'జగదానంద కారకా.. జయ జానకీ ప్రాణ నాయకా.. శుభ స్వాగతం..' పాట చెవుల్లో మారుమోగుతోంది. అణువణువునా భారీతనం ఉట్టిపడే అందమైన వర్ణ చిత్రాలు కన్ను మూసినా, తెరిచినా కట్టెదుట ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. నార చీరెలు ధరించిన నయనతార సీత రూపంలో పదే పదే గుర్తుకొస్తోంది. మూడుగంటల పాటు ఏకాగ్రచిత్తంతో 'శ్రీరామరాజ్యం' సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వచ్చాక నా పరిస్థితి ఇది.
చాలామంది లాగానే నేను కూడా ఈ సినిమాని గురించి ఎలాంటి అంచనాలూ పెట్టుకోలేదు. ఎందుకంటే, రౌద్ర రసాభినయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న బాలకృష్ణ శ్రీరాముడుగా, నయనతారగా మారిన డయానా మరియం కురియన్ సీతా మహాసాధ్విగానూ కనిపించబోతూ, 'రాధాగోపాళం' 'సుందరకాండ' అనే రెండు నిరాశాపూరిత సినిమాల తర్వాత బాపూ-రమణలు తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు అవ్వడం వల్ల కావొచ్చు నేనీ సినిమా కోసం ఎదురు చూడలేదు. కానైతే విడుదలైన తొలిరోజున వినిపించిన 'హిట్' టాక్ విని మాత్రం చాలా సంతోష పడ్డాను.

రావణ సంహారం పూర్తిచేసి సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సహితుడై అయోధ్యకి తిరిగి వచ్చిన శ్రీరాముడు పట్టాభిషిక్తుడు కావడంతో సినిమా మొదలై, కుశలవుల పట్టాభిషేకంతో సమాప్తమయ్యింది. నిర్మాణ వ్యయానికి వెరవకుండా (సుమారు ఇరవై ఏడు కోట్లని వినికిడి) అత్యంత భారీగా నిర్మించిన ఈ సినిమాలో ఆ భారీ తనం ప్రతి ఫ్రేములోనూ కనిపించింది. సెట్టింగుల మొదలు, గ్రాఫిక్స్ వరకూ అన్నీ కథలో దాదాపుగా ఇమిడిపోయాయి.

చిత్రీకరణలో బాపూ మార్కు ఆసాంతమూ కనిపించిన ఈ సినిమాలో నటీనటుల ప్రస్తావన వచ్చినప్పుడు మొదట చెప్పాల్సింది నయనతార గురించే. ఈమెని వెండితెర మీద చూడడం ఇదే మొదటిసారి నాకు. 'అంజలీదేవి, జయప్రదా మెప్పించిన సీత పాత్రలో నయనతార?' అన్న భావన సినిమా చూడని క్రితం వరకూ గుచ్చిన మాట నిజమే కానీ, చూసిన తర్వాత మటుమాయమయ్యింది. సీత పాత్రని మలిచిన తీరుని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆమె ఆత్మాభిమానాన్ని చిత్రించిన తీరు గుర్తుండి పోతుంది.

మరో ముఖ్యమైన, కథకి మూలస్థంభమైన పాత్ర వాల్మీకి. అక్కినేని పోషించిన ఈ పాత్రలో సాత్వికత కనిపించలేదు ఎందుకో. దాదాపు అన్ని సన్నివేశాల్లోనూ వాల్మీకి ప్రశాంతంగా కాక అసహనంగానే కనిపించాడు. సంభాషణలు పలికిన తీరూ అలాగే ఉంది. కుశలవుల నుంచి కూడా నేను కొంచం ఎక్కువే ఆశించినట్టు ఉన్నాను. అయితే, లక్ష్మణుడిగా శ్రీకాంత్ మెప్పించాడు. కే.ఆర్. విజయ మొదలు రోజా వరకూ ఎందరూ నటులు సహాయ పాత్రల్లో మెరిశారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, గ్రాఫిక్స్ ని బాపూ ఉపయోగించుకున్న తీరు అబ్బుర పరిచింది. మహళ్ళూ, రాచ వీధులే కాదు అడవులూ, పశు పక్ష్యాదులని సైతం గ్రాఫిక్స్ లో సృష్టించారు. అయితే ఎక్కడా కూడా ఈ గ్రాఫిక్స్ నటీనటుల్ని తోసిరాజనకపోవడం వెనుక ఉన్నది మాత్రం దర్శకుడి కృషే. చాలా వరకూ కంటికింపు గానే ఉన్నప్పటికీ, అక్కడక్కడా ఈ రంగుల కలగలపు కళ్ళని కూసింత ఇబ్బంది పెట్టింది.
నేను మరికొంచం ఎక్కువ ఆశించిన మరో విభాగం సంగీతం. బాలేదని అనలేను కానీ, మరింత బాగుండ వచ్చు అనిపించిందని చెప్పకుండా ఉండలేను. ఒక్క పద్యమూ లేకపోవడం నిరాశ పరిచింది. మరీ సమాస పూరితాలు కాకపోయినా, సంభాషణల్లాగే సరళమైన పదాల కూర్పుతో కాసిన్ని పద్యాలు ఉంటే నిండుదనం వచ్చేది అనిపించింది.
మొత్తంగా చూసినప్పుడు మాత్రం మెచ్చి తీరాల్సిన ప్రయత్నం. తెలుగు సినిమా దారీ తెన్నూ తెలియకుండా సాగుతున్న తరుణంలో రాముడి కథని ఎంచుకుని, కన్నుల పండువైన సినిమాని అందించిన నిర్మాత యలమంచిలి సాయిబాబుని ప్రత్యేకంగా అభినందించాలి. చెప్పాల్సిన విధంగా చెబితే ఎంత పాత కథతో సినిమా తీసినా జనం ఆదరిస్తారని మరోమారు నిరూపించిన సినిమా 'శ్రీరామరాజ్యం.' థియేటర్లో మరోసారన్నా చూడాలి