ఈ కథలన్నిటికి నిర్దిష్టమైన భాషా సాంస్కృతిక లక్షణాలున్నాయి. రచయిత వాడిన ప్రాంతీయ నుడికారం, ప్రతి వస్తువుకి విశేషణం, దాని వెనకున్న ప్రాంతీయ ప్రత్యేకత కథలకు అదనపు సౌందర్యాన్నిచ్చింది" అన్నారు రామచంద్రారెడ్డి. "కేవలం వర్ణనాత్మక చిత్రణ, భాష, పేర్లు ఇత్యాది విలక్షణాలు వుంటే మాత్రం వంశీ కథలు ఏం చెప్తాయి అనే ప్రశ్నకు ఆ కథలలో - గొప్ప మనసుతో ఎందరినో ఆదుకున్న పాత్రలు, విలువల కోసం తాపత్రయ పడే పాత్రలు, స్వచ్ఛమైన ప్రేమతో ఆకట్టుకునే పాత్రలు, గొప్ప కళా నైపుణ్యంతో వెలుగొందిన జీవితాలు మొదలైనవి ఆదర్శవంతాలు. మోసాలు, ద్వేషాలు, అక్రమ సంబంధాలు అన్యాపదేశంగా చెప్పే మానవ విలువల ప్రాధాన్యాలే ఈ కథల పరమావధి" అనేది ఈ కథలు చదివిన పాఠకులందరూ ఆమోదించే ప్రతిపాదన. పరిశోధకుడే ప్రచురించుకున్న ఈ పుస్తకం వెల రూ. 260. ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ, ఆన్ లైన్ లోనూ కొనుక్కోవచ్చు. మలిముద్రణలో అచ్చుతప్పుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది.

సోమవారం, డిసెంబర్ 09, 2024

అవస్థ

నాలుగున్నర దశాబ్దాలకి పూర్వం యు.ఆర్. అనంతమూర్తి రాసిన కన్నడ నవలకి 'అవస్థే' కి రంగనాథ రామచంద్రరావు చేసిన తెలుగు అనువాదం 'అవస్థ' నవల. దక్షిణ కర్ణాటక లోని శివమొగ్గ (షిమోగా) ప్రాంతానికి చెందిన అనంతమూర్తి, ఆ ప్రాంతాన్ని, అక్కడి స్వాతంత్య్రానంతర రాజకీయ వాతావరణాన్ని ఇతివృత్తంగా తీసుకుని రాసిన నవలలో ప్రధాన పాత్ర కృష్ణప్ప గౌడ. పేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి, అక్షరం సాయంతో ఎదిగి, నాయకత్వ లక్షణాల కారణంగా శాసన సభ్యుడిగా విజయాలు సాధించడమే కాక, ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడే స్థాయికి చేరతాడు. ఈ దశలోనే అతణ్ణి అనూహ్యంగా అనారోగ్యం కబళిస్తుంది. పక్షవాతం కారణంగా శరీరం చచ్చు బడుతుంది. గౌడ ఆరోగ్యవంతుడవుతాడనీ, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడనీ అనుచరుల్లో గొప్ప నమ్మకం.  

గౌడ రాజకీయ అనుచరుల్లో ఒకడైన నాగేశ, కృష్ణప్ప గౌడ జీవిత చరిత్ర రాయడానికి పూనుకుంటాడు. అతనికి చెప్పే క్రమంలో గౌడ తన జీవితాన్ని నెమరు వేసుకోవడం, అటుపై తన ఇంటికి నడిచి వచ్చిన ముఖ్యమంత్రి పదవిని చేపట్టే విషయంతో సహా తన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోడానికి ఉద్యుక్తుడు కావడంతో నవల ముగుస్తుంది. బాల్య జీవితం కృష్ణప్ప గౌడ వ్యక్తిత్వం పై ఎలాంటి ప్రభావాన్ని చూపింది, యవ్వనంలో అతని జీవితంలో ప్రవేశించిన వ్యక్తులు తర్వాతి జీవితం మీద ఏవిధంగా తమదైన ముద్రని వేశారు అన్నది సునిశితంగా చెప్పారు రచయిత. పశువుల్ని కాసుకునే కృష్ణప్ప గౌడ జీవితంలోకి మహాదేవయ్య రావడం అతని జీవితంలో మొదటి మలుపు. కేవలం మహాదేవయ్య పూనిక, ఆర్ధిక సాయంతోనే గౌడ బడిలో చేరతాడు. నిజానికి మహాదేవయ్య కథలోనే ఒక నవలకి సరిపోయేంత వస్తుంవుంది. 

కాలేజీ రోజుల్లో కృష్ణప్ప గౌడ జీవితంలో ప్రవేశించే అణ్ణాజీ కథ మరో నవలకి సమానం. విస్తృతంగా చదివి, ఇంగ్లీష్ తో అనర్గళంగా మాట్లాడే ఈ వామపక్ష మేధావికి ఉన్న ఒకే ఒక్క వ్యసనం స్త్రీ. కృష్ణప్ప గౌడ మీద అన్నాజీ ప్రభావం తక్కువదేమీ కాదు. తనని ప్రేమించిన గౌరీ దేశపాండే కి కృష్ణప్ప తన ప్రేమని తెలుపక పోవడం వెనుక అణ్ణాజీ  ప్రభావం కూడా కొంత కారణం. తర్వాత జీవితంలో గౌడ అనుసరించిన రాజకీయ మార్గం, నడిపిన ఉద్యమాలు, పాటించాలని ప్రయత్నించే విలువలు వీటన్నిటి వెనుకా అణ్ణాజీ ప్రభావం వుంది. అసలు, కృష్ణప్ప గౌడ జీవితం ఒక ముఖ్యమైన మలుపు తిరిగి, రాజకీయ నాయకుడిగా మారడానికి కారణం కూడా అణ్ణాజీనే.  గౌడ శారీరక బలహీనతని, మానసిక బలహీనతలనీ సమాంతరంగా చిత్రిస్తూ రావడం, అలాగే వర్తమానంలో జరిగే కథతో సమాంతరంగా ఫ్లాష్ బ్యాక్ లని చెబుతూ రావడం వల్ల నవల చదివే పాఠకులకి ఊయల ఊగుతున్న అనుభూతి కలుగుతుంది చాలాసార్లు. 


కృష్ణప్ప గౌడ ఆశయాలకీ, ఆచరణకీ మధ్య ఉన్న భేదం, తత్కారణంగా అతని అంతర్మధనమే 'అవస్థ' నవల లో ప్రధాన కథ. నిజానికి ఇలా భేదం వుండడం రాజకీయాల్లో సర్వ సాధారణం. అయితే, గౌడ అందరు నాయకుల లాంటి వాడు కాదు. అతని వ్యక్తిత్వం ప్రత్యేకమైనది. ఈ వ్యక్తిత్వమే 'అవస్థ' నవలకు ఆయువు పట్టు. అతని జీవితంలో స్త్రీలందరూ గౌడని ఎంతో కొంత ప్రభావితం చేసిన వాళ్ళే. తల్లి శారదమ్మ, చిన్నప్పుడు ఆదరించిన రుక్మిణమ్మ, కాలేజీ రోజుల్లో ఆరాధించిన గౌరీ దేశ్ పాండే, కొంతకాలం సహజీవనం చేసిన లూసినా, అణ్ణాజీ స్నేహితురాళ్ళు - మరీ ముఖ్యంగా చిన్నవీరయ్య భార్య ఉమ, గౌడ పెళ్లాడిన సీత, నర్సు జ్యోతి.. వీళ్లందరి ప్రభావం కృష్ణప్ప గౌడ చర్యలపై కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా, వరంగల్ జైలు జీవితం అతనిపై చెరగని ముద్ర వేసింది. మౌన సన్యాసి ప్రభావమూ తక్కువది కాదు. 

ఉన్నత ఆశయాలని కలిగి ఉండడానికి, వాటిని ఆచరణలో పెట్టడానికి మధ్య భేదాన్ని సూక్ష్మంగా చిత్రించిన నవల ఇది. కృష్ణప్ప గౌడ ఆశయాలు గొప్పవి. అతడు వాటిని కలిగి ఉండడానికి దారి తీసిన పరిస్థితులూ ప్రత్యేకమైనవి. అయితే, వాటిని ఆచరణలో పెట్టలేకపోవడానికి కారణాలు మాత్రం ఊహించగలిగేవే. గౌడకి తన లక్ష్యంతో పాటు దానిని చేరుకునే మార్గమూ ముఖ్యమే. అతని సమస్యంతా తాను వెళ్తున్న మార్గం పట్ల పేరుకుపోయిన తీవ్రమైన అసంతృప్తి. దానిని మార్చలేని (మార్చుకోలేని) అసహాయత. "యితడు మానసికంగా అత్యంత బలవంతుడా లేక అతి దుర్బలుడా?" అనే ప్రశ్న పాఠకులకి చాలాసార్లే వస్తుంది. అతడిలో కనిపించే ద్వంద్వాలు ఒక్కోసారి అయోమయంలో పడేస్తాయి. అయితే, ఈ ద్వంద్వాలకి కారణాలు అతడి నేపధ్యం లోనూ, పెరిగిన విధానంలోనూ దొరుకుతాయి. 

రంగనాథ రామచంద్రరావు తెలుగు అనువాదం సరళంగా వుంది. కన్నడ నుడికారాన్ని ఉపయోగించక తప్పని సందర్భాలలో ఇచ్చిన ఫుట్ నోట్స్ పాఠకులకి ఎంతో ఉపయుక్తం. అచ్చుతప్పులు తక్కువే. బాగా నిరాశ పరిచింది ఏదైనా ఉందంటే అది ముందుమాట. ఈ ముందుమాటలో మహాదేవయ్య  - పరమేశ్వరయ్య గానూ, అణ్ణాజీ - అప్పాజీ గానూ మారిపోయారు. కొన్ని వాక్యాలు పునరుక్తులయ్యాయి. నాలుగు పేజీల ముందుమాటలో ఇన్ని తప్పులు ఎలా వచ్చాయో అని ఆశ్చర్యం కలిగింది. కన్నడలో నవల గానే కాక సినిమాగానూ విజయవంతమై అవార్డులు పొందింది. అయితే, సోషలిస్టు నాయకుడు శాంతవేరి గోపాల గౌడ వారసులు, అనుచరుల నుంచి కోర్టు కేసులు ఎదుర్కొన్నారు అనంతమూర్తి. గోపాల గౌడ జీవితాన్నించి స్ఫూర్తి పొంది కృష్ణప్ప గౌడ పాత్రకి రూపకల్పన చేశారు. ఛాయ రిసోర్స్ సెంటర్ ప్రచురించిన 198 పేజీల 'అవస్థ' వెల రూ. 160. ఆన్లైన్ లో కొనుగోలు చేయవచ్చు. 

సోమవారం, డిసెంబర్ 02, 2024

ఆరామ గోపాలమ్

బాల్యం నుంచి వృద్ధాప్యం వరకూ జీవితంలో ప్రతి దశలోనూ అలవి కాని కష్టాలే. జీవితపు ప్రతి మలుపు లోనూ ఊహించని ఇబ్బందులే. అయితేనేం, సాహిత్యాన్ని పడవగానూ, సంగీతాన్ని తెడ్డుగానూ చేసుకుని ఈ కష్టాల వైతరణిని దాటేసిన 'సామాన్యుడు' ఆయన. భరాగో అనే పొట్టిపేరుతో తెలుగు సాహిత్యాభిమానులకి తెలిసిన భమిడిపాటి రామగోపాలమ్ ఆత్మకథ 'ఆరామ గోపాలమ్' చదువుతుండగానూ, పూర్తి చేసిన తర్వాతా కూడా ముళ్ళపూడి వెంకటరమణకి 'కోతి కొమ్మచ్చి' రాయడానికి అతి పెద్ద ప్రేరణ బహుశా ఈ పుస్తకమే అయి ఉండొచ్చని బలంగా అనిపించింది. నిజానికి ముళ్ళపూడి బాల్యంలో కష్టపడ్డా, సినిమాల్లో స్థిరపడ్డాక జీవితం సాఫీగానే సాగింది. కానీ, భరాగో కథ అది కాదు. అయినా, మనుషుల్ని పోలిన మనుషులు ఉండొచ్చు కానీ జీవితాలని పోలిన జీవితాలు అరుదుగా తప్ప ఉండవు కదా. 

తన జీవిత కథని 'బాల్య లహరి' 'యువ తరంగం' 'ఉద్యోగ పర్వతం' 'సంసారం సాగరం' 'సాహిత్య వనం, సంగీత వాహిని' అనే ఐదు అధ్యాయాలుగా విభజించారు భరాగో. చివర్లో 'My Scribes' 'మిత్ర పుష్పాలు' అనే రెండు అనుబంధాలని చేర్చారు. విజయనగరం జిల్లాలో ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో 1932 లో జన్మించారు రామగోపాలమ్. ఇంటికి పెద్ద కొడుకు. తండ్రి బడిపంతులు. పెద్ద కొడుకు హైస్కూలు చదువుకి వచ్చేసరికి తండ్రికి పదవీ విరమణ వచ్చేసింది. పైగా. పింఛను లేని ఉద్యోగం. ఆ తండ్రికి ఉన్నదల్లా పిల్లల్ని బాగా చదివించాలన్న ఆశ. నిజానికి ఆశ కాదు, గట్టి పట్టుదల. స్కూలు ఫీజు కోసం కాలినడకన ఊళ్లు తిరిగి దానాలు స్వీకరించడం మొదలు, పిల్లవాడికి చదువుకునే ఊళ్ళో వారాలు కుదర్చడం వరకూ పడని శ్రమ లేదు. 

పోతన పద్యాలూ, త్యాగరాయ కృతులూ మొదలుగా భరాగోకి చిన్న నాటి నుంచీ సంగీత సాహిత్యాల పట్ల అభిరుచి యేర్పడింది. జీవితంలో ఎదురైన ప్రతి కష్టమూ ఈ రెంటినీ ఆయనకి మరింత దగ్గర చేసింది తప్ప, దూరం చేయలేదు. విజయనగరం బ్రాంచి కాలేజీలో చదువుకునే రోజుల్లో ఘంటసాల (వెంకటేశ్వర రావు) భరాగోకి 'సత్రం మేట్'. ఈ కాలేజీ కబుర్లు ఈ పుస్తకానికి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ఆకాలంలోనే హిందీ సినిమా పాటలతో పరిచయం పెరిగి ప్రేమగా మారింది భరాగోకి. తెలుగు పాటలు సరేసరి. కాలేజీ రోజుల్లోనే రచనా వ్యాసంగమూ మొదలైంది. ఆ కాలంలో కలం పట్టిన విజయనగరం కుర్రకారు అందరికి మల్లేనే భరాగో ఆశయం కూడా 'చాసోని మెప్పించే' కథ రాయడం. చాసో హవేలీ వెదజల్లిన సాహితీ పరిమళాలు అన్నీ ఇన్నీ కావని మరోమారు చెబుతుంది ఈ ఆత్మకథ. 


చదువు పూర్తవుతూనే భరాగో తక్షణావసరం ఉద్యోగం. ఓపిక తెచ్చుకుని ట్యూషన్లు చెబుతున్న తండ్రి, కంటి చూపు పోగొట్టుకున్న తల్లి, చదువుకుంటున్న తమ్ముళ్లు, వీళ్ళందరికీ ఓ భరోసా ఇచ్చేది ఉద్యోగమే. సర్వే శాఖలో చిన్న ఉద్యోగిగా ప్రవేశించి, అంచెలంచెలుగా నిచ్చెనమెట్ల ఎక్కడం, ఊహించని విధంగా ఉద్యోగం పోగొట్టుకోవడం, మళ్ళీ కష్టపడి పునర్నియామకపు ఉత్తర్వు సంపాదించుకోవడం, విశాఖ పోర్టు కి డిప్యుటేషన్ మీద వెళ్లి, అక్కడే స్థిరపడి పదవీ విరమణ చేయడాన్ని సరదాగా చెప్పేరు భరాగో. ఈలోగానే పెళ్లి, పిల్లలు, వాళ్ళ చదువులు, బాధ్యతలు ఒకపక్కా, సాహిత్య వ్యాసంగం మరోపక్కా సాగేయి.  దినపత్రికలో సాంస్కృతిక విలేకరిగా పార్ట్ టైం ఉద్యోగం మొదలు పెట్టి కాలమిస్టు గా ఎదగడం, ఈ క్రమంలో పెరిగిన పరిచయాలు, ఎదురైన అనుభవాలు, ఇదంతా సమాంతరంగా నడిచిన మరో కథ. 

చాలామంది కాలమిస్టుల్లాగే భరాగో కూడా అనేక కథా వస్తువుల్ని కాలమ్స్ గా కుదించేశారు. అయినప్పటికీ కూడా. 'వెన్నెల నీడ' 'వంటొచ్చిన మగాడు' లాంటి గుర్తుండిపోయే కథల్ని రాశారు. పోర్టు ట్రస్టు ప్రోత్సాహంతో వాటన్నింటినీ 'ఇట్లు మీ విధేయుడు' పేరిట కథా సంకలనంగా ప్రచురించి, 1991 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గెలుచుకున్నారు. కాలమ్స్ లో ఎంపిక చేసిన వాటిని 'సరదా కథలు' 'కథన కుతూహలం' పేరిట పుస్తకాలుగా ప్రచురించారు. వీటిలో 'కథన కుతూహలం' కి తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం రావడం మాత్రమే కాదు, వీటిలో ఎంపిక చేసిన కథనాల్ని చిత్రించి దూరదర్శన్ లో 'భమిడిపాటి రామగోపాలం కథలు' పేరిట ప్రసారం చేశారు కూడా. ప్రముఖ నటుడు సుత్తివేలు భరాగో పాత్రని పోషించారు (యూట్యూబ్ లో చూడవచ్చు). అలా, చేయగలిగినంత సాహిత్య రచన చేయలేకపోయినా, చేసిన మటుకు గౌరవాలు అందుకున్నారు. 

ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం, పదవీ విరమణ అనంతరం అనారోగ్యం కబళించి మంచానికి పరిమితమై పోయినా, రాసేందుకు శరీరం సహకరించకపోయినా, వ్రాయసకాండ్రని నియమించుకుని రచనల్ని కొనసాగించడం. అలా రాత సాయం అందించిన అందరినీ పేరుపేరునా 'My Scribes' అనుబంధంలో తలుచుకోవడం. ఈ పుస్తకం తాలూకు మరో ప్రత్యేకత ఛాయాచిత్రాలు. చిన్ననాటి నుంచి, చివరి రోజుల వరకూ తనకు తారసపడిన వారిలో తాను ప్రస్తావించిన అందరివీ ఛాయాచిత్రాలని ఈ పుస్తకంలో చేర్చారు. మునుపు ఏ ఆత్మకథ లోనూ ఇలా ఫోటోలు వాడడం జరగలేదని కూడా ఆయనే చెప్పారు. భరాగో అనగానే గుర్తొచ్చే 'సావోనీర్ రచన' ని గురించి కూడా వివరంగానే రాశారు తన ఆత్మకథలో. త్రివేణి పబ్లిషర్స్ ప్రచురించిన ఈ 384 పేజీల పుస్తకం వెల రూ. 300. డిస్ప్లే లో ఉండక పోవచ్చు కానీ, పుస్తకాల షాపులో జాగ్రత్తగా వెతికితే లోపలి అరల్లో దొరికే అవకాశం వుంది. కల్పనని మించిన వాస్తవాలు ఎన్నో వున్న ఆత్మకథ ఈ 'ఆరామ గోపాలమ్'.

మంగళవారం, నవంబర్ 26, 2024

కులశేఖర్ ...

"మా వైజాగ్ కుర్రాడే.. పాటల్లో మా శ్లాంగ్ అదరగొట్టేడు. నాకో కేసెట్ ఇచ్చేడు వినమని.. తనకి పది కేసెట్లు ఇచ్చేరట" విశాఖ మిత్రుడు ఉత్సాహంగా చెబుతుంటే, "రెమ్యూనరేషన్ గానా?" అని అమాయకంగా అడ్డుపడ్డాను. "లేదులెండి, డబ్బులు కూడా ఇచ్చేరట" నవ్వుతూ జవాబిచ్చేడు. "మా వాడిది సింహాచలం. నాన్నగారు లెక్చరర్, బ్రదర్స్ సింహాచలం టెంపుల్ లో పనిచేస్తారు.. ఈ కుర్రాడికి మొదటి నుంచీ రైటింగ్ బాగా ఇంటరెస్ట్.. శాస్త్రి గారి దగ్గర కొన్నాళ్ళు ట్రైనింగ్ అయ్యేడు" మిత్రుడు వివరించేడు. నిన్నో మొన్నో జరిగినట్టుగా ఉన్న ఈ సంభాషణ జరిగి దాదాపు పాతికేళ్ళు. సంభాషణలో 'కుర్రాడు' సినీ గీత రచయిత కులశేఖర్. కొంచం సేపటి క్రితమే అతని మరణ వార్త చెవిన పడింది. జ్ఞాపకాలు మొదలయ్యాయి. 


'చిత్రం' సినిమా విడుదలకి ముందు ఆ సినిమాకి పని చేసిన చాలామందికి మల్లేనే కులశేఖర్ గురించి కూడా ఎవరికీ తెలియదు. ఆ సినిమా అనూహ్య విజయం సాధించడంతో, పని చేసిన అందరూ ఎంతోమందికి 'మావాళ్ళు' 'మనవాళ్ళు' అయిపోయేరు రాత్రికి రాత్రే. తర్వాత, వాళ్ళందరి ప్రయాణాల్లోనూ అనేక ఎత్తు పల్లాలు. కథానాయకుడు ఉదయ్ కిరణ్ ప్రయాణం, ముగింపు ఎలా అయితే అనూహ్యమో, ఈ కులశేఖర్ ప్రయాణమూ, ముగింపూ కూడా అంతే అనూహ్యం. ఉదయ్ కిరణ్ నాకు తెరమీద మాత్రమే తెలుసు. కానీ, మిత్రుడి కారణంగా కులశేఖర్ కాస్త ఎక్కువ తెలుసు. అర్ధాంతర మరణం - అది ఎవరిదైనా సరే - బాధిస్తుంది. వెళ్లి పోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడంలో ఏమన్నా సాంత్వన దొరుకుతుందా అంటే, ఏమో.. 

ఉత్తరాంధ్రలో బాగా పాపులర్ అయిన గరివిడి లక్ష్మి హరికథ (?) ట్యూన్లో రాసిన 'ఓ మావా, ఎల్లిపోతున్నాది' పాట బాగా హిట్. 'కుక్క కావాలి' పాటకి కూడా బాగా పేరొచ్చింది. కానీ 'చిత్రం' ఆల్బమ్ లో నాకు బాగా నచ్చిన పాట 'ఊహల పల్లకీలో ఊరేగించనా..' గురువు శాస్త్రి గారు (సిరివెన్నెల సీతారామశాస్త్రి) చేయి చేసుకుని వుంటారా అని అనుమాన పడ్డాను కూడా. అలా జరిగేందుకు ఏమాత్రం అవకాశం లేదని నా మిత్రుడు చాలా గట్టిగా చెప్పేడు. ప్రపంచం మొత్తం విజయం వెనుకే పరుగు తీస్తుంది. అందులో సినిమా పరిశ్రమ ముందుంటుంది. కులశేఖర్ తో సహా, 'చిత్రం' సినిమాకి పని చేసిన వాళ్ళందరూ అక్షరాలా ఊపిరి సలపనంత బిజీ అయిపోయేరు. 


"అంత సక్సెస్ కొట్టినా మా వాడేం మారలేదు తెలుసా.. ఎవరెవరికి రాస్తున్నాడో వివరంగా చెప్పేడు ఫోన్ చేసి" మిత్రుడి అప్డేట్ ని టీ చప్పరిస్తూ విన్నాను. "ఓసారి ప్లాన్ చేసి కలుద్దాం. అతనికి సాహిత్యం అంటే చాలా ఇష్టం. సంతోషిస్తాడు, బాగా మాట్లాడతాడు కూడా..." తల ఊపేను. కలవాలని నేను అనుకోలేదు కానీ, కొన్నాళ్ల తర్వాత కలిశాను. వాక్ మెన్ లో ట్యూన్ వింటూ, పొదిగేందుకు మాటలు వెతుక్కుంటూ, శబ్ద రత్నాకరం తిరగేస్తూ, అతిథుల్ని పలకరిస్తూ అక్షరాలా అష్టావధానం చేస్తున్న కులశేఖర్ ని కాసేపు చూశాను. వాతావరణం బరువుగా వుంది. తీరా డ్రాయింగ్ రూమ్ వరకూ వెళ్లి ఏమీ మాట్లాడకుండా వచ్చేయడం ఎందుకనిపించి అడిగాను, "పెళ్లికిలా పల్లకిలా ఈ ప్రేమ అని రాశారు, అంటే ప్రేమకి పర్యవసానం పెళ్లే అంటారా?" చురుక్కుమన్న చూపు ఇప్పటికీ గుర్తుంది. "ప్రేమకి పర్యవసానం ప్రేమే" అంటూ క్లుప్తమైన జవాబు. 'నువ్వులేక నేనులేను' సినిమాలో 'నిండు గోదారి' పాట చార్ట్ బస్టర్ అప్పట్లో. 

ఒక వృత్తిలో ఉన్నవాళ్లు, సీనియర్లని స్మరిస్తూ ఏదైనా పని చేయడం సినిమా పరిశ్రమలో కొంచం అరుదే. అలాంటిది, 'వచన రచనకి మేస్త్రి' మల్లాది రామకృష్ణ శాస్త్రిని స్మరిస్తూ కులశేఖర్ 'మణిదీపం' అనే సంచిక తీసుకొచ్చేరు. అన్నివిధాలా నాణ్యమైన పుస్తకం. లైబ్రరీలో దాచుకోవలసినది. కాలం గడుస్తోంది. చిత్రమైన పరిశ్రమ కదా. అవకాశాల ఉద్ధృతి నెమ్మదించింది. 'ప్రేమలేఖ రాశా' అనే సినిమాకి దర్శకుడిగా కొత్త అవతారం. తర్వాత కాలంలో బాగా పేరు తెచ్చుకున్న అంజలి కథా నాయిక. ఇప్పుడు వశిష్ట పేరుతో చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్న కుర్రాడు హీరో. కుర్రాడి తండ్రి ప్రొడ్యూసర్. సినిమా బాగా ఆడలేదు. ఉప్పొంగిన కెరటం నెమ్మదిగా వెనక్కి తగ్గినట్టుగా, కులశేఖర్ నెమ్మదిగా వెనక వరుసలోకి వెళ్ళిపోయేడు. 

ఏళ్ళు గడిచిపోయేయి. ఉన్నట్టుండి పేపర్లలో ఓ వార్త. గోదావరి జిల్లాలో ఓ ఆలయంలో వెండి వస్తువులు దొంగిలిస్తూ పట్టుబడ్డ సినీ గీత రచయిత కులశేఖర్ అని. అతని మానసిక పరిస్థితి అంత బాగాలేదని కూడా. 'ఓడలు బళ్లవుతాయి' అనేసుకోగలం కానీ, బండిగా మారిన ఓడ కథని ఊహించలేం కదా. "ఆలయాల్లో పని చేసే వాళ్ళు చాలా మంది దేవుడు మా యింటి మనిషే, దేవుడి సొమ్ము మా సొమ్మే అనుకుంటారు.. ఇతను సినిమా వాడవ్వడం వల్ల విషయం పెద్దదయ్యింది" మిత్రుడు ఫోన్ లో అంటున్నాడు.. నాకు చెబుతున్నాడో, తనకి తాను చెప్పుకుంటున్నాడో అర్ధం కాలేదు. "ఇలా జరిగి ఉండాల్సింది కాదు.. చాలా జరిగేయి. నాకు తెలుసు కానీ, చెప్పలేను.. చెప్పాలని లేదు.." కాల్ కట్టయ్యింది. నాకూ తెలుసుకోవాలని లేదు. వెనక్కి తగ్గిన కెరటం మళ్ళీ ఉప్పొంగుతుంది అనుకున్నాను. ఇలా శాశ్వితంగా కుంగిపోతుందని అనుకోలేదు. కులశేఖర్ ఆత్మకి శాంతి కలగాలి. 

శనివారం, సెప్టెంబర్ 14, 2024

ఎల్బీ నట విశ్వరూపం 'కవిసమ్రాట్'

మొదటి అభినందన నిర్మాత ఎల్బీ శ్రీరామ్ కి. పెట్టిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ అని తెలిసి కూడా సబ్జెక్టు మీద ప్రేమతో 'కవిసమ్రాట్' సినిమాని నిర్మించినందుకు. రెండవది నటుడు ఎల్బీ శ్రీరామ్ కి.  తెలుగులో తొలి జ్ఞానపీఠ గ్రహీత 'కవిసమ్రాట్' విశ్వనాథ సత్యనారాయణ మాట తీరు, హావభావాలు ఎలా వుంటాయో ఇప్పటి వాళ్లకి ఎవరికీ తెలిసే అవకాశం లేదు. కానైతే, నటుడు ఎల్బీ శ్రీరామ్ ఏ పాత్రలో ఎలా ఉంటాడో బాగా తెలుసు. తాను ఇన్నాళ్లూ పోషించిన పాత్రల ప్రభావం ఏమాత్రం కనిపించని విధంగా 'కవిసమ్రాట్' పాత్ర పోషించి, అవుననిపించిన నటుడు ఎల్బీ శ్రీరామ్ ని అభినందించాల్సిందే. వరుసలో మూడో వాడు, ఈ సినిమాకి కథ, మాటలు రాసుకుని, స్క్రీన్ ప్లే చేసుకుని, దర్శకత్వం వహించిన సవిత్ సి. చంద్ర నీ అభినందించాలి. 

గంట నిడివి గల ఈ 'కవిసమ్రాట్' బయోపిక్ కాదు. కేవలం విశ్వనాథ సత్యనారాయణ జీవితంలో కొన్ని ఘట్టాలకి దృశ్యరూపం. ఆ ఘట్టాల ఆధారంగా విశ్వనాథ వ్యక్తిత్వం, వ్యక్తిగత జీవితం, నాటి సంఘం, సాహిత్య వాతావరణం ఇవన్నీ ప్రేక్షకులు తెలుసుకునే అవకాశం ఇచ్చిన చిత్రం. దృశ్యాలని అనుసంధానం చేసే కథ చిన్నదే. తన స్వగ్రామం నందమూరులో జీర్ణస్థితిలో ఉన్న శివాలయాన్ని పునరుద్ధరించాలన్నది విశ్వనాథ శోభనాద్రి కల. ఆ కలని శోభనాద్రి కుమారుడు సత్యనారాయణ ఎలా నెరవేర్చాడు అన్నది కథ. ఇంగ్లీష్ సినిమాల పట్ల విశ్వనాథకి గల మోజు, వంటలో ప్రవేశం, సమకాలీన సాహిత్యం పట్ల ధోరణి, తనకి సాయం చేసిన వాళ్ళని మరవని తత్త్వం, బీదరికం లోనూ దూరం చేసుకోని ఆత్మాభిమానం ఇలాంటివన్నీ కథనంలో భాగమై ఆసాంతమూ సినిమాని ఆసక్తికరంగా మలిచేందుకు దోహద పడ్డాయి. 

ప్రారంభంలో వచ్చే 'నందమూరి తారకరామారావు' సన్నివేశంలో కనిపించిన నాటకీయత కొంత కలవరపెట్టిన మాట నిజం. అయితే, ఆ నాటకీయత ఆ ఒక్క సన్నివేశానికే పరిమితం కావడం పెద్ద ఊరట. 'దొరసాని' సన్నివేశం లోనూ ఒకింత నాటకీయత లేకపోలేదు కానీ, ఆ సంఘటన అలాగే జరిగింది అనడానికి దాఖలా విశ్వనాథ అచ్యుతదేవరాయలు రచన 'మా నాయన గారు' (అజో-విభొ కందాళం ఫౌండేషన్ ప్రచురణ).  నటీనటుల నటనని గురించి చెప్పుకోవాలంటే ప్రధాన పాత్రధారి ఎల్బీ శ్రీరామ్ అంతా తానే అయ్యారు. తమ్ముడు వెంకటేశ్వర్లు పాత్ర ధరించిన అనంత్ బాబు కి ఇంచుమించు సమంగా స్క్రీన్ స్పేస్ దొరికింది. మిగిలిన పాత్రల్లో కాస్త ఎక్కువ సేపు కనిపించింది 'ప్రసన్న కవి' గా టీఎన్నార్ (సుదీర్ఘ వీడియో ఇంటర్యూల ద్వారా పాపులర్ అయిన జర్నలిస్టు, కరోనాలో కాలం చేశారు). 

డాక్టర్ జోశ్యభట్ల సంగీతాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శివాష్టకం, విశ్వనాథాష్టకం లో భాగాలని కీలక సన్నివేశాలకి నేపధ్య సంగీతంగా వాడుకోవడం వల్ల ఆయా సన్నివేశాల అందం ఇనుమడించింది. ఆ కాలపు ఇళ్ళు, నాటి వాతావరణ చిత్రణ కి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ తెరమీద కనిపిస్తుంది. అయితే, కృష్ణా జిల్లా నేపధ్యంగా జరిగే కథలో అక్కడక్కడా గోదావరి నది కనిపించడం, ఆ మాండలీకం వినిపించడాన్ని కాస్త సరిపెట్టుకోవాలి. 'వేయిపడగలు' చుట్టూ అల్లిన సన్నివేశాలు నాకు ప్రత్యేకంగా అనిపించాయి, నాటి ఆంధ్ర విశ్వకళా పరిషత్తు బహుమతిని అడివి బాపిరాజు 'నారాయణరావు' తో కలిసి పంచుకున్న విషయాన్నీ ప్రస్తావించి వుంటే  బాగుండేది అనిపించింది. 'రామాయణ కల్పవృక్షము' కీ విశ్వనాథ వ్యక్తిగత జీవితానికీ వేసిన ముడి కన్విన్సింగ్ గా వుంది. 

కరోనానంతర కాలంలో థియేటర్లకి వెళ్లడం బాగా తగ్గి, సినిమాలు టీవీలోనే చూస్తున్నందువల్ల ఈ చూడడంలో వచ్చిన మార్పు ఏమిటంటే ఏ సినిమానీ ఏకబిగిన చూడకపోవడం. కాసేపు చూసి ఆపడం, మర్నాడో, మూడో నాడో కొనసాగించడం.. ఇలా అన్నమాట. ఈ మధ్య కాలంలో ఏకబిగిన చూసిన సినిమా ఈ 'కవిసమ్రాట్'. అంతే కాదు, సినిమా పూర్తి కాగానే మళ్ళీ మొదటికి వెళ్లి, చివరివరకూ రెండో సారి చూసిన సినిమా కూడా ఇదే. మొదటి సారి చూసినప్పుడు ప్రకటనలు అడ్డు పడడం సహజమే (యూట్యూబ్ లో కాబట్టి, ప్రకటనలు తప్పవు). కానీ, రెండో సారి కూడా ప్రకటనలు అడ్డమే అనిపించాయి. రెండు సార్లూ కూడా, చూస్తున్నంత సేపూ విశ్వనాథ రచనలు గుర్తొస్తూనే ఉన్నాయి. అయితే, రెండో సారి చివర్లో ఉండగా 'అల నన్నయకి లేదు...' గుర్తొచ్చింది (ఈ ప్రస్తావన సినిమాలో కూడా వుంది, వేరే విధంగా). ఎందుకంటే, విశ్వనాథ సమకాలీన రచయితలు ఎవరి గురించీ కూడా సినిమాలు రాలేదు మరి!!

మంగళవారం, జూన్ 04, 2024

ఉచితమైన తీర్పు

"జగన్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలవక పోతే, ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు, దేశం మొత్తం మీద కూడా ఎక్కడా ఏ రాజకీయ పార్టీ ఉచిత పథకాలు ప్రకటించాల్సిన అవసరం లేదు..." సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది మొదలు మిత్రులెవరితో ఎన్నికల ప్రస్తావన వచ్చినా నేను చెబుతూ వచ్చిన మాట ఇదే. ఉచిత పథకాలని ఉద్యమ స్థాయిలో అమలు చేసిన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇంతటి దారుణ పరాభవాన్ని రుచి చూస్తారని నాకే కాదు, నా మిత్రులు ఎవరికీ కూడా అంచనా లేదు. ఎందుకంటే, పోలింగ్ బూత్ కి తప్పకుండా వెళ్లి ఓటు వేసే కుటుంబాలన్నింటికీ గడిచిన ఐదేళ్ల కాలంలో పంచిన మొత్తాలు తక్కువేమీ కాదు. ఆ కృతజ్ఞత పూర్తిగా పని చేస్తుందని జగన్ నమ్మితే, ఎంతోకొంత మేరకు తప్పక ప్రభావం చూపిస్తుందని మా బోంట్లం అనుకున్నాం. 

ఆంధ్రప్రదేశ్ వోటింగ్ సరళిని చూస్తే, ప్రతిపక్షం పట్ల అనుకూలత కన్నా ప్రభుత్వం పట్ల వ్యతిరేకతే ఎక్కువగా పనిచేసినట్టు అనిపిస్తోంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లోనూ ఇలాంటి తీర్పునే ఇంతే బలంగా ఇచ్చారు ప్రజలు. (ఐదేళ్ల పాలనకే ఇంత వ్యతిరేకతని ఎందుకు మూట కట్టుకుంటున్నాం అనే ఆత్మవిమర్శని మన నాయకుల నుంచి అస్సలు ఆశించలేం, ఇది ఒక విషాదం). ప్రతిపక్ష నాయకుడిగా కొంచం విశ్రాంత జీవితం గడిపినా, ఎన్నికలకి ఏడాది ముందు పూర్తిగా యాక్టివేట్ అయిన నారా చంద్రబాబు నాయుడు తన సర్వమూ ఒడ్డి పోరాడారు ఈ ఎన్నికల్లో. ఈ వయసులో ఈ పోరాట స్ఫూర్తి  ఎంతైనా అభినందనీయం. అయితే, బాబు ఇచ్చిన 'అంతకు మించి' హామీలని జనం నమ్మేరా? 

నేనైతే నమ్మలేదనే అనుకుంటున్నాను. పదేళ్ల నాటి 'రైతు రుణ సంపూర్ణ మాఫీ' 'ఇంటికో ఉద్యోగం' లాంటి అమలు కాని హామీలని జనం మర్చిపోలేదు. కానైతే, ప్రభుత్వం మీద వ్యతిరేకతని ప్రకటించడానికి మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో, తెలుగుదేశం పార్టీయే ఊహించని రీతిలో విజయాన్ని కట్టబెట్టారు. (దీనిని ఏమాత్రం ముందుగా ఊహించగలిగినా, పొత్తుల ప్రస్తావన లేకుండా ఒంటరిగా పోటీ చేసి ఉండేది ఆ పార్టీ). ఇంత బలంగా ఆగ్రహ ప్రకటన ఎందుకు చేశారు అన్నది కుతూహలం కలిగించే విషయం. నెలనెలా అకౌంట్లలో పడే డబ్బు ఆగిపోయినా పర్లేదనే నిర్ణయానికి ఊరకే వచ్చెయ్యరు కదా. నిజానికి జగన్ డబ్బు పంపిణీతో సరిపెట్టేసి వుంటే అది వేరే కథ. కానీ విద్యా వైద్య రంగాల్లో చెప్పుకోదగిన కృషి జరిగింది (దీనినెందుకో ప్రచారానికి పెద్దగా వాడుకోలేదు). వాలంటీర్ల వల్ల చాలావరకు మేలు జరిగింది, ముఖ్యంగా కరోనా కాలంలో. 

మౌలిక సదుపాయాలు (రోడ్లు), ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, ఇసుక, లిక్కర్ పాలసీలు, చాలామంది ఎమ్మెల్యేలు సామంత రాజుల్లాగా వ్యవహరించడం (కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరిగినట్టు), కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో జరిగిన నిత్యావసర వస్తువుల ధరల విపరీత పెరుగుదల.. ఇవి ప్రధాన కారణాలు అయితే, సవాలక్ష కారణాల్లో మరికొన్నింటిగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకి జీతాలు/పెన్షన్లు ఎన్నో తారీఖున వస్తాయన్నది ప్రతి నెలా ఓ పజిల్ కావడం లాంటి వాటిని చెప్పుకోవాలి. చంద్రబాబు వస్తే మంత్రదండంతో రాత్రికి రాత్రే ఇవన్నీ సరైపోతాయని భ్రమలు లేకపోవచ్చు కానీ, తమ ఆగ్రహాన్ని ప్రకటించే మార్గంగా ప్రజలు ఓటుని ఎంచుకున్నారనిపిస్తోంది. అందిన వాటి పట్ల కృతజ్ఞత కన్నా (నిజానికి ఈ కృతజ్ఞత ఉండాలా అన్నది వేరే చర్చ) అందని వాటి పట్ల ఆగ్రహమే ఎక్కువగా పనిచేసింది. 

జగన్ ప్రభుత్వం చేయలేకపోయిన రెండు ముఖ్యమైన ప్రాజెక్టులు -- ఒక స్థిరమైన రాజధాని ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం. ఐదేళ్ల నాడు కేంద్రంలో మెజారిటీ తక్కువ వస్తే, తన ఎంపీల మద్దతు ఇచ్చి నిధులు సాధించుకోవాలని జగన్ ఆశించారు. "కేంద్రం మెడలు వంచి" అని పదేపదే చెప్పారు. అప్పుడు రాని అవకాశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చింది. లోక్ సభ ఫలితాల తీరు చూస్తుంటే "పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారు" అనే ఐదేళ్ల నాటి తన వ్యాఖ్యని నరేంద్ర మోడీ మర్చిపోవాల్సిన తరుణం వచ్చినట్టుగా అనిపిస్తోంది. పోలవరాన్నీ, అమరావతినీ నిధుల వరద ముంచెత్తవచ్చు. అయితే, రెండూ కూడా ఆ ఫళాన పూర్తయ్యే నిర్మాణాలు కావు. ఆ పనులు ఏ రీతిగా సాగుతాయన్నది చూడాలి. 

"మళ్ళీ బీజేపీ గెలిస్తే ఇన్కమ్ టాక్స్ శ్లాబ్ నలభై శాతం అవుతుంది, జీఎస్టీ ముప్ఫయి శాతం అవ్వచ్చు.." ఎన్నికలకి ముందు మిత్రులొకరు వ్యంగ్యంగా అన్న మాట ఇది. గత పదేళ్ల పన్నుపోట్ల మీద సెటైర్ అన్నమాట. ఇప్పుడిక ఏ పక్షం అధికారం లోకి రావాలన్నా మిత్ర పక్షాల సాయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ ధరలు, పన్నుల దూకుడు అలాగే ఉంటుందా, లేక ఏమన్నా నిదానిస్తుందా అన్నది వేచి చూడాల్సిన విషయం. ఈ మిత్రపక్షాల సాయం ఏమేరకు అవసరం పడుతుంది అన్నదాని మీద కొన్ని కీలకమైన విషయాలు ఆధార పడి వున్నాయి. ఆ సర్దుబాట్లు, ఇచ్చిపుచ్చుకోడాలు ఇదంతా జరగబోయే కథ. చంద్రబాబు మీద ఉన్న స్కిల్ స్కామ్ వగయిరా కేసులన్నీ తొలగిపోతాయనడానికి సందేహం లేదు. జగన్ కేసుల విషయంలో ఇప్పుడు వ్యవస్థ ఎలా పని చేయబోతోందన్నది చూడాలి. ఇంతకీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉచితాలు లేకపోయినా పర్లేదనుకున్నారా లేక చంద్రబాబు 'అంతకుమించి' ని నిజంగానే నమ్మేరా?? 

ఆదివారం, ఏప్రిల్ 14, 2024

ఎదలో గానం.. పెదవే మౌనం...

"శిల కూడా చిగురించే విధి రామాయణం
విధికైనా విధి మార్చే కథ ప్రేమాయణం ..."

మంచి సాహిత్యం, దానికి సరిపడే సంగీతం, తగిన సన్నివేశం.. ఇవన్నీ కుదిరినప్పటికీ కొన్ని పాటల విషయంలో కొన్ని కొన్ని అసంతృప్తులు అలా మిగిలిపోతూ ఉంటాయి. శేఖర్ కమ్ముల 'ఆనంద్' (2004) సినిమా కోసం వేటూరి రాసిన 'ఎదలో గానం..' పాట ఆ కొన్నింటిలో ఒకటి. ప్లే లిస్టులో పెర్మనెంటు మెంబరుగా ఉండిపోవాల్సిన ఈ పాట కేవలం గాయకుడి ఉచ్ఛారణ కారణంగా అతిథిలా అప్పుడప్పుడూ వచ్చి పోతూ ఉంటుంది. చాన్నాళ్ల తర్వాత ఈ మధ్యనే మళ్ళీ వచ్చింది. 

ఈ పాట నాయికా నాయకుల యుగళగీతం కాదు, కథలో కీలక సన్నివేశాలు జరుగుతుంటే నేపథ్యంలో వినిపించే పాట. సినిమాలో ఉన్న ముఖ్య పాత్రలన్నీ ఈ పాటలో కనిపిస్తాయి. కె ఎం రాధాకృష్ణన్ ఫ్యూషన్ సంగీతంతో బాణీ కట్టారు. 

"ఎదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో
మెరిసెనిలా శ్రీ రంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో"

శ్రీరంగ కావేరి ఒక్కో ఋతువులోనూ ఒక్కో అందంతో మెరుస్తుంది. 'సారంగ' అంటే 'చిత్ర వర్ణము కలది' అంటున్నారు వావిళ్ళ వారు. కనులు సెలయేరులైనప్పుడు కలలు 'సెలవు' తప్ప ఇంకేం అనగలవు? పాటని అద్భుతంగా ఎత్తుకున్నప్పటికీ,  హరిహరన్ "ష్రిరంగ కావేరి.." అంటుంటే పంటికింద మొదటి రాయి 'ఫట్' మంటుంది. 

"కట్టు కథలా ఈ మమతే కలవరింత
కాలమొకటే కలలకైనా పులకరింత
శిల కూడా చిగురించే విధి రామాయణం
విధికైనా విధి మార్చే కథ ప్రేమాయణం
మరవకుమా వేసంగి ఎండల్లొ పూసేటి మల్లెల్లొ మనసు కథ" 

పల్లవిలో 'సెలవన్నాయి కలలు' అనేశారు కదా. ఇప్పుడేమో 'కాలమొకటే కలలకైనా పులకరింత' అంటున్నారు. ఒకే కల మళ్ళీ మళ్ళీ రావచ్చు.. లేదూ, ఎప్పటి కలలనో తల్చుకుని ఇప్పుడు పులకరించనూ వచ్చు. "శిల కూడా చిగురించే విధి రామాయణం.. విధికైనా విధి మార్చే కథ ప్రేమాయణం" వేటూరి మాత్రమే రాయగలిగే లైన్లైవి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన సంతకం. ఎండల్లో మల్లెలు పూస్తాయి, క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతాలు జరుగుతాయి.. 

పంటి దగ్గరికి వస్తే 'కట్టుకద' 'విది' 'ఖద'  వరుసగా రాళ్లే రాళ్లు. ఒక్క చరణంలో ఇన్ని తప్పులు ఎలా పాడించ గలిగారా అని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, విన్నప్పుడల్లా. హరిహరన్ కి తెలుగు రాదు సరే, మిగిలిన బృందంలో ఎవరికీ తెలుగు తెలియదా? హరిహరన్ కి సరితూగే తెలుగు గాయకుడు దొరకలేదని సరిపెట్టుకున్నా, కనీసం ఈ ఒక్క చరణం మళ్ళీ రికార్డు చేసి ఉండకూడదా అనేది సరిపెట్టుకోలేని సంగతి నాకు. 

"శ్రీ గౌరీ చిగురించే సిగ్గులెన్నొ
పూచే సొగసులో ఎగసిన ఊసులో
ఊగే మనసులో అవి మూగవై
తడి తడి వయ్యారాలెన్నొ
ప్రియ ప్రియ అన్న వేళలోన.. శ్రీ గౌరీ..."

సినిమా చూడకపోయినా, సందర్భం తెలియకపోయినా కూడా ఈ చరణం వినగానే ఓ కొత్త పెళ్లికూతురు కళ్ళముందు మెదులుతుంది. చిత్రీకరణ పరంగా కూడా ఈ చరణం కొంచం ప్రత్యేకంగానే ఉంటుంది. నేనైతే ఈ చరణం కోసం ఎదురు చూస్తాను, పాట వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడూ కూడా. పరభాషా గాయనే అయినా చిత్ర ఉచ్ఛారణకి వంక పెట్టడానికి ఉండదు సాధారణంగా. 'శ్రీ గౌరీ' ఒక్కటీ మాత్రం 'ష్రి గౌరీ' లా వినిపిస్తూ ఉంటుంది నాకు. పల్లవి, తొలి చరణం ప్రభావమేమో మరి. 

శుక్రవారం, ఫిబ్రవరి 09, 2024

భారత రత్నం

అవార్డుల బహూకరణలో రాజకీయాలు ప్రవేశించడం ఇవాళ కొత్తగా జరిగింది కాదు. ఎవరికి ఏ అవార్డు వచ్చినా దాని వెనుక ఒక రాజకీయ కారణం ఉంటుందన్నది బహిరంగ రహస్యం. అయినప్పటికీ కూడా నేను ఇష్టపడే ఇద్దరు వ్యక్తులకి 'భారత రత్న' అవార్డు ప్రకటించడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి ఈ అవార్డు ప్రకటించారన్న వార్త తెలియగానే తెలియకుండానే కళ్ళలో నీళ్లు తిరిగాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలకీ, సోనియా, రాహుల్ గాంధీల అభిమానులకీ ఈ ప్రకటన మింగుడు పడక పోవచ్చు. కానీ, 'భారతరత్న' అవార్డుకి విలువ పెంచే నిర్ణయం ఇది. మళ్ళీ చెబుతున్నా, ఇది రాజకీయ నిర్ణయమే అయి ఉండవచ్చు. అయినప్పటికీ, పీవీ అర్హతకి తగిన బహుమతి - అది కూడా చాలా చాలా ఆలస్యంగా. 

అది తాత ముత్తాతల నుంచి తనకి వారసత్వంగా వచ్చిన పార్టీ కాదు. అందులో తాను అప్పటికి ఎంపీ కూడా కాదు. ప్రధాని పదవికి తన అభ్యర్థిత్వం ఒక తాత్కాలిక ప్రకటన. ఆ పదవి కోసం పార్టీలో సీనియర్ల నుంచే విపరీతమైన పోటీ. ప్రతి పూటా ఆ పదవిని రక్షించుకుంటూ ఉండాలి. ఇది చాలదన్నట్టు ఏ క్షణంలో ప్రభుత్వం కూలుతుందో తెలియని రాజకీయ అనిశ్చితి. ఒకరిద్దరు ఎంపీలు గోడ దూకినా ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితి. మరో నాయకుడైతే కేవలం తన పదవిని నిలబెట్టుకోడానికే పరిమితమై, రోజువారీ కార్యకలాపాలని 'మమ' అనిపించి కుర్చీ దిగి ఉండేవాడు. ఆనాడు ఆ పదవిలో ఉన్నది మరో నాయకుడే అయితే ఇవాళ భారత దేశం మూడో ప్రపంచ దేశాల (థర్డ్ వరల్డ్ కంట్రీస్) సరసన నిలబడి ఆకలి దప్పులతోనూ, అంతర్గత యుద్ధాలతోనూ అలమటిస్తూ ఉండేది. 

ఇవాళ్టిరోజున చాలా మామూలుగా అనిపించే 'నూతన ఆర్ధిక సంస్కరణలు' ఆరోజున చాలా పెద్ద నిర్ణయం. అప్పుడు, అంటే 1991 లో దేశానికి ఇక అప్పు పుట్టని పరిస్థితి ఎదురైనప్పుడు, బంగారం నిలవల్ని విదేశానికి తరలించాల్సి వచ్చింది, కుదువ పెట్టి అప్పు తీసుకు రావడం కోసం. బంగారాన్ని కళ్ళతో చూస్తే తప్ప అప్పు ఇవ్వడానికి నిరాకరించిన వాతావరణం. అంతర్జాతీయంగా ఆనాటి భారతదేశపు పరపతి అది. ఉన్నవి రెండే దారులు. కొత్త కొత్త అప్పులు చేస్తూ, పన్నులు పెంచి వాటిని తీరుస్తూ రోజులు గడపడం మొదటిది. ప్రపంచీకరణ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశించడం రెండవది. స్వపక్షం, విపక్షాలు కూడా మొదటి దారిని కొనసాగించమనలేదు, కానీ రెండో దారిని తీవ్రంగా వ్యతిరేకించాయి. (అలా వ్యతిరేకించిన వారిలో చాలామంది సంతానం ఇవాళ అమెరికా తదితర దేశాల్లో స్థిరపడడానికి కారణం ఆ ప్రపంచీకరణే కావడం ఒక వైచిత్రి). 

తన పదవిని, మైనారిటీ ప్రభుత్వాన్నీ నిలబెట్టుకుంటూనే, వ్యతిరేకిస్తున్న అందరినీ సమన్వయం చేసుకుంటూ, ఒక చారిత్రక నిర్ణయం తీసుకుని భారత దేశాన్ని ప్రపంచ మార్కెట్లో ప్రవేశపెట్టిన ఘనత కచ్చితంగా పీవీ నరసింహారావుకే దక్కుతుంది. మన్మోహన్ సింగ్ ని ఆర్ధిక మంత్రిగా నియమించుకోవడం మొదలు, కీలక నిర్ణయాలు తీసుకోడానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వరకూ అడుగడుగునా పీవీ శక్తియుక్తులు కనిపిస్తాయి. ప్రపంచీకరణ ఫలితంగా విదేశీ పెట్టుబడులు భారతదేశానికి రావడం మొదలయ్యింది. అప్పటి వరకూ ఉద్యోగం అంటే గవర్నమెంట్, బ్యాంక్ లేదా స్థానిక ప్రయివేటు సంస్థల్లో మాత్రమే విపరీతమైన పోటీ మధ్యలో అవకాశాలు దక్కించుకుంటూ వస్తున్న యువతకి కార్పొరేట్ ఉద్యోగాలు దేశ విదేశాల్లో స్వాగతం పలికాయి. స్థానికంగా విద్యావకాశాలు పెరిగాయి. మధ్యతరగతి నిలబడింది. చదువుకునే అవకాశాన్ని వినియోగించుకున్న పేదలు మధ్య తరగతికి, ఆపై తరగతికి చేరగలిగారు. 

ఇంత చేసిన పీవీకి దక్కింది ఏమిటి? సొంత పార్టీ నుంచే ఛీత్కారాలు. ప్రాణం పోయాక, అంతిమ సంస్కారాలకి దేశ రాజధానిలో కనీసం చోటు దొరకలేదు. ఆ జీవుడు వెళ్ళిపోయిన ఇన్నేళ్ల తర్వాత కూడా "అప్పట్లో మా కుటుంబం అధికారంలో ఉండి ఉంటే బాబరీ మసీదు కూలి ఉండేది కాదు" అనే వాళ్ళు ఒకరైతే, "భారత దేశానికి తొలి బీజేపీ ప్రధాని పీవీ నరసింహారావు" అనేవారు మరొకరు. ఇవన్నీ ఒక ఎత్తైతే, జీవితకాలమూ పీడించిన కోర్టు కేసులు మరో ఎత్తు. పోనీ ప్రధాని పదవిని దుర్వినియోగం చేసి వందల కోట్లో, లక్షల కోట్లో వెనకేసుకున్నారా అంటే, ఆ కుటుంబం ఇప్పటికీ దేశంలోనే ఉంది. సాధారణ జీవితాన్నే గడుపుతోంది. గోరంత చేసినా కొండంత ప్రచారం చేసుకునే నాయకులున్న కాలం ఇది. కొండంత చేసి కూడా గోరంతకూడా చెప్పుకోని (చెప్పుకోలేని) పీవీ లాంటి నాయకులు అత్యంత అరుదు. 

ఇప్పుడీ అవార్డు వల్ల విమర్శించే నోళ్లు మూత పడతాయా? అస్సలు పడవు. అవార్డు వెనుక రాజకీయ ప్రయోజనం ఉన్నట్టే, విమర్శ వెనుక కూడా ఉంటుంది. ఏం జరుగుతుందీ అంటే, నూతన ఆర్ధిక సంస్కరణలనాటి రోజుల నెమరువేత జరుగుతుంది. వాటి వల్ల బాగుపడిన కొందరైనా గతాన్ని గుర్తు చేసుకుంటారు. పీవీ కృషికి తగిన గుర్తింపు దొరికిందని సంతోషిస్తారు. విమర్శకులందరూ పాత విమర్శలకి మరో మారు పదును పెడతారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఉన్నతమైన అవార్డు పరువు తీసింది అంటారు. జీవించి ఉన్నప్పుడే విమర్శలకి వెరవని, చలించని నాయకుడు పీవీ. ప్రధాని పదవి వరిస్తే పొంగి పోనట్టే, ఈ అవార్డుకీ పొంగిపోరు. ఎటొచ్చీ ఆయన కృషిని గుర్తు చేసుకునే నా బోంట్లు సంతోషిస్తారు. అంతే.. 

అన్నట్టు, ఎమ్మెస్ స్వామినాథన్ కి 'భారత రత్న' వస్తుందని ఆయన ఉండగానే అనిపించింది నాకు. పీవీ లెక్కలో చూస్తే, స్వామినాథన్ కి త్వరగా వచ్చినట్టే. ఆయనకీ ఈ అవార్డుకి అన్ని అర్హతలూ ఉన్నాయి. 

బుధవారం, జనవరి 24, 2024

పదిహేను ...

నిజానికి ఈ పోస్టు రాయడమా, వద్దా అని చాలా ఆలోచించాను. బ్లాగింగ్ మొదలు పెట్టి పదిహేనేళ్ళు పూర్తవ్వడం సంతోషం కలిగించే విషయమే. కానీ, గడిచిన ఏడాది బ్లాగు చరిత్రని తిరిగి చూసుకుంటే ఏమున్నది గర్వకారణం అనిపించింది. వ్యక్తిగత జీవితం తాలూకు ప్రభావం బ్లాగింగ్ మీద ఉండడం అన్నది ఎప్పుడూ నిజమే అయినా, గడించిన సంవత్సర కాలంలో అది మరింతగా రుజువయ్యింది. రాయాలని అనిపించక పోవడం, మొదలు పెట్టబోతూ వాయిదా వెయ్యడం, నెమ్మదిగా రాద్దాం అనుకోవడం...ఇలాంటి అనేక అనుభవాలే గుర్తొస్తున్నాయి నెమరువేతల్లో. ఏమీ సాధించక పోయినా ఏడాది తిరిగేసరికి పుట్టినరోజు వచ్చేసినట్టే, పెద్దగా రాయకపోయినా కేలండర్ మారడంతో బ్లాగుకీ పుట్టినరోజు వచ్చేసింది. ఇదొక సహజ పరిణామ క్రమం అన్నమాట. 

మరీ 'మా రోజుల్లో' అనబోవడం లేదు కానీ, పదిహేనేళ్ళు అయింది కాబట్టి నేను బ్లాగుల్లోకి వచ్చిన తొలినాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలనిపిస్తోంది. అప్పటికే తెలుగులో వందకి పైగా బ్లాగులుండేవి. ప్రతి వారం కొత్త బ్లాగులు జతపడుతూ ఉండేవి. కొందరు ప్రతి రోజూ, చాలామంది కనీసం వారానికి ఒకటి రెండు పోస్టులు రాసేవాళ్ళు. ఆవకాయ మొదలు అమెరికా రాజకీయాల వరకూ ప్రతి విషయం మీదా పోస్టులు, కామెంట్లలో చర్చలూ ఉండేవి. ఆవేశకావేశాలు లేకపోలేదు కానీ, కామెంట్ మోడరేటర్ పుణ్యమా అని అసభ్య కామెంట్లు, వ్యక్తిగత దూషణలు అరుదుగా తప్ప కనిపించేవి కాదు. తెలుగు బ్లాగు అగ్రిగేటర్లకి ట్రాఫిక్ పెరుగుతున్న కాలంలోనే కొన్ని వెబ్ మ్యాగజైన్లు కూడా ప్రారంభం అయ్యాయి. చదివేవాళ్ళు, రాసేవాళ్ళతో మంచి సాహిత్య వాతావరణం ఉండేది. 

Google Image

అప్పటితో పోలిస్తే బ్లాగులు రాసే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. అయితే, బ్లాగుల్ని చదివి, అభిప్రాయాలు పంచుకునే పాఠకులు ఇప్పటికీ కొనసాగుతున్నారు. అప్పట్లో ఆన్లైన్ లో తెలుగు కంటెంట్ అరుదుగా దొరికేది. ఇప్పుడు విస్తృతి పెరిగింది. చదవడానికి, చూసేందుకు కూడా కంటెంట్ కి లోటు లేదు. మోడరేషన్ లేని చర్చలు లైవ్ లో నడుస్తున్నాయి. సభా మర్యాదల్లోనూ మార్పు వచ్చింది. మైక్రో కంటెంట్ వెల్లువెత్తుతోంది. నాలుగైదు లైన్లు/అర నిమిషం వీడియోల్లో విషయాలని కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. చదివే/చూసే వాళ్ళ ధోరణిలోనూ మార్పు కనిపిస్తోంది. ఒకప్పటిలా సుదీర్ఘమైన పోస్టులు, అర్ధవంతమైన చర్చలు అరుదుగా కనిపిస్తున్నాయి. మార్పు అనివార్యం. 

విస్తృతి పెరగడం తాలూకు విపర్యయం ఏమిటంటే కంటెంట్ చోరీ. బ్లాగుల్లో రాసుకున్న పోస్టులు లేదా వాటిలో కొన్ని భాగాలూ తెలియకుండానే ఇంకెక్కడో ప్రత్యక్షం కావడం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. కానీ అప్పట్లో ఫలానా చోట వచ్చిందని పట్టుకోడానికి వీలు ఉండేది. ఇప్పుడు ఎక్కడని వెతకాలి? తాజా ఉదాహరణ 'గుంటూరు కారం' సినిమా. ఆ సినిమా విడుదలకి కొన్ని రోజుల ముందు యద్దనపూడి సులోచనా రాణి రాసిన 'కీర్తి కిరీటాలు' నవల ఆధారంగానే సినిమా తయారవుతోందనే గాలి వార్త ఒకటి బయటికి వచ్చింది. ఆ నవలని గురించి నేను రాసిన బ్లాగ్ పోస్టు, అందులో కొన్ని భాగాలూ నాకు తెలిసి నాలుగైదు చోట్ల ఉపయోగించుకో (చోరీ చేయ) బడ్డాయి. తెలియకుండా ఇంకెన్ని చోట్ల వాడారో మరి. సోర్సుకి క్రెడిట్ ఇవ్వడాన్ని అవసరం లేని పనిగానో, పరువు తక్కువగానో భావించే వాళ్ళు ఉన్నత కాలం ఇది జరుగుతూనే ఉంటుంది బహుశా. 

ఈ తరహా చౌర్యాలు తాత్కాలికంగా ఉసూరుమనిపిస్థాయి కానీ, 'ఎందుకొచ్చింది, రాయడం మానేద్దాం' అనిపించవు నాకు. చోరీ చేసిన వాళ్ళ మీద కోపం కన్నా చికాకే ఎక్కువ కలుగుతూ ఉంటుంది. ముందే చెప్పినట్టుగా ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, ఏం చేసినా ఆగేది కూడా కాదు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, బ్లాగింగ్ ఆపేసే ఉద్దేశమేమీ లేదు. వీలైనంత తరచుగా రాయాలనే ఉంది. అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా మరింత గట్టిగా చేయాలన్నదే సంకల్పం. పదిహేనేళ్ళుగా నా రాతల్ని చదివి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఇక్కడే మరింత తరచుగా మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాను.