శనివారం, డిసెంబర్ 04, 2021

కొణిజేటి రోశయ్య

రాజకీయాల్లో, మరీ ముఖ్యంగా తెలుగు రాజకీయాల్లో, 'వివాద రహితులు' గా ఉన్న నాయకులు బహు తక్కువ. ఆ కొందరిలో మొదటి వరస నాయకుడు కొణిజేటి రోశయ్య ఈ ఉదయం కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘ కాలం ఆర్ధిక మంత్రి, స్వల్పకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రోశయ్య, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నరుగా తన రాజకీయ విశ్రాంతి జీవితం గడిపి, అటుపైన రాజకీయాల వైపు ఏమాత్రం తొంగిచూడలేదు. దీనిని 'తామరాకు మీద నీటిబొట్టు చందం' అనుకుంటే, రాజకీయ జీవితంలో తొలినాళ్ళ నుంచీ అదే ధోరణి అవలంబించిన అరుదైన నాయకుడు రోశయ్య. ఆయనని ప్రత్యేకంగా గమనించడానికి కారణం ఏమిటంటే, నేను కలిసిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు ఆయనే.  

అప్పట్లో నేను పనిచేసే సంస్థ యాజమాన్యానికి ఆయనతో స్నేహం. ఒకసారి అనుకోకుండా నేనూ వాళ్లతో పాటు రోశయ్య ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అప్పట్లో ఆయన ప్రతిపక్షం. అమీర్ పేటలో ఆయన ఇల్లు ఎలాంటి హంగూ, ఆర్భాటమూ  లేకుండా ఉంది. ఆ వేసవి కాలపు మధ్యాహ్నపు వేళ ఆయన నాకు స్వయంగా మంచినీళ్ల గ్లాసు అందించడమే కాదు, నా వివరాలూ కనుక్కున్నారు! అప్పటివరకూ పేపర్లో రోశయ్య గురించి చదవడం, రేడియోలో వినడం, టీవీలో చూడడం మాత్రమే చేసిన నాకు అదో వింత అనుభవం. బహుశా అప్పటినుంచీ ఆయన్ని కొంచం  ప్రత్యేకంగా గమనించాననుకుంటా. నున్నని మెరిసే బట్టతల, మడత నలగని తెల్లని ఖద్దరు దుస్తులు, భుజం మీద కావి రంగు పై పంచ, ఆరడుగుల ఎత్తున్న భారీ విగ్రహమేమో ఓ సారి చూస్తే మళ్ళీ మర్చిపోలేం. 

ఎన్టీఆర్ వెన్నుపోటు తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే 'విజన్-2020' అనీ, 2020 వరకూ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అనీ మీడియా హోరెత్తించడం మొదలు పెట్టింది. అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షం లో ఉండేది. అది కూడా బలమైన ప్రతిపక్షం కాదు. ఉన్నవాళ్ళలో కూడా కొందరు నాయకులు చంద్రబాబు నాయుడికి అనుకూలమని గాసిప్ వార్తలు వచ్చేవి పేపర్లలో. అదిగో, ఆ కాలంలో క్రమం తప్పకుండా కాంగ్రెస్ గొంతు వినిపించిన కొద్దిమంది నాయకుల్లో రోశయ్య ఒకరు. నిజానికి మొదటివారు అనడం సబబు. అప్పట్లో రోశయ్య పేపర్లలో, టీవీల్లో కనిపించని రోజు ఉండేది కాదు. రోశయ్య మనవడు, తాతని రూపాయి ఇవ్వమని అడిగాడని, నేను పేపర్లోనూ, టీవీలోనూ కనిపించని రోజున రూపాయి ఇస్తానని ఆయన హామీ ఇచ్చారనీ, ఆ మనవడు పాపం రోజూ టీవీ చూసి నిరాశ పడుతున్నాడనే వ్యంగ్య కథనం ఒకటి పేపర్లో వచ్చింది. ('ఆంధ్రభూమి' లో బుద్ధా మురళి రాసిన 'జనాంతికం' వీక్లీ కాలమ్). 

Google Image
రోశయ్య వాగ్ధాటినీ, పనితీరుని ప్రజలంతా ప్రత్యక్షంగా చూసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో. ఆర్ధిక శాఖ రోశయ్యది. పైగా అప్పుడు టీవీ చానళ్ళు విస్తృతంగా వ్యాపించి, ప్రత్యక్ష ప్రసారాలు ఊపందుకున్నాయి. "నేను సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెడదామంటే రోశయ్య గారు బడ్జెట్ ఇవ్వడం లేదు" అని వైఎస్  వేసిన సెటైర్లు జనంలోకి బాగా వెళ్లాయి. చంద్రబాబు నాయుడు-రోశయ్యలది ప్రత్యేక అనుబంధం. ఎవరి మాటలూ పెద్దగా పట్టించుకోని చంద్రబాబు నాయుడు, రోశయ్య మాటల్ని పట్టించుకున్న సందర్భాలున్నాయి. తనపై అలిపిరి దాడి తర్వాత, సింపతీ వేవ్ లో గెలవచ్చన్న ఆలోచనతో ముందస్తు ఎన్నికలు ప్రకటించారు చంద్రబాబు. దాడి జరిగి నెలలు గడిచినా చేతికి కట్టు తియ్యలేదు. దీనిమీద రోశయ్య నుంచి విమర్శ రాగానే, మర్నాటి నుంచీ చేతి కట్టు కనిపించలేదు. 

"నేను తెలివైన వాడిని అని చంద్రబాబు నాయుడు అంటున్నారు అధ్యక్షా. నాకన్ని తెలివితేటలు ఉంటే, వైఎస్ వెనకే వెళ్లి కత్తితో పొడిచేసి ఆ కుర్చీలో కూర్చునే వాడిని కదా అధ్యక్షా.." అన్న రోశయ్య అసెంబ్లీ వీడియో, ఇప్పటికీ అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతిసారీ వైరల్ అవుతూ ఉంటుంది. అయితే, చాలా అనూహ్యంగా వైఎస్ అకాల మరణం తర్వాత ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అవకాశం వచ్చింది రోశయ్యకి. పార్టీకి వీర విధేయుడిగా ఉండడం, తనకంటూ వర్గం లేకపోవడం, సొంత బలం లేకపోవడం లాంటివి కలిసొచ్చాయని విశ్లేషణలు వచ్చాయి అప్పట్లో. రెండేళ్ళకి కాస్త తక్కువగా ఆపదవిలో ఉన్నా, అది దినదిన గండంగానే గడిచింది. కాంగ్రెస్ లో ఉన్న కలహాలు, కుమ్ములాటలు ఓ పక్క, యువరాజ పట్టాభిషేకానికి రోశయ్యే అడ్డుపడ్డారనే భావనతో వ్యతిరేకించిన వర్గం మరోపక్క, హైకమాండ్ మితిమీరిన పెత్తనం ఇంకో పక్క ముప్పేట దాడి చేసినా తన అనుభవం, లౌక్యంతో నెగ్గుకొచ్చారు రోశయ్య. 

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో అధినేతతో పాటు గెలిచిన పదిహేడు మంది ఎమ్మెల్యేలలో ఒకరు రోశయ్యకు దగ్గరవారనీ, సదరు ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి దూకేయబోవడమే ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలిసిపోడానికి కారణమనీ  విశ్లేషణలు వచ్చాయి అప్పట్లో. ఇలాంటి చారిత్రక సందర్భాలు రోశయ్య రాజకీయ జీవితంలో చాలానే ఉన్నాయి. తను ఆదేశించిన వెంటనే ముఖ్యమంత్రి కుర్చీ దిగిపోయినందుకు బహుమతిగా రోశయ్యని తమిళనాడు గవర్నరుగా చేసింది కాంగ్రెస్ హైకమాండ్. అప్పటికే గవర్నరు గిరీ అంటే విశాలమైన రాజభవన్లో విశ్రాంతి తీసుకోవడం, దగ్గరలో ఉన్న గుళ్ళూ, గోపురాలూ చుట్టి రావడం అన్న భావన జనంలో బలపడడం వల్ల, "పోన్లే, పెద్దాయన రాజ లాంఛనాలతో విశ్రాంతి తీసుకుంటారు" అనుకున్నారందరూ. 

కానీ, రోశయ్యకు అక్కడా సమస్యలే స్వాగతం పలికాయి. సరిగ్గా అప్పుడే ముఖ్యమంత్రి జయలలిత అవినీతి కేసుల్లో జైలుపాలు కావడం, ఆమె భక్తుణ్ణి ముఖ్యమంత్రిని చేయడం, ప్రతిపక్ష నాయకుడు కరుణానిధి పూటకో ఫిర్యాదుతో ముఖ్యమంత్రిని కలవడం లాంటివెన్నో జరిగాయి. ఈ మధ్యలో కర్ణాటక గవర్నరుగా ఓ రెండు నెలలు అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు. అటుపైన తనకి, తన పార్టీకీ కూడా వయోభారం సంభవించడంతో రాజకీయాలకి దూరంగా ఉండిపోయారు. హైదరాబాద్ కి తిరిగి వచ్చేసినా, 'మాజీ ముఖ్యమంత్రి' హోదాని వాడుకోనట్టే ఉంది. ఎన్ జీ రంగా శిష్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించి, సోనియా గాంధీ అంతరంగికుడిగా రాజకీయాల్లోనుంచి విరమించుకోవడం మధ్యలో రోశయ్య చూసినవి, చేసినవి చాలానే ఉన్నాయి. ఎప్పటికీ వివాద రహితుడిగా ఉండడం కోసం కాబోలు, అయన తన ఆత్మకథ రాయలేదు. రోశయ్య ఆత్మకి శాంతి కలగాలి. 

2 కామెంట్‌లు:

  1. ఏదో ఆశించా.. ఇంకేదో కనిపించింది.

    ఇందులోనూ... కీలక ఘట్టాన్ని దాటేశారుగా...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు ఆశించినది వడ్డించేందుకు కావాల్సిన ముడిసరుకేదో లోపించిందండీ మరి.. ..ధన్యవాదాలు

      తొలగించండి