బుధవారం, మే 25, 2016

తెలుగువారి ప్రయాణాలు

తెలుగునాట యాత్రా సాహిత్యానికి రెండువందల ఏళ్ళ చరిత్ర ఉందని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. గడిచిన రెండు వందల ఏళ్ళలో తెలుగు వారు సృజించిన యాత్రాకథనాలలో ప్రసిద్ధ యాత్రికుడు, యాత్రా కథకుడు ఎం. ఆదినారాయణ ఏర్చి కూర్చిన అరవై నాలుగు కథనాల సమాహారం 'తెలుగువారి ప్రయాణాలు' సంకలనం చదువుతూండగా కలిగిన ఆశ్చర్యాలు ఎన్నో, ఎన్నెన్నో. తీర్ధ యాత్రికులు, కవులు, కళాకారులు, సౌందర్యారాధకులు, పండితులు, రచయితలు, ప్రపంచ యాత్రికులు, ప్రజానాయకులు చేసిన ప్రయాణాల తాలూకు విశేషాలని ఒకే పుస్తకం నుంచి తెలుసుకోగలగడం చాలా సంతోషాన్ని కలిగించింది.

తెలుగులో యాత్రాగ్రంధం అనగానే మొదట గుర్తుకు వచ్చేది ఏనుగుల వీరాస్వామి 'కాశీయాత్ర.' అయితే, వీరాస్వామి కన్నా ఎనిమిదేళ్ళు ముందే వెన్నెలకంటి సుబ్బారావు కాశీయాత్ర చేశారని, ఆ వివరాలు తన ఆత్మకథలో రాసుకున్నారనీ చెబుతుందీ సంకలనం. మొత్తం ఆరు ఖండాల్లో కాలినడక, సైకిలు, మోటారు సైకిలు, కారు, బస్సు, రైలు, విమానంపై ప్రయాణించిన యాత్రికుల అనుభవాలు మనకి చెప్పే విశేషాలకి అంతేలేదు. యాత్రాగ్రంధాలలో నుంచి తీసుకున్న కథనాలు కొన్నయితే, ఆత్మకథల నుంచి స్వీకరించినవి మరికొన్ని. తెలుగువారు ఇంగ్లీష్ లో రాసుకున్న కథనాల తెలుగు అనువాదాలకీ చోటు దొరికిందీ పుస్తకంలో.

చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి కాశీ యాత్ర, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నేత్రావధానం కోసం చేసిన రైలు ప్రయాణం, దువ్వూరి వెంకట రమణ శాస్త్రి కాకినాడ మీద బాంబులు పడుతున్నాయన్న వదంతుల నేపధ్యంలో ద్రాక్షారామం వరకూ చేసిన బస్సు ప్రయాణం, అడివి బాపిరాజు అజంతా ఎల్లోరా గుహలని దర్శించిన వైనం, బుచ్చిబాబు తన బాల్యంలో కాలువల ఒడ్డున చేసిన ఏకాంత ప్రయాణాలు,  కొల్లేరులో చలం సాగించిన పిట్టల వేట, తిరుమల రామచంద్ర చేసిన మొహంజోదారో-హరప్పా యాత్ర, శ్రీశ్రీ చైనా ప్రయాణం, రావూరి భరద్వాజ రష్యా యాత్ర, కాళోజీ, ఆరుద్ర, దాశరథి చేసిన ప్రయాణాల వివరాలు అచ్చమైన యాత్రా 'కథనా'లే. వీరి రచనాశక్తి కథనాల్లో కనిపిస్తూ ఉంటుంది మనకి.


ట్రావెలాగ్స్ ని తెలుగు కమర్షియల్ సాహిత్యంలో చేర్చిన ఘనత మల్లాది వెంకట కృష్ణమూర్తిది. ఆయన చేసిన ఐరోపా యాత్ర విశేషాలున్నాయీ పుస్తకంలో. ఆధునిక యాత్రా సాహిత్యం అనగానే గుర్తొచ్చే పరవస్తు లోకేశ్వర్, దాసరి అమరేంద్ర, వాడ్రేవు చినవీరభద్రుడుతో పాటు సంపాదకుడు ఆదినారాయణ యాత్రా కథనమూ చేర్చారిందులో. సినీ నటీ నటులు టంగుటూరి సూర్యకుమారి, భానుమతి, పద్మనాభం, అక్కినేని నాగేశ్వరరావు రాసుకున్న ప్రయాణ విశేషాలతో పాటు, ఆసాంతం ఊపిరి బిగపట్టి చదివించే బుర్రకథ కళాకారుడు షేక్ నాజర్ కథనం, కరుణరస ప్రధానంగా సాగే ఆదిభట్ల నారాయణదాసు యాత్ర వాళ్ళని గురించి కొత్త సంగతులెన్నో చెబుతాయి.

'రంగూన్ లో చిత్రాంగి' అంటూ స్థానం నరసింహారావు చెప్పిన కబుర్లని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. తెలుగు నాటక ప్రదర్శన కోసం రంగూన్ వెళ్ళిన తొలి బృందం వీరిదే. స్థానం వారు చిత్రాంగిగా అభినయిస్తే, వారు మేకప్ చేసుకోడాన్ని చూడడం కోసం ప్రత్యేక అనుమతి తీసుకుని గ్రీన్ రూం కి వచ్చారట నాటి రంగూన్ నగర ప్రముఖులు! పిఠాపురం రాజాతో విదేశీ  యాత్రకి వెళ్ళిన కురుమెళ్ళ వెంకటరావు 'స్టీమర్ మీద ఐరోపాకి ప్రయాణం' ముచ్చట్లు పంచుకుంటే, బొబ్బిలి రాజావారితో 'బొబ్బిలి నుండి వెంకటగిరి వరకూ' చేసిన ప్రయాణాన్ని వర్ణించారు మండపాక పార్వతీశ్వర శాస్త్రి. స్వామి ప్రణవానంద కథనం  'గండ శిలల దారిలో గోముఖానికి ప్రయాణం' చాలాకాలంపాటు వెంటాడుతుంది.

ఆచార్య ఎన్. గోపి 'గున్నయ్య ఒత్తు,' ఏడిదము సత్యవతి రాసిన 'ప్రియతముడి ప్రాణాల కోసం' కథనాలు కరుణరస భరితాలు. ఎండ్లూరి సుధాకర్, జె. బాపురెడ్డి తమ యాత్రానుభావాలని దీర్ఘ కవితల రూపంలో అక్షరీకరించారు. ముదిగంటి జగ్గన్న శాస్త్రి 'ఆంధ్రభోజుడి ఆత్మఘోష' చదువుతుంటే వెంటనే హంపీకి ప్రయాణమైపోవాలనిపిస్తుంది. అత్యం నరసింహ మూర్తి, బీఎస్సెన్ మూర్తిల పరిశీలనా శక్తి అబ్బుర పరుస్తుంది. ఎన్టీఆర్ చైతన్య యాత్ర గురించి పర్వతనేని ఉపేంద్ర రాసిన కథనం, వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రను గురించి భూమన కరుణాకర్ రెడ్డి రాసిన కథనం రాజకీయ యాత్రలని గురించి వివరిస్తే, నాటి రాష్ట్రపతి కె. ఆర్. నారాయణన్ తో 'స్వాతి' సంపాదకులు వేమూరి బలరాం చేసిన న్యూయార్క్, పెరూ, బ్రెజిల్ యాత్ర విశేషాలు వీవీఐపీల ప్రయాణాల గురించి లోతుగా చెబుతాయి.

ఈ సంకలనం తీసుకురావడం వెనుక తన ఉద్దేశాలతో పాటు, తీసుకొచ్చేందుకు చేసిన కృషిని సవివరంగా రాశారు ఆదినారాయణ తన ముందుమాటలో. ఆయన ప్రచురించిన మూల గ్రంధాల జాబితా చూసినప్పుడు చదవాల్సినవి ఓ ఐదారు పుస్తకాల వివరాలు కనిపించాయి. కాకినాడ-కోటిపల్లి మధ్య వంశీ చేసిన రైలు ప్రయాణాన్ని కూడా జోడించి ఉంటే బాగుండుడేది అనిపించింది. మొత్తం మీద చూసినప్పుడు, రెండు శతాబ్దాల కాలంలో ప్రపంచంలో వచ్చిన అనేకానేక మార్పులు భిన్న రంగాలకి చెందిన వారి ద్వారా తెలుసుకునే వీలు కల్పిస్తోందీ పుస్తకం. యాత్రల మీద  ఆసక్తి ఉన్నవారిని మాత్రమే కాక, సాహిత్యాభిమానులనీ అలరించే రచన ఇది. ('తెలుగువారి ప్రయాణాలు,' సంపాదకులు ఎమ్. ఆదినారాయణ, ఎమెస్కో ప్రచురణ, పేజీలు  520, వెల రూ. 200, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

3 కామెంట్‌లు:

  1. చాల ఇంట్రెస్ట్ గా ఉంది మురళి గారు. ఈ బుక్ తప్పకుండా చదువుతాను.
    మనలో మాట ....మీరు రోజుకి మినిమం ఒక బుక్ చదివేస్తారనుకుంటా...:)

    రిప్లయితొలగించండి
  2. మంచి పుస్తకం పరిచయం చేసారు :) ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

  3. @జయ: చూడ్డానికి భారీ పుస్తకమే కానీ, మొదలు పెడితే ఇట్టే అయిపోతుందండీ.. హహహా.. రోజుకో పుస్తకం కాదండి, చదివినవన్నీ ఒక్కసారిగా రాస్తున్నానంతే... ధన్యవాదాలు
    @ఇందు: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి