శుక్రవారం, డిసెంబర్ 02, 2016

జయమ్ము నిశ్చయమ్మురా (2016)

జాతకాలని, శకునాలని బాగా నమ్మే ఓ కుర్రాడు జీవితంలో ఓ దశలో వాటికి దూరంగా జరిగి, తనకంటూ ఓ వ్యక్తిత్వాన్ని నిర్మించుకుని, సమస్యలని అధిగమించడంతో పాటు ప్రేమని సాధించుకున్న వైనమే హాస్యనటుడు శ్రీనివాస రెడ్డి  కథానాయకుడిగా గతవారం విడుదలైన 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమా. ఈ ఏకవాక్య కథని రెండున్నర గంటల సినిమాగా తెరకెక్కించారు శివరాజ్ కనుమూరి. తెలుగు, ఇంగ్లీష్ సాహిత్యంలో వచ్చిన కొన్ని కథల్ని ఆధారంగా చేసి రాసుకున్న కథలో, సౌలభ్యం కోసం కొన్ని లాజిక్ లని విడిచిపెట్టినట్టు టైటిల్స్ లో చెప్పేసిన దర్శకుడి చిత్తశుద్ధి నచ్చేసింది.

కరీంనగర్ జిల్లాలోని పల్లెటూళ్ళో ఓ చేనేత కుటుంబంలో పుట్టిన సర్వమంగళం (శ్రీనివాస రెడ్డి) ఉద్యోగాన్వేషణలో ఉంటాడు. తల్లి (డబ్బింగ్ జానకి) నేతపని చేసి అతన్ని పోషిస్తూ ఉంటుంది. జాతకులని నమ్మే సర్వానికి పితా (జీవా) మాట వేదవాక్కు. అతని సూచనల ప్రకారం నడుచుకుని కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్లో ఉద్యోగం సంపాదిస్తాడు సర్వం. అది మొదలు కరీంనగర్ కి బదిలీ చేయించుకోవడం మీదే అతని దృష్టి అంతా. తన నమ్మకాల కారణంగా తోటి ఉద్యోగుల్లో పలచన అయిన సర్వం, తన ఆఫీసు కాంపౌండ్ లోనే ఉన్న మీసేవా సెంటర్లో పనిచేసే రాణి (పూర్ణ)తో ప్రేమలో పడతాడు, అది కూడా ఆమె జాతకం తన జాతకంలో మేచ్ అయిందని పితా చెప్పాకే.

సొంతంగా నర్సరీ ఏర్పాటు చేసుకుని, ఉద్యోగం వదిలేయాలని ఆలోచనలో ఉన్న రాణి ని జాయింట్ కలెక్టర్ తన వలలో వేసుకునే ప్రయత్నం చేయడం, అప్పటికే ఆ అధికారి అసలు రంగు తెలిసిన సర్వం రాణిని రక్షించడంతో పాకాన పడ్డ కథ, సర్వం-జాయింట్ కలెక్టర్ ల మధ్య మొదలైన యుద్ధం పతాక స్థాయికి రావడం, రాణి తన అన్న చూసిన సంబంధానికి ఒప్పుకోవడంతో ముగింపు దిశగా నడుస్తుంది. సర్వం తన బదిలీని, రాణిని ఎలా సాధించుకున్నాడన్నది ముగింపు. మునిసిపల్ ఆఫీసులో పని జరిగే తీరుని ప్రవీణ్, కృష్ణభగవాన్, జోగి బ్రదర్స్, పోసాని కృష్ణమురళి పాత్రల ద్వారా చూపించాడు దర్శకుడు.


తొలి సినిమానే అయినా కథ చెప్పడంలో ఎలాంటి తడబాటూ ప్రదర్శించలేదు శివరాజ్ కనుమూరి. ప్రథమార్ధంలో నేలమీద నడిచిన హీరోని, జాయింట్ కలెక్టర్ మీద యుద్ధం ప్రకటించాక ఒక్కసారిగా నేల విడిచి సాము చేయించి, ప్రేమ సాధించుకునే విషయంలో మళ్ళీ నేలమీదకి దించాడు. ఇప్పటివరకూ డాక్యుమెంటరీల్లో తప్ప సినిమాల్లో కనిపించని పిఠాపురం-కాకినాడ బీచ్ రోడ్డుని చాలా చక్కగా, "ఆ రోడ్డు అంత బాగుంటుందా?" అనిపించేలా తీశాడు. కెమెరా (నగేష్ బానెల్) కంటికి హాయిగా ఉంది. నేపధ్య సంగీతం (రవిచంద్ర) బాగా కుదిరింది. రెండు మూడు సన్నివేశాలు తొలగిస్తే క్లీన్ 'యు' వచ్చేదే కానీ, ఆ సన్నివేశాలు కథకి కీలకం అయ్యాయి. 'యుఏ' ఇచ్చింది సెన్సారు.

కానైతే, ఈసినిమాకి ప్రధాన సమస్య నిడివి. సాధారణంగా చాలా సినిమాల్లో రెండో సగంలో కనిపించే సాగతీత, మొదటిసగంలో కూడా అనిపించిందంటే ఎడిటింగ్ లోపమే. పాత్రల పరిచయాన్ని కొంచం కుదించి ఉండొచ్చు. అలాగే, రెండో సగంలో శుభం కార్డు కోసం ఎదురు చూస్తుండగా మొదలయ్యే పెళ్లి ప్రహసనం వాచీ చూసుకునేలా చేసింది.హీరోయిన్ పాత్ర చిత్రణ, హాస్యం, ముగింపు ఈ మూడింటి మీదా వంశీ ప్రభావం కనిపించింది. సముద్రాన్ని కూడా కూడా గోదారంత బాగానూ చూపించారు తెరమీద.

థర్టీ ప్లస్ హీరో పాత్రకి శ్రీనివాస రెడ్డి చక్కగా సరిపోయాడు. ఆత్మన్యూనత ఉన్న వ్యక్తిగానూ, దాన్ని జయించిన వాడిగానూ వేరియేషన్స్ చక్కగా చూపించాడు. తెలంగాణ మాండలీకాన్ని సునాయాసంగా పలికాడు కూడా.  అలాగే పూర్ణ కూడా అతనికి సరిపోయే జోడీ. సహాయ పాత్రల్లో కాంతారావుగా కనిపించిన శ్రీవిష్ణు నటనతో గోదారి జిల్లాల వాళ్ళు కొంచం ఎక్కువ కనెక్ట్ అవుతారు. 'జబర్దస్త్' కమెడియన్స్ చాలామంది చిన్న చిన్న పాత్రల్లో మెరిశారు. విలన్ గా రవివర్మ పూర్తి స్థాయి పాత్రలో కనిపించాడు. అలాంటి లక్షణాలున్న కొందరు గుర్తొచ్చారంటే, ఆ క్రెడిట్ దర్శకుడితో పాటు నటుడికీ దక్కుతుంది.

ఇన్నాళ్లూ హాస్యనటులు, విలన్లు పలికిన తెలంగాణ మాండలికాన్ని హీరో పలకడం బాగా అనిపించింది. బహుశా తెలంగాణ ఉద్యమం సాధించిన నిశ్శబ్ద విజయాల్లో ఇదీ ఒకటేమో. ఈ సినిమా బాగా ఆడితే, 'అగ్ర' హీరోలు సైతం పాత్రల్ని తెలంగాణ ప్రాంత వ్యక్తులుగా డిజైన్ చేయించుకున్నా ఆశ్చర్యం లేదు. మొత్తం మీద చూసినప్పుడు నాయికా నాయకులకి వ్యాపకాలు, లక్ష్యాలు ఉండడం, వాటికోసం వాళ్ళు శ్రమించడం మెచ్చుకోవాల్సిన విషయం. గవర్నమెంట్ ఆఫీసుల పనితీరుని వ్యంగ్యంగా చూపించిన తీరు సామాన్యులు బాగా ఎంజాయ్ చేసేదిగా ఉంది. కనీసం ఓ ఇరవై నిమిషాలు ట్రిమ్ చేస్తే రిపీటెడ్ ఆడియన్స్ ని ఆకర్షించేదిగా ఉండేది ఈ 'జయమ్ము నిశ్చయమ్మురా.' భారీ బిల్డప్ సినిమాలు మాత్రమే ఇష్టపడే వాళ్ళకి తప్ప మిగిలిన అందరూ చూడొచ్చీ సినిమాని.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి