సోమవారం, మే 21, 2018

నవలాదేశపు రాణి

హైస్కూలు రోజుల నాటి బరువైన వేసవికాలపు మధ్యాహ్నాలు యిట్టే గడిచిపోయేలా చేసిందీ, అటుపైన సాహిత్యపు రుచిని మప్పిందీ ఒక్కరే.. ఆమె తెలుగుసాహిత్యపు 'నవలాదేశపు రాణి' యద్దనపూడి సులోచనా రాణి. సెలవురోజుల్లో క్లాసేతర పుస్తకం చేతుల్లో కనిపిస్తే కన్నెర్రజేసే అమ్మానాన్నా కూడా, ఆ పుస్తకం సులోచనారాణిది అని గమనిస్తే చూసీ చూడనట్టు తప్పుకునేవారు. అమ్మ, అత్తయ్యలు, పెద్దమ్మలు, పిన్నిలు పోటీలు పడి చదివి చర్చించుకున్నవీ, తాతయ్య తన చివరి రోజుల్లో కళ్ళజోడు సరిచేసుకుంటూ చదువుకున్న నవలలూ యద్దనపూడివే. సులోచనారాణి రచనలు సకుటుంబంగా చదవదగినవీ, వయోభేదం లేకుండా అందరూ ఆస్వాదించగలిగేవీ అనడానికి ఇంతకు మించి చెప్పాల్సింది ఏమీ లేదేమో.

దేశానికి స్వతంత్రం వచ్చేనాటికి విద్యలో, ప్రత్యేకించి స్త్రీవిద్యలో, వెనుకబడి ఉన్న ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రమూ ఉంది. "ఆడపిల్లకి చదువెందుకూ" నుంచి "చాకలిపద్దు రాసే చదువు చాలు" మీదుగా "మొగుడికో ఉత్తరమ్ముక్క రాసుకునే చదువన్నా చెప్పించాలి" వరకూ నెమ్మదిగా ఎదుగుతూ వచ్చిన ఆలోచనలని దేశ రాజకీయాలు, ప్రత్యేకించి ఇందిరాగాంధీ లాంటి నాయకులు పదవులు చేపట్టడంతో ఒక్కసారిగా పూర్తిగా మార్చి ఆడపిల్లలకి చదువు అవసరం అన్న ఎరుకని కలిగించాయి. స్వతంత్రం వచ్చి రెండు దశాబ్దాలు గడిచేసరికి చదవడం నేర్చిన మధ్యతరగతి గృహిణుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. వీరికి అవసరమైన వినోదాన్ని, తగు పాళ్ళలో విజ్ఞానాన్ని అందించే బాధ్యతని వార, పక్ష, మాస పత్రికలు స్వీకరించాయి.

నిరంతరం కొత్తని అన్వేషించే పత్రికా సంపాదకుల దృష్టివల్లనయితేనేమి, పత్రికల మధ్య పెరిగిన పోటీ అయితే ఏమి, మహిళల కోసం మహిళల చేతే విస్తృతంగా రచనలు చేయించే ఆలోచనలు జరుగుతున్న తరుణంలో కలంపట్టారు సులోచనారాణి. పుట్టి పెరిగింది పల్లెటూళ్ళోనే అయినా, అది విద్యావంతుల కుటుంబం కావడం, పెద్దలందరికీ పఠనాసక్తి ఉండడంతో సాహిత్యాన్ని చదువుతూ పెరిగారామె. పెద్ద చదువులు చదవలేకపోయినా ప్రపంచపు పోకడలని ఆకళింపు చేసుకున్నారు. సరదాగా కథా రచన ప్రారంభించి, పాఠకుల అభిమానాన్ని సంపాదించుకుని, అనుకోకుండా 'సెక్రటరీ' తో నవలా రచన మొదలుపెట్టి తక్కువ కాలంలోనే సాటి రచయితలు అసూయ పడేంత తిరుగులేని స్థానానికి చేరుకున్నారు.

సులోచనారాణి రచనల్ని గురించి మాట్లాడేటప్పుడు తప్పకుండా వేసుకోవాల్సిన ప్రశ్నలు రెండు. ఆమె రచనల్లో ఏం ఉంటాయి? ఏం ఉండవు?? నవలల్లో చదివించే గుణాన్ని పుష్కలంగా నింపడం ఆమె ప్రత్యేకత. మళ్ళీ మళ్ళీ చదివేప్పుడు కూడా పాఠకుల్లో అదే ఉత్సుకత, పుస్తకాన్ని పూర్తిచేసి కానీ పక్కన పెట్టలేని ఒకలాంటి బలహీనత.. ఇదే ఆమె విజయరహస్యం. ఆమె నవలలు సినిమాలుగానూ, టీవీ సీరియళ్లు గానూ రావడం వెనుక, కంప్యూటర్ రోజుల్లో కూడా మళ్ళీ మళ్ళీ ముద్రించబడుతూ ఉండడం వెనుక ఉన్న రహస్యమూ ఇదే. మానవ సంబంధాలని దాటి ఆమె రచనవస్తువు మరోవైపు వెళ్ళలేదు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ తమని తాము ఐడెంటిఫై చేసుకునే పాత్రలు, మనింట్లోనో,  పక్కింట్లోనో  జరిగాయేమో అనిపించే సంఘటనలు. ఫలితంగా, తన టార్గెటెడ్ పాఠకులైన గృహిణులతో పాటు అన్ని వర్గాలనీ తన రచనలవైపు ఆకర్షించుకున్నారు. అతిశయాన్నీ, నాటకీయతనీ కూడా అంగీకరింపజేశారు.
 

మానవ సంబంధాల చుట్టూ కథలల్లిన సులోచనారాణి అక్రమసంబంధాల జోలికి వెళ్ళలేదు ఎన్నడూ. 'సంసార పక్షపు రచయిత్రి' అన్న ముద్రని సంపాదించుకుని, నిలబెట్టుకున్నారు. పాపులారిటీ కోసం క్షుద్రపూజలనో, పిశాచాలనో రచనల్లో ప్రవేశపెట్టలేదు. సెక్సు, హింసల జోలికి వెళ్ళలేదు. టీవీ సీరియళ్ల టైపు పగలు, ప్రతీకారాలు మచ్చుకైనా కనిపించవు. సంస్కృత కావ్యాలనో మరో రచనలనో అడ్డం పెట్టుకుని కథానాయికల అంగాంగ వర్ణనలు చేయలేదు.ఆమె సృష్టించిన నాయికలు బేలలు కారు, ధీరలు. అలాగని, నాయికలని ఉన్నతంగా చూపించడం కోసం నాయకుల వ్యక్తిత్వ హననం చేయడమో, వారిని మరగుజ్జులుగా చూపడమో జరగలేదెన్నడూ. విశ్వ విఖ్యాత మిల్స్ అండ్ బూన్స్ రచనలు, బెంగాలీ రచయిత శరత్ బాబు సాహిత్య ప్రభావం సులోచనారాణి రచనల మీద కనిపించినా నేరుగా కాపీ కొట్టారన్న అపప్రధని ఏనాడూ మూటకట్టుకోలేదు.

పురుషాధిక్య ప్రపంచంలో ఒక మహిళ తనకి తానుగా ఒక ఉన్నత స్థానాన్ని సృష్టించుకుని, దశాబ్దాల పాటు మరొకరిని దరిదాపులకు రానివ్వకుండా నిలబడడం అన్నది మామూలు విషయం కాదు. ప్రతిభకి నిరంతర కృషి తోడవడం వల్ల వచ్చిన ఫలితమది. విజయం వెంట పరుగుతీసే సినిమా వారు, సులోచనారాణి చేత సినిమా రచనలూ చేయించారు. సహజంగానే ఆమె కీర్తి కొందరికి కంటగింపు అయ్యింది. జోక్స్ నీ, సెటైర్స్ నీ ప్రచారంలోకి తెచ్చారు. ఆమెని దృష్టిలో ఉంచుకుని చేసిన వ్యంగ్య రచనలు, "నేను స్త్రీని, పైగా అందమైన పేరు భరిస్తున్నదానిని.. రచనలు చేయడానికి ఇంతకన్నా అర్హతేమి కావాలి?" లాంటి సంభాషణలు, మూడు నాలుగు పత్రికల్లో ఏకకాలంలో సీరియల్స్ రాసే పాపులర్ రచయిత్రి, ఒకసారి పొరపాటున ఒక పత్రికకి పంపాల్సిన మేటర్ని మరో పత్రిక్కి పంపినా పాఠకులు పోల్చుకోలేక చదివేసుకున్న ఇతివృత్తాలతో కథలు... తనని ఉద్దేశించి రాసిన వీటన్నింటినీ ఆమె స్పోర్టివ్ గానే తీసుకుని ఉంటారు బహుశా.

వ్యక్తిగా సులోచనారాణి వివాదరహితురాలు. ఏ వివాదంలోనూ ఆమె తలదూర్చలేదు. తనని విమర్శించిన వాళ్లకి కూడా మరింత పాపులర్ రచనలు చేయడం ద్వారానే సమాధానం చెప్పారు తప్ప మరో మార్గాన్ని ఎంచుకోలేదు. 'మీనా' నవలని కాపీకొట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అ ఆ' సినిమా తీసినప్పుడు కూడా ఆమెనుంచి బహిరంగ విమర్శ రాలేదు. అయితే, ఆమె అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో, సినిమా విడుదలైన కొన్ని రోజులకి త్రివిక్రమ్ టైటిల్ కార్డ్స్ లో ఆమెకి 'స్పెషల్ థాంక్స్' చెప్పక తప్పలేదు. 'సులోచనారాణి నవలల్లో సామాజిక స్పృహ ఉండదు' అన్నది ఆమె రచనల మీద విన్న ప్రధాన విమర్శ. తెలుగు సాహిత్యంలో అస్తిత్వ వాదం ఊపందుకున్న కాలంలో కూడా ఆమె తన ధోరణిలో రచనలు చేశారు తప్ప, వాదాల జోలికి వెళ్ళలేదు. ఆమె మార్గం మీద ఆమెకి స్పష్టమైన అవహగాన ఉండడం ఇందుకు కారణం కావొచ్చు బహుశా.

తరచి చూస్తే, స్త్రీ సాధికారికతని తన రచనల్లో బలంగా ప్రతిపాదించిన రచయిత్రి సులోచనారాణి. తెలుగునాట తొలితరం ఉద్యోగినులు ఆమె పాత్రలలో తమని తాము చూసుకున్నారు అనడం అతిశయోక్తి కాదు. రచయిత్రిగా తన బలం ఏమిటన్నది ఆమెకి బాగా తెలుసు. తెలుగు లోగిళ్ళలో కనీసం కొన్ని తరాలకి సాహిత్యం చదవడాన్ని అలవాటు చేశాయి ఆమె రచనలు. అసలంటూ పాఠకులు తయారైతే, తర్వాత తమకి నచ్చిన సాహిత్యాన్ని చదువుకుంటారు కదా. ఈ తయారయ్యే ప్రక్రియకి ఆమె నవలలు చేసిన దోహదం తక్కువదేమీ కాదు. 'కమర్షియల్ రైటర్' అని ఆమెని చిన్నచూపు చూసిన సామాజికస్పృహ గల రచయిత(త్రు)లూ ఉన్నారు. వాళ్లకి చెప్పేది ఒక్కటే.. మీ రచనలు చదివిన, చదువుతున్న పాఠకుల్లో అనేకులు మొదట చదివిని ఆమె రచనలనే అని ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆమె రచనలు చదవడం వల్లే వాళ్ళు మీ రచనల దాకా వచ్చారని మర్చిపోకండి.

'నవలాదేశపు రాణి' అన్న కీర్తి కిరీటాన్ని సృష్టించుకున్న ఘనత సులోచనారాణిది. ఆ స్థానం ఆమెది మాత్రమే. సులోచనారాణి రచనలన్నీ ఒకచోట చేర్చి సంకలనం వెలువరించే దిశగా ఆలోచించాల్సిందిగా ప్రచురణకర్తలని కోరుతూ, నా బాల్యంలో భాగమైన, నేను చదివిన, చదువుతున్న సాహిత్యానికి కారకురాలైన నా అభిమాన రచయిత్రికి కన్నీటి నివాళి.

8 కామెంట్‌లు:

  1. ఆ నవలాదేశపు రాణి అన్న కీర్తికిరీటానికి ఇంకో 'రా" లేదా "మహా" తగిలించాలని నా విన్నపం

    రిప్లయితొలగించండి
  2. చాలా గొప్ప నివాళి.హృద్యంగా ఉంది.
    -భాస్కర్.కె

    రిప్లయితొలగించండి
  3. శ్రీనివాస్ పప్పు గారి ప్రతిపాదనను నేను బలపరుస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  4. Chaala chakkaga raasaru sreekanth ..ippatiki kudaa chadavalani pinche novels enno rasaru aavida

    రిప్లయితొలగించండి
  5. nice article on yaddanapudi sulochna ranigaru.enni saralu chadivina malli ade asakthi nijam miru cheppindi.hatsoff sulochanarani gariki and thanks for such article.

    రిప్లయితొలగించండి
  6. మురళి గారూ,
    రాముడి గురించి వ్రాయనన్న నా మాట నిలబెట్టుకోవడం కష్టం గా ఉంది. ఇకమీదట వ్రాయక తప్పని పరిస్థితి గోచరిస్తుంది. మీకు చెప్పి వ్రాద్దామని చెపుతున్నాను. నా మాట తీసి కొబ్బరి గట్టు మీద పెడుతున్నాను. చిత్తగించవలెను.

    రిప్లయితొలగించండి
  7. మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి