శనివారం, మే 09, 2020

అనగనగా ఒక రాకుమారుడు

"తెలుగు సినిమా పరిశ్రమకి ఎన్టీఆర్, ఏఎన్నార్లిద్దరూ రెండు కళ్ళు" ఏళ్ళ తరబడి అనేకమంది నోటివెంట వింటూ వచ్చిన ఈ డైలాగుని విన్న ప్రతిసారీ "మరి కాంతారావు?" అన్న ప్రశ్న వచ్చేది. నటనలో వాళ్ళిద్దరికీ సమస్థాయిలోనే ఉన్నా స్వయంకృతాపరాధాలతో సహా అనేక కారణాలకి కాంతారావు తెలుగు సినీ నటరాజుకి మూడోకన్ను కాలేకపోయారని తెలుస్తుంది ఆయన ఆత్మకథ 'అనగనగా ఒక రాకుమారుడు' చదివినప్పుడు. తను మరణించడానికి రెండేళ్లు ముందు 2007 లో కాంతారావు ప్రచురించిన ఈ స్వీయగాధ చదువుతూ ఉంటే ఈ రాకుమారుడు పుట్టుకతోనే శాపగ్రస్తుడు అనిపించక మానదు. 

నిజాం రాజ్యంలో కోదాడకు సమీపంలో ఉన్న గుడిబండలో 1923, నవంబరు 16న జన్మించిన కాంతారావు చిన్ననాటినుంచీ కష్టాలు అనుభవిస్తూ పెరిగారు. పుట్టింది జమిందారీ కుటుంబంలోనే అయినా, అయన పుట్టుకకి కొన్ని నెలల ముందే తండ్రి మరణించడం, ఆ వెంటనే దాయాదులందరూ ఆస్తి కోసం కోర్టుకి వెళ్లడంతో పదిహేడో ఏడు వచ్చే వరకూ న్యాయ పోరాటాలతోనే సరిపోయింది. కోర్టు కేసు గెలిచినా, మేనత్త మాయమాటలు నమ్మి వచ్చిన ఆస్తిని ఉన్నదున్నట్టుగా ఆమెకి ధారపోశారు కాంతారావు. అటుపైని, పాతికేళ్ల వయసొచ్చే లోగానే వివాహం, భార్యాబిడ్డలని పోగొట్టుకోవడం, ద్వితీయ వివాహం,  రజాకార్ల దాడి కారణంగా ఉన్న ఊరిలో నిలువ నీడ లేకుండా పోవడం వంటివన్నీ వరసగా జరిగిపోయాయి. 

నటన మీద చిన్నప్పటినుంచీ మక్కువ ఉన్నా, పదిహేడో ఏట సురభి నాటక సమాజంలో చేరి నాటకాలు ఆడడంతో తనలో ఒక నటుడున్నాడన్న నమ్మకం కుదిరింది కాంతారావుకి. జగ్గయ్యపేటలో తానుంటున్న ఇంటికి ఎదురుగా నాటి బాలనటుడు మాస్టర్ విశ్వం (బాలనాగమ్మ) కుటుంబం ఉంటూ ఉండడంతో, తాను కూడా మద్రాసు వెళ్లి సినిమాల్లో చేరాలన్న ఆలోచన వచ్చి, ఉన్నఫళంగా మద్రాసు ప్రయాణం అయ్యారు కాంతారావు. వెళ్లిన కొన్నాళ్లకే అగ్ర నిర్మాత హెచ్. ఎం. రెడ్డి దృష్టిలో పడడంతో చిన్న వేషాలతో మొదలై, త్వరలోనే హీరో వేషాలకి ఎదిగారు. వంద సినిమాల్లో హీరోగా నటించిన తర్వాత, తన తోటివాళ్ళు ఇంకా హీరోలుగా కొనసాగుతూ ఉండగానే తనుమాత్రం కేరక్టర్ ఆర్టిస్టుగా మారిపోయి దాదాపు 350 సినిమాలు, టీవీ సీరియళ్ళలో నటించారు. 


ఆత్మకథతో తన బాల్యం తర్వాత, చిత్రరంగ ప్రవేశాన్ని వివరంగా రాసి, అటుపైని ఏ ఏడాది ఏ సినిమాల్లో నటించిందీ, ఆయా షూటింగుల్లో జరిగిన తమాషా సంఘటనలు లాంటివి మాత్రం వివరంగా చెప్పి, తెరవెనుక జరిగిన రాజకీయాలని రేఖామాత్రంగా ప్రస్తావించి ఊరుకున్నారు. అయితే, తనకి జానపద వీరుడిగా పేరొచ్చేందుకు దోహదం చేసిన దర్శకుడు విఠలాచార్య తనని పెట్టిన ఇబ్బందులు, సృష్టించిన కష్టాలు అన్నింటిని మాత్రం వివరంగా చెప్పుకొచ్చారు. కృష్ణ హీరోగా రంగ ప్రవేశం చేసిన తర్వాత, తనని హీరోగా తప్పించడం కోసం 'కొందరు పెద్దలు' కృషి చేశారని చెబుతూనే, కృష్ణతో తనకి మంచి స్నేహం ఉందని చెప్పారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరిలోనూ కలిసి నటించినా, కాంతారావు మొగ్గు ఎక్కువగా ఎన్టీఆర్ వైపే ఉందనిపిస్తుంది, ఈ ఆత్మకథ చదువుతూ ఉంటే. 

చిన్నప్పటినుంచీ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నా, హీరోగా మారాక ఆర్ధిక క్రమశిక్షణ మీద కాంతారావు దృష్టి పెట్టలేదని స్పష్టంగా అర్ధమవుతుంది. వచ్చిన సినిమాలు వరుసగా చేసుకుంటూ పోవడమే తప్ప, తన మార్కెట్ ఎంతన్నది గమనించుకుని పారితోషికం పెంచుకోవడం, చేసిన సినిమాలకి గాను ముక్కుపిండి డబ్బు వసూలు చేసుకోవడం చేతకాలేదు. అందరితోనూ మంచిగా ఉండాలని అనుకున్నారు తప్ప, తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకోలేదు. అసలా ఆలోచనే చేయలేదు. సినిమా నిర్మాణంలోకి దిగి చేతులు కాల్చుకోవడంతో కూతురికి పెళ్లి చేయలేని పరిస్థితి. అయితే, ఉన్నట్టుండి వేషాలు వచ్చి, అడ్వాన్సులు చేతిలో పడడంతో అంగరంగ వైభవంగా ఆ పెళ్లి జరిపించారు. (ఈ పెళ్లిలో జరిగిన వృధా వ్యయాన్ని కళ్లారా చూశాకే బాపూ-రమణలు తమ పిల్లల పెళ్లిళ్లు బంధువులకే పరిమితం చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు - 'కోతికొమ్మచ్చి'). 

వృద్ధాప్యంలోకి అడుగు పెడుతూనే పుట్టపర్తి సత్యసాయి బాబాకి భక్తుడిగా మారిపోయిన కాంతారావు, అనేక ముఖ్యమైన విషయాల్లో బాబా సలహాని తీసుకునే ముందుకు నడిచారు. అయితే, సినిమా నిర్మాణం జోలికి వెళ్ళొద్దని బాబా ఇచ్చిన సలహాని పెడచెవిన పెట్టి మరో రెండు సినిమాలు నిర్మించారు. ఫలితంగా, మద్రాసులో ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న ఇల్లు, భార్య ఒంటిమీద బంగారం అమ్ముకుని కుటుంబంతో సహా హైదరాబాదులో అద్దె ఇంటికి మారాల్సి వచ్చింది. నలుగురబ్బాయిల్లో ఇద్దరు బాలనటులుగా నటించారు తప్ప తర్వాత సినిమాల్లోకి రాలేదు. హైదరాబాదు, మద్రాసులో ఉద్యాగాలలో స్థిరపడ్డారు. చలన చిత్ర పరిశ్రమ ఎంత వింత పరిశ్రమో మరోమారు కళ్ళకి కట్టే పుస్తకం ఈ 'అనగనగా ఒక రాకుమారుడు.' (క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్ ప్రచురణ, పేజీలు 230, వెల రూ. 200). 

5 కామెంట్‌లు:

  1. ఉత్తమ స్థాయి నటుడు అయివుండి ఎన్నో విజయాలు చవి చూసి కూడా సంపదలు కాపాడుకోలేక పోయారు కాంతారావు గారు.
    స్వధర్మే నిధనం శ్రేయ: పరధర్మో భయావహ: అన్న మాట ఆచరించలేక
    సినీ నటులు నిర్మాతలుగా మారి సంపాదించిన మొత్తం పోగొట్టుకున్న వారు మరికొందరు ఉన్నారు.

    రిప్లయితొలగించండి
  2. కాంతారావు గురించి వ్రాస్తూ కత్తి అన్న మాటే వ్రాయకపోవడం ఎలా మరచిపోయారండి?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'విఠలాచార్య' చేతుల్లో కాంతారావు పడిన బాధలు గుర్తొచ్చి 'కత్తి కాంతారావు' అని రాయాలనిపించలేదండీ.. ధన్యవాదాలు 

      తొలగించండి