బుధవారం, జులై 08, 2020

కనిపించని సమస్య

నెమ్మదిగా నాలుగు నెలలవుతోంది, కరోనా అని మనం పిలుచుకుంటున్న కోవిడ్-19 తో సహజీవనం మొదలై. కొన్ని ప్రపంచ దేశాలు మనకన్నా (భారతదేశం) ముందే కరోనా బారిన పడితే, మరికొన్ని మన వెనుక నిలిచాయి. దేశాల పేర్లు వేరు తప్ప పరిస్థితులు దాదాపు ఒక్కటే. కరోనా క్రిమి ఎలా అయితే కంటికి కనిపించడం లేదో, జనజీవనం మీద దాని ప్రభావం కూడా అలాగే దృశ్యాదృశ్యంగా ఉంది.  పైకి కనిపించని విధంగానే జీవితాలని అల్లకల్లోలం చేసేస్తోంది. మొదట్లో ఇది కేవలం ఆరోగ్య సమస్య అనుకున్నాం కానీ, రానురానూ ఇది ఆర్ధిక వ్యవస్థల్ని మింగేసేదిగా విశ్వరూపం దాలుస్తోంది. ఫలితం, ఇప్పటికే కొన్ని కోట్ల మంది ఉపాధి కోల్పోయారు, మరి కొన్ని కోట్ల మంది 'ఏక్షణంలో అయినా మెడమీద కత్తి పడొచ్చు'  అనే భయంతో బతుకుతున్నారు. 

'కరోనా-ఉపాధి' అనగానే మొదట గుర్తొచ్చేవాళ్ళు వలస కూలీలు. నగరాల్లో ఉపాధి కోల్పోయి, ప్రయాణ సాధనాలేవీ అందుబాటులో లేక కాలినడకన వందల కిలోమీటర్లు నడిచి స్వస్థలాలకు చేరుకున్న వాళ్ళు. వాళ్ళ కష్టాన్ని తీసేయలేం కానీ, స్వచ్చంద సంస్థల నుంచీ, వ్యక్తుల నుంచీ, ప్రభుత్వం నుంచీ కూడా వాళ్లకి ఎంతో కొంత సహాయం అందింది. 'మేమున్నాం' అంటూ ముందుకొచ్చి తోచిన సాయం చేసినవాళ్లు లక్షల్లో కాకపోయినా, వేలల్లో ఉన్నారు. ప్రభుత్వం కూడా ఉచిత రేషన్ లాంటి పథకాలు ప్రకటించింది. దేశంలో ఎక్కడున్నా రేషన్ పొందొచ్చన్న వెసులుబాటునీ ఇచ్చింది. దీనివల్ల వాళ్ళకి మూడుపూటలా భోజనం దొరక్క పోవచ్చు, కానీ ఒక్క పూట భోజనానికైనా భరోసా ఉంది. ఈ వలస కూలీల సమస్య అందరి దృష్టిలోనూ పడింది. మొత్తంగా కాకపోయినా, కనీసం కొంతమేరకైనా వాళ్ళకి తోడు నిలబడే వాళ్ళూ తారస పడ్డారు.

కరోనా తొలిదశలో దెబ్బతిన్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉండగా, రెండో దశలో దెబ్బ తింటున్న వాళ్ళు, తినబోతున్న వాళ్ళది మరో కథ. మనం పెద్దగా మాట్లాడుకోని కథ. మాట్లాడుకోవాల్సిన కథ కూడా. ప్రయివేటు సెక్టార్లో జీతాల కోతతో మొదలైన కరోనా ప్రభావం ఇప్పుడు ఉద్యోగాల కోత దశకి చేరుకుంది. బాధితులంతా మధ్య తరగతి వాళ్ళు. ప్రభుత్వం ముక్కు పిండి మరీ పన్ను వసూలు చేసే వర్గం ఏదైనా ఉందా అంటే అది వీళ్ళు మాత్రమే. వీళ్ళలో చాలామందికి జూలై మొదటి వారంలో వాళ్ళ వాళ్ళ ఆఫీసులనుంచి రెండు రకాల కబుర్లు వచ్చాయి. కొందరికి 'మీసేవలు చాలు' అని, మరి కొందరికి 'ఈ కష్ట కాలంలో మేము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మానసికంగా సిద్ధ పడండి' అనీను. ఒక్కసారిగా వీళ్లందరి కాళ్ళ కింద నేలా కదిలినా, ప్రసార సాధనలకి అది 'వార్త' కాలేదు. ప్రభుత్వానికి 'పట్టించుకోవాల్సిన విషయం' కూడా కాలేదు. 

కరోనా కారణంగా భారతదేశంలో ఎక్కువగా ప్రభావితం అయ్యిందీ, ఎటు నుంచీ సాయానికి నోచుకోనిదీ ఏదన్నా వర్గం ఉందా అంటే, అది ఈ ప్రయివేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగ వర్గమే. ఇన్నాళ్లూ పని చేసిన సంస్థలకి వీళ్లిప్పుడు ఒక్కసారిగా 'వదిలించుకోవాల్సిన బరువు' అయిపోయారు. ప్రభుత్వం దృష్టిలోనేమో సాయం పొందేంత పేదలు కాదు. సోషల్ మీడియా తో సహా ఎవరికీ మాట్లాడుకోవాల్సిన టాపిక్ కూడా కాదు. ఒకపూట భోజనంతోనో, ప్రయాణపు ఏర్పాట్ల ద్వారానో లేక ఉచిత రేషన్ వల్లనో (కనీసం కొంతైనా) పరిష్కారమయ్యే  సమస్యలు కూడా కావు వీళ్ళవి. 'అంతకు మించి' చేయాల్సిన అవసరం ఉండగా, అసలు సమస్యే లేనట్టుగా వ్యవహరిస్తూ ఉండడం జరుగుతోందిప్పుడు. 'బ్యాంక్ రుణాల చెల్లింపు వాయిదా' అనే ప్రహసనాన్ని చూస్తూనే ఉన్నాం. 

జీతాల్లో కొంత మేర కోత పడితేనే సర్దుబాట్లు చేసుకోలేక తబ్బిబ్బు పడిన వాళ్ళలో చాలామందికి 'ఇకపై జీతాలే రావు' అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలిగేదే. ఖర్చులేవీ ఆగవు. పూలమ్మిన చోట కట్టెలమ్ముదామన్నా ఈ కరోనా కాలంలో కొనేవాళ్ళు లేరు. ఇప్పట్లో ఉద్యోగాలేవీ దొరికే సూచనలూ లేవు. ఒకవేళ జాబ్ మార్కెట్ పుంజుకున్నా, మరింతగా పెరిగే పోటీలో ఉద్యోగం దొరకబుచ్చుకోడం అంత సులువేమీ కాదు. ఉద్యోగం చేసినంత కాలం ముక్కుపిండి పన్ను వసూలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు సమస్యనే గుర్తించడం లేదు. 'ఉపశమనం' స్కీముల్లో ఈ వర్గానికి ప్రాతినిధ్యమే లేదు.  వ్యక్తి స్థాయిలో ఎవరు ఎవర్ని ఆదుకోగలుగుతారు? అదైనా ఎన్నాళ్ళు? 

ఉద్యోగాలు పోయిన వాళ్ళ సమస్యలు ఒకరకమైతే, మెడమీద కత్తి వేలాడుతున్న వాళ్ళ ఇబ్బందులు మరోరకం. నూరేళ్లాయుస్సుకి హామీ లేదు కానీ, పరిస్థితి మాత్రం దినదిన గండమే. ఎప్పుడు ఏ కబురు వినాల్సి వస్తుందో తెలీని అనిశ్చితిలో రోజులు గడుపుతున్న వాళ్ళు అనేకమంది.  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, బయటికి వెళ్లి ఉద్యోగం చేయడం వల్ల ప్రాణానికి ఉన్న ముప్పు ఒకటైతే, ఇప్పటికిప్పుడు ఈ ఉద్యోగం పోతే జరుగుబాటు ఎలా అన్న మిలియన్ డాలర్ ప్రశ్న మరొకటి. నిజానికి, ఈ ఉద్యోగాలు పోవడం అన్నది కరోనా బారిన పడ్డ అనేక దేశాల్లో జరుగుతున్నా, వాటిలో చాలా దేశాలు సమస్యని గుర్తించాయి. ఎంతోకొంత ఉపశమనానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ కూడా కనీసం సమస్యని గుర్తిస్తే బాగుండును.

4 కామెంట్‌లు:

  1. Your comment on middle class and tax is spot on.

    Middle class is the one, who (are forced to) pay tax first for lifelong and after all that, in case of any unforeseen happens, they are left to end for themselves. Every one(specially middle class) to plan their finances so that they can take care of their retirement.

    రిప్లయితొలగించండి
  2. మీరు చెప్పింది కరెక్ట్ ,ఎక్కువ నష్టపోయిన మధ్యతరగతి వాళ్ళ కి ఇంకో బాధ స్కూల్ ఫీసులు .వాళ్ళు పీడించుకు తింటున్నారు. స్కూల్ chenge చేస్తే మళ్ళీ అడ్మిషన్లు కట్టాలి fees తో పాటు.

    రిప్లయితొలగించండి